రంపచోడవరం: ఏజెన్సీలో రబ్బరు రైతుల ప్రోత్సాహానికి చర్యలు తీసుకుంటున్నట్టు కలెక్టర్ దినేష్కుమార్ పేర్కొన్నారు. మారేడుమిల్లి మండలం పూజారిపాకలు గ్రామంలో బుధవారం రబ్బరు ప్రొసెసింగ్ యూనిట్ను, ఐటీడీఏ ద్వారా ఏర్పాటు చేసిన రబ్బర్ ప్లాంటేషన్ను ఆయన పరిశీలించి మాట్లాడారు. పూజారిపాకలులో మరో వెయ్యి ఎకరాలలో రబ్బరు ప్లాంటేషన్కు రైతుల నుంచి దరఖాస్తులు తీసుకుని కార్యాచరణ సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ఇక్కడి రబ్బరు ప్లాంటేషన్ ద్వారా రైతులు ఏ మేరకు అభివృద్ధి చెందినదీ ఆయన తెలుసుకున్నారు. ఈ రైతులకు ఏవైనా సమస్యలు ఉంటే రబ్బరు బోర్డు అధికారులను, డీహెచ్ఓను సంప్రదించాలని ఆయన సూచించారు. స్మోక్ రూమ్ల ఏర్పాటుకు రైతులు 50 శాతం వాటా చెల్లిస్తే మరో పది స్మోక్ రూమ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. మారేడుమిల్లి మండలంలోని నేషనల్ రబ్బర్ ప్రాసెసింగ్ ఫార్మింగ్ యూనిట్ మంజూరుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ యూనిట్లో మొత్తం 830 మంది రైతులలో ఒక్కొక్క రైతు రూ.5 వేల చొప్పున వాటా ధనం చెల్లించాలన్నారు. పందిరిమామిడి గ్రామంలో తాగునీటికి ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఇక్కడి యువత కోరిక మేరకు క్రీడా మైదానం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటమని ఆయన తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యురాలు గొర్లె సునీత, డీహెచ్ఓ దేవదానం, ఎంపీడీవో మడకం కుమారి, జెడ్పీటీసీ గొర్లె బాలాజీ బాబు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ దినేష్కుమార్


