
మే డే ఘనంగా నిర్వహించాలి
ఆదిలాబాద్టౌన్: జిల్లా వ్యాప్తంగా అసంఘటిత కార్మికులు మే డేను ఘనంగా నిర్వహించాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి సిర్ర దేవేందర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని సీపీఐ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో మే డే పోస్టర్ ఆవిష్కరించి మాట్లాడారు. మున్సిపల్, రిమ్స్, సివిల్సప్లై, అంగన్వాడీ, ఆశ, ఆటో, బీడీ, బ్యాంకింగ్ తదితర సంఘటిత, అసంఘటిత కార్మికులంతా మే డే ఘనంగా జరుపుకోవాలని పేర్కొన్నారు. కార్మికులు పో రాడి సాధించుకున్న 44 చట్టాలను కేంద్ర ప్రభుత్వం నాలుగు కోడ్లుగా తీసుకొచ్చిందని తెలిపారు. 8 గంటల పనిదినాన్ని 12 గంటలకు పెంచిందన్నారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు రాజు, గంగయ్య, రమేశ్, చందు, ముజీబ్, శంకర్, సురేశ్, ప్రశాంత్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
జాతీయస్థాయి పోటీలకు ‘స్పోర్ట్స్’విద్యార్థులు
ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని తెలంగాణ క్రీడా పాఠశాలకు చెందిన విద్యార్థులు జాతీయస్థాయి ఖేలో ఇండియా యూత్ గేమ్స్ పోటీలకు ఎంపికయ్యారు. మహారాష్ట్రలోని పూణేలో జనవరిలో నిర్వహించిన నేషనల్ కేడెట్స్ జూడో చాంపియన్షిప్ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి టాప్–16లో నిలిచిన నలుగురు స్పోర్ట్స్ స్కూల్ విద్యార్థులు జాతీయస్థాయి పోటీలకు అర్హత సాధించారు. రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న క్రీడాకారుల్లో ఆదిలాబాద్ క్రీడా పాఠశాలకు చెందిన ఈ నలుగురు క్రీడాకారులే ఉండడం విశేషం. జాతీయస్థాయికి ఎంపికై న వారిలో కొంపెల్లి అక్షయ, రమావత్ తరుణ్, మోతం హర్షవర్ధన్, లావూరి సతీష్ ఉన్నారు. మొదటి ముగ్గురు ఇటీవలే క్రీడా పాఠశాల నుంచి పదో తరగతి పరీక్షలు రాయగా, సతీష్ జిల్లా కేంద్రంలోని విద్యార్థి కళాశాలలో ఇంటర్ పూర్తి చేశాడు. మే 4నుంచి 8వరకు పాట్నా వేదికగా నిర్వహించనున్న పోటీల్లో పాల్గొననున్నట్లు జూడో కోచ్ రాజు తెలిపారు.