breaking news
vara laxmi
-
మంత్రి సభలో మహిళ ఆత్మహత్యాయత్నం
-
మంత్రి సభలో మహిళ ఆత్మహత్యాయత్నం
బెల్లంపల్లి: ముగ్గురు రాష్ట్ర మంత్రుల సాక్షిగా భూమి కోసం ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లిలో శుక్రవారం జరిగింది. నిండు సభలో హెయిర్డై తాగి బలవన్మరణానికి యత్నించిన సంఘటన తీవ్ర కలకలం రేపింది. శుక్రవారం రాష్ట్ర నీటిపారుదల, మార్కెటింగ్ శాఖ మంత్రి టి.హరీశ్రావు, దేవాదాయ శాఖ మంత్రి ఎ.ఇంద్రకరణ్రెడ్డి, అటవీ శాఖ మంత్రి జోగు రామన్న, ఎంపీలు, ఎమ్మెల్యేలు బెల్లంపల్లి పర్యటనకు వచ్చారు. వ్యవసాయ మార్కెట్ యార్డులో కొత్తగా నిర్మించిన కార్యాలయ నూతన భవనానికి మంత్రి హరీశ్రావు ప్రారంభోత్సవం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మాట్లాడుతుండగా.. బెల్లంపల్లి సుభాష్నగర్బస్తీకి చెందిన ఆరే వరలక్ష్మి అనే మహిళ సూపర్వాస్మల్ 33 హెయిర్డైని తాగి పడిపోయింది. పోలీసులు అంబులెన్స్లో ఆమెను స్థానిక ప్రభుత్వాస్పత్రికి పంపించారు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ సందర్భంగా బాధితురాలు వరలక్ష్మి ఆస్పత్రిలో విలేకరులతో మాట్లాడింది. ‘నా తండ్రి పురంశెట్టి బాపు తాండూర్ శివారులోని సర్వే నం.699/1లో ఉన్న ఒక ఎకరం 42 సెంట్ల పట్టా భూమిని నాకు కట్నంగా ఇచ్చారు. ఆ భూమిని తాండూర్ జెడ్పీటీసీ మంగపతి సురేశ్బాబు కబ్జా చేసుకున్నాడు. 2011 నుంచి జెడ్పీటీసీ నన్ను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. ఆక్రమణకు గురైన భూమి విషయమై హైకోర్టును ఆశ్రయించాను. హైకోర్టు నాకు అనుకూలంగా తీర్పు ఇచ్చినా.. ఇంత వరకు జెడ్పీటీసీ సురేశ్బాబు భూమి మాత్రం అప్పగించలేదు. జెడ్పీటీసీకి మద్దతుగా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, బెల్లంపల్లి టీఆర్ఎస్ నాయకులు పసుల సురేశ్ ఫోన్ చేసి రోజూ భూమి విడిచిపెట్టాలని బెదిరిస్తున్నారు. మంత్రి హరీశ్రావు దృష్టికి నా సమస్యను తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే హెయిర్డైని తాగాను’. పరామర్శించిన కలెక్టర్.. సభ ముగిసిన అనంతరం వరలక్ష్మిని కలెక్టర్ జగన్మోహన్, ఆసిఫాబాద్ సబ్ కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, మంచిర్యాల ఆర్డీవో ఆయేషామస్రత్ఖానం, తహసీల్దార్ కె.శ్యామలదేవి ప్రభుత్వాస్పత్రితో బాధితురాలిని పరామర్శించారు. కలెక్టర్ జగన్మోహన్ ఆమె ఆరోగ్య పరిస్థితిని ఆస్పత్రి మెడికల్ ఆఫీసర్ చంద్రమోహన్ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆమెతో మాట్లాడుతూ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. -
పండుటాకులకు పెద్దకష్టం
వర్గల్: కలహాల కాపురం..క్షణికావేశం...వెరసి కు టుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి. తల్లిదండ్రుల బలవన్మరణాలతో పసిపిల్లలు అనాథలు గా మిగిలిపోతున్నారు. తమ బతుకులే కష్టంగా మారిన పండుటాకులకు మరింత భారమవుతున్నారు. విధి ఆడిన వింత నాటకంలో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులు జాలిగా ప్రేమ కోసం పరితపిస్తుంటే..రెక్కలే తప్ప మా దగ్గరేమున్నాయంటూ అక్కున చేర్చుకుంటున్న పండుటాకులు ఇందుకా తాము బతికున్నదని తమలో తామే కుమిలిపోతున్నారు. వర్గల్ మండలం నెంటూరుకు చెందిన చీరాల ఎల్లయ్య(60), రామవ్వ(56) దంపతులు నిరుపేదలు. వీరికి బాలయ్య, ఆంజనేయులు, రమేష్ సంతానం. పెద్ద కుమారుడు బాలయ్య పదేండ్ల క్రితం చనిపోయాడు. దీంతో పసిప్రాయంలో ఉన్న బాలయ్య కుమారుడిని అతని తల్లి తాత, నాన్నమ్మల వద్ద వదిలి తన దారిన వెళ్లిపోయింది. ఇక ఎల్లయ్య, రామవ్వల రెండో కుమారుడు ఆంజనేయులుకు ఎనిమిదేళ్ల క్రితం వివాహం కాగా, బతుకుదెరువు కోసం భార్య వరలక్ష్మితో కలిసి ఒంటిమామిడికి వెళ్లాడు. అక్కడ తాను కూరగాయల మార్కెట్లో హమాలీగా, భార్య కూలీగా పనిచేస్తున్నారు. వీరికి రజిత (6), నందిత (4) సంతానం. దంపతుల మధ్య సఖ్యత లేక వీరి కాపురం కలహాలకు నెలవైంది. రెండ్రోజుల క్రితం శుక్రవారం దంపతుల మధ్య గొడవ జరిగింది. తమ కాపురానికి గుర్తుగా ఇద్దరు చిన్నారులున్నారనే విషయం విస్మరించిన వరలక్ష్మి క్షణికావే శానికి లోనైంది. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నది. భార్య బలవన్మరణం చెందడం, అందుకు తానే కారణమని అపవాదు రావడంతో భర్త ఆంజనేయులు తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. శనివారం భార్య అంత్యక్రియలకు సైతం హాజరుకాకుండా అదేరోజు రాత్రి ఓ చెట్టుకు ఉరేసుకుని బలవన్మరణం చెందాడు. దీంతో వారి పిల్లల భవిష్యత్తు అయోమయంగా మారింది. పిల్లల ఆలనాపాలనా భారం తాత, నానమ్మలైన ఎల్లయ్య, రామవ్వలపై పడింది. ఇద్దరు కుమారుల కాపురాలు చితికిపోయి... వారి పిల్లల భవిష్యత్ అగమ్యగోచరంగా మారడంతో ఆ వృద్ధ దంపతులు పెను విషాదంలో కూరుకుపోయారు. పదో తరగతి చదువుతున్న చిన్న కుమారుడు రమేష్తోపాటు తల్లిదండ్రుల ప్రేమకు దూరమైన హరికిషన్(బాలయ్య కుమారుడు), రజిత, నందిత (ఆంజనేయులు సంతానం) భారాన్ని రజక వృత్తితో కాలం వెల్లదీస్తున్న ఈ పండుటాకులు ఎలా భరించి ఆసరాగా నిలుస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. శనివారం కోడలు చితికి....ఆదివారం కుమారుడి చితికి.. వరలక్ష్మి ఆత్మహత్యకు ఆమె భర్త ఆంజనేయులే కారణమని అపవాదు రావడంతో మనస్తాపం చెందిన అతను శనివారం నెంటూరులో జరిగిన ఆమె అంత్యక్రియలకు రాలేదు. దీంతో మామ ఎల్లయ్యనే తల కొరివిపెట్టి కోడలు వరలక్ష్మి అంత్యక్రియలు జరిపారు. ఆ తర్వాత కొద్దిసేపటికే కుమారుడు బలవన్మరణం చెందిన వార్త తెలిసి హతాశుడయ్యాడు. ఆదివారం ఆంజనేయులు మృతదేహానికి గజ్వేల్లో పోస్టుమార్టం నిర్వహించి ఇంటికి తీసుకురాగా, ఒక రోజు ముందు కోడలి చితికినిప్పుపెట్టిన ఎల్లయ్య ఆదివారం కుమారుడి మృతదేహానికి అంత్యక్రియలు చేశారు. ఈ సందర్భంగా ఎల్లయ్య దంపతులు వేదన, చిన్నారుల ఆక్రందనలు నెంటూరు గ్రామస్తులను కంట తడిపెట్టించాయి.