breaking news
Transgender community
-
జీహెచ్ఎంసీలో ట్రాన్స్ జెండర్ల నియామకాలు!
హైదరాబాద్: జీహెచ్ఎంసీ(గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ కార్పోరేషన్)లో ట్రాన్స్ జెండర్ల నియామకానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. బల్దియాలోని పలు విభాగాల్లో ఔట్ సోర్సింగ్ విధానంలో ట్రాన్స్ జెండర్లను తీసుకోవాలని నిర్ణయించారు. జీహెచ్ఎంసీ పార్కులు, గ్రౌండ్స్, వాటర్ బోర్డు రిజర్వాయర్ల వద్ద సెక్యూరిటీ గార్డులుగా నియమించేలా అధికారులు ప్లాన్ చేస్తున్నారు. ఇక స్ట్రీట్ లైట్స్ మెయింటెనెన్స్, గ్రీన్ మార్షల్స్ గా అవకాశాలను సైతం అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ మేరకు బుధవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ట్రాన్స్ జెండర్లతో సమావేశం ఏర్పాటు చేసి.. వారికి ఉపాధి వివరాలను అధికారులు తెలిపారు. -
అది అత్యంత ముఖ్యమైనది: తొలి ట్రాన్స్ జెండర్ జడ్జి
ఇండోర్: ట్రాన్స్ జెండర్లకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించడం అత్యంత ముఖ్యమని తొలి ట్రాన్స్ జెండర్ జడ్జి జోయిత్ మోండల్ నొక్కి చెప్పారు. అంతేగాదు ట్రాన్స్ జెండర్లు పోలీస్ ఫోర్స్, రైల్వే వంటి విభాగాల్లో పనిచేయడం వల్ల వారిపట్ల సమాజ దృక్పథం కూడా మారుతుందని మోండల్ అన్నారు. ఈమేరకు లిట్ చౌక్ అనే సాంస్కృతి సాహిత్య ఫెస్టివల్లో పాల్గొన్న అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో జోయితా మోండల్ ఈ వ్యాఖ్యలు చేశారు. అలాగే తన కమ్యూనిటీ సభ్యులు, వారు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల అధికారులు చాలా సున్నితంగా వ్యవహరించాలని అన్నారు. ట్రాన్స్ జెండర్ల కమ్యునిటీలకు సరైన వసతి లేదని, అందుకోసం ఒక పథకాన్ని ప్రవేశ పెట్టాలని అన్నారు. ఇదిలా ఉండగా జోయితా మోండల్ 2017లో పశ్చిమ బెంగాల్ ఇస్లాంపూర్ లోక్ అదాలత్లో తొలి ట్రాన్స్జెండర్ న్యాయమూర్తిగా నియమితులయ్యారు. దేశంలో అలాంటి పదవిని అలంకరించిన తొలి ట్రాన్స్ జెండర్గా జోయితా మోండల్ నిలిచారు. ఆమె తర్వాత 2018లో మహారాష్ట్రలోని నాగ్పూర్లో లోక్ అదాలత్లో న్యాయమూర్తిగా విద్యాకాంబ్లే, ఆమె తర్వాత గౌహతి నుంచిస్వాతి బిధాన్ బారుహ్ ఇలాంటి అత్యున్నత పదవిని అలకరించిన ట్రాన్స్ జెండర్లుగా నిలిచారు. కాగా మహారాష్ట్ర ప్రభుత్వం ట్రాన్స్ జెండర్లు కూడా పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చని, ఫిబ్రవరి 2023 కల్లా ఫిజికల్ టెస్టులకు ప్రమాణాలు నిర్దేశిస్తామని బొంబే హైకోర్టుకు తెలపడం గమనార్హం. (చదవండి: ఉదయ్పూర్ డిక్లరేషన్ అమలు చేయండి ) -
ట్రాన్స్... అప్డేట్ వెర్షన్
చలం స్త్రీవాద రచయిత. ఇప్పుడు లేరు. ఆయన రచనలు, కోట్స్ ఉన్నాయి. ‘‘స్త్రీకి కూడా శరీరం ఉంది. దానికి వ్యాయామం ఇవ్వాలి. ఆమెకు మెదడు ఉంది. దానికి జ్ఞానం ఇవ్వాలి. ఆమెకు హృదయం ఉంది. దానికి అనుభవం ఇవ్వాలి..’’ అనేది చలంగారి పాపులర్ కోట్. శరీరం, మెదడు, హృదయం ఈ మూడూ ట్రాన్స్జెండర్లకు కూడా ఉన్నాయని ప్రియా బాబు అంటున్నారు! తమిళనాడు మదురైలో ఉండే ఆయన.. చలం రచనల్ని చదివి ఉండకపోవచ్చు. అయితే తనూ ఒక ట్రాన్స్జెండర్ కావడంతో తనలాంటి వారి మనసును చదవగలిగారు. ట్రాన్స్ జెండర్లకు అవసరమైన వ్యాయామం, జ్ఞానం, అనుభవం ఇచ్చే ఒక పత్రికను నడుపుతున్నారు. ఆ పత్రిక పేరు.. ‘టాన్స్ న్యూస్’. ‘ట్రాన్స్ న్యూస్’ పక్షపత్రిక. ప్రింట్లో రాదు. డిజిటల్లో వస్తుంది. గత ఏడాది నవంబర్లో పత్రిక ప్రారంభమైంది. ఇప్పుడా పత్రికకు ఒక గుర్తింపు వచ్చింది. ఆ పత్రికను పెట్టిన ప్రియ కన్నా ఎక్కువగా! అందులో అప్డేట్ న్యూస్ ఉంటాయి. బ్యూటీ టిప్స్ ఉంటాయి. స్కిన్ కేర్ గురించి ఉంటుంది. ఇంకా ఆరోగ్యం, గృహాలంకరణ.. ఇలాంటివన్నీ. స్త్రీల కోసం పత్రికలు ఏవైతే ఇస్తుంటాయో ట్రాన్స్ మహిళల కోసం ‘ట్రాన్స్ న్యూస్’ అవన్నీ ఇస్తుంటుంది. ఇంకా.. ట్రాన్స్ ఉమెన్ తయారు చేసిన ఉత్పత్తులకు ఈ పత్రిక మార్కెటింగ్ కల్పిస్తుంది. ఉద్యోగావకాశాల సమాచారాన్ని కూడా అందజేస్తుంది. ‘టాన్స్ న్యూస్’ పత్రికను ఒక మనిషి అనుకుంటే ఆ మనిషి ఆత్మ ప్రియా బాబు. ఆమెకు 50 ఏళ్లుంటాయి. ఎవరైనా తనని ‘ఆమె’ అని పిలవడానికే అతడు ఇష్టపడతారు. కనుక మనమూ ప్రియ అనే చెప్పుకుందాం. ∙∙ ప్రియ ‘ట్రాన్స్ ఉమన్’. యాక్టివిస్ట్, కౌన్సెలర్.. ఇప్పుడిక మ్యాగజీన్ ఎడిటర్. ఆరేళ్ల క్రితం ప్రియ, ముగ్గురు స్నేహితులు కలిసి ముదురైలో ‘ట్రాన్స్ జెండర్ రిసోర్స్ సెంటర్’ స్థాపించారు! 2017లో లాభార్జన ధ్యేయం లేని సంస్థగా ఆ సెంటర్ రిజిస్టర్ అయింది. అందులో ట్రాన్స్ జెండర్ల న్యూస్ పేపర్ క్లిప్పింగులు, డాక్యుమెంటరీలు, షార్ట్ ఫిల్ములు, ప్రభుత్వ విధానాలు, జీవోలు ఉంటాయి. ట్రాన్స్ జెండర్లు ఈ రిసోర్స్నంతటికీ ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. రిసోర్స్ సెంటర్కు చక్కటి ఆదరణ లభించడంతో గత నవంబర్ 1న ‘ట్రాన్స్ న్యూస్’ అన్లైన్ పత్రిక కూడా మొదలైంది. ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నప్పుడు జనం తమనెంత చిన్నచూపు చూస్తుంటారో ఎవరైనా అడిగినప్పుడు చెప్పడం తప్పితే అదే పనిగా చెప్పరు ప్రియ.ఆమె బిజీలో ఆమె ఉంటారు. ప్రియ చదువు ఇంటర్ మధ్యలోనే ఆగిపోయింది. తోటి విద్యార్థుల మాటలు, చూపులు పడలేక ఆమె కాలేజ్కి వెళ్లడం మానేశారు. ఆ సమయంలోనే తమిళ రచయిత సూ.సమిథిరం ఓ ట్రాన్స్ఉమన్ యాక్టివిస్టుపై రాసిన ‘వాడమల్లి’ అనే పుస్తకం చదివారు. అది చదివాక, తనూ ట్రాన్స్ ఉమెన్ కోసం ఏదైనా చేయాలని బలంగా అనుకున్నారు. ఫలితమే రిసోర్స్ సెంటర్, పత్రిక. మనసులో మాట చెప్పుకోడానికి కూడా ట్రాన్స్ ఉమెన్కు రిసోర్స్ సెంటర్ తోడ్పడింది. పాఠశాలలో సెమినార్లు నిర్వహించింది. మంచి మంచి వక్తల చేత మాట్లాడించింది. అవన్నీ నేటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఇక పత్రికలోనైతే ఇప్పుడు ట్రాన్స్ ఉమెన్ మోడలింగ్ ఫొటోలు కూడా చోటు చేసుకున్నాయి. ఇప్పటి వరకు వచ్చిన నాలుగు సంచికల్లో 13 మంది ట్రాన్స్ ఉమెన్, ఇద్దరు ట్రాన్స్మెన్ ఫొటోలు వేశారు. తాజాసంచికలో మధ్యప్రదేశ్లో ఇటీవల జరిగిన భుజారియా ట్రాన్స్జెండర్ ఉత్సవాలను గురించి ప్రముఖంగా వేశారు. ఇండియాలో తొలి ట్రాన్స్జెండర్ న్యూస్ రీడర్ పద్మినీప్రకాశ్ గురించి రాశారు. ట్రాన్స్ ఆంట్రప్రెన్యూర్ జీవా రెంగరాజ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. అలాగే జుట్టు రాలకుండా కొన్ని టిప్స్ కూడా. ప్రియ తమిళ్ నుంచి ఇంగ్లిష్లోకి అనువదించగలరు. ఆ విద్య ఆమెకు చాలావరకు పత్రికను అప్డేట్ చెయ్యడంతో తోడ్పడుతోంది. తమిళ్, ఇంగ్లీషు.. రెండో భాషల్లో వస్తున్న ఈ డిజిటల్ మ్యాగజీన్కు వీక్షకుల సంఖ్య కూడా బాగానే ఉంది. ∙∙ ప్రియ ఎడిటర్ అయితే ఆమె కింద ఐదుగురు రిపోర్టర్లు, ఐదుగురు ఇంటెర్న్లు ఉన్నారు. వాళ్లంతా ట్రాన్స్ ఉమనే. పత్రిక నడపడానికి అవసరమైన ఫండింగ్ను ఇచ్చేందుకు ‘హై–టెక్ అరై’ అనే ఆయిల్ సీల్ను ఉత్పత్తి చేసే సంస్థ ముందుకు వచ్చింది. అది దీర్ఘకాల హామీ. ఎన్నాళ్లు ‘ట్రాన్స్ న్యూస్’ వస్తే అన్నాళ్లూ ఫండ్స్ వస్తుంటాయి. ఫండ్స్ అంటే పెద్దగా ఏం అవసరం లేదు. జీతాలు, ఆఫీస్ అద్దె. వ్యాపార ప్రకటనలైతే ఇంకా రావడం మొదలు పెట్టలేదు. అవొస్తే తమకు ఆర్థికంగా బాగుంటుందని ప్రియ ఆశిస్తున్నారు. పత్రిక చందా ఉచితం. త్వరలోనే హిందీ, మరాఠీ, తెలుగు, కన్నడ భాషల్లో కూడా ‘ట్రాన్స్ న్యూస్’ తీసుకురానున్నామని చెబుతున్న ప్రియ బాబు తన గురించి చెప్పుకోడానికి మాత్రం ఆసక్తి చూపరు. ‘మా జీవితాలన్నీ ఒకేలా ప్రారంభం అవుతాయి. వాటి గురించి చెప్పవలసింది ఏముంటుంది?’ అని నవ్వేస్తారు. -
అటు ఇటు కాని లోకానికి వెలివేతలో..ఎన్ని వ్యథలో
మా దేహాల్లో సూర్యోదయాలు వెతుక్కునే మీరు.. మాకు చీకటి ప్రపంచాన్ని మిగిల్చారు.. మేం మనుషులమే కాదన్నట్లు తప్పించుకు తిరుగుతున్నారు.. మమ్మల్ని వెలివేస్తూ మీరు నిత్యం మలిన పడుతున్నారు.. మా హృదయాలు గాయపడినా మీకు అక్కరలేదు.. మా కన్నీళ్లు మిమ్మల్ని కదిలించవు.. మగతనాన్ని వదిలేసిన మేం ఏనాడూ సిగ్గు పడలేదు.. ఎన్ని కష్టాలొచ్చినా ధైర్యంగా ఎదుర్కొన్నాం.. మానవత్వాన్ని బతికించండీ అంటూ చప్పట్లు కొట్టి కోరుతున్నాం.. ఆకు రాలిన చెట్టు వసంతం కోసం ఎదురు చూసినట్లు.. స్నేహ హస్తం కోసం ఎదురు చూస్తున్నాం.. మేం ఎదురైతే.. పండు వెన్నెల్లా పలకరించండి! ..ఓ హిజ్రా ఆవేదన ఇదీ ఎందుకిలా పుట్టారో వారికి తెలియదు.. ఎలా బతకాలనేది అర్థం కాదు. కానీ జీవితంపై ఎంతో ప్రేమ. చీదరించుకుంటున్నా.. చికాకు పడుతున్నా.. బాధను గుండెల్లో ఉంచుకుని.. తమకు తామే అనుభవాలు పంచుకుంటూ సాగే జీవితం వారిది. వారిపై సమాజం ఆంక్షలు విధిస్తుంది. బయట కనిపించగానే ముఖం చాటేస్తుంది. చీకట్లో బతికే వీరు తమకు వెలుగులు లేకపోయినా ఫర్వాలేదు.. కనీసం మనుషులుగా గుర్తిస్తే చాలంటూ మొరపెట్టుకుంటున్నారు. సాక్షి, కర్నూలు : మన చుట్టూ ఉన్న ప్రపంచంలో కొంతమంది మగవాళ్లు ‘ఆడ పనులు’ చేస్తూ అందరి హేళనకు గురి అవుతుంటారు. వీరిలో కొంతమంది పెళ్లి వయసుకు ముందో, పెళ్లి కుదరంగానో ఇళ్ల నుంచి అదృశ్యమవుతారు. ఇంకొంత మంది పెళ్లికి ముందే ఆత్మహత్యలు చేసుకొంటారు. బస్సుల్లో, రైళ్లలో చప్పట్లు కొట్టుకొంటూ అడుక్కునే వారిగా మరికొంత మంది కనిపిస్తారు. ఇలాంటి దయనీయ జీవితం వారు కోరుకున్నది కాదు. క్రోమోజోముల నిష్పత్తిలో తేడాతో జరిగిందే. సాధారణంగా ఎక్స్, వై క్రోమోజోములు కలిస్తే అబ్బాయి, ఎక్స్ ఎక్స్ క్రోమోజోములు కలిస్తే అమ్మాయి పుడతారు. ఈ క్రోమోజోములు ఇతర నిష్పత్తిలో కలిస్తే రకరకాల శారీరక, మానసిక పరిస్థితులు ఏర్పడతాయి. అలా పుట్టిన వాళ్లు ఆడా మగా నమూనాల్లో ఇమడలేక అటు ఇటు కాని లోకంతో నిత్యం యుద్ధం చేస్తున్నారు. సమాజం వారిని ఒక విధంగా దూరంగా ఉంచింది. దగ్గరకు కూడా రానీయని గీత గీసింది. వారు దగ్గరకు వస్తే ఆమడ దూరం వెళ్లడం.. పిలిస్తే పలకకపోవడం.. పలికినా ఏదో వెకిలితనం, హేళన సమాజంలో చాలా మంది చేసే పనే. వారు చదువుకోవాలన్నా స్కూల్లో, కళాశాలలో సీటు ఇవ్వరు. వారికి పని చేయాలన్నా దొరకదు. ఉద్యోగమూ ఇచ్చేందుకు ఎవ్వరూ ముందుకు రాదు. దీంతో వారు సమాజంలో ప్రత్యేకంగా బతుకుతున్నారు. మా బతుకు మాది అంటూ గట్టిగా చప్పట్లు కొట్టి మరీ చెబుతున్నారు. జిల్లాలో 3వేలకు పైగా హిజ్రాలు ఉన్నారు. జన్మతః జన్యులోపాల కారణంగా హిజ్రాలుగా జీవిస్తున్న వారే అధిక శాతం ఉన్నారు. వీరిని సమాజానికి భయపడి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులూ వెలివేస్తున్నారు. తమ బాధ ఎవ్వరికి చెప్పుకోవాలో, ఎవరిని కలవాలో, ఎవరిని ఆశ్రయించాలో అర్థం కాదు. ఎవ్వరూ వారిని దగ్గరకు రానీయరు. వీరికి ఆధార్కార్డు మినహా ఎలాంటి గుర్తింపు కార్డులు ఉండవు. 90 శాతం మందికి ప్రభుత్వం ఇచ్చే పింఛనూ రావడం లేదు. అధికారుల చుట్టూ తిరిగినా రేషన్కార్డు ఇవ్వరు. హెల్త్కార్డు ఉండదు. రోగమొస్తే ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులూ చిన్నచూపు చూస్తారు. కనీసం తాకి కూడా పరిశీలించరు. తమకు వచ్చిన బాధలను, ఇబ్బందులను ఎవ్వరికైనా చెప్పుకోవాలన్నా వినేవారు ఉండరు. ఇంటి స్థలం రాదు. చివరకు వారు నివసించేందుకు ఎవ్వరూ ఇంటిని అద్దెకు ఇవ్వడం లేదు. కర్నూలులోని జాతీయ రహదారి పక్కన ఉండే ఐటీసీ ఎదురుగా ఉండే స్థానిక కృష్ణానగర్లో ఓ చిన్న ఇంట్లో 30 మంది దాకా హిజ్రాలు నివసిస్తున్నారు. సాధారణంగా అలాంటి ఇంట్లో కేవలం నలుగురు మాత్రమే నివసిస్తారు. కానీ ఎవ్వరికీ ఇల్లు అద్దెకు లభించకపోవడంతో అందరూ అక్కడే తలదాచుకుంటున్నారు. అందులోని 30 మంది ఒకరికి ఒకరై జీవిస్తున్నారు. ఒకరికి ఒకరి కుటుంబసభ్యుల్లా బతుకున్నారు. ఎవరికి ఎలాంటి కష్టం వచ్చినా కలిసి పంచుకుంటారు. భిక్షాటనతోనే జీవనం హిజ్రాలకు పని ఇవ్వరు. ఉద్యోగం చేస్తామన్నా ఇచ్చేందుకు ఎవ్వరూ ముందుకు రారు. దీంతో వారు భిక్షాటనే ప్రధాన వృత్తిగా ఎంచుకున్నారు. ప్రతిరోజూ ఉదయం నుంచి రాత్రి వరకు భిక్షాటన చేయడం, వచ్చిన డబ్బులో కొంత భవిష్యత్ అవసరాలకు దాచుకోవడం, మరికొంత జీవనానికి ఖర్చు చేయడం చేస్తుంటారు. పట్టణాల్లోని దుకాణాలు, వ్యాపార సముదాయాలకు వెళ్లడం గట్టిగా చప్పట్లు కొట్టి భిక్షాటన చేయడం వీరి నైజం. వివాహ సమయంలో కొందరు వీరిని పిలిచి దిష్టి తీయించుకుని, దానికి ప్రతిఫలంగా కొంత మొత్తాన్ని చేతిలో పెడతారు. తమకు ప్రభుత్వం కనీసం పారిశుధ్య పనులకైనా వినియోగించుకోవాలని వారు కోరుతున్నారు. ఈ సమాజంలో తమనూ గుర్తించాలని వేడుకుంటున్నారు. అమ్మాయిగా కనిపించాలని అనిపించేది నా పేరు అనుశ్రీ. మాది కర్నూలు. అమ్మా నాన్న ఉన్నారు. మేము ఐదుగురు సంతానం. నేను నాల్గో దాన్ని. నాలో చిన్నతనం నుంచి ఆడలక్షణాలు ఉన్నాయి. అమ్మాయిగా కనిపించాలని, అమ్మాయిలతో ఎక్కువసేపు గడపాలని ఉబలాటపడేదాన్ని. బయటికి వెళితే సమాజం వేలెత్తి చూపించేది. సమాజంలో ఎన్నో అవమానాలు, అవహేళనలు ఎదుర్కొన్నాను. అమ్మా నాన్న వద్ద ఉంటూ ఇంటర్ వరకు చదువుకున్నాను. దీంతో 12ఏళ్ల తర్వాత ఇంటి నుంచి బయటకు వచ్చేశాను. ఆ తర్వాత అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా బీకాం డిగ్రీలో చేరాను. అక్కడ కూడా నాకు అవమానాలే ఎదురయ్యాయి. ప్రతి ఒక్కరూ నన్ను చూసి అవహేళన చేసేవారు. ఒక విధంగా ఈ సమాజం నన్ను వెలివేసింది. ఎక్కడైనా పనిచేసుకుని బతకాలన్నా పని, ఉద్యోగం ఇవ్వలేదు. ఉద్యోగం చేయాలంటే మగవాడిగా రావాలంటున్నారు. వేషం వేసినా ఆడలక్షణాలు ఎక్కడికీ పోవు కదా! దీంతో 11 ఏళ్ల క్రితం ముంబయి వెళ్లి లింగమార్పిడి ఆపరేషన్ చేయించుకున్నాను. –అనుశ్రీ, కర్నూలు కూరగాయలు అమ్మినా కొనేవారు కాదు నా పేరు శ్వేత, కర్నూలు నగరంలోని శ్రీరామనగర్లో ఉండేవాళ్లం. చిన్నతనం నుంచి నాకు ఆడవారితో తిరగాలని అనిపించేది. వారితో ఉండాలని, వారితో నా భావాలు పంచుకోవాలని అనుకునేదాన్ని. నా ప్రవర్తనను ఇంట్లో వారు వ్యతిరేకించి బయటకు పంపించారు. 2014లో ఒకసారి అపెండిసైటిస్(కడుపునొప్పి) వస్తే చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చేరాను. ఆసుపత్రిలో వైద్యులు ఆపరేషన్ అయితే చేశారు గానీ ఆ తర్వాత తాకి కూడా చూడలేదు. దూరం మాట్లాడి మందులు రాసిచ్చి వెళ్లిపోయేవారు. ఈ వివక్షతను చూసి కొంత కాలం మళ్లీ ప్యాంట్, షర్ట్ వేసుకుని తిరిగాను. రైతుబజార్లో కూరగాయలు విక్రయించేదాన్ని. కానీ నా వద్ద ఎవ్వరూ కొనేవారు కాదు. పక్కనున్న వ్యాపారస్తులు సైతం నన్ను వ్యాపారం చేసుకోనిచ్చేవారు కాదు. నువ్వు మా పక్కన ఉంటే మా వద్ద కూడా కూరగాయలు ఎవ్వరూ కొనరని తిట్టిపోసేవారు. దీంతో కూరగాయల విక్రయం మానేసి మట్టిపనికి, కూలీపనికి వెళ్లాను. అక్కడ కూడా నాకు అవమానాలే ఎదురయ్యాయి. నన్ను హేళన చేసేవారు. దీంతో 2006లో హిజ్రాలతో కలిసిపోయాను. ఆ తర్వాత ముంబయి వెళ్లిపోయి లింగమార్పిడి ఆపరేషన్ చేయించుకున్నాను. –శ్వేత, శ్రీరామనగర్, కర్నూలు హేళన చేయడంతో చదువు ఆపేశాను నా పేరు పావని. మా స్వస్థలం నందికొట్కూరు. మాది వ్యవసాయ కుటుంబం. నాకు ఒక అన్న ఉన్నాడు. చిన్నతనం నుంచి నాకు ఆడలక్షణాలు ఉండేవి. ఇంట్లో ఆడపిల్లలు చేసే పనులన్నీ నేనే చేసేదాన్ని. అంట్లు తోమడం, ముగ్గులు వేయడం, బట్టలు ఉతకడం, వంట చేయడం వంటి పనులన్నీ నేనే చేసేదాన్ని. స్కూల్కు వెళ్లినా హేళన చేసేవారు. దీంతో ఏడో తరగతితోనే చదువు ఆపేశాను. ఇంట్లో వాళ్లు నా ప్రవర్తనను వ్యతిరేకించడం, తిట్టడంతో నేను 12 ఏళ్ల క్రితం నేను ఇంటి నుంచి బయటకు వచ్చేశాను. ఆ తర్వాత హిజ్రాలతో కలిసి జీవిస్తూ వచ్చాను. 2014లోనే విజయవాడలో లింగమార్పిడి ఆపరేషన్ చేయించుకున్నాను. –పావని, కర్నూలు మా లాంటి బతుకు ఎవ్వరికీ రాకూడదు నా పేరు మౌనిక. మా స్వస్థలం రాజమండ్రి. ప్రస్తుతం కర్నూలు. అమ్మా నాన్న ఉన్నారు. మేం నలుగురు సంతానం. ఒక అన్న, ఇద్దరు అక్కలు, నేను చివరి దాన్ని(వాన్ని). జీన్స్ ప్రాబ్లమ్ వల్ల నాలో చిన్నతనం నుంచి ఆడలక్షణాలు ఉన్నాయి. 12 ఏళ్ల తర్వాత ఈ సమస్య మరింత ఎక్కువైంది. ఇంట్లో వారు అలా ఉండకూడదని పలుమార్లు చెప్పారు. పలు మార్లు కొట్టారు, తిట్టారు కూడా. కానీ జన్మత వచ్చిన మార్పును వారు మార్చలేరు కదా. దీంతో ఇంట్లో నుంచి నన్ను తరిమేశారు. బయటకు వచ్చిన నాకు బయట ఎక్కడా నీడ దొరకలేదు. ఒకసారి అనారోగ్యం చేస్తే పెద్దాసుపత్రిలో చేరాను. ఆసుపత్రిలో ఉన్నన్ని రోజులు డాక్టర్లు నన్ను కనీసం తాకి చూడలేదు. సమాజం వెలివేయడంతో 2009లో ఢిల్లీ వెళ్లి లింగమార్పిడి ఆపరేషన్ చేయించుకున్నాను. అనంతరం హిజ్రాలతో కలిసి జీవిస్తున్నాను. ప్రతిరోజూ భిక్షాటన చేయడం, ఎవ్వరైనా పెళ్లిళ్ల సమయంలో పిలిస్తే దిష్టి తీసే కార్యక్రమానికి వెళ్లి పొట్టపోసుకుంటున్నాను. నాలాంటి జీవితం శత్రువులకు కూడా రాకూడదని ఆ భగవంతున్ని వేడుకుంటున్నాను. ఒంటరితనం, మా బాధలు చెప్పుకోవడానికి కూడా ఎవ్వరూ ఉండటం లేదు. మాలో మేమే కుమిలిపోవాల్సి వస్తోంది. వయస్సు మీద పడితే మా బతుకు మరింత దయనీయంగా మారుతుంది. మావైపు చూసే వారు ఎవ్వరూ ఉండరు. గుడిమెట్లపై కూర్చుని అడుక్కోవాల్సి ఉంటుంది. –మౌనిక, కర్నూలు -
శంకర్పై హిజ్రాల ధ్వజం
దర్శకుడు శంకర్పై హిజ్రాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విక్రమ్ హీరోగా శంకర్ దర్శకత్వం వహించిన తాజా చిత్రం ఐ. ఎమిజాక్సన్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో సంతానం హాస్యపాత్ర పోషించారు. ఆస్కార్ ఫిలింస్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం ఇటీవల తెరపైకి వచ్చింది. ఈ చిత్రంలో హిజ్రాపాత్రను ప్రతినాయకుల్లో ఒకరిగా శంకర్ చిత్రీకరించారు. ఆ పాత్రను నిజమైన హిజ్రా ఓఐఎస్ రాజాణితోనే నటింప చేశారు. ఈమె ప్రముఖ మోడల్ మాత్రమే కాకుండా ప్రముఖ నటీమణులు ఐశ్వర్యారాయ్ తదితరులకు ప్యాషన్ డిజైనర్ కూడా. ఐ చిత్రంలో విక్రమ్ను మోడల్గా తీర్చిదిద్దే పాత్రలో నటించిన రాజాణి ఆయన్ని ప్రేమిస్తున్నట్లు విక్రమ్ ఆమెను అసహ్యించుకున్నట్లు చిత్రీకరించారు. దీంతో ఆమె ప్రతినాయకులతో కలసి ఆయన్ని నాశనం చేసే కుట్రలో పాలుపంచుకుంటుంది. ఈ సన్నివేశాలు హిజ్రాలను కించపరిచే విధంగాను, మనోభావాలు దెబ్బతినేలాగా ఉన్నాయంటూ హిజ్రా సంఘం ఒక ప్రకటనలో పేర్కొంది. అందులో అనాది నుంచి సమాజం హిజ్రాలను చిన్న చూపు చూస్తూనే ఉందన్నారు. చాలా సినిమాల్లోనూ హిజ్రాలను అవమానిస్తూ చిత్రీకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఐ చిత్రంలో హాస్యనటుడు సంతానం హిజ్రాలను అవహేళన చేసే విధంగా సంభాషణలు చెప్పి కించపరిచారని వాపోయారు. అందుకే ఈ వ్యవహారంపై దర్శకుడు శంకర్ ఇంటిని ముట్టడించి ఆందోళన చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇందుకోసం ఇతర ప్రాంతాల నుంచి హిజ్రాలు చెన్నైకి రానున్నారని సమాచారం.