breaking news
Summer Training Camps
-
అదిగదిగో అలనాటి జీవన స్వర్గం!
అనగనగా ఓ కాలంలో.. సెల్ కోడి కూయకుండానే నిద్ర లేచేవారు. కరెంటు, రెంటు, ఎక్స్ట్రా.. వంటి కష్టాలు లేకుండా ప్రకృతితో మమేకమయ్యేవారు. ఉదయాస్తమయాల మధ్య కాలాన్ని అత్యంత సహజంగా గడిపేవారు. పున్నమి వెలుగు, అమావాస్య చీకటి, వాసంతపు వేకువ, శరత్ కాలపు రాత్రుళ్ల కాలాన్ని ఆస్వాదించేవారు. ఆధునికత వచ్చింది. యంత్రాలను తెచ్చింది. బతుకుల్లో సహజత్వం మాయమైపోయింది. కూర్మ గ్రామం మళ్లీ ఆ సహజత్వానికి దగ్గరగా బతుకుతోంది. వందల ఏళ్ల కిందటి జీవన విధానాన్ని అనుసరిస్తోంది. ఆ బతుకుల్లో తీపిని రుచి చూపేందుకు వేసవిలో శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నారు.హిరమండలం: కరెంటు లేని నివాసాలు.. రసాయనాలు లేని పంటలు, ఆధునికత అంటని బతుకులు.. వెరసి కూర్మ గ్రామం. శ్రీకాకుళం జిల్లా హిరమండలం మండల పరిధిలోని అంతకాపల్లి అడవుల్లో కనిపిస్తుందీ గ్రామం. కృష్ణ చైతన్య సమాజం పేరుతో 2018లో గ్రామం ఏర్పాటైంది. భక్తి వేదాంతస్వామి ప్రభుపాదుల ఆదేశాల మేరకు భక్తి వికాస్స్వామి ఆధ్వర్యంలో ఈ పల్లె ఏర్పడింది. ఏడాది పొడవునా ఇక్కడకు వేలాది మంది భక్తులకు తరలివస్తుంటారు. కాగా ప్రస్తుతం కూర్మ గ్రామంలో యువతకు నెల రోజుల పాటు వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నారు. అన్నీ సొంతంగానే.. కూర్మ గ్రామంలో 80 మంది వరకూ నివాసముంటున్నారు. 20 వరకూ గృహస్తు జీవన కుటుంబాలు ఉన్నాయి. ఓ 20 మంది వరకూ విద్యార్థులు ఉన్నారు. ఆరుగురు బ్రహ్మచర్యం పాటిస్తున్నారు. సరళ జీవనం, ఉన్నత చింతన వీరి విధానం. మనిషికి నిత్యావసరాలుగా భావించే కూడు, గూడు, గుడ్డ ప్రకృతి నుంచే పొందవచ్చని నిరూపిస్తున్నారు. ప్రకృతి సేద్యంతోనే వీటిని సంపాదించుకుంటున్నారు. ఏడాదిలో వీరికి అవసరమైన వందలాది బస్తాల ధాన్యాన్ని పండిస్తుంటారు. టన్నుల కొద్దీ కూరగాయలను సాగు చేస్తున్నారు. అక్కడ గృహస్తులతో పాటు విద్యార్థులు, ఏడాది పొడవునా ఇక్కడకు వచ్చే భక్తులకు వాటితోనే ఆహారం తయారుచేసి అందిస్తుంటారు. దంపుడు బియ్యాన్ని మాత్రమే వండుకుంటారు. వారి దుస్తులను వారే తయారుచేసుకుంటారు. ఇళ్లకు వారే మేస్త్రీలు, కూలీలు. ఇసుక, సున్నం, బెల్లం, మెంతులు, కరక్కాయలు, మినుములు మిశ్రమంగా చేసి గానుగ ఆడిస్తారు. గుగ్గిలం మరగబెట్టిన మిశ్రమంతో కలిపి ఇళ్లు కట్టుకున్నారు. కుంకుడు కాయ రసంతోనే దుస్తులను ఉతుక్కుంటారు. వర్ణాశ్రమ విద్య.. ఇక్కడ విద్యార్థులు వర్ణాశ్రమ విద్యను అభ్యసిస్తుంటారు. పూర్వపు గురుకులాలతరహాలో ఇక్కడ వాతా వరణం ఉంటుంది. విద్యార్థులు సంస్కృతం, ఇంగ్లిష్, హిందీ, తెలుగులో అనర్గళంగా మాట్లాడతారు. వయసు, ఆసక్తిని బట్టి చేతివృత్తులపై శిక్షణ ఇస్తారు. మనిíÙని సనాతన మార్గం వైపు నడిపించాలన్నదే కృష్ణచైతన్య సమాజం కూర్మ గ్రామం ఏకైక లక్ష్యం. అందుకే ఒక ఇంటితో ప్రారంభమైన ఈ శ్రీకారం ఇప్పుడు దాదాపు 80 ఇళ్ల వరకూ చేరుకుంది. ఏటా యువతకు శిక్షణప్రకృతి సమాజాన్ని విస్తరించాలని.. సనాతన ధర్మం వైపు ఈ సమాజం అడుగులు వేయాలని ఏటా యువతకు ఇక్కడ వేసవి శిబిరాలు ఏర్పాటుచేస్తున్నారు. నెలరోజుల పాటు చేతివృత్తులు, పురాతన జీవన విధానం, సనాతన ధర్మం వంటి వాటిపై అవగాహన కల్పిస్తారు. అందులో భాగంగానే ఈ నెల 1 నుంచి వేసవి శిక్షణ శిబిరాలు ప్రారంభమయ్యాయి. వర్ణాశ్రమ కళాశాలలో ఈ శిబిరాలు నెల రోజుల పాటు కొనసాగుతాయి. చేనేత మగ్గం, మట్టికుండల తయారీ, వడ్రంగి, కర్రసాము, నూనెగానుగ, సున్నం గానుగ, వైదిక గృహ నిర్మాణం, ప్రకృతి వ్యవసాయం, గో సంరక్షణ, ఆయుర్వేదం వంటి వాటిపై ఇక్కడ శిక్షణ ఇస్తారు. మరోవైపు ఆధ్యాత్మిక కార్యక్రమాల శిక్షణ కూడా ఉంటుంది. మంత్రధ్యానం, శ్రవణం, కీర్తనం, వైదిక జీవన ప్రాముఖ్యత, రసాయనాలు లేని ఆహారం, మనస్సుకు, శరీరానికి అనుకూలమైన జీవన విధానం, గృహస్థ జీవన శిక్షణ, బ్రహ్మచారి శిక్షణ, సంస్కృత సంభాషణ అభ్యాసనం, మృదంగం, కరతాళ వాదనం శిక్షణ వంటి అంశాలపై నెలరోజుల పాటు ఈ శిక్షణ కొనసాగనుంది. జీవిత లక్ష్యంపై అవగాహన మనిషి జీవిత లక్ష్యంపై అవగాహన కల్పించడమే కృష్ణచైతన్యం. వర్ణాశ్రమ కళాశాలలో బతుకు తెరువు, వృత్తి కళలపై శిక్షణ ఇస్తున్నాం. నెల రోజుల పాటు వేసవి శిబిరాలు కొనసాగుతాయి. గుజరాత్, పంజాబ్, కర్ణాటక, తమిళనాడులో కూర్మ లాంటి గ్రామా లను నెలకొల్పాం. హంగేరిలో అయితే 800 ఎక రాల విస్తీర్ణంలో గ్రామం విస్తరిస్తోంది. చెక్ రిపబ్లిక్లోనూ ఒక పల్లె ఉంది. – నటేకర్ నరోత్తమదాస్, వర్ణాశ్రమ బోధకుడు, కూర్మ గ్రామం -
మొక్కుబడిగా జీహెచ్ఎంసీ శిబిరాలు
ఎల్బీ స్టేడియం : ఘనచరిత్ర ఉన్న జీహెచ్ఎంసీ వేసవి శిక్షణ శిబిరాలు ఈ ఏడాది మొక్కుబడిగా సాగుతున్నాయి. ప్రతి యేటా ఏప్రిల్ చివరి వారంలో అట్టహాసంగా ఆరంభమయ్యే ఈ శిబిరాలు ఈ యేడు అంతంత మాత్రం నిర్వహణతో వెలవెలబోతున్నాయి. ఇంకా చెప్పాలంటే జీహెచ్ఎంసీ ఇప్పటికీ అధికారికంగా ఈ శిబిరాలను ప్రారంభించలేదు. నగరంలో అక్కడక్కడ ఉన్న ప్లే గ్రౌండ్స్లో స్థానిక అధికారుల నేతృత్వంలో అరకొరగా సాగుతున్నాయి. యేటికేడు భారీ ఎత్తున నిర్వహించే సమ్మర్ కోచింగ్ క్యాంపులు ఈ వేసవిలో ఒక్కసారిగా డీలాపడిపోయాయి. దీనికి గల కారణాలను మాత్రం సంబంధిత అధికారులు స్పష్టంగా వెల్లడించడం లేదు. దీనిపై పలు క్రీడా సంఘాలు, క్రీడాకారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దేశంలో ఏ నగర పాలక సంస్థ చేపట్టని విధంగా జీహెచ్ఎంసీ (అప్పటి ఎంసీహెచ్) ఈ శిబిరాలకు 1968లో శ్రీకారం చుట్టింది. ఇంతింతై వటుడింతై అన్నట్లు... అప్పట్లో కేవలం పది మైదానాల్లో కేవలం 15 మంది కోచ్లతో 1400 మంది చిన్నారుల శిక్షణతో ఆరంభమైన ఈ శిబిరాలు తదనంతరం వందల మైదానాల్లో వేయి మంది కోచ్లతో నిర్వహించే స్థాయికి చేరుకుంది. సౌత్, ఈస్ట్, వెస్ట్, నార్త్, సెంట్రల్ ఇలా ఐదు జోన్లలోని 18 సర్కిళ్లలో ఉన్న 150 డివిజన్లలో ప్రతి వేసవిలోనూ క్యాంపులను నిర్వహించేవారు. ఈ శిబిరాల్లో సుమారు లక్ష మంది ఔత్సాహిక క్రీడాకారులు కేవలం నామమాత్రపు ఫీజుతో శిక్షణ తీసుకునేవారు. కొన్ని క్రీడాంశాలకైతే ఉచితంగానే శిక్షణ ఇస్తారు. ఆరేళ్ల నుంచి 18 ఏళ్ల బాలబాలికలు ఈ శిబిరాల్లో పాల్గొనేవారు. భారీ ఎత్తున 52 క్రీడాంశాల్లో నిర్వహించిన ఈ వేసవి క్రీడా శిక్షణ శిబిరాల ద్వారానే పలువురు వెలుగులోకి వచ్చారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో రాణించి హైదరాబాద్ సత్తాచాటుకున్నారు. అయితే ఇంతటి చరిత్ర ఉన్న ఈ శిబిరాలను జీహెచ్ఎంసీ క్రీడాధికారులు ఈ ఏడాది విస్మరించారు. ఏమైనా నిధుల కొరతా?... అంటే అదీ లేదు. ఎందుకంటే అందుబాటులో రూ. 10 కోట్ల బడ్జెట్ ఉన్నా అధికారుల నిర్లక్ష్యం వల్ల పెద్ద ఎత్తున శిబిరాలను నిర్వహించలేకపోయారు. క్రీడలకు, క్రీడాకారులకు భారీ ప్రోత్సాహకాలంటూ ప్రకటనలిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కూడా జీహెచ్ఎంసీ శిబిరాలవైపు కన్నెత్తి చూడలేదు. ఇప్పుడు స్పెషల్ కమిషనర్ ఏలుబడిలో ఉన్న జీహెచ్ఎంసీ పాలక మండలి నిర్వాకంపై నగరానికి చెందిన పలు పార్టీల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.