breaking news
shetturu
-
ఆధార్.. బేజార్
ఈ చిత్రంలో కన్పిస్తున్నది మంజన్న, తిప్పమ్మ దంపతుల కుటుంబం. వీరిది శెట్టూరు మండలం ములకలేడు గ్రామం. వీరికి పిల్లలు శృతి, గంగోత్రి, గీత, హనుమంతు, వర్దన్ ఉన్నారు. అమ్మ గంగమ్మ, చెల్లి రంగమ్మతో కలిపి మొత్తం తొమ్మిది మంది కటుంబసభ్యులు ఉన్నారు. ఈ కుటుంబం గత 20 ఏళ్లుగా శెట్టూరులో నివాసం ఉంటుంన్నారు. వీరి వృత్తి వెంట్రుకల వ్యాపారం. సొంత ఇల్లు లేదు. ఇందులో ఒక్కరికీ ఆధార్ కార్డులు లేవు. ఆధార్ కోర్డు నమోదు కోసం ఏళ్ల తరబడి ప్రతి అధికారి చుట్టు తిరిగారు. ఆధార్ కార్డులు లేకపోవడంతో 12 ఏళ్ల శృతి, 10 ఏళ్ల గంగోత్రి, 8 ఏళ్ల గీతను ఏ పాఠశాలలోనూ చేర్చుకోవడం లేదు. ఆధార్ కార్డులు లేక హనుమంతు, వర్దన్ పేర్లు అంగన్వాడీ కేంద్రంలో నమోదు లేదు. ఇలా పిల్లల భవిష్యత్ అంధకారం కాగా, అమ్మ గంగమ్మ (వితంతువు) 60 ఏళ్లు దాటినా పెన్షన్ రావడం లేదు. సరైన ధ్రువీకరణ పత్రాలు లేవనే కారణంతో ఎక్కడకు వెళ్లినా ఆధార్ నమోదు చేయడం లేదు. శెట్టూరు: కళ్యాణదుర్గం నియోజవర్గంలోని ప్రత్యేక ఆధార్ క్యాంపుల్లో సర్వీసులు సక్రమంగా అందడంలేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కళ్యాణదుర్గం, శెట్టూరు, బ్రహ్మసముద్రం, కుందుర్పీ, కంబదూరు మండలాల్లో 76 గ్రామ సచివాలయాలు ఉన్నాయి. ప్రతి సచివాలయంలో ఆధార్ సేవలు అందించేదుకు అవకాశాలున్నాయి. అయితే అధికారుల నిర్లక్ష్యంతో నియోజవర్గంలో కేవలం ఆరు సచివాలయాల్లో ఆధార్ సర్వీసులు అందిస్తున్నారు. అదీ మండలానికి ఒక్కటే సచివాలయం కాగా బ్రహ్మసముంద్రంలో అసలే లేదు. సచివాలయాల్లోని డిజిటల్ అసిస్టెంట్ల నిర్లక్ష్యంతో సమస్యలు పరిష్కారం కావడం లేదు. నియోజవర్గంలోని శెట్టూరు, బ్రహ్మసముద్రం, కుందుర్పీ, కంబదూరు మండలాలు కర్ణాటక సరిహద్దు కావడంతో ఎక్కువ శాతం వివాహాలు, జననాలతో పాటు వలసలు ఎక్కువగానే ఉంటాయి. దీంతో ఈ మండలాల్లో ఆధార్ సమస్యలు కుప్పలు తెప్పలుగా పడివున్నాయి. విద్యార్థుల ఆపార్ కార్డు కోసం, గర్భిణుల, బాలింతలు అంగన్వాడీలలో పేస్ యాప్ కోసం, చిన్నపిల్లలు అంగన్వాడీ కేంద్రంలో నమోదు కోసం, వయోజనులు, వృద్ధులు సంక్షేమ పథకాల కోసం ఆధార్కార్డులు తప్పనిసరి. నూతన ఆధార్ నమోదు, ఆధార్ కార్డులో మార్పులు, చేర్పులు తదితరర్ సమస్యలతో ప్రజలు కళ్యాణదుర్గం, రాయదుర్గంతో పాటు కర్ణాటక ప్రాంతంలోని ప్రైవేటు ఆధార్ సెంటర్ల చుట్టూ తిరుగుతున్నారు. రైతులు, కూలీలు పని మానుకుని వెళ్తున్నా సమస్య పరిష్కారం కాక అవస్థలు పడుతున్నారు.గ్రామంలో ఏర్పాటు చేయాలి నా కుమారుడుకి మూడేళ్లు. ఇప్పటికే రెండు సార్లు ఆధార్ కార్డు తీయించాను. సమస్య ఏమో తెలియదుకాని రిజెక్ట్ అయింది. ప్రస్తుతం అంగన్వాడీ కేంద్రంలో ఆధార్ కార్డు అడుగుతున్నారు. ఆధార్ సర్వీస్ కేంద్రం మా మండలంలో ఎక్కడా లేదు. కళ్యాణదుర్గం లేక రాయదుర్గం వెళ్లాల్సి వస్తోంది. పనులు మానుకుని పిల్లాడిని తీసుకువెళ్లాలి. అది కూడా ఒక రోజు పడుతుందో.. రెండు రోజులు పడుతుందో తెలియదు. మాలాంటి పేదలకు ఖర్చుతో కూడుకున్న పని. మా గ్రామంలోని సచివాలయంలో ఆధార్ సర్వీసులు ఇస్తే బాగుంటుంది. – రాజేశ్వరి, పడమటి కోడిపల్లి, బ్రహ్మసముద్రం మండలం -
మరణంలోనూ వీడని అన్నదమ్ముల బంధం
సాక్షి, శెట్టూరు: బహిర్భూమికి వెళ్లిన ఇద్దరు చిన్నారులను చెరువు మింగేసింది. నీటమునుగుతున్న తమ్ముడిని రక్షించేందుకు ప్రయత్నించి అన్న కూడా జల సమాధి అయ్యాడు. అల్లారుముద్దుగా పెంచుకున్న కుమారులిద్దరూ మృత్యువాతపడటంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఈ ఘటన శెట్టూరు మండలం కరిడిపల్లిలో శుక్రవారం సాయంత్రం జరిగింది. గ్రామస్తులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. శెట్టూరు మండలం కరిడిపల్లికి చెందిన గోవిందయ్య, మహంతమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు బన్నీ (10)ఐదో తరగతి, చిన్న కుమారుడు బాలు (7) రెండో తరగతి చదువుతున్నారు. శుక్రవారం కృష్ణాష్టమి సెలవు కావడంతో ఇంటివద్దే ఉన్నారు. సాయంత్రం గ్రామానికి చెందిన హర్షవర్ధన్ అనే మరో బాలుడితో కలిసి అన్నదమ్ములిద్దరూ బహిర్భూమికని గ్రామ సమీపంలోని చెరువు వద్దకు వెళ్లారు. బాలు, బన్నీ పోటీపడుతూ నీళ్లున్న గుంత వద్దకు పరుగులు తీశారు. బాలు కాలు జారి గుంతలోకి పడిపోయాడు. తమ్ముడిని కాపాడేందుకని బన్నీ చేయందించాడు. అయితే గుంత లోతుగా ఉండటంతో బాలు మునిగిపోయాడు. అదే క్రమంలో తమ్ముని చేయి పట్టుకున్న బన్నీ కూడా అందులోకి పడిపోయాడు. ఇద్దరూ మునిగిపోతుండటం గట్టున ఉన్న హర్షవర్ధన్ గమనించి పరుగున ఊరిలోకి వెళ్లి బాలు, బన్నీల పిన్నమ్మ ఈశ్వరమ్మకు జరిగిన విషయం చెప్పాడు. వెంటనే ఆమె స్థానికులను పిలిచుకుని చెరువు వద్దకు పరుగులు పెట్టింది. పదిమందికి పైగా గ్రామస్తులు చెరువులోకి దిగి ఇద్దరు చిన్నారులను బయటికి తీసుకొచ్చారు. అయితే అప్పటికీ బన్నీ, బాలు ప్రాణాలు విడిచారు. సంఘటన స్థలాన్ని ఏఎస్ఐ నాగరాజు, ఎంఈఓ శ్రీధర్, వీఆర్వో గంగాధర్లు పరిశీలించి, కేసు నమోదు చేశారు. దేవుడా.. ఎంత పనిచేశావయ్యా..! గోవిందయ్య శుక్రవారం గ్రామ సమీపంలోని గొర్రెల మేపుకోసం వెళ్లాడు. భార్య మహంతమ్మ ఓ రైతు పొలంలో టమాట పంటను తొలగించడానికి కూలి పనులకు వెళ్లింది. పొలం పని ముగించుకుని వచ్చాక పిల్లల్ని ఇంటి వద్దే ఉంచి ఆమె గొర్రెల మేపు కోసం వెళ్లిన భర్త వద్దకు వెళ్లింది. సాయంత్రం వేళ ఇద్దరు కుమారులు చెరువులో పడ్డారని వార్త వినగానే తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తూ పరుగులు పెడుతూ చెరువు వద్దకు వచ్చారు. చెరువు గట్టుపై విగత జీవులుగా పడి ఉన్న కుమారులను చూసి రోదించడం అందరినీ కలచివేసింది. ‘ఇంటివద్దే ఆట్లాడుకుంటుంటారనుకునిపోతినే...అంతలోపే ఇలా...దేవుడు ఇంత అన్యాయం చేశాడా...ఒకేసారి ఇద్దరినీ పొట్టన పెట్టుకుంటాడా...అయ్యో..మేము ఏం పాపం చేశాము దేవుడా...’ అంటూ మహంతమ్మ కన్నీటి పర్యంతమైంది. బాధిత కుటుంబానికి పరామర్శ చిన్నారులు మృత్యువాత పడిన సంఘటన తెలుసుకున్న శెట్టూరు వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ సోమనాథ్రెడ్డి, నాయకులు హరినాథ్రెడ్డి, ఎంఎస్రాయుడు, తిప్పేస్వామి, రామకృష్ణ, తిమ్మరాజు, లింగప్ప, శ్యాంసుందర్చౌదరి, మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరిలు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. -
'శెట్టూరు ఘటనపై విచారణ జరిపించాలి'
అనంతపురం: శెట్టూరు ప్రమాద ఘటన పై విచారణ జరిపించాలని వైఎస్ఆర్సీపీ రాష్ట్రకార్యదర్శి ఎల్.ఎం మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. మృతుల కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించాలన్నారు. నలుగురి మృతికి కారణమైన బోర్ వెల్ లారీ సిబ్బంది, యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. వ్యవసాయ క్షేత్రంలో వేస్తున్న బోరును చూడటానికి వెళ్లిన నలుగురు గ్రామస్థులు, బోర్వెల్ లారీ రివర్స్ తీస్తుండగా దాని కిందపడి మృతిచెందిన విషయం తెలిసిందే. శెట్టూరు మండలం పర్లచేడు గ్రామంలో శనివారం తెల్లవారుజామున ఈ సంఘన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో గ్రామానికి చెందిన సంజీవ(33), మంతేష్(27), తిమ్మప్ప(33), నర్సింహమూర్తి(30) అనే నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. ఒకే గ్రామానికి చెందిన నలుగురు అనూహ్యంగా మృతిచెందడంతో.. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
చిన్నంపల్లిలో చిరుత కలకలం
అనంతపురం: అనంతపురం జిల్లా శెట్టూరు మండలం చిన్నంపల్లిలో చిరుత పులి కలకలం సృష్టించింది. చిరుత సంచారంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. మాజీ ఎంపీటీసీ వెంకటేశ్వర్లుకు చెందిన పొలంలో చిరుత పడుకుని ఉండడాన్ని గమనించిన స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. కాగా చిరుత పులి గాయపడి ఉండటం కాని లేదా గర్భం దాల్చి ఉండవచ్చునని, అందువల్లే అక్కడి నుంచి కదలడం లేదని అటవీ శాఖ అధికారులు అనుమానిస్తున్నారు. వలల ద్వారా చిరుతను పట్టుకోవడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. గతంలో కూడా మండల పరిధిలో చిరుత దాడి చేసి మేకలను, గొర్రెలను తిన్న సంఘటనలు చోటుచేసుకున్నాయి.


