breaking news
Regular MEO
-
ఇన్చార్జిలే దిక్కు..
సాక్షి, వరంగల్ రూరల్: పాఠశాల విద్యను పటిష్టం చేయడంలో కీలక పాత్ర పోషించే డీఈఓతోపాటు ఎంఈఓల్లో ఇన్చార్జిలే అధికంగా ఉన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారిగా పనిచేస్తున్న నారాయణరెడ్డికి ఇటీవల డైట్ కళాశాల ప్రిన్సిపాల్గా పదోన్నతిని కల్పించి బదిలీ చేశారు. ఆయనకే వరంగల్ రూరల్ జిల్లా ఇన్చార్జి విద్యాశాఖాధికారిగా బాధ్యతలు అప్పగించారు. రెగ్యులర్ ఎంఈఓలు లేక ఆయా మండలాల్లోని గెజిటెడ్ హెచ్ఎంలను ఇన్చార్జి ఎంఈఓలుగా నియమించారు. 16 మండలాల్లో ఒక్కరే రెగ్యులర్ ఎంఈఓ జిల్లాలోని 16 మండలాలకుగాను ఒక్కరే రెగ్యులర్ ఎంఈఓ ఉన్నారు. నల్లబెల్లి మండల విద్యాశాఖ అధికారిగా దేవా మినహా మిగతా మండలాలకు ఇన్చార్జీలే కొనసాగుతున్నారు. ఖానాపు రం, నర్సంపేటకు ఇన్చార్జి ఎంఈఓగా దేవా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మిగతా చోట్ల సీనియర్ ప్రధానోపాధ్యాయులు ఇన్చార్జీ ఎంఈ ఓలుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సొంత పాఠశాల పర్యవేక్షణతోపాటు మిగతా పాఠశాలల పర్యవేక్షణ వారికి అదనపు భారంగా మారింది. దీంతో ఆయా మండలాల్లోని పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం, ఉపాధ్యాయుల విధుల నిర్వహణపై పర్యవేక్షణ కరువైంది. దీంతో పలు పాఠశాలలు గాడి తప్పుతున్నాయనే ఆరోపణలున్నాయి. దీంతో చాలాచోట్ల విద్యార్థుల సంఖ్య సైతం తగ్గుముఖం పడుతోంది. రెండు చోట్ల పూర్తిస్థాయిలో సేవలు అందించలేకపోతున్నారు. పనిచేసే మండలంలో కాకుండా ఇతర మండలాల్లో.. ఇటీవల ఉపాధ్యాయుల బదిలీలు జరిగాయి. దీంతో ఎంఈఓలుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న వారు ఇతర మండలాలకు బదిలీ అయ్యారు. దుగ్గొండి ఇన్చార్జి ఎంఈఓగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న వాసంతి హసన్పర్తి మండలంలోని చింతగట్టు జెడ్పీ హైస్కూల్కు, చెన్నారావుపేట ఎంఈఓగా పని చేస్తున్న పర్వేజ్ ధర్మసాగర్ మండలం కూనూరు జెడ్పీ హైస్కూల్కు, గీసుకొండ ఇన్చార్జి ఎంఈఓ సృజన్తేజ నెక్కొండ మండలం సూరిపల్లి జెడ్పీ హైస్కూల్కు హెచ్ఎంలుగా విధులు నిర్వర్తిస్తున్నారు. వరంగల్ రూరల్ జిల్లాలో కాకుండా ఇతర జిల్లాలో పని చేస్తున్న వారు ఇంచార్జీలుగా వ్యవహరిస్తున్నారు. వారు పనిచేస్తున్న పాఠశాలకు, ఇన్చార్జి ఎంఈఓగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న మండలానికి మధ్య సుమారు 50 కిలోమీటర్లపైనే దూరం ఉంటుంది. దీంతో పర్యవేక్షణ కష్టంగా మారింది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పూర్తి స్థాయిలో ఎంఈఓలను నియమించాలని కోరుతున్నారు. -
ఎంఈఓలు కావలెను
బద్వేలు : జిల్లాలో పాఠశాలలపై పర్యవేక్షణ కొరవడింది. జిల్లాలో 51 మండలాలకుగాను కేవలం 7 మండలాలకు మాత్రమే మండల విద్యాశాఖాధికారులు ఉన్నారు. 44 మండలాల్లో ఇన్ఛార్జి ఎంఈఓలతో కాలం గడపాల్సి వస్తోంది. వీరికి సరైన సిబ్బందిని కేటాయించకపోవడంతో కేవలం కార్యాలయ పనులకే పరిమితమవుతున్నారు. జిల్లాలో కేవలం కడప, బద్వేలు, సుండుపల్లి, చిట్వేలి, కొండాపురం, ఖాజీపేట మండలాలకు మాత్రమే రెగ్యులర్ ఎంఈఓలు ఉన్నారు. మిగిలిన చోట్ల జెడ్పీ ఉన్నత పాఠశాలల హెచ్ఎంలకు ఈ బాధ్యతలు అప్పగించారు. 4.7లక్షల చిన్నారుల బాధ్యత వారిదే జిల్లాలో ప్రస్తుతం 4,493 పాఠశాలలు ఉన్నాయి. ఇవన్నీ గత గురువారం తెరుచుకున్నాయి. వీటిలో 3,122 ప్రాథమిక పాఠశాలలు, 562 ప్రాథమికోన్నత పాఠశాలలు, 790 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలోనే 323 ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు, 323 ప్రైవేటు ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ పాఠశాలల్లో 4.7 లక్షల మంది చిన్నారులు విద్యను అభ్యసిస్తున్నారు. వీరిలో 2.4 లక్షల మంది బాలురు కాగా 2.3 లక్షల మంది బాలికలు ఉన్నారు. వీరందరి పర్యవేక్షణలో ఎంఈఓలదే కీలకపాత్ర. పాఠశాలల నిర్వహణ, నిధుల వినియోగం, విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు, తదితర విషయాలను గమనించడం కూడా ఎంఈఓల విధే. ప్రైవేటు పాఠశాలల ఇష్టారాజ్యం ప్రైవేటు పాఠశాలల పర్యవేక్షణ కూడా ఎంఈఓలే చూడాల్సి ఉంది. కానీ ఎక్కువ మండలాల్లో ఇన్ఛార్జీలు ఉండటంతో దీనిపై వారు శ్రద్ధ చూపడం లేదు. దీంతో ప్రైవేటు విద్యాసంస్థలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. విద్యాహక్కు చట్టాన్ని ఉల్లంఘించి ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్నారు. స్కూలు వాహనాలు పాతవి వినియోగిస్తున్నారు. నిబంధనలు పాటించడం లేదు. ఈ వాహనాలను విద్యార్థులను తీసుకొచ్చేందుకు వినియోగించే సమయంలో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవల జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో దాదాపు 15 మంది విద్యార్థులు గాయపడిన విషయం తెలిసిందే. అలాగే పలు పాఠశాలల్లో అగ్నిమాపక శాఖ నిబంధనలు కనిపించడం లేదు. ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను పాటించడం లేదు. ఫైరింజన్ వెళ్లేందుకు కూడా స్థలం లేకుండా గదులు నిర్మిస్తున్నారు. ఎంఈఓల పర్యవేక్షణ ఉంటే వీటన్నింటినీ కూడా విద్యాసంస్థలు పాటిస్తాయి. పని భారంతో ఒత్తిడి ఇన్చార్జి బాధ్యతలతో ఎంఈఓలపై పని భారం పెరిగి ఒత్తిడికి గురవుతున్నారు. సాధారణంగా ఎంఈఓలు ఉపాధ్యాయుల జీతభత్యాలు, సర్వీస్ రిజిస్ట్రర్ల నిర్వహణ, సెలవుల మంజూరు వంటి విషయాలను పర్యవేక్షించాలి. ఒక్కో మండలంలో 60-80 వరకు పాఠశాలలు, 150 వరకు ఉపాధ్యాయులు ఉంటారు. అదనపు సిబ్బందిని ఇవ్వకపోవడంతో ఈ బాధ్యతలన్నీ ఎంఈఓలే చేయాల్సి వస్తోంది. రోజూ రెండు పాఠశాలలను పర్యవేక్షిస్తే కానీ మండలంలోని అన్ని పాఠశాలలను నెలకొకసారి తనిఖీ చేయలేరు. ఎంఈఓలకు అదనపు సిబ్బంది లేకపోవడంతో ఈ విధులు నిర్వర్తించలేకున్నారు. 44 మండలాల్లో పలు ఉన్నతపాఠశాలల హెచ్ఎంలకు అదనపు బాధ్యతలు అప్పగించారు. వీరు తమ పాఠశాలల్లో విద్యార్థులకు పాఠాలు చెప్పడంతో పాటు ఎంఈఓ బాధ్యతలను నిర్వర్తించడం కష్టసాధ్యం. అదనపు సిబ్బంది చేయాల్సిన పనులను పలు చోట్ల ఉపాధ్యాయులతో చేయిస్తున్నారు. దీంతో వీరు ఎంఈఓలను ఖాతరు చేయడం లేదు. ఈ పరిస్థితి పలు మండలాల్లో ఉంది. ప్రాథమిక పాఠశాలలపై పర్యవేక్షణ లేకపోవడం, ఉపాధ్యాయుల నిర్లక్ష్యంతో జిల్లాలో గత ఏడాది వంద వరకు ప్రాథమిక పాఠశాలలు మూత పడ్డాయి. అన్ని మండలాలకు రెగ్యులర్ ఎంఈఓలను నియమించి, ఇతర పనులు నిర్వహించేందుకు అదనపు సిబ్బందిని కేటాయించాలని పలువురు కోరుతున్నారు. అప్పుడే పాఠశాలలపై ఎంఈఓలు పూర్తిస్థాయిలో పర్యవేక్షణ చేయగలరనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.