చౌకగా మిడ్నైట్ విమాన టికెట్లు!
న్యూఢిల్లీ: స్పైస్ జెట్ విమానాయాన సంస్థ ప్రయాణికులను ఆకట్టుకునేందుకు సరికొత్త సర్వీసును ప్రారంభించనుంది. తన నెట్వర్క్ పరిధిలో నవంబర్ 2 నుంచి రెడ్ ఐ ఫ్లయిట్ సర్వీసెస్ను మొదలుపెట్టనుంది. దీనిద్వారా ఢిల్లీ-బెంగళూరు, ఢిల్లీ-నాందెడ్కు నడిచే మిడ్ నైట్ విమానాల టికెట్ ధరలు తగ్గనున్నాయి.
సాధారణంగా రెడ్ ఐ విమానాలు అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రయాణమై.. తెల్లవారుజాముకు గమ్యస్థానాన్ని చేరుతాయి. ఇప్పటికే రెండు దేశీయ విమానాయాన సంస్థలు ఇలాంటి ఆఫర్లను ప్రయాణికులకు అందజేస్తున్న సంగతి తెలిసిందే. జెట్ ఎయిర్వేస్, ఇండిగో సంస్థలు చౌక ధరలకు అర్ధరాత్రి నడిచే విమానాల సర్వీసులను అందజేస్తున్నాయి. గుర్గావ్కు చెందిన స్పైస్ జెట్ కూడా ఇదేదారిలో ముందుకుసాగుతున్నది. తన శీతకాలం షెడ్యూల్ భాగంగా ఇలాంటివే మరో ఆరు సర్వీసులను ప్రారంభించాలని ఆ సంస్థ భావిస్తున్నది. రెడ్ ఐ సర్వీసులో భాగంగా ఢిల్లీ-బెంగళూరు మధ్య టికెట్ ధరను రూ. 3889గా స్పైస్ జెట్ నిర్ణయించింది. రెడ్-ఐ విమాన సర్వీసులు భారత్లో ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతున్నా.. అమెరికా, యూరప్ దేశాల్లో అవి ఎంతగానో ప్రజాదరణ పొందాయి.