పుస్తకాలకు అట్టలు వేయడం వారికిష్టం!
- కితాబు
ఆంధ్రసాహిత్య రంగంలోని అత్యంత వృద్ధుల దగ్గర్నుంచి, క్రొంగ్రొత్త రచయిత దాకా అందరితోనూ ఒకే రకమైన స్నేహభావం వారి(మల్లాది రామకృష్ణ శాస్త్రి)కుంది. పాతకావ్యాలూ, ప్రాచీన గ్రంథాలూ ఎంత శ్రద్ధగా పరిశీలిస్తారో కొత్త రచయిత రచనలు సైతం అంత ఆసక్తితో చదువుతారు. అప్పటివరకు ముక్కూముఖం ఎరుగని రచయిత వచ్చి వారి పరిచయం చేసుకొని ‘నేను ఫలానా పత్రికలో ఫలానా కథ వ్రాశాను’ అని చెప్పుకొంటే, ఆ రచయితే వ్రాసి మరిచిపోయిన మరొక రచనను శాస్త్రిగారు జ్ఞాపకం చేయగలరు!
వారికి పుస్తకాలూ, పత్రికలూ కొనడం, అట్టలు వేయడం, చదవడం, భద్రపరచడం ద్వితీయ ప్రకృతి. చెన్నపట్నంలో సెకండ్ హేండ్ పుస్తకాలు విక్రయించే ప్రతి మారుమూల దుకాణదారుడూ శాస్త్రిగారి స్నేహితుడు. విక్రేత రూపాయి ధర చెప్పిన మంచి పుస్తకాన్ని శాస్త్రిగారు రూపాయిన్నర పెట్టి కొనగలిగిన ఉదారులు!
(మల్లాది రామకృష్ణ శాస్త్రి గురించి ఆరుద్ర)