breaking news
pv subbarao
-
స్వాతంత్య్ర సాధనకు అండ.. జాతీయ జెండా
జాతీయోద్యమంలో తొలిసారిగా 1916లో లక్నో జాతీయ కాంగ్రెస్ సభలో జాతీయపతాకను ఎగరవేశారు. పింగళి వెంకయ్య గొప్ప స్వాతంత్య్ర సమర యోధులు. 1919లో జలంధర్కు చెందిన లాలాహన్స్రాజ్ మన జాతీయ పతాకంపై రాట్నం చిహ్నం ఉంటే బాగుంటుందని సూచించగా గాంధీజీ అంగీకరించారు. 1921 లో అఖిలభారత కాంగ్రెస్ మహాసభలు విజయవాడలో జరిగాయి. ఆ సభలో గాంధీజీ బందరు ఆంధ్రజాతీయ కళాశాల అ«ధ్యాపకులుగా పనిచేస్తున్న పింగళి వెంకయ్యను పిలిపించి కాషాయం, ఆకుపచ్చ, మధ్యలో రాట్నం ఉండేలా జాతీయ జెండాను రూపొందించాలని కోరారు. వెంకయ్య వెనువెంటనే జాతీయ పతాకాన్ని రూపొందించి కాంగ్రెస్ పార్టీకి అందించారు. ఆ తర్వాత సత్యం, అహింసలకు ప్రత్యేక నిదర్శమైన తెలుపు రంగు కూడా ఉండాలని గాంధీజీ చెప్పడంతో ఆ జెండాలో అదనంగా తెలుపురంగును చేర్చడంతో మూడు రంగులతో నేటి త్రివర్ణ పతాకాన్ని దేశానికి అందించారు. ఆ జెండా ఆంధ్రదేశంలోనే ఆవిర్భవించడం మనకు గర్వకారణం. తొలిరోజుల్లో జాతీయ పతాకంలోని రంగులు జాతిమతాలకు సంకేతాలకు భావించారు. క్రమేపీ అవి జాతి మతాతీత సంపదలుగా నిర్ధారించబడ్డాయి. కుంకుమపువ్వు (కాషాయం)శౌర్యానికి, త్యాగశీలానికి ప్రతీక. ఆకుపచ్చరంగు అకుంఠిత భక్తి విశ్వాసానికి, శూరత్వానికి సంకేతం. తెలుపు స్వాతంత్య్ర పోరాట ప్రాతిపదికైన సత్యం, అహింసలకు ప్రత్యేక నిదర్శనంగా నిలిచాయి. స్వాతంత్య్రం అనంతరం రాజ్యాంగ పరిషత్ నెహ్రూ గారి సూచన మేరకు రాట్నానికి బదులుగా అశోక ధర్మచక్రాన్ని నిర్ణయించింది. అందులోనూ రాట్న చిహ్నమైన చక్రం ఉండటం గమనార్హం. పింగళి వెంకయ్య కృష్ణాజిల్లా మచిలీపట్నం సమీపాన భట్లపెనుమర్రు గ్రామంలో 1876 ఆగస్టు రెండోతేదీన జన్మించారు. ఆయన తల్లిదండ్రులు వెంకటరత్నమ్మ, హనుమంతరాయుడు దివితాలూకా యార్లగడ్డ గ్రామ కరణం. వెంకయ్య బాల్యం నుండి ప్రతిభావంతమైన విద్యార్థి. 19వ ఏటా బొంబాయి వెళ్లి సైన్యంలో చేరాడు. దక్షిణ ఆఫ్రికాలో ఉన్న మహాత్మగాంధీతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం దాదాపు అర్థ శతాబ్దంపాటు కొనసాగింది. స్వాతంత్య్ర సాధనకు దేశమంతటా జెండా సత్యగ్రహ ఉద్యమాలు ఆయా రాష్ట్రాల్లో విజయవంతంగా సాగాయి. 1923 మే ఒకటో తేదీన ‘జెండా సత్యగ్రహ ఉద్యమం’ తొలిసారిగా ప్రారంభమైంది. అందులో వివిధ రాష్ట్రాల నుంచి వేలాది మంది స్త్రీ, పురుషులు జాతీయ అభినివేశంతో పాల్గొన్నారు. ఆంధ్రప్రాంతం నుండి తొలిసారిగా సుభద్రాదేవి అనే మహిళా వాలంటీర్ ఈ ఉద్యమంలో పాల్గొంది. ఉద్యమం విజయవం తం కావడంతో జెండాకు ఒక పవిత్రత, సార్వజనీనత, గౌరవ ప్రాముఖ్యాలు ఏర్పడ్డాయి. దీంతో సభలన్నింటిలో జాతీయ జెండా ప్రాధాన్యత సంతరించుకుంది. జెండా ప్రతిష్టకోసం ప్రాణాలొడ్డి లాఠీ బాధలు భరించి, జరిమానాలతో నష్టపోయిన వారెందరో ఉన్నారు. ఆ సందర్భంగా ఎందరో ప్రముఖ రచయిత లు జెండాను కీర్తిస్తూ ప్రశంసగీతాలు రాశారు. వాటిలో గురుజాడ రాఘవశర్మ రాసిన ‘జెండా ఎత్తరా జాతికి ముక్తిరా’ ప్రజల్లో గొప్ప ఉత్తేజాన్ని రేపింది. సుంకర సత్యనారాయణ రాసిన ‘ఎగురవే జెండా.. శాంతిదూతగా జాతీయజెండా –యుగయుగంబుల జగతినెగురవే జెండా సౌఖ్య ప్రదాతగా స్వాతంత్య్ర జెండా’ అనే గీతం ప్రజల్లో జెండా పట్ల మరింత గౌరవాన్ని పెంచింది. ఎందరో పోరాటవీరుల త్యాగఫలితంగా జాతీయ జెండా అండగా స్వాతంత్య్రాన్ని సాధించాం. ఇటీవల మాచర్లలో పింగళి వెంకయ్యగారి కుమార్తె సీతామహాలక్ష్మి ఆర్థిక ఇబ్బందులను గుర్తించి స్వయంగా ఆమె ఇంటికి వెళ్లి రూ.75 లక్షల నగదు ఇచ్చి సహకరించడం ప్రస్తుత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మానవతా దృక్పధానికి నిదర్శనంగా నిలుస్తోంది. వెంటనే పింగళి వెంకయ్య గారికి భారతరత్న ఇవ్వాలంటూ భారత ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. భారత జాతికి స్ఫూర్తిగా నిలిచిన మన జాతీయ జెండా, ఆ జెండా రూపకర్త పింగళికి ‘భారతరత్న’ బిరుదు లభిస్తే ఆ మహనీయుడికి నిజమైన నివాళి లభించినట్లే. -డా. పీవీ సుబ్బారావు (పింగళి వెంకయ్య శతజయంతి సందర్భంగా) వ్యాసకర్త సాహీతి విమర్శకులు: 98491 77594 -
అగ్రశ్రేణి అభ్యుదయ రచయిత అనిశెట్టి
అభ్యుదయ కవిగా, ప్రయోగాత్మక నాటక రచయితగా, కథా రచయితగా, సినీ రచయితగా, పత్రికా సంపాదకుడిగా విశిష్టత సంతరించుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి అనిశెట్టి సుబ్బారావు. 1922 అక్టోబర్ 23న నరసరావుపేటలో జన్మించాడు. తల్లిదండ్రులు ఆదిలక్ష్మమ్మ, కోట్లింగం. నరసరావుపేట మున్సిపల్ పాఠశాలలో ఆయన విద్యాభ్యాసం సాగింది. ఉన్నత పాఠశాలలో కుందుర్తి ఆంజనేయులు, రెంటాల గోపాలకృష్ణ, బెల్లంకొండ రామదాసు, మాచిరాజు దేవీ ప్రసాదులు ఆయన ççసహాధ్యాయులు. అనిశెట్టి 1941లో గుంటూరు ఏసీ కళాశాల నుండి బీఏ పట్టభద్రుడయ్యాడు. జాతీయోద్యమ స్ఫూర్తి, గాంధీజీ పట్ల అభిమానంతో 1942లో క్విట్టిండియా ఉద్యమంలో చురుగ్గా పాల్గొని అరెస్టయ్యాడు. సన్నిహిత మిత్రులైన ఏల్చూరి, కుందుర్తి, బెల్లంకొండ రాందాసులు శ్లిష్టా, శ్రీశ్రీ, నారాయణబాబుల ప్రభావంతో అభ్యుదయ దృక్పథం వైపు మళ్లారు. నరసరావుపేట కేంద్రంగా 1942లో ఏర్పడిన నవ్యకళాపరిషత్కు అనిశెట్టి ప్రధాన కార్యదర్శి. అనిశెట్టి మద్రాసులో లా చదివే రోజుల్లో బెంగాలీ విప్లవకారుడు రతన్కుమార్ ఛటర్జీకి అశ్రయమిచ్చాడు. ఆయన విప్లవ కరపత్రాలు బయటపడి పోలీసులు అనిశెట్టిని అరెస్టుచేసి రాయవెల్లూరు జైలుకు పంపిం చారు. ప్రభుత్వ అధికారులు జైలు శిక్ష తగ్గిస్తామని, ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొనవద్దని ప్రలోభపెట్టినా రాజీ పడలేదు. అభ్యుదయ కవితా ఉద్యమంలో అనిశెట్టి, ఆరుద్రలు‘అఆ’లని శ్రీశ్రీ ప్రశంసించాడు. అనిశెట్టి 1943లో తెనాలిలో తాపీ ధర్మారావు అధ్యక్షతన ఆరంభమైన అరసం తొలి మహాసభల నుండి 1947లో పి.వి. రాజమన్నార్ గారి అధ్యక్షతన జరి గిన నాలుగో మహాసభల వరకు కార్యవర్గ సభ్యులుగా చురుగ్గా పాల్గొన్నాడు. 1950లో ప్రభుత్వం కమ్యూనిస్టు పార్టీని నిషేధించటంతో అభ్యుదయ రచయితలైన శ్రీశ్రీ, అనిశెట్టి, ఆరుద్ర వంటి వారు సినీరంగానికి వెళ్లారు. 1941 నుండి 1947 వరకు భారతి, కృష్ణాపత్రిక, తెలుగుతల్లి, అభ్యుదయ వంటి పత్రికల్లో ప్రచురించిన తన కవితలను అనిశెట్టి ‘అగ్నివీణ’ కవితా సంపుటిగా ప్రచురిం చాడు. అభ్యుదయ కవితా ఉద్యమంలో కె.వి. రమణారెడ్డి భవనఘోష, రెంటాల సర్పయాగం, గంగి నేని ఉదయిని కవితా సంపుటాలు ప్రసిద్ధాలు. అనిశెట్టి కవిగా కన్నా నాటకకర్తగా ప్రసిద్ధుడు. 1950లో గాలిమేడలు నాటకంలో తొలిసారిగా ఫ్రాయిడ్ మనో విశ్లేషణాత్మక సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు. గాలిమేడలు నాటకంలో తొలిసారిగా ప్రేక్షకుల నుండి పాత్రలను ప్రవేశపెట్టాడు. ఈ పద్ధతిని ఆత్రేయతో సహా చాలా మంది రచయితలు అనుసరించారు. ఆంగ్ల సాహిత్యాన్ని ఔపోశనపట్టిన అని శెట్టి 1951లో తొలిసారిగా తెలుగులో (ఫాంటోమైమ్) శాంతి ముకాభినయాన్ని రాశాడు. శాంతి కాముకతో అనిశెట్టి రాసిన ఈ మూకాభినయం 1952లో ఏలూరు సాంస్కృతిక ప్రదర్శనల్లో ప్ర«థమ బహుమతి బంగారుపతకాన్ని పొందింది. తమిళం, మలయాళం, కన్నడ వంటి అనేక ప్రాంతీయ భాషల్లోకి, ఇంగ్లిష్, రష్యా, చైనా వంటి అంతర్జాతీయ భాషల్లోకి అనువదించబడి అనిశెట్టికి అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిపెట్టింది. సినీ రచయితగా 1952 నుండి 1979 వరకు సంతానం, రక్త సంబంధం వంటి 50 సినిమాలకు మంచి పాటలు రాసి ప్రేక్షకుల మన్ననలు పొందాడు. వంద సినిమాలకు సంభాషణలు రాశాడు. దాదాపు 300 తమిళ డబ్బింగ్ సినిమాలకు సంభాషణల రచయితగా ప్రసిద్ధి పొందాడు. ప్రతిభ, అభ్యుదయ వంటి పత్రికలకు సంపాదక వర్గ సభ్యుడుగా విలక్షణమైన శీర్షికలు నిర్వహించాడు. 1979 డిసెంబర్లో మరణించిన అనిశెట్టి సుబ్బారావు అభ్యుదయ కవిగా, ప్రయోగాత్మక నాటక రచయితగా, కథా రచయితగా, సినిమా రచయితగా, పత్రికా సంపాదక వర్గ సభ్యుడుగా సాహితీ ప్రియుల హృదయాల్లో చిరస్మరణీయుడు. (నేడు అనిశెట్టి సుబ్బారావు 98వ జయంతి) డాక్టర్ పీవీ సుబ్బారావు వ్యాసకర్త సాహితీ విమర్శకులు, అనిశెట్టి సాహిత్య పరిశోధకులు ‘ 98491 77594 -
ఒకే చోట రెండు పక్షులు
కాకినాడ ఆంధ్ర సాహిత్య పరిషత్ ఆధ్వర్యంలో 1950 ప్రాంతంలో అప్పటి ప్రముఖ కవులతో ఒక కవి సమ్మేళనం జరిగింది. అందులో గుర్రం జాషువా, దువ్వూరి రామిరెడ్డి, విశ్వనాథ సత్యనారాయణ వంటివారు పాల్గొన్నారు. కవిసమ్రాట్ విశ్వనాథకంటే ముందుగా సభా ప్రాంగణానికి వచ్చిన జాషువా, దువ్వూరి ఒకచోట కూర్చుని మాట్లాడుకుంటున్నారు. అప్పుడే వచ్చిన విశ్వనాథ వ్యంగ్యంగా రెండు పక్షులూ ఒకచోట చేరాయే అన్నారు. ఇద్దరూ కవికోకిల బిరుదాంకితులే కదా. వెంటనే వారు స్పందిస్తూ ఈ కిరాతుడి కంట పడతామని అనుకోలేదన్నారు. ఆ ప్రాంగణంలో ఉన్నవారంతా వారి సమయస్ఫూర్తికి నవ్వుకున్నారు. -డాక్టర్ పి.వి.సుబ్బారావు -
ఆంగ్లం నుంచి తెలుగులోకి అనువదించిన తొలి నాటకం?
తెలుగు భాషా సాహిత్యంపై సంస్కృతం, ఆంగ్లం, ఉర్దూ, పారశీకం, ఒరియా, తమిళం, మలయాళం, కన్నడం, మరాఠీ భాషల ప్రభావం ఉంది. ఈ అంశంపై గత డీఎస్సీ స్కూల్ అసిస్టెంట్లో రెండు ప్రశ్నలు, లాంగ్వేజ్ పండిట్లో మూడు ప్రశ్నలు వచ్చాయి. కాబట్టి అభ్యర్థులు ఈ అంశాలపై దృష్టి సారించి సన్నద్ధతకు మెరుగులు దిద్దుకుంటే మంచి మార్కులు సాధించవచ్చు. తెలుగు సాహిత్యంపై ఇతర భాషల ప్రభావం సంస్కృతం ప్రభావం: ప్రపంచ భాషా కుటుంబాల్లో పెద్దది ఇండో ఆర్యన్ లేదా హిందార్య కుటుంబం. వీటిలో అతి ప్రాచీనమైంది సంస్కృతం. దీనికి సంబంధించి రెండు భేదాలున్నాయి. అవి: 1. వైదిక సంస్కృతం 2. లౌకిక సంస్కృతం వైదిక సంస్కృతం: వైదిక ఆచార వ్యవహారాల్లో ఉపయోగించేది వైదిక సంస్కృతం. కావ్యాల్లోని భాష లౌకిక సంస్కృతం. భారతీయ భాషలన్నింటిపై సంస్కృతం ప్రభావం ఉంది. తెలుగు భాషపై ప్రత్యేకించి ఎక్కువ. మన దేశంలో అతి ప్రాచీనగ్రంథం ‘రుగ్వేదం’. ఇది క్రీ.పూ. 1500 నాటిదని భాషా శాస్త్రవేత్తలు నిర్ధారించారు. వేదాలన్నీ మౌఖికాలు. పూర్వకాలంలో వాటిని విని, వల్లెవేసేవారు కాబట్టి వేదాలను ‘శ్రుతులు’ అని కూడా అంటారు. మన దేశంలో లిఖిత పూర్వకంగా ముద్రణలో లభించిన మొదటి గ్రంథం యాస్కుని నిరుక్తం.రుగ్వేదం తర్వాత యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదాలు వచ్చాయి. వేదాలకు వి వరణాత్మక వ్యాఖ్యానాలుగా బ్రాహ్మణకాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు ఆవిర్భవించాయి. లౌకిక సంస్కృతం: కావ్యాల్లో వాడిన భాష లౌకిక సంస్కృతం. దీని కాలం క్రీ.పూ. 1000 నుంచి 600 నాటిదని భాషాశాస్త్రవేత్తలు పేర్కొన్నారు. వాల్మీకి రామాయణం, వ్యాసుడి మహాభారతం, ‘పాణి’ని అష్టాధ్యాయి వంటి గ్రంథాలు లౌకిక సంస్కృతంలోనే ఉన్నాయి. పాణిని అష్టాధ్యాయి వ్యాకరణం ప్రపంచంలో ప్రముఖ భాషా శాస్త్రవేత్తల ప్రశంసలు అందుకుంది. ‘మానవ మేధాశక్తికి మహత్తర గోపురం’ పాణిని వ్యాకరణం అని ‘బ్లూమ్ఫీల్డ్’ అభివర్ణించాడు. మహాకవి కాళిదాసు కుమార సంభవం, రఘు వంశం, రుతు సంహారం లాంటి ప్రసిద్ధ కావ్యాలను రచించారు. అభిజ్ఞాన శాకుంతలం, మాళవికాగ్ని మిత్రం, విక్రమోర్వశీయం లాంటి గొప్ప నాటకాలు రాశారు. భాసుడు రచించిన ‘ప్రతిమ’, ‘స్వప్న వాసవదత్తం’ నాటకాలు కూడా ప్రసిద్ధికెక్కాయి. భర్తృహరి ‘సుభాషితాలు’, శూద్రకుడి ‘మృచ్ఛకటికం’ నాటకం పండితుల ప్రశంసలు పొందాయి. తెలుగు భాషా సాహిత్యంపై సంస్కృత భాషా సాహిత్యాల ప్రభావం ఎక్కువగా ఉంది. తొలిదశలో తెలుగు సాహిత్యం సంస్కృత సాహిత్యాన్ని అనుసరించింది. పురాణాలు, కావ్యాలు, నాటకాల్లో సంస్కృత ప్రభావం కనిపిస్తుంది. ఆదికవి నన్నయ భారతాంధ్రీకరణలో ఐదింట నాలుగుపాళ్లు తత్సమ పదాలను ప్రయోగించారు. భారత, భాగవత, రామాయణ గ్రంథాలన్నీ సంస్కృతం నుంచి అనువాదమైనవే. తిక్కన, ఎర్రన, శ్రీనాథ యుగం సంస్కృత కావ్యాలనే అనుసరించింది. శ్రీనాథుడి శృంగార నైషధం, కాశీఖండం, భీమఖండం కావ్యాలు సంస్కృత అనుసరణలుగా, సంస్కృత సమాస భూయిష్టమైన నారికేళ పాకంలో సాగాయి. శ్రీనాథుడు ‘క్రీడాభిరామం’ కావ్యంలో అన్ని భాషలకు సంస్కృతం అమ్మ లాంటిదని (జనని సంస్కృ తంబు సకల భాషలకును) ప్రశంసించారు. 19 వ శతాబ్ది చివరలో బిషప్ కాల్డ్వెల్ తెలుగు ద్రావిడ భాషా జన్యమని సిద్ధాంతీకరించేంత వరకు పండితులంతా సంస్కృత భాష నుంచి పుట్టిందనే అభిప్రాయంతో ఉన్నారు. ప్రబంధ కవులు చాలా వరకు సంస్కృత కావ్యాల ఆధారంగా రచనలు సాగించారు. శ్రీ కృష్ణ దేవరాయల ఆముక్త మాల్యద, రామరాజభూషణుడి వసుచరిత్ర సంస్కృత సమాస భూయిష్టంగా నారికేళపాకంలో సాగాయి. మనుచరిత్రలో పెద్దన కొంత కదళీపాకాన్ని, కొంత నారికేళ పాకాన్ని మిళితం చేశారు. రాజకీయ, సాంస్కృతిక, భౌగోళిక సంబంధాల వల్ల తెలుగులో సంస్కృత పదాలు ప్రవేశించాయి. ప్రస్తుతం పూజలు, కర్మకాండలకే సంస్కృతాన్ని ఉపయోగిస్తున్నారు. ఆంగ్ల భాషా ప్రభావం: సంస్కృతం తర్వాత తెలుగు సాహిత్యంపై అత్యధికంగా ప్రభావితం చేసిన భాష ఆంగ్లం. 19వ శతాబ్దంలో ఆంగ్ల సాహిత్య ప్రభావం సాంస్కృతిక పునరుజ్జీవనానికి దోహదం చేసింది. వీరేశలింగం, గురజాడ, గిడుగు, చిలకమర్తి లాంటి కవులు ఆంగ్ల భాషా సాహిత్యాలను అధ్యయనం చేశారు. వీరేశలింగం ఆంగ్ల సాహిత్య ప్రభావంతో నవల, ప్రహసనం, స్వీయ చరిత్ర, జీవిత చరిత్ర ప్రక్రియలను తెలుగులో రాశారు. గురజాడ పాశ్చాత్యుల హేతువాద దృక్పథాన్ని ప్రశంసిస్తూ ‘కన్నుగానని వస్తు తత్వము కాంచ నేర్వరు/ లింగిరీజులు’ అని మెచ్చుకున్నారు. పాశ్చాత్యుల సంస్కరణ దృక్పథానికి ప్రభావితుడై బాల్య వివాహాలు, కన్యాశుల్కాన్ని నిరసించారు. ‘కన్యాశుల్కం’ నాటకాన్ని శిల్పవంతంగా తీర్చిదిద్దారు. చిలకమర్తి లక్ష్మీ నరసింహం వీరేశలింగం అడుగుజాడల్లో ప్రసిద్ధ నవలలు, ప్రహసనాలు, నాటకాలను రాశారు. గిడుగు రామ్మూర్తి పంతులు ఆంగ్లభాషా ప్రభావంతో గ్రాంథిక భాష వద్దన్నాడు. వ్యావహారిక భాషా ఉద్యమాన్ని చేపట్టి విజయాన్ని సాధించారు. వ్యావహారిక భాషా ఉద్యమ ఫలితంగా తెలుగు ప్రాంతాల్లో అక్షరాస్యత పెరిగింది. సృజనాత్మక వచన రచనలు వెలువడ్డాయి. 20వ శతాబ్ది మొదటి భాగంలో ఆధునిక కవులైన రాయప్రోలు సుబ్బారావు, విశ్వనాథ సత్యనారాయణ, దేవులపల్లి, తల్లావజ్జల, కవికొండల వెంకట రావు మొదలైన కవులు షెల్లీ, కీట్స్, వర్డ్సవర్త, డ్రెడైన్ లాంటి రొమాంటిక్ కవుల ప్రభావంతో భావ కవితా ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఆంగ్ల సాహిత్య ప్రభావంతో ఆధునిక సాహితీ ప్రక్రియలైన నవల, కథానిక, నాటకం, వ్యాసం, విమర్శ లాంటి రచనలు అందుబాటులోకి వచ్చాయి. పాలనా పరమైన గవర్నర్, కమిషనర్, మేయర్, చైర్మన్, మినిస్టర్, న్యాయ సంబంధమైన కోర్టు, లాయర్, జడ్జి, డిక్రీ లాంటి పదాలు తెలుగులో కలిసిపోయాయి. అలాగే విద్యారంగంలో కాలేజీ, స్కూలు, యూనివర్సిటీ, ప్రొఫెసర్, లెక్చరర్, టీచర్ పదాలు చేరాయి. నిత్య వ్యవహారంలో మిళితమైన రోడ్డు, రైలు, బస్సు, పేపరు, పెన్ను, గన్ను పదాలను ఆచార్య బొడ్డుపల్లి పురుషోత్తం ‘నవీన తత్సమాలు’గా పేర్కొన్నారు. తెలుగు సాహిత్యంపై ఆంగ్లం ప్రభావాన్ని తెలియజేసే ప్రసిద్ధ గ్రంథాలు: 1. తెలుగు సాహిత్యంపై ఇంగ్లిషు ప్రభావం - ఆచార్య కొత్తపల్లి వీరభద్రరావు 2. తెలుగులో ఆంగ్ల పదజాలం - ఆచార్య టి. అక్కిరెడ్డి 3. ఆంధ్ర సాహిత్య విమర్శ- ఆంగ్ల ప్రభా వం - ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యం 4. బాల వ్యాకరణం - వికాస వ్యాఖ్య - ఆచార్య బొడ్డుపల్లి పురుషోత్తం ఉర్దూ ప్రభావం: అల్లాఉద్దీన్ ఖిల్జీ దండయాత్ర ప్రభావంతో ఉర్దూ భాష భారత దేశంలో ప్రవేశించింది. నవీన ఔత్తరాహ భాష హిందీ తర్వాత ప్రముఖమైంది ఉర్దూ. ఈ భాషా వ్యవహర్తలు దేశమంతా ఉన్నారు. మహమ్మదీయుల పాలనలో ఉర్దూ 13వ శతాబ్ది నుంచి పాలనా భాషగా ఉంది. మల్కీభరామ్ ఉర్దూతోపాటు తెలుగును ఆదరించారు. ఆయన పొన్నెగంటి తెలగన రచించిన ‘యయాతి చరిత్ర’ను అంకితం తీసుకున్నారు. ఆంగ్లేయుల పాలనలో 1835లో ఉర్దూను రాజభాషగా ప్రకటించారు. హిందీ బోధన కంటే ఉర్దూ బోధనకే ప్రాధాన్యమిచ్చారు. ముస్లిం ప్రభువుల పాలనలో సైనిక శిబిరాల్లో పుట్టిన ఉర్దూ సాంఘిక, రాజకీయ కారణాల వల్ల బాగా అభివృద్ధి చెందింది. క్రీ.శ. 15వ శతాబ్ది నాటికే ఉర్దూ సాహిత్యం ఉంది. ఈ భాషా సాహిత్య రూపాన్ని ‘దఖానీ’ అని పిలుస్తారు. ఉర్దూ, హిందీలు హిందూస్థానీ భాషలుగా ప్రసిద్ధి చెందాయి. రాజకీయ పాలనా పరంగా నవాబు, నౌకరు, తహసీల్దార్, దరఖాస్తు , రసీదు, కుర్తా, కండువా, లంగా మొదలైన ఉర్దూ పదాలు తెలుగులో పూర్తిగా కలిసిపోయాయి. అదేవిధంగా సాంస్కృతికపరంగా మసీదు, సలాం, మక్కా, నమాజు లాంటి పదాలు తెలుగులో చేరాయి.ఆధునిక కవితా రూపాలైన గజల్స్, రుబాయీలు ఉర్దూ సాహిత్య ప్రభావితాలే. ఆధునిక కవుల ప్రయోగాల్లో ఉర్దూ పదాలు విరివిగా ఉన్నాయి. ఉర్దూలో ఇక్బాల్చంద్, రాజేందర్ సింగ్ బేడీ ప్రముఖ రచయితలు. ప్రసిద్ధగ్రంథాలు - రచయితలు 1. తెలుగులో ఉర్దూ పదాలు - డాక్టర్ టి. స్వరాజ్యలక్ష్మి 2. తెలుగు భాషకు మహమ్మదీయుల సేవ - డాక్టర్ షేక్ మస్తాన్ 3. తెలుగుపై ఉర్దూ - పారశీకుల ప్రభావం - ఆచార్య కె. గోపాల కృష్ణారావు గత డీఎస్సీలో అడిగిన ప్రశ్నలు 1. తెలుగులో ప్రస్తుతం వాడుకలో ఉన్న లైటు, స్విచ్, కాఫీ అనే ఆంగ్ల పదాలు? (ఎస్.ఎ. - 2012) 1) నిత్యావసరాలకుసంబంధించినవి 2) సాంస్కృతిక సంబంధమైనవి 3) పరిపాలనా సంబంధ పదాలు 4) శాస్త్ర పరిభాషా సంబంధమైనవి 2. తెలుగు మాట ‘వేయి’ పదం? (ఎస్.ఎ. - 2012) 1) సంస్కృత పదం 2) తమిళ పదం 3) కన్నడ పదం 4) ద్రావిడ వ్యుత్పత్తి ఉన్న స్వతంత్ర పదం 3. ‘జమిలి’ శబ్దానికి మూలరూపం ‘యమల’. ఇది ఏ భాషా పదం? (ఎల్పీ - 2012) 1) కన్నడం 2) మలయాళం 3) సంస్కృతం 4) తమిళం 4. ‘చాకిరీ’ అనే పదం ఏ భాషలోనిది? (ఎల్పీ - 2012) 1) కన్నడం 2) మలయాళం 3) ఉర్దూ 4) తమిళం సమాధానాలు 1) 1; 2) 4; 3) 3; 4) 3. మాదిరి ప్రశ్నలు 1. సంస్కృతం ఏ భాషా కుటుంబానిది? 1) ఆర్య భాష 2) ఇండో ఆర్యన్ భాష 3) సినోటిబెటన్ 4) ఆస్ట్రో ఏషియాటిక్ 2. తెలుగులో ప్రవేశించిన పాలనా సంబంధ సంస్కృత పదం? 1) ఆదేశం 2) నిర్బంధం 3) పరిపాలన 4) పైవన్నీ 3. తెలుగుతో సంస్కృత భాషకు ఉన్న సంబంధం? 1) సజాతీయ భాష 2) విజాతీయ భాష 3) సమీప భాష 4) మత సంబంధ భాష 4. సంస్కృత సమాస భూయిష్టమైన శైలిని ఏమంటారు? 1) ద్రాక్షాపాకం 2) కదళీపాకం 3) నారికేళ పాకం 4) పాషాణ పాకం 5. సంస్కృతం నుంచి తత్సమాలుగా ఎలాంటి మార్పు లేకుండా తెలుగులోకి వచ్చిన మాటలు? 1) మకారాంత శబ్దాలు 2) సకారాంత శబ్దాలు 3) అకారాంత శబ్దాలు 4) దీర్ఘాచ్చులు ఉన్న ఏకాక్షర పదాలు 6. అన్య దేశ్యాల ద్వారా తెలుగులోకి వచ్చిన అనుబంధ రూపాలు? 1) దారు, నామా 2) పోతు, గారు 3) ఖానా, రికం 4) కోరు, పోతు 7. ఆంగ్లం నుంచి తెలుగులోకి అనువదించిన తొలి నాటకం? 1) మర్చంట్ ఆఫ్ వెనిస్ 2) జూలియస్ సీజర్ 3) రోమియో జూలియట్ 4) కామెడీ ఆఫ్ ఎరర్స 8. జీవిత చరిత్ర - స్వీయ చరిత్రలకు మూలమైన ఆంగ్ల ప్రక్రియలు? 1) లైఫ్ హిస్టరీ - బయోగ్రఫీ 2) ఆటో బయోగ్రఫీ - లైఫ్ హిస్టరీ 3) బయోగ్రఫీ - ఆటో బయోగ్రఫీ 4) బయోగ్రఫీ - సెల్ఫ్ హిస్టరీ సమాధానాలు: 1) 2; 2) 4; 3) 2; 4) 3; 5) 4; 6) 1; 7) 2; 8) 3.