breaking news
Professionalism
-
సున్నితత్వం పెంచుకోండి
రాయ్పూర్: పోలీసులంటే ప్రజల్లో, ముఖ్యంగా యువతలో ఉన్న భావనను ఎంతగానో మెరగుపరచాల్సిన అవసరముందని ప్రధాని మోదీ అన్నారు. ‘‘అది జరిగేలా చూడాల్సిన బాధ్యత పోలీసులదే. అందుకోసం వారే సున్నితత్వం, జవాబుదారీతనం పెంచుకోవాలి’’అని ఆయన అభిప్రాయపడ్డారు. మొత్తంగా ఆ శాఖలో ప్రొఫెషనలిజం మరింత మెరుగవాలని ఆకాంక్షించారు. రాయ్పూర్లో మూడు రోజుల పాటు జరిగిన డీజీపీలు, ఐజీల 60వ అఖిల భారత సదస్సును ఉద్దేశించి ఆదివారం ఆయన ప్రసంగించారు. విచ్చిన్న కార్యకలాపాలకు పాల్పడేందుకు పొంచి ఉన్న నిషేధిత శక్తులపై నిత్యం డేగ కన్నుంచడం కూడా అత్యవసరమని ఉద్బోధించారు. వామపక్ష తీవ్రవాదం నుంచి విముక్తమైన ప్రాంతాల సమగ్రాభివృద్ధిలో పోలీసులు కూడా తమ వంతు పాత్ర పోషించాలని సూచించారు. అప్పుడే ప్రజల్లో వారిపట్ల మరింత సదభిప్రాయం కలుగుతుందని గుర్తు చేశారు. మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో సువిశాలమైన భారత తీర రక్షణను మరింత బలోపేతం చేసేందుకు వినూత్న చర్యలు చేపట్టాల్సిన అవసరం కూడా ఎంతో ఉందని చెప్పారు. ‘వికసిత భారతం: భద్రతా కోణాలు’ ప్ర«దానాంశంగా ఈ సదస్సు జరిగింది. డ్రగ్స్ భూతం కట్టడి మొదలుకుని తీర రక్షణ దాకా విభిన్నాంశాలపై మూడు రోజుల పాటు లోతైన చర్చ జరిగింది. విజన్ 2047 సాకారానికి పోలీసులపరంగా తీసుకోవాల్సిన పలు చర్యలు ప్రస్తావనకు వచ్చాయి. హిడ్మా తదితర మావోయిస్టు అగ్రనేతలను పోలీసులు ఇటీవలే ఎన్కౌంటర్ చేసిన నేపథ్యంలో ఛత్తీతగఢ్ రాజధాని రాయ్పూర్లో సదస్సు జరగడం గమనార్హం. అర్బన్ పోలీసింగ్ను మరింత బలోపేతం చేయడం, పర్యాటక పోలీసింగ్ను మరింత స్నేహశీలంగా మార్చడం, కొత్తగా వచ్చిన భారత న్యాయ చట్టాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు కృషి చేయడం తదితరాలపై పోలీసులు బాగా దృష్టి సారించాలని మోదీ హితవు పలికారు. ప్రాకృతిక విపత్తుల సమయంలో ప్రజలను ఆదుకునే విషయంలోనూ పోలీసులు ముందు వరుసలో నిలవాలన్నారు. పోలీసు విచారణల్లో ఫోరెన్సిక్ వాడకంపై కేస్ స్టడీలు రూపొందించాల్సిందిగా యూనివర్సిటీలు, ఉన్నత విద్యా సంస్థలకు పలుపునిచ్చారు. ఇంటలిజెన్స్ బ్యూరోకు చెందిన అధికారులకు రాష్ట్రపతి పోలీసు మెడల్స్ను మోదీ ఈ సందర్భంగా ప్రదానం చేశారు. అర్బన్ పోలీసింగ్లో అత్యుత్తమంగా నిలిచిన నగరాలకు తొలిసారిగా ప్రవేశపెట్టిన అవార్డులను అందజేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల డీజీపీలు, ఐజీలు, కేంద్ర పోలీసు బలగాల సారథులు తదితరులు సదస్సులో పాల్గొన్నారు. మరో 700 మందికి పైగా పోలీసు ఉన్నతాధికారులు వర్చువల్గా ఈ కీలక సదస్సులో భాగం పంచుకోవడం విశేషం. -
World Television Day: చిత్రలహరి వస్తుంది పద...
కొద్దిగా ఉన్నప్పుడే బాగుండేది. టీవీ ఉన్న ఇంటికి టీవీ లేని వాళ్లంతా వచ్చి కూచునేవారు. ఆదివారం రామాయణం కోసం ప్రతి ఇల్లూ ఆతిథ్యం ఇచ్చేది. చిత్రలహరికి గడప బయట నిలబడి తొంగి చూసే పిల్లల్ని అదిలించేవారు కాదు. ఇంటి పైన యాంటెనా, ఇంట్లో డయనారా అదీ హోదా అంటే. టెలివిజన్ జీవితంలో భాగం అయిన రోజులు బాగుండేవి. ఇవాళ జీవితమంతా టీవీగా మారి ఊపిరి సలపడం లేదు. టీవీ వచ్చిన రోజులకూ ఇప్పటికీ ఎంత తేడా!సినిమా తెర మీద కాకుండా మరో తెర మీద, అదీ ఇంట్లో ఉండే తెర మీద బొమ్మ పడుతుందని ఊహించని రోజుల్లో టెలివిజన్ వచ్చి చేసిన సందడి అంతా ఇంతా కాదు. నాటి హైద్రాబాద్, లేదా మద్రాస్ (చెన్నై), లేదా కొండపల్లి నుంచి సిగ్నల్స్ సరిగా ఆ రోజుకి అందాయో ఇక పండగే పండగ. ఎందుకు పండగ? సాయంత్రం ఆరు నుంచి రాత్రి పది వరకు ఆ తెలుపు నలుపు టీవీలో ఏదో ఒకటి ఉచితంగా ప్రసారం అవుతూ ఉంటుంది. చూడొచ్చు. అందుకని.సమయం ఉన్న రోజులుమన దేశంలో 1959లో టెలివిజన్ మొదలైనా సరైన ప్రసారాలు రూపుదిద్దుకోవడానికి 1976కి కాని సాధ్యపడలేదు. నగరాలను దాటి ఊళ్లకు సిగ్నల్ అందే వ్యవస్థ ఏర్పడటానికి మరో పదేళ్లు పట్టింది. కలర్ ప్రసారాలు 1982లో మొదలైనా 1990లకు గాని కలర్ టీవీలు కొనే శక్తి ఊళ్లల్లో ఏ కొద్దిమందికో తప్ప అందరికీ రాలేదు. ఏతా వాతా 1985 నుంచి తెలుపు, నలుపు టీవీ ప్రసారాలు తెలుగు ప్రేక్షకులకు తెలుస్తూ వచ్చాయి. ఆ రోజుల్లో మనుషులందరి దగ్గరా ఎక్కడ లేని తీరిక, సమయం. కాబట్టి టీవీ ఆన్ చేసి అర్థమైనా కాకపోయినా చూస్తూ ఉండటం అలవాటుగా మారింది. ఇక అందులో ఆసక్తికరమైన కార్యక్రమాలు మొదలయ్యాక అతుక్కుపోయారు. టెలివిజన్ చేసిన మొదటి పని ఏమిటంటే– దేశ వాసులందరికీ ఒకే టీవీ ఒకే వినోదం అనే భావన కలిగించడం. ప్రాంతీయ ప్రసారాలు ఉన్నా ముఖ్యమైన మీట ఢిల్లీలో ఉంటుందని అందరికీ తెలియచేయడం. కేంద్ర శక్తిని స్థాపించడంలో టెలివిజన్ ముఖ్య పాత్ర పోషించింది.రామాయణం సంచలనం1987 నుంచి మొదలైన ‘రామాయణం’ సీరియల్ టెలివిజన్ పవర్ ఏంటో దేశానికి చాటింది. వ్యాపార ప్రకటనలు ఎలక్ట్రానిక్ మీడియాలో వెల్లువెత్తడం కూడా మొదలయ్యాయి. అంతవరకూ టికెట్ ఇచ్చి సినిమా హాల్లో రామాయణం చూసిన జనం ఈ ఉచిత రామాయణాన్ని తండోపతండాలుగా చూశారు. ఆ తర్వాత ‘మహాభారత్’, ‘హమ్లోగ్’, ‘నుక్కడ్’, ‘ఉడాన్’, ‘మాల్గుడీ డేస్’... ప్రేక్షకులకు అందమైన డేస్ మిగిల్చాయి.చిత్రహార్–చిత్రలహరిప్రతి బుధవారం వచ్చే హిందీ పాటల ‘చిత్రహార్’, శుక్రవారం వచ్చే ‘చిత్రలహరి’ సూపర్హిట్ ఆదరణ పొందాయి. జనం తెలుగు పాటల కోసం టీవీల ముందు కొలువు తీరేవారు. ఆ రోజుల్లో ప్రతివారం ‘ఒక బృందావనం సోయగం’ (ఘర్షణ 1988) పాట తప్పనిసరిగా ఉండేది. పండగల ముందు ఆయా పండగలకు తగ్గట్టుగా పాటలు ఉండేవి. అదే సమయంలో ధర్మవరపు సుబ్రహ్మణ్యం ‘ఆనందో బ్రహ్మ’ సూపర్హిట్ అయ్యింది. ఆదివారం రోజు అతి పాత తెలుగు చిత్రం వచ్చినా జనం విరగబడి చూసేవారు.అపురూప క్షణాలుఇంటి పైనా యాంటెనా, ఇంట్లో టీవీ ఉండటం ఎంతో గొప్పయిన రోజులు అవి. ఇక కలర్ టీవీ ఉన్న ఇంటికి డిమాండ్ జాస్తిగా ఉండేది. వాన వచ్చినా, గాలి వీచినా నిలువని బొమ్మతో వేగినా అదే పెద్ద సంబరం. ఇన్స్టాల్మెంట్లో కొని ఇంటికి టీవీ తెచ్చిన రోజు పండగ ఉండేది. మధ్యతరగతి జీవులకు తగినట్టుగా ‘మినీ టీవీ’లు కంపెనీలు తెచ్చాక వాటితోనే సర్దుబాటు చేసుకున్న సన్నజీవులెందరో. దూరదర్శన్ సిగ్నేచర్ ట్యూన్తో సహా దూరదర్శన్ అందరికీ అభిమాన పాత్రమైంది. ఆదివారం మధ్యాహ్నం ప్రాంతీయ భాషా చిత్రాలు కూడా సబ్టైటిల్స్తో చూసేవారు. అలా ఎన్నో ఉత్తర కన్నడ, తమిళ, మలయాళ సినిమాలు చూశారు. టీవీ ప్రసారాల వల్ల ఇరుగిల్లు పొరుగిల్లు ఒకే ఇల్లయినట్టుగా అందరూ కలిసి మెలిసి ఉండేవారు. టీవీలో క్రికెట్ లైవ్ చూడటానికి ఎంతో మంచిగా వ్యవహరించాల్సి వచ్చేది. స్నేహాలు చేయాల్సి వచ్చేది.ఇప్పుడు చేతిలో ఫోన్. అనుక్షణం రీల్స్. చేతిలోనే కదిలే బొమ్మ. దేనికీ విలువ లేదు. ఓటీటీల్లో వందల సినిమాలు ఉన్నా దేనిని ఎంపిక చేసుకోవాలో తెలియని పరిస్థితి. ఏదీ నచ్చదు. కానీ ఆ రోజుల్లో వచ్చిందే నచ్చేది. అతిగా లభ్యమైనది ఏదైనా విలువ కోల్పోతుంది. ఇవాళ విజువల్ ఎంటర్టైన్మెంట్ వేయి రూ పాలు సంతరించుకున్నా, ఇరవై నాలుగ్గంటల న్యూస్ చానల్స్ ఉన్నా అవన్నీ జల్లెడలో జారే ఊకలానే ఉంటున్నాయి. టెలివిజన్ ప్రసారాల ప్రొఫెషనలిజమ్, హుందాతనం, ఆ న్యూస్రీడర్లు, ఆ యాంకర్లు... ఆ మాట... ఉచ్చారణ... పలుకు... ఇప్పుడెక్కడ. పసిడి రెక్కలు విసిరి కాలం పారిపోయింది. -
కొందరు సరిగా పనిచేయట్లేదు!
న్యూఢిల్లీ: కొందరు హైకోర్టు న్యాయమూర్తులు వేగంగా కేసులను పరిష్కరించే వృత్తినైపుణ్యం ఉన్నా కూడా ఆ స్థాయిలో పనిచేయట్లేరని సర్వోన్నత న్యాయస్థానం ఆవేదన వ్యక్తంచేసింది. అలాంటి జడ్జీలపాలిట స్కూల్ ప్రిన్సిపాల్ మాదిరి హితబోధ చెప్పే ఉద్దేశం తమకు లేదని, స్వీయసమీక్ష ద్వారా ఆ జడ్జీల తమ వైఖరిని మార్చుకోవాలని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్.కోటీశ్వర్ సింగ్ల సుప్రీంకోర్టు ధర్మాసనం హితవు పలికింది. ‘‘హైకోర్టుల్లో రెండు రకాల జడ్జీలున్నారు. కొందరు జడ్జీలు పగలూరాత్రీ పనిచేస్తూ వేగంగా ఎక్కువ కేసులను పరిష్కరిస్తున్నారు. కొందరు జడ్జీలు మాత్రం దురదృష్టవశాత్తు సవ్యంగా సేవలు అందించట్లేదరు. కారణాలు మంచివైనా చెడ్డవైనా సరే పని మాత్రం సరిగా సాగట్లేదు. పరిస్థితులు ఎలాంటివనేది ఇక్కడ అప్రస్తుతం. ఒక జడ్జీ ఒక క్రిమినల్ కేసును ఆలకిస్తున్నారనుకుందాం. ఆయన రోజుకు 50 కేసులను పరిష్కరించాలని మేం అత్యాశపడట్లేదు. అలాగని ఆయన ఒక్క కేసు విచారించి గొప్ప పని చేశాననుకుంటే పద్ధతి కాదు. బెయిల్ కేసులో రోజుకు ఒకే ఒక్క కేసును విచారిస్తూ కూర్చుంటా అంటే అది ఆయన ఆత్మపరిశీలనకే వదిలేయాలి. తమ వద్ద కేసుల పెండింగ్ల కొండ పేరుకుపోకుండా జడ్జీలు చూసుకోవాలి. ఆ మేరకు స్వీయ నియంత్రణ ఉండాలి. వృత్తిపరంగా నాణ్యమైన కార్యశీలత అనేది తప్పనిసరి. రోజుకు పరిష్కరించే ఎక్కువ కేసుల సంఖ్య పెంచుకుంటూ పోవాలి. దాంతోపాటే కేసుల పరిష్కార విధానంలో అత్యున్నత న్యాయప్రమాణాలు, నియమనిబంధనలను పాటించాల్సిందే. ఈ విషయంలో హైకోర్టు జడ్జీలకు స్కూల్ ప్రిన్సిపాల్ మాదిరి పాఠాలు చెప్పే యోచన మాకు లేదు. మన ముందు ఎంతటి పెండింగ్ కేసుల భారం ఉంది, ఎంత త్వరగా ఆ భారాన్ని తగ్గించుకోవాలని అనే స్పృహ జడ్జీలకు ఉండాలి’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. తమపై నమోదైన క్రిమినల్ కేసుల్లో వాదోపవాదనలు ముగిసి తీర్పులు జార్ఖండ్ హైకోర్టులో ఏళ్ల తరబడి రిజర్వ్లోనే ఉండిపోవడంతో విసిగిపోయిన ఆ నిందితులు సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఉదంతంలో ధర్మాసనం పై విధంగా స్పందించింది. -
సహోద్యోగులతో పంచుకోకూడని అంశాలు..
పని ప్రదేశాల్లో స్నేహపూర్వక వాతావరణాన్ని పెంపొందించుకోవడం మంచిదే. అంతమాత్రానా సహోద్యోగులతో అన్ని విషయాలు పంచుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. వ్యక్తిగత వివరాలు, విశ్వాసాలు, ఆరోగ్య విషయాలు..వంటి కొన్ని అంశాలను తోటి ఉద్యోగులతో చర్చించకపోవడమే మేలని సూచిస్తున్నారు. ఒకవేళ వారితో ఆయా విషయాలను చర్చిస్తే వృత్తిపరంగా, వ్యక్తిగతంగా జరిగే మేలు కంటే చేటే ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. తోటి ఉద్యోగులతో పంచుకోకూడని కొన్ని అంశాలను నిపుణులు తమ మాటల్లో తెలియజేస్తున్నారు.వ్యక్తిగత, ఆర్థిక సమాచారంమీ వ్యక్తిగత, ఆర్థిక పరిస్థితిని గోప్యంగా ఉంచాలి. మీరు పొందుతున్న జీతం, అప్పులు, పెట్టుబడులు కార్యాలయంలో అనవసరమైన ఒత్తిడి, పోటీని సృష్టిస్తాయి. మీ జీవనశైలిని ప్రభావితం చేసే అంశాలపై తోటి ఉద్యోగులు ఒక అంచనాకు వచ్చే అవకాశం ఉంటుంది. దానివల్ల వృత్తిపరంగా నష్టం జరగవచ్చు.ఆరోగ్య సమస్యలుసెలవులు తీసుకోవడానికి, టార్గెట్లు తప్పించుకోవడానికి తరచూ చాలామంది ఆఫీస్లో ఆరోగ్య సమస్యలున్నట్లు చెబుతారు. అందుకు బదులుగా మీకు నిజంగా ఏదైనా సమస్యలుంటే దాన్ని ఎలా అధిగమిస్తున్నారో హెచ్ఆర్, మేనేజర్కు మాత్రమే చెప్పండి. భవిష్యత్తులో మీరు సెలవు అడిగినప్పుడు మీ సమస్యపై వారికి అవగాహన ఉంది కాబట్టి అనుమతించే అవకాశం ఉంటుంది. తోటి ఉద్యోగులకు చెప్పడం వల్ల మీరు టార్గెట్లు తప్పించుకునేందుకే ఇలా చేస్తున్నారని తప్పుడు ప్రచారం చేయవచ్చు.రాజకీయ, మత విశ్వాసాలుపని ప్రదేశంలో విభిన్న విశ్వాసాలు కలిగిన వారు ఉంటారు. మీ రాజకీయ, మత విశ్వాసాలను వారిపై రుద్దడం కంటే అసలు ఆ ప్రస్తావన లేకుండా వృత్తి జీవితం సాఫీగా సాగేలా జాగ్రత్త పడాలి.సహోద్యోగులు, మేనేజ్మెంట్పై కామెంట్లుసహచరులు / మేనేజ్మెంట్ గురించి తోటి ఉద్యోగులతో చెడుగా మాట్లాడటం లేదా గాసిప్లు క్రియేట్ చేయడం ఆపేయాలి. సంస్థకు సంబంధించిన మీ అభిప్రాయాలు సరైనవే అయినా ఇతరులతో పంచుకోకూడదు. మీ విమర్శలు ఏవైనా ఉంటే నేరుగా మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్లడం మంచిది.ఇదీ చదవండి: బ్యాంకులపై ఆధారపడొద్దు: ఐఆర్డీఏఐభవిష్యత్ ఉద్యోగ ప్రణాళికలుమీరు అధికారిక ప్రకటన చేయకుండా కంపెనీ మారే ఆలోచనను ఎవరితోనూ పంచుకోకూడదు. మీ భవిష్యత్ ఉద్యోగ ప్రణాళికలను గోప్యంగా ఉంచడం ఉత్తమం. ఈ విషయాన్ని ముందుగానే చెబితే ప్రస్తుత మీ స్థానానికి ప్రతికూలంగా మారే అవకాశం ఉంటుంది. -
శ్రమో నమః
వందల కోట్ల చేతులు ప్రపంచమనే ఈ మహాయంత్రాన్ని పని చేయిస్తున్నాయి. పని అంటే కర్మ. కాలగతిలో కర్మ శబ్దం ఆ ప్రాథమికార్థపు నేల విడిచి విధిలిఖితమనే తాత్వికార్థపు గగనసీమను తాకింది. మనుగడకు అవసరమైన సాధారణ కర్మల స్థాయిని దాటి మతపరమైన తంతులతో సహా ఇతరేతర అర్థాలకు విస్తరించింది. కర్మలో శ్రమ ఉంటుంది, శ్రమలో కర్మ ఉంటుంది. రెండూ అన్యోన్యాశ్రితాలు. మళ్ళీ ప్రపంచాన్నే ఒక యాంత్రిక మహాశకటమనుకుంటే, దానిని ముందుకు నడిపించేది కోట్లాది జనాల శ్రమ ఇంధనమే. పుట్టిన ప్రతిజీవీ అంతో ఇంతో కర్మయోగే. అందరికీ వందనం. వేదం కర్మవాదమే. అందులో కర్మ గురించిన ఉగ్గడింపే ఆద్యంతం వ్యాపించి ఉంటుంది. వేదకాలపు కర్మభావనలో హెచ్చుతగ్గుల వింగడింపు లేదు; దేవతలు, మనుషులన్న తారతమ్యం లేదు. సూర్యచంద్రులు, ఉషస్సు, అగ్ని సహా అందరూ క్రమం తప్పకుండా తమ విధ్యుక్త కర్మలను నిర్వహించవలసిందే. ఇంద్రుడు కర్మ చేతనే గొప్పవాడయ్యాడంటుంది వేదం. అతని చేతి వేళ్ళు అనేక వేల కర్మలను చేస్తూ ఉంటాయి. ఆహార పచనం, దేవతలకు హవ్యాన్ని అందించడంతో సహా అగ్ని బహువిధ కర్మదక్షుడు. అగ్నిని అనేక విధాలుగా వినియోగంలోకి తెచ్చిన కార్మిక నిపుణులు అంగిరసులు. సర్వకర్మకుశలురైన పుత్రపౌత్రులు కావాలని వేదజనం కోరుకుంటారు. కర్మనిరతిని ప్రకృతితో ముడిపెట్టి వేదం అందంగా చెబుతుంది. ‘‘మనుషుల్లారా! నిద్రలేవండి, చీకట్లు తొలిగాయి, మన దేహాలకు ప్రాణం వచ్చింది, ఉష ఉదయించి సూర్యుని రాకను ప్రకటించింది, అన్నం సమృద్ధిగా దొరికే చోటుకి వెడదాం పదండి’’ అని ఒక ఋక్కు చెబుతుంది. ఉష ఉదయించి మీ మీ వృత్తి వ్యాపారాల వైపు మిమ్మల్ని జాగృతం చేస్తోందని మరో ఋక్కు అంటుంది. ‘‘జాలరి పగ్గం, సాలెల మగ్గం, శరీర కష్టం స్ఫురింపజేసే గొడ్డలి, రంపం, కొడవలి, నాగలి, సహస్ర వృత్తుల సమస్త చిహ్నా’’ల స్మరణ ఆధునిక మహాకావ్యంలోనే కాదు; కవిత్వానికే ఆదిమమైన వేదంలోనూ కనిపిస్తుంది. త్వష్ట నిపుణుడైన లోహకార్మికుడు... స్వర్ణమయమై, వేయి అంచులు కలిగిన వజ్రాయుధాన్ని నిర్మించి ఇంద్రునికి ఇచ్చాడు. దేవతలతో సమానమైన గౌరవాన్ని పొందాడు. ఋభులనే అన్నదమ్ములు మానవులైనా లోహవిద్యలో త్వష్టను మించిన ప్రావీణ్యం చూపి దేవతలయ్యారు. మరుత్తులనే దేవతలు ప్రవాహానికి అడ్డుపడిన ఓ పర్వతాన్ని బద్దలుకొట్టి నీటికి దారి చేశారు. అశ్వినులు మనువుకి విత్తనాలిచ్చి వ్యవసాయం చేయించారు; వైద్యం చేసి ఎంతోమందికి ఆరోగ్యాన్ని, ఆయుష్షును ఇచ్చారు. క్షురకుడు కేశఖండన చేసినట్లుగా ఉష చీకట్లను ఉత్తరిస్తోందని ఒక ఋక్కు అంటుంది. శ్రమ ఉచ్చమా, న్యూనమా అని చూడకుండా; శ్రామికుల మధ్య హెచ్చుతగ్గుల తేడా తేకుండా శ్రమను మాత్రమే గౌరవించిన దశ అది. ఇంద్రాదులు సమాజానికి ఏదో ఒక మేలు చేసే సేవకులు కనుకనే దేవతలయ్యారు. వేదకాలంలో అలాంటి సేవకులను పన్నెండుగురిని గుర్తించి పన్నిద్దరు ఆయగార్లు అన్నారు. శారీరక శ్రమను తక్కువ చేసి మేధోశ్రమను ఆకాశానికి ఎత్తడం ఆనాటికి లేదు. తిథివారనక్షత్రాలు చూసే వ్యక్తి కన్నా మృతపశువుల చర్మాన్ని ఒలిచే చర్మకారునికి ఎక్కువ ప్రతిఫలం ముట్టిన కాలం అది. కర్మ, కర్మఫలం రెండూ ఆనాడు సాముదాయికమే. చెరువుల వంటి నిర్మాణాలలో రాజు, రాజుగారి భార్యా కూడా మట్టితట్టలు మోసిన ఉదాహరణలు పురాచరిత్రలో కనిపిస్తాయి. అది పోయి చాకిరొకరిది, సౌఖ్యమొకరిదైన తర్వాతే పరిస్థితి తలకిందులైందని పండితులంటారు. అందరూ అన్నిరకాల పనులూ చేయడం పోయి వృత్తి విభజన రావడంతోనే వృత్తుల మధ్య, వ్యక్తుల మధ్య చిన్నా పెద్దా తారతమ్యాలూ పొటమరించాయి. ఇష్టపూర్వక కర్మ నిర్బంధకర్మగా మారి దుఃఖదాయిని అయింది. అప్పుడు కూడా వృత్తి నైపుణ్యంలో ఆనందాన్ని, తృప్తిని అనుభవించే అవకాశం ఎంతోకొంత ఉండేది. వృత్తిదారులు పారిశ్రామిక యంత్రంలోని పరికరాలుగా మారిపోవడంతోనే అదీ పోయింది. ఈ మార్పును కొడవటిగంటి కుటుంబరావు ఒక కథలో అద్భుతంగా చిత్రీకరిస్తారు. ప్రకృతి సమవర్తి. శ్రుతిమించిన అసమానతలను ఆట్టే కాలం సహించదు, ఎప్పటికైనా కత్తెర వేసి సమతుల్యతను తెస్తుంది. అడుగంటిన శ్రమ విలువను, గౌరవాన్ని, తగిన ప్రతిఫలాన్ని ఉద్ధరించే ప్రయత్నం ఆధునిక కాలంలోనే మళ్ళీ ఊపందుకుంది. ‘శ్రమ నిష్ఫలమై, జన నిష్ఠురమై నూతిని గోతిని వెదికే కార్మిక వీరుల కన్నుల నిండా కణకణమండే విలాపాగ్నులకు, గలగల తొణికే విషాదాశ్రులకు ఖరీదు కట్టే షరాబులు’ ఉద్భవించారు. ఏ ఒకడి ఆస్తిహక్కైనా శ్రమపునాది మీదే ఆధారపడుతుందని జాన్ లాక్ అనే ఆర్థికవేత్త నొక్కిచెప్పి శ్రమకు తిరిగి పట్టం కట్టాడు. ఆడమ్ స్మిత్ అనే మరో ఆర్థికవేత్త విలువకు మూలం శ్రమేనన్నాడు. దాని ఆధారంగా డేవిడ్ రికార్డో అనే మరో ఆర్థికవేత్త శ్రమవిలువ సిద్ధాంతాన్ని ముందుకుతెచ్చాడు. కార్ల్ మార్క్స్ తాత్వికతకు అదే సారవంతమైన వనరు అయింది. శ్రమ విలువను తిరిగి గుర్తించడమే జరిగింది కానీ శ్రామికుని బతుకు బండి ఇంకా పూర్తిగా పట్టాలకెక్కలేదు. ‘ఉందిలే మంచి కాలం ముందు ముందునా’ అన్న కవి ఆకాంక్ష నెరవేరే రోజు ముందుకు జరుగుతూనే ఉంది. అయినా మనిషి నిత్య ఆశాజీవి కదా! -
డోంట్ వర్రీ: రజనీకాంత్
ఇటీవల చెన్నై శివార్లలో ‘2.0’ షూటింగ్ జరుగుతున్న సమయంలో హీరో రజనీకాంత్ కాలికి గాయమైన సంగతి తెలిసిందే. వెంటనే దగ్గరలోని హాస్పటల్కి ఆయనను తీసుకువెళ్లారు. అయితే, గంటలోనే రజనీకాంత్ సెట్కి తిరిగొచ్చి షూటింగ్కి నేను రెడీ అన్నారట! ‘‘యూనిట్ సభ్యులంతా టెన్షన్ పడుతుంటే.. ‘డోంట్ వర్రీ’ అని ధైర్యం చెప్పారు. ఆయన ప్రొఫెషనలిజం, వ్యక్తిత్వం చూసి నేను ఆశ్చర్యపోయా’’ అని హీరోయిన్ ఎమీ జాక్సన్ అన్నారు. -
నిర్భయంగా నిర్ణయాలు తీసుకోండి
* నిష్పక్షపాతంగా వ్యవహరించండి * ప్రభుత్వ రంగ బ్యాంకర్లకు * ఆర్థిక శాఖ ఆదేశాలు న్యూఢిల్లీ: వ్యాపారపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో నిర్భయంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాలని ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ)ను కేంద్ర ఆర్థిక శాఖ ఆదేశించింది. అలాగే, ఇతరత్రా ఒత్తిళ్లను పట్టించుకోరాదని సూచించింది. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల (ఎఫ్ఐ) అధికారుల నియామకాలు, బదిలీల విషయంలో ప్రభుత్వ జోక్యం ఉండబోదని హామీ ఇచ్చింది. ఆర్థిక శాఖ సోమవారం ఈ మేరకు పీఎస్బీలు, ఎఫ్ఐలు, బీమా సంస్థల చీఫ్లకు ఆదేశాలు పంపింది. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు తమ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నిర్భయంగా నిర్ణయాలు తీసుకోవాలని అందులో పేర్కొంది. రుణం తీసుకునేవారి పలుకుబడికి, ఒత్తిడికి ప్రభావితం కారాదని స్పష్టం చేసింది. ఒకవేళ ఎవరైనా పక్షపాత ధోరణితో వ్యవహరించిన పక్షంలో దానికి పూర్తి బాధ్యత వారిదే అవుతుందని స్పష్టం చేసింది. బదిలీలు, నియామకాల విషయంలో కచ్చితంగా నిబంధనలు పాటించాలని, ఆఖరికి ఆర్థిక శాఖ నుంచి సిఫార్సులు వచ్చినా పరిగణించనక్కర్లేదని పేర్కొంది. ఒకవేళ ఏదైనా ప్రత్యేక సందర్భంలో మినహాయింపునిచ్చినా అందుకు గల కారణాలను సీఎండీ స్పష్టంగా పేర్కొనాల్సి ఉంటుందని ఆర్థిక శాఖ సూచించింది. పీఎస్బీల్లో ప్రభుత్వ జోక్యం ఉండబోదంటూ ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చిన నేపథ్యంలో ఆర్థిక శాఖ తాజా ఆదేశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పీఎస్బీల్లో ఇప్పుడే వాటాలు విక్రయించం.. పీఎస్బీల్లో ప్రభుత్వ వాటాలు విక్రయించాల్సిన అవసరమేమీ ప్రస్తుతం లేదని ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా స్పష్టం చేశారు. ఇప్పుడున్న వేల్యుయేషన్లను బట్టి చూసినా.. ఇది అభిలషణీయం కాదన్నారు. 27 పీఎస్బీల్లో ప్రభుత్వ వాటాను 52 శాతానికి తగ్గించుకోవాలని కేంద్ర క్యాబినెట్ ఇటీవల నిర్ణయించిన సంగతి తెలిసిందే. 2019 ఏప్రిల్ నాటికి బాసెల్ 3 ప్రమాణాలను అందుకునేందుకు కావాల్సిన నిధులను బ్యాంకులు సమకూర్చుకోవాల్సిన అవసరం ఉన్నందున వాటాల విక్రయ వార్తలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరోవైపు, పీఎస్బీల్లో నిరర్ధక ఆస్తుల సమస్య ఆమోదయోగ్యం కానంత అధిక స్థాయిలో ఉందని సిన్హా చెప్పారు. 2014 సెప్టెంబర్ ఆఖరు నాటికి పీఎస్బీల్లో స్థూల ఎన్పీఏలు రూ. 2.43 లక్షల కోట్ల స్థాయిలో ఉన్నాయి. ఇక, పీఎస్బీల కార్యకలాపాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోదల్చుకోలేదని, ఆయా బ్యాంకుల యాజమాన్యాలు క్రియాశీలకంగా, ప్రొఫెషనలిజంతో పనిచేయాలని సిన్హా సూచించారు.


