-
రాజ్యసభ సభ్యులను ఎలా ఎన్నుకుంటారు?
భారత పార్లమెంట్ లోని ఎగువ సభను రాజ్యసభ అంటారు. దీనినే పెద్దలసభ అని కూడా పిలుస్తారు. రాజ్యసభ సభ్యులను వివిధ రాష్ట్రాల శాసనసభల సభ్యులు ఎన్నుకుంటారు కాబట్టి దీన్ని రాష్ట్రాల సభ అని కూడా అంటారు. రాష్ట్రాల నుంచి , కేంద్రపాలిత ప్రాంతాల నుంచి , వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారిని రాష్ట్రపతి ఎంపిక చెయ్యడం ద్వారానూ, రాజ్యసభ సభ్యులు నియామకం అవుతారు.వీరి పదవీకాలం 6 సంవత్సరాలు ఉంటుంది.ప్రతి రెండేళ్లకొకసారి మూడో వంతు సభ్యుల పదవీకాలం ముగుస్తుంది. ఈ నేపథ్యంలో, ఎన్నికలు నిర్వహించి సభ్యులనుఎన్నుకుంటారు. ఇదీ, రాజ్యసభ సభ్యులను ఎంపికచేసుకొనే విధానం. లోక్సభ సర్వశక్తివంతమైనది.రాజ్యసభతో పోల్చుకుంటే,ఎక్కువ హక్కులు లోక్ సభ కలిగి ఉంటుంది.ప్రజల నుంచి నేరుగా ఎన్నిక ద్వారానే లోక్ సభ సభ్యుల ఎంపిక జరుగుతుంది. ప్రజాప్రతినిధులుగా వీరు,వివిధ పార్టీల నుంచి ఎంపికవుతారు. ఇలా ఈ రెండు సభల నిర్మాణం వెనుకప్రజాహితమే ప్రధాన ఉద్దేశ్యంగా రాజ్యాంగ నిర్మాతలు రూపకల్పన చేశారు.రాజ్యసభను సెకండ్ ఛాంబర్ అనికూడా అంటారు.అంటే,సెకండ్ చెక్ అన్నమాట. రాజ్యసభకు కూడా శాసనాధికారం ఉంటుంది. వివిధ శాసనాలను తీర్మానం చేసే క్రమంలో రాజకీయాలకు,పార్టీలకు అతీతంగా దేశభక్తితో నిర్ణయాలు జరగాలనే గొప్ప ఉద్దేశ్యంతో,సమాంతర వ్యవస్థగా రాజ్యసభను ఏర్పాటుచేశారు.విజ్ఞాన ఖనులు, మేధావులు,సాంస్కృతిక ప్రేమికులు, గొప్ప ప్రజానాయకులు , పరమ దేశభక్తులు,సత్ శీలురు ఈ పెద్దల సభలో సభ్యులుగా ఎంపికవుతారు. లోక్ సభసభ్యులు పార్టీ ప్రయోజనాలకు అనుగుణంగా బిల్లులు ఆమోదించినప్పటికీ,వీటికి అతీతంగా,వీరు ప్రజాహితం కోరుకుంటూ,అవసరమైతే వీటిని అడ్డుకుంటారు. కొన్ని బిల్లుల విషయంలో,లోక్ సభ సభ్యులు ప్రజలకు ప్రయోజనకారిగా ఉన్నాయని భావించినా, సుదూర భవిష్యత్తు అలోచించి, రాజ్యసభ సభ్యులు వాటిని ఆమోదించకుండా తిప్పికొట్టే పరిస్థితులు వస్తూ ఉంటాయి. పెద్దలసభ,అని పేరు పెట్టుకున్నందుకు,నిజంగా పెద్దమనుషులతో ఈ సభలు శోభాయమానంగా ఉండేవి. దురదృష్టవశాత్తు,విలువలు తగ్గుముఖం పడుతూ,అధికారమే పరమావధిగా సాగుతున్న రాజకీయ వ్యవస్థల మధ్య పెద్దలసభలో పెద్దమనుషులు తగ్గుతూ వస్తున్నారు. రాజకీయ పునరావాస కేంద్రంగా,స్వప్రయోజనాల లక్ష్యంగా, ఇచ్చిపుచ్చుకొనే ధోరణుల మధ్య పెద్దలసభకు కొందరి నియామకాలు జరుగుతూ ఉన్నాయనేది, జారిటీ మేధావులు అభిప్రాయం. ఉభయసభల్లో బిల్లులు ఆమోదం పొందాలంటే,రాజ్యసభలోనూ అధికార పార్టీకి మెజారిటీ ఉండాలి. ఈ విషయంలో,చాలావరకూ, ప్రతిపక్ష పార్టీలకే మెజారిటీ ఎక్కువగా ఉండే పరిస్థితులను అధికారంలో ఉన్న పార్టీలు ఎదుర్కొంటూ ఉన్నాయి. ఇటువంటి సందర్భాల్లో, రాజ్యసభలో మెజారిటీ కోసం,ప్రతిపక్ష సభ్యులకు ఎరవేసి, లాక్కొనే ప్రయత్నాలు అధికారంలో ఉన్న పార్టీలు చేస్తూ ఉంటాయి. రాజకీయక్షేత్రంలో,ఇది యుద్ధనీతిగా అభివర్ణించుకుంటున్నారు.ఈ అభ్యాసం కొన్నేళ్ల నుంచి పెరుగుతూ వస్తోంది. పెద్దలసభల్లోనూ బడా పారిశ్రామక వేత్తలు,వ్యాపారులు,స్వపక్షీయులు వచ్చి చేరుతున్నారు. ఈ క్రీడలో యుద్ధనీతి ఎలా ఉన్నా రాజనీతికి తూట్లు పడుతున్నాయి.లోక్ సభలో ఆమోదం పొందినప్పటికీ, రాజ్యసభలో ఆమోదం పొందక, సెలెక్ట్ కమిటీకి వెళ్లి,కాలయాపన జరిగి,ఏళ్ళు పూళ్ళు సాగి, త్రిశంకు స్వర్గంలో నిలిచిపోయిన బిల్లులు ఎన్నో ఉన్నాయి. ఉదాహరణకు: మహిళాబిల్లు.ఈ విధంగా అధికారపార్టీలను ఇరకాటంలో పెట్టి,నైతికంగా గెలిచామనే ఆనందంతో ప్రతిపక్ష పార్టీలు తాండవం చేస్తూ ఉంటాయి. ఈ క్రమంలో,ఎన్నో సంస్కరణలకు నోచుకోవాల్సినవి,మెజారిటీ ప్రజలకుఎన్నో ప్రయోజనాలు చేకూర్చేవి, చారిత్రకమైన బిల్లులు కూడా ఉంటాయి.ఇదొక రాజకీయ చదరంగం.రాష్ట్ర పాలనకు సంబంధించి,రాష్ట్రాలలో ఉండే, శాసనమండలిని కూడా ఎగువసభ అంటారు. ఇక్కడ,అధికార పార్టీకి మెజారిటీ లేక,ప్రతిపక్షాలు బిల్లుల ఆమోదం విషయంలో ఇబ్బంది పెడితే, అధికారంలో ఉన్న పార్టీకి శాసనమండలిని రద్దు చేసుకొనే అధికారం ఉంది. కానీ,రాజ్యసభను రద్దు చేసే అధికారం కేంద్రంలో లేదు. అలా రాజ్యాంగం నిర్మాణం చేశారు. తమకు మెజారిటీ వచ్చిన దాకా ఆగి తీరాల్సిందే. రాష్ట్రాలకు సంబంధించిన పెద్దల సభల్లోనూ ఒకప్పుడు మహనీయులు ఉండేవారు.రాజకీయ సంస్కృతి మారుతున్న నేపథ్యంలో,ఇక్కడా పెద్దమనుషులు కరువవుతున్నారు. ప్రస్తుతం,దేశంలోని ఎక్కువ రాష్ట్రాలలో శాసనమండలి వ్యవస్థలు రద్దయ్యే ఉన్నాయి. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకూ రాజ్యసభ ప్రస్థానాన్ని గమనిస్తే, నిత్యస్మరణీయులైన మహనీయులు సభ్యులుగా పనిచేశారు.శాసనాల రూపకల్పనలో అచంచలమైన దేశభక్తితో, నిస్వార్ధంగా వ్యవహరించారు. అటు ఎంపికచేసిన పార్టీకి,ఇటు రాజ్యసభకు ఎంతో గౌరవాన్ని తెచ్చిపెట్టారు.నిజంగా దేశ ప్రయోజనాల గురించి ఆలోచించేవారికి ఇది గొప్ప అవకాశం.నియోజకవర్గాల్లోకి వెళ్ళి రాజకీయాలు చేసుకోనక్కర్లేదు.ఓట్ల భయం లేదు.ఖాళీ సమయాల్లో,అద్భుతమైన గ్రంథాలయాల్లో ఉన్న అపార జ్ఞాన సంపదను అక్కున చేర్చుకొని,దేశ ప్రతిష్ఠ పెంచే,సకల జనుల శ్రేయస్సు ప్రసాదించే అద్భుతమైన సలహాలు,సూచనలు పాలకులకు ఇవ్వవచ్చు.ఒకప్పుడు అలాగే సాగేది.నిన్న మొన్నటి వరకూ కూడా,ఎందరో పెద్దలు ఈ పెద్దలసభలకు ఎంపికయ్యారు. వాజ్ పెయి,పి.వి.నరసింహారావు, మన్మోహన్ సింగ్,ప్రణబ్ ముఖర్జీ, భూపేష్ గుప్తా,అల్లాడి కృష్ణస్వామి అయ్యర్,ఎన్. జి. రంగా, నీలం సంజీవరెడ్డి,బెజవాడ గోపాల్ రెడ్డి,బూర్గుల రామకృష్ణరావు,వల్లూరి బసవరాజు, కాసు వెంగళరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి,నార్ల వెంకటేశ్వరరావు,దేవులపల్లి రామానుజరావు, పి. కె. కుమరన్ మొదలైన పెద్దలెందరో ఈ పెద్దల సభలో ఉండేవారు. రాష్ట్రపతి ఎంపిక చేసినవారిలోనూ ఎందరో పెద్దలు ఉండేవారు.రాజా రామన్న, జాకీర్ హుస్సేన్,అబు అబ్రహాం, శంకర్ కురూప్,ఆర్.కె.నారాయణ్, పండిట్ రవిశంకర్,పృథ్వి రాజ్ కపూర్,లతా మంగేష్కర్,కులదీప్ నయ్యర్. సి.నారాయణరెడ్డి మొదలైన వాళ్ళు పెద్దల సభకు ఎంతో గౌరవాన్ని, వైభవాన్ని తెచ్చిన గొప్పవాళ్ళు. టెండూల్కర్,జయభాదురీ,రేఖ, హేమామాలిని మొదలైన వాళ్ళు కూడా ఎంపికయ్యారు.కళాకారులు, కవులు,శాస్త్రవేత్తలు,క్రీడాకారులకు గౌరవపూర్వకంగా రాజ్యసభకు ఎంపిక చెయ్యడం ఒక ఆనవాయితీ, ఒక మర్యాద.ఇందులో కొందరు అలంకారప్రాయంగా పదవికి పరిమితమైనవారు,కనీస హాజరు కూడా లేనివారు ఉన్నారు. జయభాదురీ,డాక్టర్ సి.నారాయణరెడ్డి వంటివారు తమ పదవిని,సమయాన్ని సంపూర్ణంగా సద్వినియోగం చేసుకున్నారు.కొందరు పార్టీలకు, ప్రభుత్వంలో ఉన్న అధికార పార్టీలకు వివిధ రూపాల్లో ప్రయోజనాలు చేకూర్చి, తత్ఫలితంగా పదవులు దక్కించుకుంటున్నారనే విమర్శలు ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున వస్తున్నాయి.చట్ట సభల్లో హుందాగా ప్రవర్తించడం,సర్వ ప్రజాహితంగా నిర్ణయాలు తీసుకోవడం,పదవీకాలాన్ని సద్వినియోగం చెయ్యడం, ప్రజాధనాన్ని వృధా కాకుండా చూడడం ఈ సభ్యుల బాధ్యత. రాజ్యాంగం అమలు అనేది,అమలు చేసే పాలకులమీదనే ఆధారపడుతుందని అంబేద్కర్ ఏనాడో చెప్పారు.ఆచరణలో, పెద్దలసభ రాజకీయాలకు అతీతంగా, సర్వ స్వతంత్య్రమైన వ్యవస్థగా నిలబడాలి. ఉభయ సభలు ఆదర్శవంతంగా సాగాలన్నది,నేటి కాలంలో అత్యాశే అయినప్పటికీ, అలా సాగాలని అభిలషిద్దాం. - మాశర్మ, సీనియర్ జర్నలిస్టు -
Old Parliament: ఏకైక ప్రత్యక్ష సాక్షి అదొక్కటే!
పార్లమెంట్ పాతదైపోయింది. హాల్స్ నుంచి ప్రతీది.. ప్రజాప్రతినిధుల అవసరాలకు అనుగణంగా సరిపోవడం లేదు. పైగా సాంకేతిక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. భవిష్యత్ కోసం కొత్తది కావాల్సిందే.. నరంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రెండేళ్ల కిందట ఇలాంటి ప్రకటనే చేసింది. ఆ ప్రకటనకు కట్టుబడి.. భారీ వ్యయంతో పార్లమెంట్ నూతన భవనాన్ని నిర్మించింది కూడా. రేపు(ఆదివారం) పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం జరగనుంది. ఈ తరుణంలో ఆధునిక భారత దేశ చరిత్రలో కీలక ఘట్టాలకు ఏకైక ప్రత్యక్ష సాక్షిగా నిలిచిన పార్లమెంట్ ప్రస్థానాన్ని తిరగేద్దాం.. కౌన్సిల్ హౌజ్ నుంచి పార్లమెంట్ అనే గుర్తింపు దాకా.. బ్రిటిషర్ల కాలంలో చట్ట సభల ద్వారా మొదలై.. 76 ఏళ్ల ప్రజాసామ్య దేశానికి సంబంధించి మొదటి మీటింగ్ జరిగింది ఈ భవనంలోనే!. ఉభయ సభల్లోని సభ్యుల మధ్య వాదప్రతివాదనలు, చర్చలు, నేతల కీలక ప్రసంగాలు, ప్రభుత్వాల పని తీరుపై ఓటింగ్లు.. ఇలాంటి ఎన్నో ఘట్టాల ద్వారా అనుబంధాన్ని అల్లేసుకుంది. దాని చరిత్రను పరిశీలిస్తే.. 👉 1911లో కోల్కతా నుంచి రాజధానిని ఢిల్లీకి తరలించాలని నిర్ణయించింది అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం. అందుకోసం న్యూఢిల్లీని నిర్మించాలనుకుంది. రెండేళ్ల తర్వాత న్యూఢిల్లీ ప్రణాళికా దశకి చేరింది. ఆ సమయంలో తక్కువ సభ్యులున్న లెజిస్టేటివ్ కౌన్సిల్ కోసం గవర్నర్ జనరల్ నివాసం (ఇప్పుడున్న రాష్ట్రపతి భవన్) సరిపోతుంది కదా అని బ్రిటిష్ అధికారులు భావించారు. వేసవిలో సిమ్లాలోని వైస్రాయ్ లాడ్జ్లో, శీతాకాలంలో అప్పటి ఢిల్లీ సెక్రటేరియెట్ బిల్డింగ్లో (ఇప్పుడది ఢిల్లీ అసెంబ్లీగా ఉంది) భేటీ అయ్యేవాళ్లు. అయితే.. 👉 1918లో మాంటెగ్ ఛేమ్స్ఫర్డ్ సంస్కరణలు తెర మీదకు వచ్చాయి. దాని ప్రకారం.. చట్టసభల ప్రాధాన్యంతో పాటు... సభ్యుల సంఖ్యా పెరిగింది. ఎగువ, దిగువ సభలనేవి అమల్లోకి వచ్చాయి. వీటితో పాటు సిబ్బంది సంఖ్యా పెరిగింది. దీంతో బ్రిటిష్ ప్రభుత్వం రెండు ప్రతిపాదనలు చేసింది. ఒకటి.. టెంట్ల కింద సభను నిర్వహించటం. రెండవది.. శాశ్వత భవంతిని నిర్మించడం. అలా.. 1921లో పార్లమెంట్ భవనానికి తొలి అడుగు పడింది. అదే సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ (దిగువ సభ) తొలి భవంతి. 👉 న్యూ ఢిల్లీ నగర రూపశిల్పులు.. బ్రిటిష్ ఆర్కిటెక్టులు ఎడ్విన్ ల్యూటెన్, హెర్బర్ట్ బేకర్లు ఎగువ, దిగువ చట్టసభలకు శాశ్వత భవన నిర్మాణాలను ప్రతిపాదించారు. ల్యూటన్ గుండ్రంగా, బేకర్ త్రికోణాకారంలో ప్రణాళికలు తయారు చేశారు. చివరకు ల్యూటన్ దానికే బ్రిటిష్ సర్కారు మొగ్గు చూపింది. 👉 1921 ఫిబ్రవరి 12న.. డ్యూక్ ఆఫ్ కానాట్ ‘ప్రిన్స్ ఆర్థర్’ కొత్త పార్లమెంటు భవనానికి శంకుస్థాపన చేశారు. ఆరేళ్లలో నిర్మితమైన ఈ భవనాన్ని 1927 జనవరి 19న అప్పటి భారత వైస్రాయ్ లార్డ్ ఇర్విన్ ప్రారంభించారు. ఆరు ఎకరాల విస్తీర్ణంలో.. 27 అడుగుల ఎత్తైన పిల్లర్లు 144 ను ఉపయోగించి.. ఈ అందమైన భవంతి నిర్మించారు. ప్రకృతి వైపరిత్యాలను తట్టుకునేలా పక్కా ప్లాన్తో చాలా బలంగా ఈ నిర్మాణం జరిగింది. బహుశా అందుకేనేమో ఈ 96 ఏళ్ల కాలంలో.. పార్లమెంట్ భవనానికి జరిగిన రిపేర్ సందర్భాలు చాలా తక్కువగానే ఉన్నాయి. 👉 మధ్యలో సెంట్రల్ హాల్, దాని పక్కనే మూడు అర్ధవృత్తాకార ఛాంబర్లు... చుట్టూ ఉద్యానవనంతో ఆకట్టుకునేలా నిర్మించారు. సెంట్రల్ హాల్ చుట్టూ ఉండే ఒక ఛాంబర్లో సంస్థానాధీశుల సభ (ఛాంబర్ ఆఫ్ ప్రిన్సెస్), మరోదాంట్లో స్టేట్ కౌన్సిల్ (ఎగువ సభ, ప్రస్తుత రాజ్యసభ), మూడోదాంట్లో సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ (దిగువ సభ, ప్రస్తుత లోక్సభ) ఉండేవి. 👉 మధ్యప్రదేశ్లోని చౌసత్ యోగిని దేవాలయాకృతి స్ఫూర్తితో పార్లమెంట్ భవనం నిర్మించారనే ఒక ప్రచారం కూడా నడుస్తుంటుంది. అలా మన పార్లమెంటు భవనం ప్రారంభం కాగా.. ప్రపంచవ్యాప్తంగా కూడా అందరి దృష్టినీ ఆకర్షించింది. 👉 బ్రిటిషర్ల కాలంలో చట్టసభగా కొనసాగిన ఈ భవనం.. అధికార మార్పిడికి వేదికైంది. అంతేకాదు.. కొత్త ఏర్పాట్లు జరిగేదాకా మొదట్లో సుప్రీంకోర్టు కూడా ఛాంబర్ ఆఫ్ ప్రిన్సెస్ నుంచే కార్యకలాపాలు నిర్వహించింది. యూపీఎస్సీ కార్యాలయం కూడా పార్లమెంటు కాంప్లెక్స్లోనే ఉండేది. 👉 స్థలాభావాన్ని అధిగమించటం కోసం 1956లో పాత పార్లమెంటులో మరో రెండు అంతస్థులు నిర్మించారు. అయినా స్థలం సరిపోయేది కాదు. 👉 సెంట్రల్ హాల్లో మూడోదైన లెజిస్లేటివ్ అసెంబ్లీలోనే 1929లో విప్లవకారుడు భగత్సింగ్, ఆయన సహచరుడు బతుకేశ్వర్ దత్లు బాంబు విసిరారు. 👉 2001లో లష్కరే తోయిబా తీవ్రవాదుల దాడి జరిగింది పార్లమెంట్ భవనంపై. స్వతంత్ర భారతంలోని అత్యంత కీలక చట్టాలకు ఈ పార్లమెంట్ భవనమే ప్రత్యక్ష సాక్షి. ఎమర్జెన్సీలాంటి చీకట్లతో పాటు స్వాత్రంత్య దినోత్సవ వేడుకల వెలుగుల్ని వీక్షించింది ఈ భవంతి. మహ మహా మేధావుల నేతృత్వంలో ఆధునిక భారత ప్రస్థానానికి దారితీసిన సంస్కరణలకే కాదు.. వివాదాలకు, నేతల వ్యక్తిగత విమర్శలకూ ఈ ప్రజాస్వామ్య సౌధం వేదికగా మారింది. 👉 నూతన భవన నిర్మాణంలో సుమారు 60,000 మంది కార్మికులు పాల్గొన్నారు. రెండు సంవత్సరాల పాటు నిర్మాణ పనులు సాగాయి. సెంట్రల్ విస్టా వెబ్సైట్ ప్రకారం.. పాత పార్లమెంటు భవన నిర్మాణానికి అవసరమైన రాళ్లు, మార్బుల్స్ కోసమే రాళ్లు కొట్టేవాళ్లను, మేస్త్రీలను కలిపి 2,500 మందిదాకా అప్పట్లో నియమించారట. 👉 కార్యకలాపాలకు కొత్త పార్లమెంట్ భవనం ఉపయోగించినప్పటికీ.. పాత పార్లమెంట్ భవనాన్ని కూల్చబోమని కేంద్రం ఇప్పటికే తెలిపింది. దానికి మరమత్తులు చేసి ప్రత్యామ్నాయ వినియోగానికి అందుబాటులోకి తెస్తామని వెల్లడించింది. పాత పార్లమెంటు భవనాన్ని దేశ పురావస్తు సంపదగా పరిరక్షిస్తామని తెలిపారు. ఆ అవసరం ఉంది కూడా. 👉 మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న టైంలో.. పార్లమెంట్ మ్యూజియంను ఏర్పాటు చేశారు. 2500 ఏళ్ల నాటి భారతీయ విశిష్ట నాగరికత సంస్కృతులు ఇందులో అద్దంపట్టేలా ఏర్పాటు చేశారు. -
భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యం: సుస్థిరత నుంచి సుస్థిరతకు!
లోక్ సభకు 18వ ఎన్నికలు ఏడాది దూరంలో ఉండడంతో భారత పార్లమెంటు దిగువసభకు ఇప్పటి వరకూ జరిగిన ఎన్నికలను జనం గుర్తుచేసుకుంటున్నారు. 1952 నుంచి జరిగిన 17 ఎన్నికల్లో మొదటి మూడు సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీకి మూడింట రెండు వంతులకు పైగా మెజారిటీ వచ్చింది. భారత తొలి ప్రధాని పండిత జవహర్లాల్ నెహ్రూ పాలనలో జరిగిన ఈ ఎలెక్షన్లలో కాంగ్రెస్ ఆధిపత్యానికి ఎదురులేని పరిస్థితి నెలకొంది. 1964 మేలో నెహ్రూ జీ మరణానంతరం ముగ్గురు కాంగ్రెస్ ప్రధానులు (జీఎల్ నందా, లాల్ బహదూర్ శాస్త్రీ, ఇందిరాగాంధీ) మూడేళ్లు రాజ్యమేలారు. ఇందిరమ్మ పాలనలో 1967లో జరిగిన నాలుగో లోక్ సభ ఎన్నికల్లో భారత ఓటర్లు ఆశ్చర్యకర తీర్పు ఇచ్చారు. మొదటి మూడు ఎన్నికల్లో తిరుగులేని ఆధిక్యం పొందిన కాంగ్రెస్ ఈసారి సాధారణ మెజారిటీ సాధించింది. మొత్తం 523 సీట్లలో కనీస మెజారిటీకి అవసరమైన 262 సీట్లకు గాను కాంగ్రెస్ 283 స్థానాలు సంపాదింది. 1962 ఎన్నికలతో పోల్చితే కాంగ్రెస్ 78 సీట్లు కోల్పోయింది. ఎన్నికల తర్వాత ఇందిరాగాంధీ రెండోసారి ప్రధాని అయ్యారు. 1969 నవంబర్లో కాంగ్రెస్ చీలికతో ఆమె మైనారిటీ ప్రభుత్వాన్ని నడుపుతూ ఏడాది ముందే 1971లో మధ్యంతర ఎన్నికలు జరిపించారు. ఆమె హయాంలో మొదటిసారి కాంగ్రెస్ కు మూడింట రెండొంతుల మెజారిటీ (352 సీట్లు) లభించింది. ఇలా కాంగ్రెస్ పార్టీకి వరుసగా ఐదుసార్లు మెజారిటీకి అవసరమైన స్థానాలు లభించాయి. ఎమర్జెన్సీ కారణంగా ఐదో లోక్ సభ ఆరేళ్లు కొనసాగింది. ఆరో పార్లమెంటు ఎన్నికల్లో (1977) కాంగ్రెస్ తొలిసారి ఓడిపోయింది. నాలుగైదు పార్టీల విలీనంతో ఏర్పడిన జనతాపార్టీ సంపూర ్ణ మెజారిటీ (295) సాధించింది. జనతా చీలిక అనంతరం మొరార్జీ దేశాయి, చరణ్ సింగ్ ప్రభుత్వాలు కూలిపోవడంతో ఆరో లోక్ సభ మూడేళ్లలోపే రద్దయింది. 1980 జనవరిలో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో ఇందిరమ్మ నేతృత్వంలోని కాంగ్రెస్ మూడింట రెండొంతుల మెజారిటీతో (353 సీట్లు) అధికారంలోకి వచ్చింది. 1984 చివర్లో ఇందిర హత్యానంతరం ఆమె కుమారుడు రాజీవ్ గాంధీ హయాంలో 533 సీట్లకు జరిగిన 8వ లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 414 సీట్లతో ఐదింట నాలుగొంతుల మెజారిటీ సంపాదించి రికార్డు సృష్టించింది. 1989 నుంచి 2009 వరకూ జరిగిన 7 ఎన్నికల్లో హంగ్ పార్లమెంటు! 1989లో జరిగిన 9వ లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయింది. అయితే, ఏ పార్టీకి మెజారిటీ రాకపోవడంతో హంగ్ లోక్ సభతోనే రెండు మైనారిటీ ప్రభుత్వాలు (వీపీ సింగ్, చంద్రశేఖర్ ప్రధానులుగా) నడిచాయి. ఏడాదిన్నర లోపే సభ రద్దవడంతో 1991 మేలో జరిగిన పదో లోక్ సభ ఎన్నికల్లో కూడా ఏ పార్టీకీ సాధారణ మెజారిటీ రాలేదు. పీవీ నరసింహారావు గారి నాయకత్వంలోని కాంగ్రెస్ మెజారిటీ సాధించలేకపోయినా 244 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. బయట నుంచి కొన్ని మిత్రపక్షాల మద్దతుతో పీవీ ప్రధాని పదవి చేపట్టి ఐదేళ్లు అధికారంలో ఉన్నారు. ఆ తర్వాత పూర్తి పదవీకాలం కొనసాగలేకపోయిన 11, 12, 13వ లోక్ సభలు (1996, 98, 99లో) ఏ పార్టీకి మెజారిటీ లేని త్రిశంకు సభలు. 1999లో ఏర్పాటైన 13వ లోక్ సభ ఐదేళ్లు పూర్తికావడానికి 8 నెలల ముందు రద్దయింది. వరుసగా 2004, 2009లో జరిగిన ఎన్నికల్లో ఏర్పడిన 14, 15వ లోక్ సభలు కూడా ఏ పార్టీకి మెజారిటీలేని త్రిశంకు సభలేకాని కేంద్ర ప్రభుత్వాలు పూర్తి పదవీకాలం నడిచాయి. 1984 తర్వాత అంటే 30 ఏళ్లకు 2014లో 16వ లోక్ సభకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ తొలిసారి మెజారిటీ సీట్లు (282) సాధించింది. మళ్లీ ఐదేళ్లకు 2019లో జరిగిన 17వ లోక్ సభ ఎన్నికల్లో కూడా పాలకపక్షం 303 సీట్లతో బలం పెంచుకుంది. పైన వివరించినట్టు 1989 నుంచి 2014 వరకూ లోక్ సభ ఎన్నికల్లో ఏ పార్టీకీ మెజారిటీ రాలేదు. వరుసగా ఏడు త్రిశంకు సభల తర్వాత గత రెండు పార్లమెంటు ఎన్నికల్లో పాలకపక్షానికి సాధారణ మెజారిటీ వచ్చింది. 2024 ఎన్నికల్లో కూడా రాజకీయ సుస్థిరతకు దారితీసే ఫలితాలు ఉంటాయని ఎన్నికల విశ్లేషకులు అంచనావేస్తున్నారు -విజయసాయిరెడ్డి, రాజ్యసభ సభ్యులు, వైఎస్సార్ సీపీ -
భారత్ పార్లమెంట్లో మైకుల మూగనోము
లండన్: భారత పార్లమెంట్ దిగువ సభ అయిన లోక్సభలో మైక్రోఫోన్లు ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా తరచుగా మూగబోతుంటాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ అన్నారు. బ్రిటన్లో భారత సంతతికి చెందిన ప్రతిపక్ష లేబర్ పార్టీ ఎంపీ వీరేంద్ర శర్మ సోమవారం లండన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బ్రిటిష్ ఎంపీలను ఉద్దేశించి రాహుల్ మాట్లాడారు. తాను నిర్వహించిన భారత్ జోడో యాత్ర గురించి ప్రస్తావించారు. ప్రజలను కూడగట్టడానికి ఇదొక రాజకీయ కార్యాచరణగా ఉపయోగపడిందని అన్నారు. భారత లోక్సభలో మైకులు పని చేస్తుంటాయి గానీ తరచుగా మొరాయిస్తుంటాయని వ్యా ఖ్యానించారు. మాట్లాడేటప్పుడు మధ్యలోనే ఆగిపోతుంటాయని, తనకు చాలాసార్లు ఇలాంటి అనుభవం ఎదురైందని స్పష్టం చేశారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ గురించి పార్లమెంట్లో మాట్లాడేందుకు ప్రతిపక్షాలకు ప్రభుత్వం అవకాశం ఇవ్వలేదని ఆరోపించారు. చైనా సైన్యంలో భారత భూభాగంలోకి అక్రమంగా ప్రవేశించిందని, దానిపైనా ప్రశ్నించే అవకాశం ఇవ్వలేదన్నారు. పార్లమెంట్లో గతంలో జరిగిన అర్థవంతమైన చర్చలు, సంవాదాలు ఇప్పుడు లేకుండాపోయాయని ఆక్షేపించారు. -
పార్లమెంట్లో ప్రసంగించనున్న అనంత విద్యార్థి
అనంతపురం కల్చరల్: యువతలో దేశభక్తి, నైతికతను పెంపొందించే దిశగా పార్లమెంటు ఆఫ్ ఇండియా, నెహ్రూ యువకేంద్ర సంయుక్తంగా ఏటా నిర్వహించే వేడుకలకు దేశవ్యాప్తంగా 25 మంది యువతీ యువకులను ఎంపిక చేశారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ తరఫున ఈనెల 14న పార్లమెంటు ప్రాంగణంలో ప్రసంగించే అరుదైన అవకాశం జిల్లాకు చెందిన మెగాజోష్కి దక్కింది. ఈ మేరకు నెహ్రూ యువకేంద్ర జిల్లా సమన్వయకర్త సందీప్కుమార్, డీడీవో శ్రీనివాసులు తెలిపారు. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఏపీలో చదువుకుంటున్న ఆమె గతంలో అనేక వక్తృత్వ పోటీల్లో పాల్గొని జిల్లా ఖ్యాతిని ఇనుమడింపజేశారన్నారు. (చదవండి: జేసీ మనుషులమంటూ దౌర్జన్యం)
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్
తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో
ఓటీటీలో రాధిక నిర్మించిన వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
33 ఏళ్ల వయస్సులో అంతర్జాతీయ అరంగేట్రం.. ఎవరీ ఆశా శోభన?
అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
వడదెబ్బ నుంచి రక్షించే మహాభారత కాలం నాటి మజ్జిగ పానీయాలు ఇవే..!
Medigadda Barrage: గత సర్కారే కారణం!
మనసున్న ముఖ్యమంత్రి జగన్
ప్రచార వాహనాల అడ్డగింత
ఈవీఎంల కమిషనింగ్ కీలకం
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement