ఛత్తీస్గఢ్లో తుది దశ పోలింగ్ ప్రారంభం
ఛత్తీస్గఢ్ : పాంచ్పటాకాలో నాలుగోదైన ఛత్తీస్గడ్ చివరి పోరుకు సిద్దమైంది. 72 స్థానాలకు మంగళవారం ఉదయం పోలింగ్ ప్రారంభం అయ్యింది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. 843 అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు నిర్దేశించనున్నారు. సాయంత్రం అయిదు గంటల వరకూ పోలింగ్ జరగనుంది.
ఇందులో 4,594 బూత్లు సమస్యాత్మకమైనవిగా, 1,398 బూత్లు అత్యంత సమస్యాత్మకమైనవిగా అధికారులు గుర్తించారు. అయితే ఎన్నికలు బహిష్కరించాలంటూ నక్సల్ ఇచ్చిన పిలుపు మావోల ప్రాబల్య ప్రాంతంలోనే పెద్దగా పనిచేయకపోవడంతో ఈ స్థానాల్లో కూడా నక్సలైట్ల ప్రభావం పెద్దగా ఉండబోదని అంచనా వేస్తున్నారు. తుది విడతలో కూడా భారీగా పోలింగ్ జరిగే అవకాశముందని భావిస్తున్నారు.
ఇక అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ హోరాహోరీగా ప్రచారం నిర్వహించాయి. ఈ ఏడాది మేలో జరిగిన నక్సల్ దాడిలో దాదాపు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రస్థాయి నాయకత్వం అంతా తుడిచిపెట్టుకుపోయిన నేపథ్యంలో.. సానుభూతి ఓట్ల పైనే కాంగ్రెస్ పార్టీ ఆశలు పెట్టుకుంది. వివిధ స్థానాల్లో.. చనిపోయిన నేతల కుటుంబ సభ్యులు, బంధువులనే బరిలో నిలిపింది. మరోవైపు అంతర్గత విభేదాలు ఆ పార్టీని దెబ్బతీస్తున్నాయి.
అజిత్ జోగి సైతం స్వయంగా ఈ విషయాన్ని ఒప్పుకుంటున్నారు. మరోవైపు బీజేపీ ప్రచారం సీఎం రమణ్సింగ్ కేంద్రంగా సాగుతోంది. విద్య, ఉపాధి, విద్యుత్ లాంటి మౌలిక సదుపాయాల కల్పనలో బీజేపీ ప్రభుత్వం ముందంజలో ఉంది. ఛత్తీస్గఢ్లో దాదాపు 5 లక్షల మంది తెలుగువారున్నారు. వారిలో అధిక శాతం బీజేపీకే మొగ్గు చూపుతున్నారని అక్కడి తెలుగు సంక్షేమ సంఘం ప్రతినిధులు చెబుతున్నారు. మిగిలిన పార్టీల్లో బీఎస్పీ 72 స్థానాల్లోనూ, ఎన్సీపీ 12, సీపీఎం, సీపీఐలు చెరో 4 సీట్లలో బరిలో ఉన్నాయి. ఛత్తీస్గడ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 8న వెలువడనున్నాయి.