మలేషియాలో ఫేస్ బుక్ ఆఫీస్
కౌలాలంపూర్ : మలేషియా రాజధాని కౌలాలంపూర్ లో సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ స్థానిక ఆఫీసును తెరిచింది. మలేషియన్ల మరిన్ని సేవలందిస్తూ, అర్థవంతమైన రీతిలో బిజినెస్ లకు కనెక్టు అవ్వడానికి ఈ స్థానిక ఆఫీసును ప్రారంభించామని ఫేస్ బుక్ దక్షిణ-తూర్పు ఆసియా మేనేజింగ్ డైరెక్టర్ కెనేథ్ బిషాప్ తెలిపారు. మలేషియాలో ఆఫీసును తెరవడం ఫేస్ బుక్ కు ఒక మైలురాయిని సూచిస్తుందని చెప్పారు. నేటి తరంలో మొబైల్ ప్రాధాన్యత పెరిగిందని, ఈ నేపథ్యంలో వ్యాపారాలను మొబైల్ కస్టమర్లకు కనెక్టు చేస్తూ సేవలందించడంలో ఇది అపూర్వమైన అవకాశమని పేర్కొన్నారు. స్థానిక టీమ్ దీనిపై ఎక్కువగా శ్రద్ధ వహిస్తుందని చెప్పారు. నికోల్ టాన్ అధ్యక్షతన ఈ స్థానిక ఆఫీసును ఫేస్ బుక్ ప్రారంభించింది. నికోల్ టాన్ అంతకు ముందు మలేషియా అడ్వర్టైజింగ్ కంపెనీ జె. వాల్టర్ థామ్ సన్ కు మేనేజింగ్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వర్తించేవారు.
94 శాతం మంది మలేషిన్లు ప్రొడక్ట్ లను, బ్రాండ్లను ఫేస్ బుక్ పేజీ ద్వారానే తెలుసుకుంటున్నారని, వాటిలో 62 శాతం వరకూ కొనుగోలు చేస్తున్నట్లు ఇటీవలే టీఎన్ఎస్ రీసెర్చ్ సంస్థ సర్వేలో వెల్లడైంది. ప్రస్తుతం 180 లక్షల మలేషియన్లు సోషల్ మీడియా ప్లాట్ ఫాంపై సమయాన్ని వెచ్చిస్తున్నారని, వారిలో 65 లక్షల ప్రజలు ఇన్ స్టాగ్రాంపై గడుపుతున్నారని ఫేస్ బుక్ తెలిపింది. దక్షిణ-తూర్పు ఆసియాలో ఎక్కువగా మలేషియన్లే ఫేస్ బుక్ పేజీపై యాక్టివ్ లో ఉంటున్నారని, స్మార్ట్ ఫోన్లలో వీడియోలను చూడటానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపింది. దక్షిణ-తూర్పు ఆసియాలో మొబైల్ లు అధికంగా వాడే దేశంగా మలేషియాకు 144శాతం రేటును కలిగి ఉందని పేస్ బుక్ తెలిపింది.