-
ఇది ఆరంభం మాత్రమే
సాక్షి, విశాఖపట్నం: మూడు రాజధానుల ఉద్యమం అంతం కాదని.. ఆరంభం మాత్రమే అని ఉత్తరాంధ్ర జేఏసీ చైర్మన్ లజపతిరాయ్ అన్నారు. విశాఖ గర్జన విజయవంతం చేసిన ఉత్తరాంధ్ర జిల్లాల ఉద్యమకారులందరికీ ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తు కార్యాచరణపై జేఏసీ కమిటీతో చర్చిస్తామన్నారు. ఆదివారం ఆయన ఓ ప్రైవేట్ హోటల్లో ఉత్తరాంధ్ర నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘విశాఖ గర్జన’ విజయోత్సవ సభలో మాట్లాడారు. ‘అమరావతి ప్రజలంటే మాకు కోపం లేదు.. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు బావుండాలని ఉత్తరాంధ్ర ప్రజలు కోరుకుంటున్నారు. గతంలో మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పుడు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నప్పుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు.. ఏనాడూ మాకు రాజధాని కావాలని డిమాండ్ చేయలేదు. అన్నింటికీ తల ఊపుతూనే వచ్చాం. ఇకపై కూడా అన్యాయం జరుగుతుంటే అలానే తల ఊపుతూ కూర్చోలేం. మా మంచితనాన్ని అమాయకత్వమనుకుంటే పొరపాటే’ అని హెచ్చరించారు. వికేంద్రీకరణను అందరూ స్వాగతించాలి రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో అత్యంత వెనకబడిన ప్రాంతం ఉత్తరాంధ్ర అని, విశాఖను పరిపాలన రాజధాని చేసి పేదరికంలో ఉన్న తమ బతుకులు మారుస్తామంటే అభినందించాల్సింది పోయి అడ్డుకోవడం దారుణం అని టీడీపీ, జనసేన వైఖరిపై అజపతిరాయ్ మండిపడ్డారు. అమరావతి–అరసవల్లి యాత్ర ద్వారా మా ప్రాంతంలో మా దేవుని దగ్గరకి వచ్చి మా ప్రాంతంలో రాజధాని వద్దని మా నోట్లో మట్టి కొడతామంటే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ, జేఏసీ సభ్యులు, ఉత్తరాంధ్ర జేఏసీ సభ్యులు ప్రొఫెసర్ విజయకుమార్, కొల్లూరి సూర్యనారాయణ, పాల్, బాల మోహన్దాస్, షరన్ రాజ్, ఎస్ఎస్ శివశంకర్, డాక్టర్ పి.రామారావు, పైలా కృష్ణమోహన్, దువ్వాడ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
వికేంద్రీకరణకు మద్దతుగా 'గర్జించిన విశాఖ'
ఒకవైపు సముద్రం హోరు.. ఇంకో వైపు వర్షం జోరు.. మరో వైపు ఈ రెండింటితో పోటీపడుతూ జన గర్జన పోరు.. వికేంద్రీకరణ కోసం ఉద్యమ కెరటం ఉప్పెనలా ఉవ్వెత్తున ఎగిసింది. పరిపాలన రాజధానికి ‘విశాఖ గర్జన’ జైకొట్టింది. వరుణ దేవుడి సాక్షిగా అశేష జనవాహిని గర్జనతో విశాఖ దిక్కులు పిక్కటిల్లాయి. థింసా నృత్యం, చెక్కభజన, కొమ్ము నృత్యం, కోలాటం, తప్పెటగుళ్లు వంటి ఉత్తరాంధ్ర ప్రత్యేక సాంస్కృతిక ప్రదర్శనల నడుమ ఆద్యంతం వికేంద్రీకరణ నినాదాలు హోరెత్తాయి. పాలన రాజధానిగా విశాఖను వ్యతిరేకిస్తే ఖబడ్దార్.. అంటూ ఉత్తరాంధ్ర జనం నిప్పులు చెరిగారు. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం/ సాక్షి, విశాఖపట్నం/ డాబాగార్డెన్స్ (విశాఖ దక్షిణ): వికేంద్రీకరణకు మద్దతుగా చేపట్టిన విశాఖ గర్జన అంచనాలకు మించి విజయవంతమైంది. విశాఖపట్నానికి పరిపాలన రాజధానిగా చేయాలన్న నినాదం మిన్నంటింది. నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన విశాఖ గర్జన పాదయాత్ర, సభ ఆద్యంతం భారీ వర్షంలోనే కొనసాగింది. ఒకే రాజధాని వద్దు.. మూడు రాజధానులు ముద్దు.. అనే నినాదాలతో పాదయాత్ర హోరెత్తింది. ఉదయం 9 గంటలకే ఎల్ఐసీ బిల్డింగ్ వద్ద గర్జన హడావుడి ప్రారంభం కాగా.. మొదట డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి జేఏసీ చైర్మన్ లజపతిరాయ్తో పాటు పలువురు మంత్రులు నివాళులు అర్పించిన అనంతరం పాదయాత్ర ప్రారంభమైంది. ఎల్ఐసీ బిల్డింగ్ నుంచి 10.30 గంటలకు ప్రారంభమైన పాదయాత్ర సెవన్హిల్స్ హాస్పిటల్ మీదుగా సర్క్యూట్ హౌస్, సిరిపురం జంక్షన్, పెదవాల్తేరు ఆంధ్రా యూనివర్సిటీ గేటు నుంచి బీచ్ రోడ్డులోని పార్కు హోటల్ వద్ద ఉన్న వైఎస్సార్ విగ్రహం వరకు 3.7 కిలోమీటర్ల మేర పాదయాత్ర మొత్తం వర్షంలోనే సాగింది. ఇసుకవేస్తే రాలనంతగా జన సందోహం మధ్య పాదయాత్ర గంటకుపైగా సాగింది. అక్కడ దివంగత నేత వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం గర్జన సభ మొదలైంది. రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షంలోనూ ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి జనం భారీగా హాజరయ్యారు. వికేంద్రీకరణలో భాగంగా విశాఖకు జై కొట్టారు. భారీగా కురుస్తున్న వర్షం తమను ఆశీర్వదిస్తున్నట్టుగా ఉందని ఆనందపడ్డారు. ఉత్తరాంధ్ర జోలికొస్తే ఉప్పు పాతరేస్తామని హెచ్చరించారు. ఈ గర్జనతోనైనా చంద్రబాబు, పవన్లకు కనువిప్పు కలగాలని ఆకాంక్షించారు. ఇప్పటికే రాష్ట్రాన్ని మూడుసార్లు విభజించారని.. మళ్లీ అమరావతి మాత్రమే రాజధాని అంటే భవిష్యత్లోనూ ఇబ్బందులు తప్పవని జేఏసీ నేతలు అభిప్రాయపడ్డారు. తమ పోరాటానికి అన్ని రాజకీయ పక్షాలు కలిసి రావాలని జేఏసీ పిలుపునిచ్చింది. ఏ కార్యక్రమం నిర్వహించినా తాము మద్దతు ఇస్తామని వైఎస్సార్సీపీ ప్రకటించింది. మొత్తంగా సముద్రపు కెరటాల్లా ఎగసిపడ్డ జన సమూహం.. విశాఖకు జై కొట్టింది. విశాఖ గర్జనకు భారీ ర్యాలీగా తరలివస్తున్న జన సందోహం.. భారీగా పాల్గొన్న యువత ప్రధానంగా ఇన్ని రోజులుగా ఉత్తరాంధ్ర వెనుకబాటులో ఎక్కువగా నష్టపోయింది యువతే. ఈ నేపథ్యంలో పాలన వికేంద్రీకరణ ద్వారా పరిపాలన రాజధానిగా విశాఖ అవతరిస్తే ఇటు విద్యా రంగంతో పాటు ఉపాధి రంగంలోనూ కొత్త అవకాశాలు వస్తాయన్న ఆశ వారి మాటల్లో ధ్వనించింది. తద్వారా ఉద్యోగాల కోసం పొట్ట చేత పట్టుకుని ఎక్కడికో పోవాల్సిన అవసరం ఉండదన్న అభిప్రాయం వారిలో వ్యక్తమైంది. ర్యాలీలో వర్షం జోరులో చిందేస్తూ.. జై విశాఖ అని నినదిస్తూ యువతీ, యువకులు పోటీపడుతూ నినాదాలతో హోరెత్తించారు. పాలిటెక్నిక్ కాలేజీతో పాటు డిగ్రీ, పీజీ విద్యార్థులు విశాఖ గర్జనలో భారీగా పాల్గొన్నారు. విశాఖ పరిపాలన రాజధాని అయితే తమ బతుకులు మారతాయని.. ఉద్యోగాలకు వలస వెళ్లాల్సిన బాధలు తప్పుతాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు. యువకులతో పోటీ పడి మరీ యువతులు చిందేస్తూ నినాదాలతో పాదయాత్ర కొనసాగించడం విశేషం. తీన్మార్ డప్పులు.. కోబ్రా డ్యాన్స్లు.. సాగరతీరాన ఉత్తరాంధ్ర ఆవేదన కడలి ఘోషలా మారింది. విశాఖ పరిపాలన రాజధాని వద్దంటూ..తమ ప్రాంతంపైకి దండయాత్రగా వస్తున్న వారికి వ్యతిరేకంగా, ఉత్తరాంధ్ర ప్రజానీకం.. కళాకారులు కడలి తరంగంలా ఎగసిపడ్డారు. విశాఖకు పరిపాలన రాజధాని వద్దంటే..పరిణామాలు మునుపటిలా ఉండవని సత్తా చూపారు. ‘గురజాడ, శ్రీశ్రీ, వంగపండు ప్రసాదరావు, రావి శాస్త్రి వంటి గొప్ప వారిని కన్న నేల ఉత్తరాంధ్ర. అలాంటి మా ప్రాంతానికి రాజధాని వద్దా? ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధి మీకు పట్టదా? అమరావతి రాజధాని పేరిట మాపై దండ యాత్రకు వస్తారా? మాకు కడుపు మండదా? అంటూ నిప్పులు చెరిగారు. ఉత్తరాంధ్ర కళాకారులు పాటలు, నృత్యాలు, జానపద గేయాలు, గిరిజన నృత్యాలు, బిందెలు తలపై ఉంచుకుని డ్యాన్స్లతో ప్రదర్శననిస్తూ.. అందరూ బాగుండాలి.. అందులో మేముండాలంటూ నినదించారు. ‘మన విశాఖ.. మన రాజధాని’ పేరిట నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు వెల్లివిరిశాయి. విశాఖ గర్జనకు హాజరైన అశేష జన సందోహంలోని ఓ భాగం తప్పెటగుళ్లతో ఉత్తరాంధ్ర వెనుకబాటును వివరిస్తూ కళాకారుల ప్రదర్శన పలువురి మన్ననలు పొందింది. పులి వేషధారణతో కళాకారులు ఇచ్చిన ప్రదర్శన ఆకట్టుకుంది. పొడుగాటి మనుషులమంటూ కాళ్లకు కర్రలు కట్టుకుని..నెత్తిన బిందెలు పెట్టుకుని వేసిన బిందెల డ్యాన్స్లు మురిపించాయి. పాముల వేషాలతో రెల్లి కులస్థులు వేసిన కోబ్రా డ్యాన్స్కు యువత సై కొట్టింది. కళాకారులతో పాటు యువత కూడా ఆ నృత్యంలో భాగస్వాములై పలువుర్ని ఆశ్చర్యానికి గురి చేశారు. తీన్మార్ డప్పులు.. కాంగో డప్పులతో విద్యార్థులు కేరింతలు కొట్టారు. కళాకారులు వాయించిన డప్పులకు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా నృత్యాలు చేస్తూ విశాఖ గర్జనలో పలువురు పాలుపంచుకున్నారు. గిరిజనుల కోయ డ్యాన్సులు.. ఖాళీమాతా డ్యాన్సులు.. అష్టలక్ష్మి నృత్యాలు గర్జనకు తోడయ్యాయి. ఎటు చూసినా జన ప్రభంజనమే విశాఖలో శనివారం ఎటు చూసినా జన ప్రభంజనమే కనిపించింది. దీనికి భారీ వర్షం తోడు కావడంతో వీధులు, రోడ్లు ‘జన’ ‘సంద్రం’గా మారాయి. గత కొన్ని దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో ఏ ఉద్యమానికి రానంతగా విశాఖ గర్జనకు జనం పోటెత్తి సరికొత్త చరిత్ర సృష్టించారు. అంబేడ్కర్ సర్కిల్లో గంటన్నరకు పైగా జనం వర్షంలో నిల్చుని మన విశాఖ.. మన రాజధాని అంటూ నినదించారు. సర్వమత ప్రార్థనల అనంతరం జోరు వానలో తడిసి ముద్దవుతూ కొందరు.. గొడుగులు చేతబట్టి మరికొందరు అడుగులు ముందుకేశారు. ‘విశాఖే పరిపాలన రాజధాని’ అన్న నినాదాలతో ఉన్న జెండాలు ర్యాలీ పొడవునా రెపరెపలాడాయి. విశాఖ నగరంలో 9 సెంటీమీటర్ల భారీ వర్షం కురవడం గమనార్హం. అడుగడుగునా అదే ఆకాంక్ష విశాఖ గర్జనలో ఆసాంతం వికేంద్రీకరణ ఆకాంక్ష స్పష్టంగా కనిపించింది. ఓ వైపు భారీ వర్షం కురుస్తున్నప్పటికీ ఉత్తరాంధ్ర నలుమూలల నుంచీ జనం ఉదయమే బయలుదేరారు. పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు దాటుకుని.. నిలువెల్లా తడుస్తూ తమ ఆకాంక్షను బలంగా చాటారు. ఉదయం 9 గంటలకే ఎల్ఐసీ బిల్డింగ్ జంక్షన్ వద్ద కోలాహలం మొదలైంది. ఉత్తరాంధ్ర ప్రత్యేక సాంస్కృతిక ప్రదర్శనలతో విశాఖ గర్జన ప్రారంభమైంది. ర్యాలీ ప్రారంభమైన తర్వాత వర్షం జోరు మరింత పెరిగింది. అయినప్పటికీ వర్షంలో తడుస్తూనే పాదయాత్ర కొనసాగించారు. కొద్ది మంది గొడుగులు పట్టుకుని పాదయాత్రకు రాగా.. ప్రధానంగా యువత మాత్రం వర్షంలో నినాదాలు చేస్తూ ముందుకు అడుగులు వేశారు. విద్యార్థులు, న్యాయవాదులు, విద్యుత్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, రైతులు, కార్మికులు... ఇలా అన్ని వర్గాల వారు విశాఖ గర్జనలో తమ నినాదాన్ని వినిపించారు. ఎక్కడికక్కడ పాదయాత్రకు స్థానిక విశాఖ జనం సాదరంగా ఆహ్వానం పలికారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
'విశాఖ రాజధాని'ని.. ఈసారి చేజార్చుకోం
సాక్షి, విశాఖపట్నం: అభివృద్ధిలో ఉత్తరాంధ్ర బాగా వెనుకబడిపోయింది.. 1956లో రాజధాని అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది. ఇప్పుడు మళ్లీ ఆ పరిస్థితి తలెత్తకూడదనే అందరం ఏకతాటిపైకి వచ్చామని ఉత్తరాంధ్ర నాన్ పొలిటికల్ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ హనుమంతు లజపతిరాయ్ వివరించారు. కుటిల బుద్ధితో చేస్తున్న పాదయాత్రని ఎలా స్వాగతించగలమని ఆయన ప్రశ్నించారు. ఈ నెల 15న జరిగే విశాఖ గర్జనతో రాజధాని పోరు మొదలవుతుందనీ.. భవిష్యత్తులో నాన్ పొలిటికల్ జేఏసీ అన్ని సమస్యలపైనా పోరాటం కొనసాగిస్తుందని ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రొఫెసర్ లజపతిరాయ్ పునరుద్ఘాటించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. అప్పటి నుంచి ఉత్తరాంధ్ర ఎదురుచూస్తోంది 1953లో ఆంధ్రరాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏ ప్రాంతాన్ని రాజధాని చెయ్యాలనే అంశంపై ఓటింగ్ జరిగింది. ఇందులో 61 మంది ఎమ్మెల్యేలు విశాఖపట్నం అని.. 58 మంది కర్నూలు అని ఓటువేశారు. 20 మంది ఎమ్మెల్యేలు తటస్థంగా ఉన్నారు. అప్పటికే కర్నూలుని రాజధానిగా చెయ్యాలని నిర్ణయించుకున్న నాటి ప్రభుత్వం.. 1956 ఏప్రిల్ 1 నుంచి విశాఖపట్నంని రాజధానిగా చేస్తామంటూ అసెంబ్లీ తీర్మానించింది. కానీ, ఇది అమల్లోకి రాకపోయినా.. అప్పటి నేతలు పోరాడలేకపోయారు. అప్పటినుంచి అభివృద్ధి కోసం ఉత్తరాంధ్ర ఎదురుచూస్తూనే ఉంది. ఇప్పటికి సీఎం వైఎస్ జగన్ మరో అవకాశాన్ని కల్పించారు. దీన్ని వదులుకునే ప్రసక్తేలేదు. ఇప్పటికే రెండు తప్పులు చేశాం. మళ్లీ అమరావతిని మాత్రమే అభివృద్ధిచేస్తే.. చారిత్రక తప్పిదం అవుతుంది. ఇప్పుడైనా అభివృద్ధి వికేంద్రీకరణ దిశగా అడుగులువేయకపోతే.. భవిష్యత్తులో మరోసారి విభజన ఉద్యమం తలెత్తక తప్పదు. కుటిల బుద్ధితో వస్తే ఎందుకు స్వాగతించాలి? కొందరు కేవలం అమరావతి మాత్రమే రాజధానిగా ఎదగాలని.. మిగిలిన ప్రాంతాల్లో అభివృద్ధి జరగకూడదనే కుటిలబుద్ధితో పాదయాత్రలు చేస్తున్నారు. ఈ ప్రాంతం అభివృద్ధి చెందకూడదనే దుర్మార్గపు ఆలోచనలతో వస్తే ఎందుకు స్వాగతించాలి. ఇక రాజధాని కోసం చేస్తున్న పోరాటాన్ని ఉధృతం చేసేందుకు నాన్పొలిటికల్ జేఏసీ ఏర్పాటైంది. విశాఖలో రాజధాని ఏర్పాటయ్యేంత వరకూ పోరాటంచేస్తాం. 15న విశాఖ గర్జన ద్వారా ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షని చాటిచెబుతున్నాం. ఆ తర్వాత ప్రతి గ్రామంలోనూ విద్యార్థి నుంచి పింఛన్ తీసుకునే వృద్ధుల వరకూ.. వికేంద్రీకరణ తదనంతరం జరిగే అభివృద్ధిపై అవగాహన కల్పిస్తాం. దూర ప్రస్తావన అప్రస్తుతం? విశాఖ రాజధాని అయితే.. భౌగోళికంగా మిగతా ప్రాంతాలకు దూరంగా ఉంటుందనే వాదనలు వినిపిస్తున్నారు. కానీ, ఈ వాదనలో బలంలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో రాష్ట్ర సచివాలయంలో పనికోసం వచ్చే వారి శాతం 0.01 కూడా వుండదు. గ్రామ సచివాలయ వ్యవస్థ వచ్చాక.. ప్రజలకు పరిపాలన మరింత చేరువైంది. అందుకే దూర ప్రస్తావన అప్రస్తుతమనే చెప్పాలి. ఇక గత కొన్ని దశాబ్దాలుగా అనేక రాష్ట్రాల్లో రాజధానులున్న ప్రాంతాల చుట్టుపక్కలున్న జిల్లాల తలసరి ఆదాయం, ఆయా జిల్లాల వృద్ధిరేటు ఎక్కువగా ఉంటుంది. మూడు రాజధానులవల్ల రాష్ట్రంలో అన్ని జిల్లాల సమన్వయ అభివృద్ధికి దోహదమవుతుంది. క్రమంగా జీడీపీ కూడా పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. -
'ప్రత్యేక హోదాకు పోరాటాలే శరణ్యం'
మంగళగిరి (గుంటూరు) : పోరాటాల ద్వారానే ప్రత్యేక హోదా వస్తుందని నాన్ పొలిటికల్ జేఏసీ పేర్కొంది. ఆదివారం గుంటూరు జిల్లా మంగళగిరిలో నాన్ పొలిటికల్ జేఏసీ ప్రత్యే హోదాపై సదస్సు నిర్వహించింది. ఈ సమావేశంలో పాల్గొన్న పలువురు వక్తలు మాట్లాడుతూ... పోరాటాల ద్వారానే ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ యలమంచిలి శివాజీ, మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు పాల్గొన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ముస్లింలకు రిజర్వేషన్లు ఉండి తీర్సాలిందే: సీఎం జగన్
భార్యాభర్తలిద్దరూ స్టార్ క్రికెటర్లే.. అతడు కాస్ట్లీ.. ఆమె కెప్టెన్!(ఫొటోలు)
టీడీపీలో భగ్గుమన్న వర్గపోరు.. తన్నుకున్న తెలుగు తమ్ముళ్లు
నాకు జాబ్ ఇవ్వండి.. నేనే రూ.40 వేలిస్తా!
రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
దుమ్మురేపుతున్న ‘హీరామండి’.. భన్సాలీకి భారీ రెమ్యునరేషన్?
చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!
బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
నాకు సపోర్ట్ చేసేందుకు ఆ హీరో భార్య ఒప్పుకోలేదు
నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
తప్పక చదవండి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- పొట్ట తగ్గాలంటే.. జిమ్కే వెళ్లాలా? ఏంటి?
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- మొన్ననే పెళ్లి చేసిండ్రు.. ఇప్పుడే పిల్లలంటే ఎట్లా?
- తప్పుడు ప్రచారాలతో చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్
- షుగర్ వచ్చిందని బెదిరిపోకండి.. ఇవి ఖచ్చితంగా పాటిస్తే షుగర్ పరార్!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
Advertisement