breaking news
new lawact
-
వడివడిగా ‘భూభారతి’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భూభారతి చట్టం అమలు దిశగా రెవెన్యూ శాఖ వడివడిగా కసరత్తు చేస్తోంది. ఈ నెలలోనే గవర్నర్ ఆమోదం పొందిన ఈ చట్టం అమలులో భాగంగా అవసరమైన మార్గదర్శకాల రూపకల్పనలో ఉన్నతాధికారులు నిమగ్నమయ్యారు. చట్టంలోని సెక్షన్లు, సబ్ సెక్షన్లవారీగా మార్గదర్శకాలను రూపొందించే పనిలోపడ్డారు. ఇందుకోసం త్వరలోనే భాగస్వామ్య పక్షాలతో వర్క్షాప్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ వర్క్షాప్లో మార్గదర్శకాలు ఎలా ఉండాలనే విషయమై స్పష్టత రానుంది. మార్గదర్శకాల రూపకల్పన వచ్చే నెల మూడో వారానికల్లా పూర్తయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ కసరత్తు పూర్తయ్యాక వాటిని మళ్లీ క్షుణ్ణంగా పరిశీలించి ఈ చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందన్న దానిపై ప్రభుత్వం ప్రకటన చేయనుంది. అయితే వచ్చే నెలలో భూభారతి చట్టం అమల్లోకి వస్తుందని రెవెన్యూ శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ చట్టం అమల్లోకి వచ్చే వరకు ప్రస్తుతం అమల్లో ఉన్న ధరణి పోర్టల్ ద్వారానే వ్యవసాయ భూముల క్రయవిక్రయ లావాదేవీలు జరుగుతాయని ఆ శాఖ వర్గాలు వెల్లడించాయి. మాతో చర్చించి నిర్ణయం తీసుకోండి: వీఆర్వోల జేఏసీ గ్రామ రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేయడంలో భాగంగా గతంలో గ్రామ రెవెన్యూ అధికారులు (వీఆర్వో)గా పనిచేసిన తమను షరతుల్లేకుండా మళ్లీ రెవెన్యూ వ్యవస్థలోకి తీసుకోవాలని తెలంగాణ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ జేఏసీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. గతంలో పనిచేసిన అనుభవాన్ని పరిగణనలోకి తీసుకొని పరీక్షలు పెట్టకుండా సర్వీస్కు భద్రత కల్పిస్తూ నియమించాలని జేఏసీ చైర్మన్ గోల్కొండ సతీశ్, సెక్రటరీ జనరల్ హరాలే సుధాకర్రావు, అదనపు సెక్రటరీ జనరల్ పల్లెపాటి నరేశ్, వైస్చైర్మన్లు చింతల మురళి, ప్రతిభలు ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. హైకోర్టులో ఉన్న కేసులను పరిష్కరించకుండా, తమతో చర్చలు జరపకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం తగదని వారు ప్రభుత్వానికి సూచించారు. -
నేడు భారత్ బంద్
న్యూఢిల్లీ: వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు నేడు భారత్ బంద్ జరగనుంది. ఈ దేశవ్యాప్త నిరసనకు ఇప్పటికే కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ, ఆప్, టీఎంసీ, వామపక్షాలు, డీఎంకే, ఆర్జేడీ, ఎన్సీపీ, టీఆర్ఎస్ సహా దాదాపు అన్ని ప్రతిపక్ష పార్టీలు మద్దతు ప్రకటించాయి. ఆయా పార్టీల కార్యకర్తలు బంద్లో చురుగ్గా పాలుపంచుకోనున్నారు. బంద్లో పాల్గొని, రైతుల న్యాయబద్ధ డిమాండ్లకు మద్దతివ్వాలని దేశ ప్రజలకు రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. బంద్ను పాటించాలని ఎవరినీ ఒత్తిడి చేయవద్దని సూచించాయి. శాంతియుతంగా నిరసన తెలపాలని, అంబులెన్స్లు, ఎమర్జెన్సీ సేవలకు మినహాయింపునివ్వాలని విజ్ఞప్తి చేశాయి. మరోవైపు, రైతులు ప్రకటించిన భారత్ బంద్నకు నైతిక మద్దతు తెలుపుతున్నామని పది కార్మిక సంఘాల ఐక్య కమిటీ సోమవారం ప్రకటించింది. బంద్కు మద్దతు తెలుపుతూనే, కార్మికులు విధుల్లో పాల్గొంటారని పేర్కొంది. డ్యూటీలో ఉండగా నల్ల రిబ్బన్లు ధరించి నిరసన వ్యక్తం చేస్తారని, విధుల్లోకి వెళ్లేముందు కానీ విధులు ముగిసిన తరువాత కానీ నిరసన ప్రదర్శన నిర్వహిస్తారని తెలిపింది. కార్మికులు స్ట్రైక్ చేయాలంటే ముందుగా నోటీసు ఇవ్వాల్సి ఉంటుందని హిందూ మజ్దూర్ సభ ప్రధాన కార్యదర్శి హర్భజన్ సింగ్ వివరించారు. కాగా, బంద్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా శాంతిభద్రతల విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం సూచనలు జారీ చేసింది. ఢిల్లీ–మీరట్ ఎక్స్ప్రెస్ హైవేపై పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లు కోవిడ్–19 ముప్పు పొంచి ఉన్న కారణంగా, మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి కరోనా నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా చూడాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశించింది. భద్రతను కట్టుదిట్టం చేయాలని, శాంతిసామరస్యాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని స్పష్టం చేసింది. రైతులు నిరసన తెలుపుతున్న ఢిల్లీలోని పలు సరిహద్దుల వద్ద పోలీసులను భారీగా మోహరించారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న ప్రధాన డిమాండ్తో ఢిల్లీ సరిహద్దుల్లో గత 12 రోజులుగా నిరసన తెలుపుతున్న రైతులతో కేంద్ర మంత్రులు ఇప్పటివరకు ఐదు విడతలుగా జరిపిన చర్చలు అసంపూర్ణంగా ముగిసిన విషయం తెలిసిందే. మరో విడత చర్చలు బుధవారం జరగనున్నాయి. వేలాదిగా రైతులు నిరసన తెలుపుతున్న సింఘు సరిహద్దును ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సోమవారం సందర్శించారు. రైతులకు ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసిన సదుపాయాలను పరిశీలించారు. ‘తాత్కాలిక జైళ్లుగా ఢిల్లీలోని స్టేడియంలను వాడుకునేందుకు అనుమతించాలని మాపై భారీగా ఒత్తిడి వచ్చింది. మేం వారి ఒత్తిడికి తలొగ్గలేదు. అది ఉద్యమానికి సహకరించింది’ అని కేజ్రీవాల్ తెలిపారు. రైతులకు కష్టం కలగకుండా తమ ప్రభుత్వం చూసుకుంటుందన్నారు. ‘ఒక ముఖ్యమంత్రిగా కాకుండా, ఒక సేవకుడిలా మీ వద్దకు వచ్చాను’ అని రైతులతో పేర్కొన్నారు. ఆప్ నేతలు, కార్యకర్తలు రైతులకు సేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. మద్దతివ్వండి బంద్లో స్వచ్ఛందంగా పాల్గొనాలని దేశ ప్రజలకు రైతు సంఘాలు విజ్ఞప్తి చేశాయి. బంద్లో పాల్గొనేలా ఎవరినీ ఒత్తిడి చేయవద్దని తమ మద్దతుదారులను కోరాయి. శాంతియుతంగా బంద్ జరపాలని, హింసాత్మక చర్యలకు పాల్పడవద్దని భారతీయ కిసాన్ ఏక్తా సంఘటన్ అధ్యక్షుడు జగ్జిత్ సింగ్ దాలేవాలా కోరారు. ‘మేం పిలుపునిచ్చిన బంద్ రాజకీయ పార్టీలిచ్చే బంద్ లాంటిది కాదు. ఇది ఒక సైద్ధాంతిక లక్ష్యం కోసం మంగళవారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 వరకు.. నాలుగు గంటల పాటు జరిపే ప్రతీకాత్మక బంద్. ఈ నిరసనతో సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకూడదనేది మా ప్రధాన ఉద్దేశం. అందుకే ఆ నాలుగు గంటల పాటు ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని కోరుతున్నాం’ అని రైతు సంఘం నేత రాకేశ్ తికాయిత్ వివరించారు. ఆ నాలుగు గంటల పాటు దుకాణాలను మూసేయాలని వ్యాపారస్తులను కోరుతున్నామన్నారు. ఆ నాలుగు గంటల పాటు టోల్ ప్లాజాలను, కీలక రహదారులను నిర్బంధిస్తామని వెల్లడించారు. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేసేవరకు తమ ఆందోళన కొనసాగు తుందని రైతు నేత బల్బీర్ సింగ్ రాజేవాల్ స్పష్టం చేశారు. తాజా చట్టాలు రైతులకు లబ్ధి చేకూరుస్తాయని ఇన్నాళ్లు చెప్పిన ప్రభుత్వం.. ఇప్పుడు వాటికి సవరణలు చేసేందుకు సిద్ధమని ఎందుకు చెప్తోందని మరో రైతు నేత దర్శన్ పాల్ ప్రశ్నించారు. బంద్కు మద్దతుగా మంగళవారం అన్ని రవాణా కార్యకలాపాలను నిలిపేస్తామని ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్(ఏఐఎంటీసీ) ప్రకటించింది. ఏఐఎంటీసీ దేశవ్యాప్తంగా దాదాపు 95 లక్షల మంది ట్రక్కు యజమానులకు ప్రాతినిధ్యం వహిస్తోంది. దీంతో, దేశవ్యాప్తంగా నిత్యావసరాల రవాణాపై ప్రతికూల ప్రభావం పడనుంది. అతిపెద్ద రైల్వే కార్మిక విభాగాలైన ‘ఆల్ ఇండియా రైల్వేమెన్స్ ఫెడరేషన్’, ‘నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వేమెన్’ కూడా బంద్కు మద్దతు ప్రకటించాయి. బంద్కు మద్దతుగా రైల్వే కార్మికులు నిరసన ప్రదర్శనలు చేస్తారని తెలిపాయి. కాగా, తమ కార్యకలాపాలు మంగళవారం కూడా కొనసాగుతాయని వాణిజ్యవేత్తల సంఘం సీఏఐటీ, ఆల్ ఇండియా ట్రాన్స్పోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ స్పష్టం చేశాయి. బంద్లో నేరుగా పాల్గొనబోవటం లేదని బ్యాంక్ యూనియన్లు తెలిపాయి. బ్యాంకు ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో విధుల్లో పాల్గొంటారని ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రకటించింది. విరామ సమయాల్లో బంద్కు మద్దతుగా బ్యాంక్ బ్రాంచ్ల ముందు ప్లకార్డులను ప్రదర్శిస్తారని తెలిపింది. ప్రతిపక్షాల ద్వంద్వ నీతి రైతుల ఉద్యమానికి మద్దతివ్వడం విపక్షాల ద్వంద్వ నీతికి నిదర్శనమని బీజేపీ విమర్శించింది. సాగు చట్టాల్లోని నిబంధనలను కాంగ్రెస్, ఎన్సీపీ తదితర విపక్షాలు గతంలో మద్దతిచ్చిన విషయాన్ని గుర్తు చేసింది. వ్యవసాయ మార్కెట్ కమిటీ చట్టాన్ని రద్దు చేస్తామని, వ్యవసాయ ఉత్పత్తుల వాణిజ్యంలో ఉన్న అన్ని ఆంక్షలను తొలగిస్తామని 2019 లోక్సభ ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ హామీ ఇచ్చిందని కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ గుర్తు చేశారు. స్వార్థం కోసం ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ సమాజంలో అశాంతి నెలకొల్పేందుకు కుట్ర చేస్తున్నాయని ప్రతిపక్షాలపై ఆరోపణలు గుప్పించారు. ఎన్నికల్లో ఓటమి పాలవుతూ.. ఉనికి కోసం రైతు ఉద్యమాన్ని వాడుకుంటున్నాయని, రైతుల్లోని కొన్ని వర్గాలను తమ గుప్పిట్లో పెట్టుకున్నాయన్నారు. 16 రాష్ట్రాలపై ప్రభావం బంద్ వల్ల 16 రాష్ట్రాల్లో రైళ్ల రాకపోకలకు ఇబ్బందులు కలగవచ్చని రైల్వే శాఖ పేర్కొంది. రైళ్లలో, రైల్వే స్టేషన్లలో భద్రతను పెంచాలని సూచించింది. బంద్లో పాల్గొనే వామపక్ష అనుకూల అతివాదులు సమస్యలు సృష్టించే అవకాశాలున్నాయని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ అరుణ్ కుమార్ హెచ్చరించారు. శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త వహించాలని జోనల్ మేనేజర్లకు సూచించారు. సైకిల్పై 300 కి.మీ. పంజాబ్, హరియాణాల నుంచి ఢిల్లీ సరిహద్దులకు వెళ్లి నిరసనలు చేస్తున్న రైతులకు మద్దతు తెలిపేందుకు ఇద్దరు యువకులు సైకిల్ మీద ఏకంగా 300 కిలోమీటర్లు ప్రయాణించారు. జోవన్ ప్రీత్ సింగ్ (24), గురిందర్ జీత్ (26)లు పంజాబ్లోని బర్నాలా నుంచి రెండు రోజుల క్రితం ప్రయాణమై సోమవారానికి ఢిల్లీ సరిహద్దుకు చేరుకున్నారు. ట్రాక్టర్లలో ప్రయాణించాలంటే పోలీసులు అడ్డుకుంటున్నారని, అందుకే సైకిళ్లపై వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. దారిపొడవునా అప్పటికే రైతులు ఉండటంతో తిండికేమీ లోటు లేదని, రాత్రి వేళ ట్రాక్టర్లలో పడుకున్నామని చెప్పారు. ఆ చట్టాలు మంచివే.. కొత్త సాగు చట్టాలు రైతులకు ప్రయోజనం చేకూర్చేవేనని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మరోసారి చెప్పారు. ఈ చట్టాలను సమర్ధిస్తున్న రైతుల బృందంతో తోమర్ సోమవారం సమావేశమయ్యారు. పద్మశ్రీ పురస్కార గ్రహీత, హరియాణాకు చెందిన రైతు కన్వల్ సింగ్ చౌహాన్ నేతృత్వంలో ఈ బృందం తోమర్ను కలిసింది. ఈ బృందంలో భారతీయ కిసాన్ యూనియన్(అత్తార్) జాతీయ అధ్యక్షుడు అత్తార్ సింగ్ సంధూ కూడా ఉన్నారు. సాగు చట్టాలను రద్దు చేయవద్దని, అవసరమైతే కొన్ని సవరణలు చేయాలని ఈ బృందం మంత్రిని కోరింది. ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేస్తున్న ఉద్యమాన్ని తమ ప్రభుత్వం ఎదుర్కోగలదని తోమర్ వ్యాఖ్యానించారు. రైతుల కోసం వైఫై.. ఢిల్లీ–హరియాణా సరిహద్దుల వద్ద ఉన్న రైతులకు ఇంటర్నెట్ సదుపాయం కల్పించేందుకు ఢిల్లీకి చెందిన ఓ ఎన్జీఓ ముందుకు వచ్చింది. ఢిల్లీ సరిహద్దు వద్ద ఓ రూటర్ ఏర్పాటు చేశామని, అలాగే హరియాణా సరిహద్దు వద్ద పోర్టబుల్ డివైజ్ల నుంచి వైఫై సదుపాయం కల్పిస్తున్నట్లు చెప్పారు. దీని ద్వారా రైతులు తమ ఇంట్లో ఉన్నవారితో మాట్లాడుకుంటారని, రైతుల పిల్లలు ఆన్లైన్ క్లాసులకు హాజరువుతారని ఎన్జీవో సభ్యులు తెలిపారు. అర్జున, పద్మ అవార్డులను వెనక్కు ఇచ్చేందుకు రాష్ట్రపతి భవన్ వైపు వెళ్తున్న మాజీ క్రీడాకారులు రైతుల డిమాండ్లు ► ప్రత్యేక పార్లమెంటు సమావేశం ఏర్పాటు చేసి మూడు వ్యవసాయ చట్టాలను, విద్యుత్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలి. ► కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)ని వ్యవసాయ చట్టంలో చేర్చాలి. ► మండీల నుంచి కొనుగోళ్లను ప్రభుత్వమే చేపట్టాలి. ► రైతులు, వ్యాపారుల మధ్య వివాదాల పరిష్కారానికి ప్రత్యేక వ్యవసాయ కోర్టులు నెలకొల్పాలి. రైతుల అనుమానాలు ► సాగు రంగంలో ప్రైవేటు సంస్థల రాకతో వ్యవసాయ ఉత్పత్తుల ధరలు 15 నుంచి 20శాతం వరకు పడిపోయే ప్రమాదం ఉంది. ► ఒకే దేశం –ఒకే మార్కెట్ విధానంతో భవిష్యత్లో కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) అన్నదే లేకుండా పోతుంది. ► మండీ వ్యవస్థ నిర్వీర్యమై పండిన పంటను అమ్ముకోవడం కష్టమవుతుంది. ► రైతులు, వ్యాపారుల మధ్య వివాదాలను సబ్ డివిజినల్ మెజిస్ట్రేట్ పరిధిలోనే పరిష్కరించుకోవాల్సి రావడం. ► కాంట్రాక్ట్ ఫార్మింగ్తో భూములకు రక్షణ కరువవుతుంది. ► నిత్యావసర సరుకుల సవరణ చట్టంతో వ్యాపారులు, దళారులు కృత్రిమ కొరత సృష్టించే అవకాశం ఉంది. ప్రభుత్వం ఏమంటోంది? ► సాగు చట్టాలకు రైతు సంఘాలు కోరిన మేరకు సవరణలు చేపట్టేందుకు సిద్ధం. ► కనీస మద్దతు ధర విధానం యథా ప్రకారం కొనసాగుతుంది. దీనిపై భయాలు, సందేహాలు పూర్తిగా నిరాధారమైనవి. ► రాష్ట్రానికి చెందిన మండీలను ప్రభావితం చేయడం మా ఉద్దేశం కాదు. ఈ దిశగా ఏపీఎంసీ చట్టాన్ని మరింత బలోపేతం చేస్తాం. ► రైతులు అభ్యంతరం తెలుపుతున్న 39 అంశాల్లోని 8 అంశాల్లో సవరణలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. ► కొన్ని కీలక అంశాలపై రైతు సంఘాలను సూచనలు కోరుతున్నాం. పీటముడి ఎక్కడ? ► వ్యవసాయ చట్టాలను పూర్తిగా వెనక్కి తీసుకోకపోతే కనీసం కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)ని చట్టంలో చేర్చాలని రైతులు పట్టుబడుతున్నారు. ఎంఎస్పీని చట్టంలో చేర్చడమంటే రైతులకు చట్టపరంగా ధరలపై హక్కు వచ్చినట్టే. ఆ డిమాండ్ తీర్చడం అసాధ్యమని కేంద్రం అంటోంది. -
కొత్త చట్టం వచ్చింది..రేషన్ డీలర్లు జాగ్రత్త
నెల్లూరు(అర్బన్): పౌర సరఫరాలకు సంబంధించి ప్రభుత్వం గత నెల 11న పాత చట్టం స్థానంలో కంట్రోలర్ ఆర్డర్– 2018 అనే కొత్త చట్టాన్ని తీసుకొచ్చిందని జేసీ వెట్రి సెల్వి తెలిపారు. కొత్తచట్టం ప్రకారం రేషన్ డీలర్లు ఏ మాత్రం మోసాలకు పాల్పడినా చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. నగరంలోని కస్తూర్బా కళాక్షేత్రంలో రేషన్ డీలర్లకు కంట్రోలర్ ఆర్డర్–2018పై శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ డీలర్లు తూకాల్లో మోసాలకు పాల్పడినా..సకాలంలో డీడీలు చెల్లించకపోయినా..రేషన్ దుకాణాన్ని సమయం ప్రకారం తీయకపోయినా కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. గతంలో 6(ఏ) కేసులు నమోదు చేసేవారని, కొత్త చట్టం ప్రకారం 420 కేసులు నమోదు చేసేందుకు అవకాశం ఉందన్నారు. అందువల్ల డీలర్లు నిబంధనల ప్రకారం నడుచుకోవాలన్నారు. ఈపాస్ యంత్రంలో వేలిముద్రలు పడని లబ్ధిదారులకు ఐరిష్ ద్వారా సరకులు ఇవ్వాలని సూచించారు. ఐరిష్ పని చేయని చోట 15వ తేదీ తరువాత మూడ్రోజుల పాటు వీఆర్వో ద్వారా సరుకులు ఇవ్వాలన్నా రు. వరికుంటపాడు, దుత్తలూరు, ఉదయగిరి, సీతారామపురం, తడ, కొండాపురం, గూడూరు, అనంతసాగరం, రాపూరు, తదితర మండలాల్లో ప్రజా పంపిణీ వ్యవస్థ సరిగా లేదన్నారు. రేషన్ సరకులు ఇచ్చిన తరువాత పౌరసరఫరాల శాఖ అధికారులు జిల్లాలోని లక్షమందికి ఫోన్ చేసి సరుకులు సక్రమంగా ఇస్తున్నారా.. తూకాల్లో మోసాలు చేస్తున్నారా.. ఇతర సమస్యలు ఏమైనా ఉన్నాయానే వివరాలు సేకరిస్తున్నారన్నారు. అందువల్ల డీలర్లు జాగ్రత్తగా నడుచుకోవాలని సూచించారు. 18 ఏళ్లు నిండిన వారిని నూతన ఓటర్లుగా చేర్పించేందుకు సహకారించాలని కోరారు. అనంతరం ప్రజాపంపిణీలో 100 శాతం మించి సరుకులు అందించిన ఐదుగురు డీలర్లను సన్మానించారు. ఈ కార్యక్రమంలో అన్ని మండలాల రేషన్ డీలర్లు, డీఎస్ఓ, ఏఎస్ఓ, డిప్యూటీ తహసీల్దార్లు,తదితరులు పాల్గొన్నారు. -
‘ట్రిపుల్ తలాక్’కు మూడేళ్ల జైలు
సాక్షి ప్రత్యేక ప్రతినిధి, న్యూఢిల్లీ: ట్రిపుల్ తలాక్ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన కేంద్రం ఈ దిశగా కఠినమైన చర్యలకోసం రంగం సిద్ధం చేసింది. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లును తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది. ట్రిపుల్ తలాక్ చెప్పిన వారికి మూడేళ్ల జైలుతోపాటు భారీగా జరిమానా విధించేలా.. ముస్లిం మహిళల (రక్షణ, విడాకులపై హక్కులు) చట్టం 1986కు పలు మార్పులు చేస్తోంది. న్యాయశాఖ, హోంశాఖ వర్గాలు సంయుక్తంగా రూపొందించిన ముసాయిదాలో ట్రిపుల్ తలాక్ చెప్పటాన్ని తీవ్రంగా పరిగణించటంతోపాటు ఆ నేరానికి పాల్పడినవారికి మూడేళ్ల జైలు, జరిమానా లేదా రెండింటినీ అమలుచేసేలా నిబంధనలున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై తుది నిర్ణయం తీసుకునేందుకు మంత్రుల బృందంతో చర్చించి, రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత తుది ముసాయిదాను సిద్ధం చేస్తారని సమాచారం. ముస్లిం మహిళల హక్కుల చట్టాన్నే.. ‘షా బానో చట్టం–1986’గా కూడా పిలుస్తారు. ముస్లిం మతపెద్దలనుంచి తీవ్ర విమర్శలు ఎదురైనప్పటికీ రాజీవ్ గాంధీ ప్రభుత్వం షా బానో కేసు నేపథ్యంలో ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. అయితే ఆ చట్టం పీఠికలో విడాకులు పొందిన తర్వాతే మహిళలకు వర్తించేలా నిబంధనలున్నాయని.. వీటిని మార్చి విడాకులకు ముందే న్యాయం జరిగేలా మార్పులు చేయాలని భావిస్తోంది. దీంతోపాటుగా నేరశిక్షాస్మృతిలోని సెక్షన్ 125 (భార్య, పిల్లలు, తల్లిదండ్రుల పోషణకు నిరాకరించినప్పుడు తీసుకునే చర్యలు)కూ సవరణలు చేయాలని కేంద్రం భావిస్తోంది. సుప్రీంకోర్టు ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నా దీనిపై ముందుకే వెళ్లాలని కేంద్రం నిర్ణయించింది. శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వాలకు ముసాయిదాలను పంపించిన న్యాయశాఖ.. దీనిపై వారి అభిప్రాయాలను కోరనుంది. ట్రిపుల్ తలాక్ మార్పులపై ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందంలో రాజ్నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ, రవిశంకర్ ప్రసాద్, న్యాయశాఖ సహాయ మంత్రి పీపీ చౌదరీలున్నారు. విడాకుల తర్వాత మైనర్ చిన్నారుల కస్టడీ (లీగల్ ప్రొటెక్షన్) విషయంలోనూ న్యాయమూర్తులు తుది నిర్ణయం తీసుకునేలా ముసాయిదాలో పేర్కొన్నారు. మాటల ద్వారానైనా, ఎస్ఎంఎస్, ఈ–మెయిల్, వాట్సప్ సందేశాల ద్వారానైనా ట్రిపుల్ తలాక్ చెప్పటం చెల్లదని స్పష్టం చేశారు. ముసాయిదాకు ఆమోదం లభిస్తే.. జమ్మూకశ్మీర్ మినహా దేశమంతా కొత్త చట్టం అమల్లోకి రానుంది. -
ఉప ప్రణాళిక అమలుకు చట్టం
బీజేపీ అధ్యక్షుడు అమిత్షాతో సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ ప్రతినిధి బృందం బృందంలో కె.రామచంద్రమూర్తి, మల్లేపల్లి, కాకి మాధవరావు సాక్షి, న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక పద్దు కింద కేటాయిస్తున్న నిధులు సక్రమంగా ఖర్చయ్యేలా చూసేందుకు కేంద్రం తగిన చట్టాన్ని రూపొందించేలా చూడాలని సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్(సీడీఎస్) ప్రతినిధి బృందం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా, పార్టీ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్లను వేర్వేరుగా కలసి విన్నవించింది. సీడీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మల్లేపల్లి లక్ష్మయ్య, సలహాదారులు ప్రముఖ పాత్రికేయులు, ‘సాక్షి’ దినపత్రిక ఎడిటోరియల్ డెరైక్టర్ కొండుభట్ల రామచంద్రమూర్తి, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి కాకి మాధవరావు, కేంద్ర మాజీ కార్యదర్శి పి.ఎస్.కృష్ణన్లతో కూడిన బృందం అమిత్షా, రాంమాధవ్లకు ఈ మేరకు ఒక వినతిపత్రం సమర్పించింది. ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళిక నిధులు కాగితాలకే పరిమితమవుతున్నాయని, వాటిని ఆచరణలో పెట్టేలా చట్టం చేయాలని కోరారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలు ఈ మేరకు చట్టం చేశాయని, కేంద్రం కూడా ఇదే తరహా చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇటీవలి బడ్జెట్ కేటాయింపుల్లో ఎస్సీ, ఎస్టీ సంక్షేమం కోసం కేటాయించాల్సిన నిధుల్లో దాదాపు 60 శాతం కోత పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై అమిత్షా బదులిస్తూ పన్నుల వాటాలో రాష్ట్రాలకు 42 శాతం వాటా ఇస్తున్నామని, ఈ నిధుల్లో కూడా ఎస్సీ, ఎస్టీల సంక్షేమం కోసం ఖర్చు చేయాల్సిన 25 శాతం మేర నిధులను పక్కాగా ఖర్చు చేయాలని రాష్ట్రాలకు త్వరలోనే కేంద్రం తగిన సూచనలు జారీ చేస్తుందని వివరించారు. ప్రధానంగా ప్రాథమిక, ఉన్నత విద్యకు, ఉపాధికి ఖర్చు చేస్తే ఎస్సీ, ఎస్టీలు అభివృద్ధికి నోచుకుంటారని ఈ బృందం వివరించింది. ఇది సాకారం కావాలంటే ఉప ప్రణాళిక నిధులు కచ్చితంగా ఖర్చయ్యేలా, నిధుల మళ్లింపు లేకుండా చేసేలా ఒక చట్టం తేవాలని కోరింది. తమ అభ్యర్థనపై వారు సానుకూలంగా స్పందించారని ప్రతినిధి బృందం మీడియాకు వివరించింది.