breaking news
Nagurao Namaji
-
ప్రాజెక్టుల పేరుతో దోపిడీ
సాక్షి, మహబూబ్నగర్ : పాలమూరు ప్రాజెక్టుల పేరుతో టీఆర్ఎస్ దోపిడీకి ప్రయత్నిస్తోందని బీజేపీ సీనియర్ నేత నాగూరావు నామాజీ ఆరోపించారు. శుక్రవారం జిల్లా బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పాలమూరు ప్రాజెక్టును మూడు సంవత్సరాల్లో పూర్తి చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి ఐదేళ్ల అనంతరం పాలమూరు పర్యటనకు వచ్చి.. తిరిగి సంవత్సరంలో పూర్తి చేస్తామని చెప్పడం హాస్యాస్పదమన్నారు. కోర్టుల్లో కేసులేస్తే ప్రాజెక్టును ఆపాలని స్టే ఏమీ ఇవ్వలేదని, కావాలని బురదజల్లి ఏదో వంకతో ప్రాజెక్టు పనులను నిర్లక్ష్యం చేస్తూ నిధులు కేటాయించకుండా నీరుగారుస్తున్నారని ఆరోపించారు. వరద జలాలపై నిర్మిస్తున్న పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టును పూర్తి చేయడంతో పాటు నారాయణపేట కోడంగల్ ఎత్తిపోతల జీఓ.69ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉన్న ప్రాజెక్టులకు నిధులు ఇవ్వలేదు, పూర్తి కాలేదు, మరో ప్రాజెక్టును తెరపైకి తెచ్చి తద్వారా నిధుల దుర్వినియోగానికి పాల్పడేందుకు చేస్తున్న కుట్రలను తిప్పికొడతామన్నారు. బీజేపీ తెలంగాణ విమోచన కమిటీ రాష్ట్ర కన్వీనర్ శ్రీవర్ధన్రెడ్డి మాట్లాడుతూ.. సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినంగా అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. గతంలో ప్రజలకిచ్చిన మాట కేసీఆర్ మరిచిపోయారని ఆరోపించారు. బీజేపీ జిల్లా అధ్యక్షురాలు పద్మజారెడ్డి మాట్లాడుతూ.. ఆడపిల్లలపై జరుగుతున్న దాడులపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పడాకుల బాల్రాజ్, వీరబ్రహ్మచారి, అనంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
69 జీఓను అమలు చేయాలి
ఊట్కూర్ : కొందరు ఎమ్మెల్యేలు రైతు బిడ్డలమంటూ మోసం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగూరావు నామాజీ ఆరోపించారు. రైతు బిడ్డలైన నాయకులు తమ జన్మసార్థకం చేసుకోనేందుకుగాను 69 జీఓను అమలు చేయాలన్నారు. ఆదివారం బిజ్వార్లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ కొందరు నాయకులు మిడిమిడి జ్ఞానంతో తనను రైతుబిడ్డను కానని చెప్పడం తగదన్నారు. ఎన్నో ఏళ్లుగా జిల్లావ్యాప్తంగా పెండింగ్ ప్రాజెక్టులు సాధించేందుకుగాను రైతు సమస్యలపై ఎవరూ చేయనన్ని పాదయాత్రలు, ఉద్యమాలు చేశానన్నారు. ఈ సమావేశంలో మజ్దూర్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు విజయన్గౌడ్, ఎంపీటీసీ సభ్యుడు శ్రీనివాసులు, బీజేపీ నాయకులు కష్ణయ్య, నర్సింహ తదితరులు పాల్గొన్నారు.