-
Amazon: మౌత్వాష్ ఆర్డర్ చేస్తే.. ఖరీదైన ఫోన్
ముంబై: సాధారణంగా అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ఈ కామర్స్ సైట్లలో అప్పుడప్పుడు మనం ఆర్డర్ చేసినవి కాకుండా వేరే ప్రొడక్ట్స్ రావడం చాలా సహజం. అయితే తాము ఆర్డర్ చేసిన వస్తువు కన్నా ఎక్కువ ఖరీదైనది వస్తే.. రిటర్న్ చేసే వారు చాలా తక్కువ మంది. ఎక్కడో ఒకరో, ఇద్దరో మాత్రం వాటిని రిటర్న్ చేస్తారు. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి ముంబైలో చోటు చేసుకుంది. ఓ వ్యక్తి అమెజాన్లో మౌత్వాష్ ఆర్డర్ చేస్తే.. అతడికి ఏకంగా రెడ్మీ నోట్ 10 ఫోన్ డెలివరీ వచ్చింది. దాంతో సదరు వ్యక్తి.. ఆ మొబైల్ని తిరిగి తీసుకోవాల్సిందిగా కోరుతూ చేసిన ట్వీట్ ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ఆ వివరాలు.. ముంబైకి చెందిన లోకేష్ దగ అనే వ్యక్తి కొన్ని రోజుల క్రితం అమెజాన్లో మౌత్వాష్ ఆర్డర్ చేశాడు. అయితే అతడికి రెడ్మీ నోట్10 డెలవరీ చేశారు. మౌత్వాష్ ఆర్డర్ చేశాను కాబట్టి మొబైల్ని రిటర్న్ చేయడానికి కుదరడం లేదంటూ అతడు ట్వీట్ చేశాడు. ‘‘హలో అమెజాన్ నేను # 406-9391383-4717957 కోల్గెట్ మౌత్వాష్ ఆర్డర్ చేశాను. దాని బదులుగా నాకు రెడ్మీ నోట్ 10 వచ్చింది. మౌత్వాష్ నిత్యవసర వస్తువు కాబట్టి యాప్లో రిటర్న్ పెట్టడానికి కుదరడం లేదు. నాకు వచ్చిన ప్యాకేజ్ మీద నా పేరే ఉంది. కానీ ఇన్వాయిస్ వేరేవారిది. నా దగ్గర నుంచి ఈ మొబైల్ తీసుకెళ్లి.. దాన్ని ఆర్డర్ చేసిన వారికి డెలవరీ చేయాల్సిందిగా నేను మీకు ఈమెయిల్ కూడా చేశాను’’ అంటూ ట్వీట్ చేశాడు. Hello @amazonIN Ordered a colgate mouth wash via ORDER # 406-9391383-4717957 and instead of that got a @RedmiIndia note 10. Since mouth was in a consumable product returns are restricted and am unable to request for return via the app(1/2) pic.twitter.com/nPYGgBGNSR — Lokesh Daga (@lokeshdaga) May 13, 2021 మే 13న చేసిన ఈ ట్వీట్కి ఇప్పటికే అనేక రీట్వీట్లు వచ్చాయి. అతడి నిజాయతీపై నెటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు. చదవండి: అమెజాన్లో హార్డ్ డిస్క్ ఆర్డర్.. పార్సిల్ విప్పగానే షాక్! -
మౌత్వాష్తో కరోనా కంట్రోల్
సాక్షి, హైదరాబాద్: మౌత్వాష్లు కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రిస్తాయట. ఇది ఆశ్చర్యంగా ఉన్నా.. ఔననే అంటున్నారు కొందరు పరిశోధకులు. కరోనాను తగ్గించే మందుతోపాటు అసలు వైరస్ సోకకుండా నిరోధించే వ్యాక్సిన్ కోసం ప్రపంచం ఎదురుచూస్తోంది. ఇదే సమయంలో కొందరు పరిశోధకులు ఇతర ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించారు. జర్మనీకి చెందిన రూర్ విశ్వవిద్యాలయం పరిశోధకులు మౌత్వాష్లపై పరిశోధనలు జరిపారు. కోవిడ్ వైరస్పై అవి ఎలా పనిచేస్తాయో కల్చర్ టెస్ట్ ద్వారా పరిశీలించారు. ఆ తర్వాత ఆ వైరస్ మానవ కణాలపై ఎలా ప్రభావం చూపుతుందో కూడా పరిశోధించారు. వైరస్ను విస్తరించకుండా నిరోధిస్తాయి.. 229ఇ అనే మానవ కరోనా వైరస్పై మౌత్వాష్ను ప్రయోగించారు. 30 సెకన్ల పాటు ద్రావణాలతో కలిపి ఉంచాక, ఆ వైరస్ క్రియారహితం అయిందని గుర్తించారు. కోవిడ్ వైరస్ శరీరంలోకి ప్రవేశించే ముందు కొన్ని గంటలపాటు గొంతు పైభాగంలోని సైనస్ ప్రాంతంలో ఉంటుంది. అక్కడి నుంచి ఊపిరితిత్తుల్లోకి ప్రవేశిస్తుంది. నిత్యం మౌత్వాష్తో గార్గ్లింగ్ చేస్తే గొంతు వద్దే వైరస్ను నియంత్రించొచ్చని, పూర్తిగా నిరోధించలేక పోయినా.. దాన్ని బాగా తగ్గించొచ్చని పరిశోధకులు పేర్కొంటున్నారు. అయితే, ఇది వైరస్ నిరోధానికి సరైన పద్ధతిగా మాత్రం భావించొద్దని పేర్కొంటుండటం విశేషం. ఇది కేవలం ల్యాబ్లో చేసిన ప్రయోగమే తప్ప మనుషులపై చేసిన క్లినికల్ ట్రయల్స్ కాదని వారు చెబుతున్నారు. ‘మౌత్వాష్లో ఉండే క్లోర్ఎక్స్డిన్ రసాయనానికి వైరస్ను క్రియారహితం చేసే శక్తి ఉంటుంది. వైరస్ నిరోధానికి తీసుకునే చర్యల్లో ఇది కూడా ఓ అంశమని గుర్తించాలి తప్ప.. దీన్ని వైద్యంగా భావించొద్దు’ అని నగరానికి చెందిన మైక్రోబయోలజిస్టు దుర్గా సునీల్ పేర్కొన్నారు. -
మౌత్వాష్తో కరోనా వ్యాప్తికి చెక్?!
బెర్లిన్: గొంతులో గరగరగా అనిపించినా.. ఇబ్బందిగా ఉన్నా వేడినీటిలో కాస్తా పసుపు వేసుకుని పుక్కిలిస్తారు మనలో చాలమంది. కరోనా మహమ్మారి విజృంభణ ప్రారంభమైన నాటి నుంచి జనాలు తిరిగి ఈ పెరటి వైద్యం వైపు మళ్లారు. గోరు వెచ్చని నీటిలో ఉప్పు, పసుపు వేసి పుక్కిలించడం.. జీలకర్ర, అల్లం, సొంఠి, మిరియాలు వంటి మసలా దినుసులతో చేసిన కషయాలు తాగడం ప్రస్తుతం చాలామంది దినచర్యలో భాగమయ్యింది. ఈ నేపథ్యంలో మౌత్వాష్తో పుక్కిలించడం వల్ల కరోనా వ్యాప్తికి చెక్ పెట్టవచ్చు అంటున్నారు పరిశోధకులు. ఇలా చేయడం వల్ల నోరు, గొంతులోని కరోనా వైరస్ కణజాలం తగ్గుతుందని.. ఫలితంగా వైరస్ ఇతరులకు సోకే ప్రమాదం తగ్గుతుందని జర్మనీలోని రూర్ యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు. అయితే మౌత్వాష్తో పుక్కిలించడం వల్ల కేవలం వైరస్ వ్యాప్తిని మాత్రమే అరికట్టగలమని.. తగ్గించడం సాధ్యం కాదంటున్నారు. ఈ మేరకు ఓ నివేదిక విడుదల చేశారు. (లిక్విడ్ బదులు జెల్ శానిటైజర్లు విక్రయించాలి) కరోనా రోగుల్లో గొంతు, కావిటీలోల ఎక్కువ మొత్తంలో వైరల్ లోడు కనిపిస్తుందని పరిశోధకులు తెలిపారు. కరోనా వ్యాప్తికి ప్రధాన కారణం.. వైరస్ బారిన పడిన వారు ఇతరులతో మాట్లాడటం, దగ్గడం, చీదడం వంటివి చేసినప్పుడు వైరస్ డ్రాప్లెట్స్ అవతలి వారి మీద పడటంతో వారు కోవిడ్ బారిన పడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మౌత్వాష్తో నోటిని పుక్కిలించడం వల్ల నోట్లోని వైరస్ కణాల సంఖ్య తగ్గి.. వ్యాప్తి తగ్గుతుంది అంటున్నారు పరిశోధకులు. ఈ పరిశోధన కోసం వారు జర్మనీలోని ఫార్మసీలలో లభించే 8 రకాల మౌత్వాష్లను పరీక్షించారు. ఇవన్ని వేరు వేరు పదార్థాలతో తయారు చేయబడ్డాయి. పుక్కిలించడం వల్ల లాలాజల వైరల్ లోడ్ తగ్గి.. తద్వారా కరోనా వైరస్ ప్రసారం తగ్గుతుందన్నారు. స్టడీలో భాగంగా పరిశోధకులు మౌత్వాష్లను వైరస్ కణాలతో కలిపి.. నోటిలోని లాలాజలాన్ని పోలిన ద్రవాన్ని సృష్టించారు. 30 సెకన్ల పాటు పుక్కిలించిన తర్వాత వెరో ఈ6 కణాలను పరీక్షించగా వైరస్ కణాలు తక్కువగా ఉన్నట్లు గుర్తించామన్నారు. వెరో ఈ6 కణాలు వైరస్ను ఆకర్షిస్తాయని తెలిపారు. ఈ పరిశోధనలో చాలా మౌత్వాష్లు సమర్థవంతంగా పని చేశాయని.. ప్రత్యేకంగా మూడు రకాలు వైరస్ను పూర్తిగా తొలగించినట్లు కనుగొన్నామన్నారు. పుక్కిలించిన తర్వాత ఎంత సమయం వరకు ఈ ప్రభావం ఉంటుందనే అంశం గురించి ఇంకా స్పష్టంగా తెలియలేదన్నారు పరిశోధకులు. ముఖ్యంగా ఇతరులతో మాట్లాడే ముందు మౌత్వాష్తో నోరు పుక్కిలించడం వల్ల వైరస్ వ్యాప్తికి అడ్డుకట్టవేయవచ్చు అంటున్నారు.(కరోనా సీజనల్ వైరస్ కాదు: డబ్ల్యూహెచ్వో) -
మౌత్ఫ్రెష్తో జాగ్రత్త..
న్యూఢిల్లీ : ఉదయాన్నే పళ్లు తోముకున్న తర్వాత మౌత్వాష్తో మరోసారి నోటిని శుభ్రం చేసుకోవడం కొందరికి అలవాటు. కానీ ఇలా చేయడం వల్ల వ్యాయామం చేస్తే వచ్చే లాభాలు కాస్తా తగ్గిపోతాయని అంటున్నారు ప్లైమౌత్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. సాధారణంగా వ్యాయామం చేసిన వెంటనే మన రక్తపోటు కొంచెం పెరగడం.. ఆ తర్వాత తగ్గుతుంటుంది. వ్యాయామం చేసేటప్పుడు నైట్రిక్ యాసిడ్ ఉత్పత్తి పెరిగిపోయి రక్తనాళాలు వ్యాకోచం చెంది శరీరంలోని అవయవాలకు, కండరాలకు తగినంత ఆక్సిజన్ అందడం వల్ల రక్తపోటు తగ్గుతుందని అంచనా. వాసోడైలేషన్అని పిలిచే ఈ ప్రక్రియ వ్యాయామం చేసేటప్పుడు మాత్రమే జరుగుతుందని ఇప్పటివరకు అనుకునేవారు. కానీ ఆ తర్వాతకూడా చాలాసమయం పాటు ఇది కొనసాగడం శాస్త్రవేత్తలకు ఆశ్చర్యం కలిగించింది. కారణం ఏంటోతెలుసుకునేందుకు జరిపిన పరిశోధనల్లో నోటిలోని ఓ బ్యాక్టీరియా నైట్రేట్లతో జరుపుతున్న రసాయన చర్యలు కారణమని స్పష్టమైంది. నైట్రిక్ ఆక్సైడ్ క్షీణించే క్రమంలో నైట్రేట్లు ఏర్పడుతుంటాయి. నోటిలోని కొన్ని రకాల బ్యాక్టీరియా ఈ నైట్రేట్లను కాస్తా నైట్రైట్లుగా మార్చి.. మళ్లీ నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తి అయ్యేందుకు దోహదపడుతున్నాయి. మౌత్వాష్ కారణంగా ఈ బ్యాక్టీరియా నశించిపోతుండటంతో నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తిలో తగ్గుదల నమోదవుతోంది. -
నోరు బాగుంటే... హెల్త్ బాగుంటుంది!
నోటిని శుభ్రం చేసుకున్నారా... అన్ని అవయవాలనూ క్లీన్ చేసుకున్నట్టే! ‘‘తమ్ముడు మన్ను తిన్నాడం’’టూ చిన్నికృష్ణుడి మీద పెద్దాడి కంప్లెయింట్. ‘‘ఏదీ నోరు తెరువ్’’ అంది యశోద. చిన్నికన్న నోరు తెరిస్తే... సకల లోకాలూ... పదహారు భువనభాండాలూ కనిపించాయట ఆమెకు. అంటే యశోదమ్మ కూడా చిన్నారి కృష్ణుడి (నోటి) ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకున్నట్టేగా! రమణీయ భాగవత కథాస్ఫూర్తిని మన ఆరోగ్యానికీ అనువర్తించుకుందామా? మన నోటిలో సకల అవయవాల రక్షణా ఉంటుంది. కేవలం మన నోటిని మాత్రం పరిశుభ్రంగా ఉంచుకున్నామనుకోండి. ఒంట్లోని దాదాపు అన్ని అవయవాలనూ క్లీన్ చేసేసినట్టే. వాటన్నింటినీ బ్యాడ్ బ్యాక్టీరియాకు దూరం ఉంచినట్టే. నమ్మడం లేదా? మీ నోటి శుభ్రత వల్ల ఎన్నెన్ని కీలక భాగాలకు రక్షణ కలుగుతుందో తెలుసుకుంటే... మీరలా నోరు తెరచుకుని చూస్తుండిపోతారంతే. పళ్లను బ్రష్ చేసుకుంటే... దేహంలోని అవయవాలు ఎలా ఖుష్ అవుతాయో చూద్దాం. ఓరల్ హైజీన్తో గుండెకు రక్ష మనం రోజూ చక్కగా బ్రష్చేసుకుంటూ, చిగుర్ల ఆరోగ్యాన్ని చక్కగా చూసుకుంటే గుండెజబ్బులను, గుండెపోటును నివారించినట్లే. నోటి శుభ్రత సరిగా పాటించకపోతే వచ్చేందుకు గుండెజబ్బులు రెడీగా ఉంటాయ్. ఇందుకు రెండు కారణాలు. మొదటిది... నోటిలో జబ్బులకు, చిగుర్ల వ్యాధులకు కారణమయ్యే బ్యాక్టీరియా కొన్నిరకాల విషాలను వెలువరిస్తుంటాయి. ఇవి రక్తప్రవాహంలోకి ప్రవేశించి రక్తం సాఫీగా ప్రవహించడానికి అడ్డుపడేలా కొన్ని రక్తపు గడ్డలు (క్లాట్స్), కొవ్వుముక్కల వంటి పదార్థాలను (ప్లాక్స్) తయారు చేస్తాయి. దాంతో గుండెపోటు అవకాశాలు పెరుగుతాయి. రెండో కారణం... నోట్లోని హానికరమైన బ్యాక్టీరియావల్ల కాలేయంలో కొన్ని ప్రోటీన్లు తయారవుతాయి. అవి రక్తనాళాల్లోకి ప్రవేశించి అడ్డుపడటం వల్ల గుండెపోటు రావచ్చు. అందువల్ల మీరు నోరు శుభ్రం చేసుకుంటున్నారంటే... గుండె పరిసరాల్లోనూ ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ఏర్పరుస్తున్నారని అర్థం. మీకో విషయం తెలుసా? గుండెకు బైపాస్సర్జరీ చేయించుకోదలచిన వారు ముందుగా దంతవైద్యుడిని కలిసి తమకు పళ్లు, చిగుళ్లకు సంబంధించిన ఇన్ఫెక్షన్స్ ఏవీలేవని నిర్ధారణ చేసుకుంటేనే శస్త్రచికిత్స జరిగేది. నోటికీ, గుండెకూ ఇంతటి దగ్గరి సంబంధముందన్నమాట. నోటి శుభ్రతతో లంగ్స్ కూడా హెల్దీగా అందరి నోళ్లలోనూ, గొంతులోనూ బ్యాక్టీరియా ఉంటుంది. దీన్నే ఓరో–ఫ్యారింజియల్ బ్యాక్టీరియా అంటారు. ఇది గొంతులోకీ, అక్కడి నుంచి లంగ్స్లోకి ప్రవేశించవచ్చు. ఇది ఒక్కోసారి పల్మునరీ ఇన్ఫెక్షన్స్కు, నిమోనియాకు దారితీయవచ్చు. ఇది వయసు పైబడ్డవారిలో జరిగితే సీఓపీడీ (క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మునరీ డిసీజ్) వంటి ఊపిరితిత్తుల సమస్యలకు దారితీసే అవకాశం ఉంది. అందుకే నోరు బాగుంటే బ్రెత్ బాగుంటుందని ఇంగ్లిష్లో అంటారు. ఇక్కడ బ్రెత్ అంటే ఊపిరికి సహాయం చేసే ఊపిరితిత్తులు అనుకోవచ్చు. మన నోరు క్లీన్గా ఉందంటే... మనల్ని క్లీన్ చేసే కిడ్నీలూ క్లీన్ మన దేహంలోని వ్యర్థాలను క్లీన్ చేసే డ్యూటీ మూత్రపిండాల (కిడ్నీల)దన్న విషయం తెలిసిందే. కిడ్నీలకూ, నోటికీ ఉన్న సంబంధమేమిటో చూద్దాం. మూత్రపిండాల జబ్బులతో బాధపడేవారికి నోటి రుచి కూడా మారిపోతుంది. వాళ్ల నోటినుంచి దుర్వాసన కూడా వస్తుంది. ఇలా ఎందుకు జరుగుతుందో చూద్దాం. మనలోని మలినాలనూ, వ్యర్థాలనూ తొలగించేవి కిడ్నీలే కదా. అవి పనిచేయనందు వల్ల ఆ మలినాలన్నీ ఒకేచోట పోగుపడినట్టుగా అవుతాయి. దాంతో మన శరీరంలోని యూరియా అమోనియాగా మారి నోటి ద్వారా బయటకు వెళ్తుంది. అందుకే అలా దుర్వాసన వస్తుంటుందన్నమాట. కాబట్టే కిడ్నీలూ బాగుండాలంటే నోరు బాగుండాలి. నోరు బాగుంటే అవీ బాగుంటాయి. ఇక కిడ్నీ జబ్బు ఉండి డయాలసిస్ చికిత్స తీసుకునేవారు నోటిని క్లీన్ చేసుకోవాలనుకుంటే అది డయాలసిస్ అయిన మర్నాడు ప్లాన్ చేసుకోవడం మంచిది. నోరు క్లీన్గా ఉంటే మెదడుకూ ఆరోగ్యం నోటి శుభ్రతకూ, మెదడుకు కూడా సంబంధం ఉందంటే నమ్మడం కష్టం. కానీ అది నిజం. మన నోటిలో చిగుళ్లపై ఒక గారలాంటిది ఏర్పడుతుంటుంది. దీన్నే సూప్రా జింజివల్ ప్లాక్ లేదా సబ్ జింజివల్ ప్లాక్ అంటారు. ఇది మన రక్తంలోని ప్లేట్లెట్లను గుంపులుగా చేరేలా చేస్తుంది. దాంతో రక్తం గడ్డకట్టే ప్రక్రియల్లో ఒకటైన ‘థ్రాంబస్ ఫార్మేషన్’ జరుగుతుంది. ఫలితంగా రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే ప్రమాదం ఉంది. దీన్నే ‘థ్రాంబో ఎంబాలిజమ్’ అంటారు. ఈ ప్రక్రియ మెదడుకు రక్తాన్ని చేరవేసే రక్తనాళాల్లో జరిగినప్పుడు అది బ్రెయిన్స్ట్రోక్కు దారి తీయవచ్చు. అంతేకాదు మన నోటిలోని, ముఖ్యంగా కోరపళ్ళ దగ్గరి ఇన్ఫెక్షన్ అక్కడి నుంచి మెదడుకు పాకి కేవర్నస్ సైనస్ థ్రాంబోసిస్ అనే కండీషన్కు దారితీసే ప్రమాదం ఉంది. ఇది ప్రాణాంతకం. అందుకే నోటిని శుభ్రంగా ఉంచుకోవాలి. అంటే... మనం ముఖం శుభ్రంగా కడుక్కోవడమంటే మెదడునూ సురక్షితంగా ఉంచుకోవడమన్నమాట. పన్ను – కన్ను పన్ను పీకిస్తే అది కంటి నరాలను అదిరేలా చేసి చూపును తగ్గిస్తుందనీ మనలో చాలామందికి ఓ అపోహ. ఇది నిజం కాదు. అయితే నోటిలో వచ్చే ఇన్ఫెక్షన్లు మెదడుకు చేరే మార్గంలోనే కంటికి చేరితే అది ‘కార్నియల్ ఇన్ఫెక్షన్’గా మారవచ్చు. కొన్నిసార్లు పైవరస పంటికి పైభాగంలో ఉండే ఎముకల్లో చీము పడితే, అది కంటినీ ప్రభావితం చేయవచ్చు. కంటికి క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయించుకోదలచిన వారు ముందుగా నోటిలో ఎలాంటి ఇన్ఫెక్షన్లూ లేకుండా చూసుకుని ఆ తర్వాతే ఆపరేషన్ చేయించుకోవాలని డాక్టర్లు సూచిస్తుంటారు. నోటి పరిశుభ్రత – డయాబెటిస్ డయాబెటిస్ ఉన్నవారు షుగర్ను అదుపులో పెట్టుకోకపోతే నోటికి సంబంధించిన అనేక సమస్యలు రావచ్చు. లాలాజలం ఉత్పత్తి దెబ్బతినవచ్చు. అందుకే చక్కెరవ్యాధి ఉన్న చాలామందిలో నోరు పొడిబారిపోతుంటుంది. అది క్రమంగా నోటిలో పుండ్లకు, దంతక్షయానికి దారితీయవచ్చు. చక్కెర నియంత్రణలో లేకపోతే జింజివైటిస్, పెరియోడాంటైటిస్ వంటి చిగుర్ల ఇన్ఫ్లమేషన్ సమస్యలు రావచ్చు. ఇక పళ్లు వదులై కదులుతున్నప్పుడు లేదా చిగుర్లనుంచి రక్తస్రావం అవుతున్నప్పుడు లేదా నోటిలో ఏదైనా పుండై అది మానకుండా ఉంటే ముందుగా దంతవైద్యుడిని కలిసి డయాబెటిస్ ఉందేమోనని నిర్ధారణ పరీక్ష చేయించుకోవడం తప్పనిసరి. ఇక్కడ చెప్పిన ఉదాహరణలతో తెలిసే విషయం ఒక్కటే... మనం ఒక్క మన నోటిని శుభ్రంగా ఉంచుకున్నామంటే... శరీరంలోని దాదాపు అన్ని అవయవాలనూ శుభ్రపరచుకున్నట్లే! అందుకే ఉదయం తప్పక నోరు శుభ్రంగా కడుక్కున్న తర్వాతే మరే పనైనా చెయ్యాలి. అలాగే ప్రతిరోజూ రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు నోరు తప్పక శుభ్రం చేసుకోవాలి. నోటి శుభ్రత ఇలా... ►పుట్టిన పాపాయి మొదలుకొని (పళ్లు రాకముందు నుంచే) అందరూ పళ్ళు శుభ్రం చేసుకోవాలి ►పైన చిగుళ్లూ, పళ్లూ కలిసే చోటి నుంచి కింద మళ్లీ చిగుళ్లూ, పళ్లూ కలిసే చోటు వరకు నిలువుగా బ్రష్ చేసుకోవాలి. పైకీ, కిందికీ రౌండ్గా తిప్పుతున్నట్లుగా బ్రష్ చేసుకోవాలి. అంతే తప్ప పలువరసకు అడ్డంగా బ్రష్ చేసుకోవడం సరికాదు ►బ్రష్ చేసుకునే సమయంలో చాలా మృదువుగా బ్రష్ చేసుకోవాలి. చిగుర్లను బ్రష్తో గాయపరచుకోకుండా చూసుకోవాలి. మరీముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారిలో ఇది చాలా ప్రధానం ►పంటికి బయటా, లోపల కూడా బ్రష్ చేసుకోవాలి ►బ్రష్ను అదేపనిగా నములుతూ ఉండకూడదు. మరీ పలువరస అరిగిపోయేలా చాలాసేపు బ్రష్ చేసుకోవడమూ సరికాదు. బ్రష్ చేసుకునే ప్రక్రియ కనీసం రెండు లేదా మూడు నిమిషాలపాటు సాగాలి ►పళ్లు తోముకున్న తర్వాత ముఖం కడుక్కునే సమయంలో, చిగుళ్లపై వేలితో మృదువుగా మాలిష్ చేస్తున్నట్లుగా మసాజ్ చేసుకోవాలి ►నాలుకపైనున్న బాక్టీరియాను తొలగించుకునేలా టంగ్క్లీనింగ్ కూడా చేసుకోవాలి ►మూడునెలలకోసారి లేదా ఏదైనా జబ్బు చేసినప్పుడు కోలుకున్న వెంటనే పాత బ్రష్ మార్చేయాలి ►ప్రతి ఆర్నెల్లకోమారు తప్పనిసరిగా డెంటిస్ట్ను కలిసి, పళ్లను పరీక్షించుకుంటూ ఉండాలి. గార (ప్లాక్) వంటివి తొలగించుకునేలా క్లీన్ చేయించుకోవాలి. కాబోయే తల్లి నోరు శుభ్రంగా ఉంటే... కడుపులో బిడ్డా క్షేమం గర్భవతుల్లో సాధారణంగా రెండోనెలలో ‘ప్రెగ్నెన్సీ జింజివైటిస్’ అనే చిగుర్ల వ్యాధి కనిపిస్తుంటుంది. ప్రెగ్నెన్సీలో నోటి శుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వకపోతే వాచిన చిగుర్లలో లేదా నోటిలో కణుతులు, మంటలేని–క్యాన్సర్ కానీ కొన్ని గడ్డలు పెరగవచ్చు. గర్భవతులు నోటి ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకోకపోతే నెలలు నిండకముందే ప్రసవం కావడం, పుట్టిన బిడ్డ బరువు తక్కువగా ఉండటం వంటి సమస్యలు రావచ్చు. గర్భవతులు నోటి ఆరోగ్యాన్ని చక్కగా ఉంచుకుంటే అది పుట్టబోయే బిడ్డకూ మేలు. డాక్టర్ ప్రత్యూషదంత వైద్య నిపుణులు ప్రొఫెసర్ ఓరల్ మెడిసిన్ అండ్ రేడియాలజీ, కిమ్స్ హాస్పిటల్, సికింద్రాబాద్
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
టీ20 వరల్డ్కప్కు ఐర్లాండ్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?
మరో కుటుంబాన్ని ఆదుకున్న స్టార్ హీరో.. వీడియో వైరల్!
ఢిల్లీ బ్యాటర్లు ఊచ కోత.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాము: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: అగ్రరాజ్యంలో టెకీ ఆవేదన
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement