breaking news
Monthly magazine
-
ఆంధ్రీ కుటీరం పేరుతో.. తండ్రి ఆశీస్సులతో..
(డెస్క్ – రాజమహేంద్రవరం): ఇది 85 ఏళ్లనాటి ముచ్చట.. అప్పటికి స్వాతంత్య్ర రావటానికి దశాబ్ద కాలం వ్యవధి ఉంది. దేశమంతా స్వేచ్ఛా కాంక్ష ప్రజ్వరిల్లుతోంది. పట్టణాలు, పల్లెలు మహాత్ముని పథంలో పయనిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నాటి తూర్పు గోదావరి జిల్లా కాకినాడ తాలూకాలోని పల్లిపాలెం అనే చిన్న గ్రామంలోని వీధుల్లో భోగిమంటల్లా నాలుగైదు చోట్ల నిప్పురవ్వలు ఎగసిపడుతున్నాయి. అవేమిటని ఆరా తీస్తే.. తెల్లవారి మిల్లు దుస్తులను రాశులుగా పోసి మంట పెడుతున్నారు గ్రామస్తులు. గాంధీజీ పిలుపు మేరకు విదేశీ వస్త్ర బహిష్కరణలో భాగంగా రేగిన ఆ అగ్నిశిఖలు ఆ గ్రామంలోని 17 ఏళ్ల యువకుడిలో ఓ కొత్త ఆలోచన రేపాయి. ఖద్దరు వస్త్రధారణ, గ్రామ స్వరాజ్య సాధన, పల్లెసీమల్లో విద్యావ్యాప్తి, మద్యపానం, జూదాలకు దూరంగా ఉండటం.. ఇలా బాపూజీ బాటలో మన గ్రామంలోని యువత పయనిస్తే దేశానికి మేలు చేసినట్లే కదా అని భావించాడు. ఆ కుర్రాడు– మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి ఆ వయసులోనే తన ఇంటిని కార్యక్షేత్రంగా మలచుకుని ఆంధ్రీ కుటీరం పేరుతో.. తన తండ్రి ఆశీస్సులతో ఒక సంస్థను ప్రారంభించాడు. యువతలో సాహిత్యాభిలాష ఆంధ్రీ కుటీరం సంస్థకు 1938 జనవరి 13న మధునాపంతుల శ్రీకారం చుట్టారు. అప్పటి వరకూ కోడిపందేలు, గుండాటల వంటి జూదాలతో కాలాన్ని వృథా చేస్తున్న యువకులను దగ్గరకు చేర్చుకున్నారు. మామిడి తోటల్లోకి తీసుకువెళ్లి తెలుగు భాషా సాహిత్యాల పట్ల ఆసక్తి కలిగించారు. తెలుగు, సంస్కృత కావ్యాలు, వ్యాకరణం నేర్పి, భాషా ప్రవీణులను చేసి, ఉపాధ్యాయ వృత్తికి దారి చూపారు. అనంతరం కాలంలో మహాకవిగా, కళాప్రపూర్ణునిగా, ఆంధ్రపురాణకర్తగా మధునాపంతుల సువిఖ్యాతులయ్యారు. అన్ని కులాల వారికీ ఉచితంగా విద్య నేర్పుతామని పత్రికా ప్రకటనలు ఇచ్చారు. గ్రామసీమల్లో విద్యావ్యాప్తికి ‘నేను సైతం’ అంటూ ఆయన తలపెట్టిన ఈ యజ్ఞం ఇలా సాగుతుండగా.. తోరణం పేరుతో తన తొలి ఖండకావ్య సంపుటిని కవిసమ్రాట్ విశ్వనాథవారి పీఠికతో వెలువరించారు. పల్లెసీమల్లో భాషా వ్యాప్తికి ఆంధ్రీ కుటీరం వంటి సంస్థలు అవసరమని విశ్వనాథ ఆకాంక్షించారు. ఆనాడే అక్షరాంకురార్పణ అదే ఏడాది మధునాపంతులకు ఓ ఆలోచన కలిగింది. తెలుగు భాషా సేవకు పత్రికా నిర్వహణ తోడ్పాటు అవుతుందని భావించారు. వెంటనే తండ్రికి, కవితా గురువు శతావధాని ఓలేటి వెంకట రామశాస్త్రికి ఆ విషయం విన్నవించారు. పిఠాపుర సంస్థాన ఆస్థాన కవులైన ఓలేటి వారు అక్కడి సొంత ప్రెస్సు విద్వజ్జన మనోరంజని ముద్రాక్షర శాలలో పత్రిక అచ్చు వేయించుకునేందుకు అనుమతించారు. ఆంధ్రికి కాకినాడ కలెక్టర్ 1939 మార్చి 15న డిక్లరేషన్ ఇచ్చారు. పల్లిపాలెమే కార్యస్థానంగా మలచుకుని 1939 మార్చి నుంచి ఆంధ్రి సాహిత్య మాసపత్రిక ఆరంభమైంది. ఆంధ్ర శబ్దానికి ఆంధ్రి స్త్రీ వాచకమే కాకుండా ఆ పేరుతో ఒక రాగం కూడా ఉంది. ‘ప్రమాది ఉగాది నాడు 1939 మార్చి 22న వేదుల రామమూర్తి అధ్యక్షతన ఆంధ్రి ప్రారంభోత్సవం జరిగింది. ‘గొప్పగా ఉన్నది. నగర సంకీర్తన చేసితిమి ఆనాడు నాకు గల ఉత్సాహము అతివేలము’ అని ‘జ్ఞప్తి’ అనే డైరీలో మధునాపంతుల రాసుకున్నారు. ఎందరో మహానుభావుల ప్రశంస నేటి కథ.. ఆంధ్రియన్న స్వసంస్కృతి పురంధ్రియన్న అన్నన్నా.. ఏమి వెర్రి నీది ఓయన్నా.. అని మధునాపంతులను డాక్టర్ సి. నారాయణరెడ్డి ప్రశంసించారు. ఆంధ్రపురాణం, ఆంధ్ర రచయితలు, ఆంధ్రి.. ఇలా తన అణువణువులోనూ ఆంధ్రత్వం పుణికి పుచ్చుకున్న కవి ఆయన. ఆయన నెలకొల్పిన ఆంధ్రీ కుటీరాన్ని వారి ఆశయాలకు అనుగుణంగా అవిచ్ఛిన్నంగా నడుపుతుండటం విశేషం. ఈ సంస్థ వచ్చే నెలలో 85వ వార్షికోత్సవం నిర్వహించుకోనున్నది. వాడ్రేవు చిన వీరభద్రుడన్నట్లు ‘ఈ ఊరి అరుగులు ఎన్నో దశాబ్దాలుగా సారస్వత సత్రయాగానికి నోచుకున్నాయి’. నేటికీ ఈ ప్రాంతానికి వచ్చిన సారస్వత ప్రియులైన ప్రముఖులంతా పల్లిపాలెం సందర్శించటం సాధారణం. శాస్త్రి శత జయంత్యుత్సవాలను కేంద్ర సాహిత్య అకాడమీ 2020లో ఇక్కడే నిర్వహించింది. ఆంధ్ర పురాణ సవ్యాఖ్యాన బృహత్ గ్రంథాన్ని ప్రచురించిన అజోవిభో అధినేత అప్పాజోస్యుల సత్యనారాయణ.. ఆ గ్రంథాన్ని మధునాపంతుల రచించించిన మామిడి వృక్షం కిందనే ఆవిష్కరించారు. ఆంధ్రి విశిష్టతలు ► పిఠాపురం మహారాజా, జయపురం సంస్థానాధీశులు విక్రమదేవవర్మ, సర్ సీఆర్ రెడ్డి వంటి ప్రముఖుల ఆశీస్సులతో మొదలైన ఆంధ్రి పత్రికలో చెళ్లపిళ్ల, జాషువా, విశ్వనాథ, వేలూరి, వేటూరి ప్రభాకరశాస్త్రి, కరుణశ్రీ, దేవులపల్లి, గడియారం వంటి వారెందరో తమ కవితలు, అమూల్య వ్యాసాలు రాసేవారు. రచయితలు, కవులు ఎంత ప్రసిద్ధులైనా వారి రచనల కింద సంపాద కుడు నిక్కచ్చిగా, నిర్భీతిగా రాసే వ్యాఖ్యలు ఆ రోజుల్లో సంచలనం కలిగించేవి. ► ఉత్తమ సాహిత్య విలువలతో సాగిన ఆ పత్రిక మూడేళ్ల పాటు 36 సంచికలు వెలువడి అనివార్య పరిస్థితుల్లో ముూతపడింది. ► పోస్టల్, కరెంటు సౌకర్యాలు లేవు. కనీసం సరైన రహదారి కూడా లేని ఓ చిన్న గ్రామం నుంచి ఉత్తమ విలువలతో వెలువడిన ఆ పత్రికపై పరిశోధనలు జరిగాయి. ► అజోవిభో సంస్థ ఆంధ్రిలోని ముఖ్యమైన వ్యాసాలన్నిటినీ సంకలనం చేసి ఓ పుస్తకంగా ప్రచురించే ప్రయత్నిస్తోంది. ► ప్రెస్ అకాడమీ ఆర్కివ్స్ వెబ్సైట్లో ఆంధ్రి సంచికలన్నీ అందుబాటులో ఉంచారు. సాహిత్యాభిమానుల సహకారం మరువలేనిది ఎప్పుడో మధునాపంతుల నాటిన బీజం నేటికీ పచ్చగా ఉండాలనే సంకల్పంతో ఆంధ్రీ కుటీరం సంస్థను కొనసాగిస్తున్నాం. సాహితీవేత్తలు, మిత్రుల సహకారం మరువలేనిది. ఇన్నేళ్లు సజీవంగా ఉన్న సంస్థలు అరుదనే చెప్పాలి. సంప్రదాయ భూమిక, ఆధునిక ఆలోచనా స్రవంతుల స్వీకరణే లక్ష్యంగా అక్షర సేవ చేసి ఆంధ్రిని ఆరాధించుకోవాలన్నదే సంకల్పం. భవిష్యత్తులో కూడా అందరి సహకారాన్నీ కోరుకుంటున్నాం. – మధునాపంతుల సత్యనారాయణమూర్తి, సంచాలకుడు, ఆంధ్రీ కుటీరం, పల్లిపాలెం -
‘ఆయనకు పేదల అవసరాలు తీర్చడమే తెలుసు’
సాక్షి, విజయవాడ: దివంగత మహానేత వైఎస్సార్ పాలన స్ఫూర్తితో ఆయన తనయుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సుపరిపాలన సాగిస్తున్నారని ఏపీ ప్రభుత్వ ప్రజా వ్యవహారాల శాఖ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం ‘వేదిక’ మాసపత్రిక ప్రత్యేక సంచిక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ఆర్థికంగా చితికిపోయిన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టారన్నారు. ప్రజాసంకల్పయాత్రలో వైఎస్ జగన్.. ప్రజల కష్టాలను కళ్లారా చూడటంతో పాటు, స్వయంగా తెలుసుకున్నారన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు మేలు చేయడమే ధ్యేయంగా పాలన చేస్తున్నారని వెల్లడించారు. విద్య, వైద్యం, వ్యవసాయానికి పెద్దపీట వేస్తున్న వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని నిజమైన ప్రజా ప్రభుత్వం అనడంలో సందేహం లేదని స్పష్టం చేశారు. ‘వైఎస్ జగన్కు ఎత్తులు, పై ఎత్తులు తెలియవని.. పేదల అవసరాలు తీర్చడమే ఆయనకు తెలుసునని’ పేర్కొన్నారు. వారు మాత్రమే రాజకీయాల్లోకి రావాలి.. అణగారిన వర్గాలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత వైఎస్ జగన్కే దక్కుతుందన్నారు. గత ఎన్నికల్లో సినిమా నటులు ఎవరితో పొత్తు పెట్టుకుని వచ్చినా.. ప్రజలు మాత్రం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై నమ్మకం ఉంచారన్నారు. ప్రజలతో మమేకమయ్యే సినీ నటులు మాత్రమే రాజకీయాల్లోకి రావాలని, లేకపోతే ప్రజలకు వారి అవసరం లేదన్నారు. సీఎం జగన్ నిజాయితీగా తను ప్రజా సేవ చేస్తూ.. మిగతా వారిని పరుగులు పెట్టించడం చాలా గర్వంగా ఉందన్నారు. ఆరు నెలల ముందు.. తర్వాత పాలనకు తేడా ప్రతిఒక్కరికి స్పష్టంగా తెలుస్తుందన్నారు. ఈ పరిస్థితుల్లో వేదిక మాసపత్రిక విశ్లేషణాత్మకంగా ప్రజా పత్రిక కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, మేరుగ నాగార్జున, మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ పాల్గొన్నారు. -
వికలాంగుల వాయిస్ మాస పత్రిక ఆవిష్కరణ
ఘట్కేసర్ టౌన్: వికలాంగులను ప్రత్యేక వ్యక్తులుగా గుర్తించి వారి సమస్యల పరిష్కారానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని తహసీల్దార్ విష్ణువర్ధన్రెడ్డి కోరారు. మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యలయం ఆవరణలో సోమవారం 'వికలాంగుల వాయిస్' ప్రత్యేక మాస పత్రికను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వికలాంగులందరికీ అంత్యోదయ కార్డుల కోసం ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తానని చెప్పారు. అర్హులైన వారు మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సీపీఎం డివిజన్ కార్యదర్శి చింతల యాదయ్య మాట్లాడుతూ.. పింఛన్లు తీసుకుంటున్న వారందరూ లైఫ్ సర్టిఫికెట్లు అందజేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని విరమించుకోవాలని కోరారు. ఉద్యోగాల్లో 3 శాతం రిజర్వేషన్లు, అంత్యోదయ కార్డులు, రెండు పడకల ఇళ్లను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వికలాంగుల హక్కుల జాతీయ వేదిక డివిజన్ కార్యదర్శి చంద్రమోహన్, ఉపాధ్యక్షుడు శంకర్, దివ్యాంగులు రమేష్, రఘు, నర్సింహ్మ, జాని, పక్కీర్ పాల్గొన్నారు. 18ఎండిసీ33. దివ్యాంగుల వాయిస్ మాస పత్రికను ఆవిష్కరిస్తున్న తహసీల్దార్ విష్ణువర్థన్రెడ్డి, యాదయ్య తదితరులు -
''ప్రజాప్రస్థానం పేరుతో మాస పత్రిక''