నైపుణ్యాలు, ఉద్యోగ పురోగతికే ప్రాధాన్యం
ముంబై: కంపెనీల కార్యకలాపాల్లో ఆటోమేషన్, జెనరేటివ్ ఏఐ వినియోగం విస్తరిస్తుండడంతో.. జెనరేషనల్ జెడ్, మిలీనియల్స్ తరగతి యువత నైపుణ్యాలు పెంచుకునేందుకు, ఉద్యోగంలో పురోగతికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఉద్యోగ నిర్ణయాల్లో పురోగతి, అభ్యాసనా అవకాశాలకే తమ ప్రాధాన్యమని డెలాయిట్ సర్వేలో వారు చెప్పారు. జెన్ జెడ్, మిలీనియల్స్లో 85 శాతం మంది ప్రతి వారం చివర్లో నైపుణ్యాలు పెంచుకునేందుకు, పనిచేస్తూనే నేర్చుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు డెలాయిట్ ఇండియా చీఫ్ హ్యాపినెస్ ఆఫీసర్ సరస్వతి కస్తూరి రంగన్ తెలిపారు. కాకపోతే వీరికి తగినంత మార్గదర్శకత్వం లభించడం లేదని డెలాయిట్ సర్వే పేర్కొంది. సర్వేలో పాల్గొన్న వారిలో సగం మంది తమ మేనేజర్ల నుంచి మార్గదర్శనం కోరుకుంటుంటే.. అది కొందరికే లభిస్తున్నట్టు తెలిపింది. 505 మంది జెనరేషన్ జెడ్, 304 మిలీనియల్స్ అభిప్రాయాలను ఈ సర్వేలో భాగంగా డెలాయిట్ తెలుసుకుంది. 1981–1996 మధ్య జన్మించిన వారిని మిలీనియల్స్గా, 1997–2012 మధ్యకాలంలో జని్మంచిన వారిని జెనరేషన్ జెడ్ కింద పరిగణిస్తుంటారు. పట్టాలు కాదు.. అనుభవానికే పెద్ద పీట వేగంగా మార్పులకు గురవుతున్న ఉద్యోగ మార్కెట్లో సంప్రదాయ డిగ్రీ అర్హతల కంటే.. అనుభవానికే అగ్ర తాంబూలం లభిస్తున్న విషయాన్ని ఈ సర్వే గుర్తు చేసింది. దీంతో సంప్రదాయ విద్యా వ్యవస్థ నాణ్యతపై సందేహాలు లేవనెత్తింది. 94 శాతం జెన్ జెడ్, 97 శాతం మిలీనియల్స్ సిద్ధాంతాల కంటే అనుభవానికే విలువ ఎక్కువని చెప్పారు. ఉన్నత విద్యపై 52 శాతం జెన్ జెడ్, 45 శాతం మిలీనియన్స్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉన్నత విద్య వ్యయాలపై 36 శాతం జెన్ జెడ్, 40 శాతం మిలీనియల్స్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆందోళన, ఒత్తిడి విషయంలో ఉద్యోగం కారణమవుతున్నట్టు 36 శాతానికి పైనే చెప్పారు. ఉద్యోగుల శ్రేయస్సుపై దృష్టి పెట్టాలి.. ‘‘ఉద్యోగుల సంతోషం, శ్రేయస్సు విషయంలో సంస్థలు తమ విధానాలను తిరిగి పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. భౌతిక, మానసిక, ఆర్థిక శ్రయస్సు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. నాయకత్వం స్థాయిలో వీటిని పరిష్కరించాల్సి ఉంది’’అని ఈ సర్వే నివేదిక తెలిపింది.