breaking news
Janakirani
-
జానీ బామ్మకు జోహారు
నివాళి ఆకాశవాణి ఉద్యోగులకు, శ్రోతలకు ‘రేడియో అక్కయ్య’గానూ మా పిల్లలకు ‘జానీబామ్మ’గానూ ఎంతో ఆత్మీయురాలైన తురగా జానకీరాణిని తలచుకుంటే మిగిలేవన్నీ అందమైన జ్ఞాపకాలే. చిరునవ్వుల సంభాషణలే. 1977లో తెలుగు యువవాణిలో తాత్కాలిక అనౌన్సర్గా చేరిన నాటి నుంచి నాకు ఆమెతో పరిచయం. అలుపెరగని శ్రమజీవి, అపారమైన మనోనిబ్బరం ఉన్న వ్యక్తి ఆమె. భర్త తురగా కృష్ణమోహనరావుగారు అకస్మాత్తుగా రోడ్డు ప్రమాదంలో మరణించినప్పుడు కూడగట్టుకున్న ధైర్యం, మొన్నటికి మొన్న తన పెద్దమ్మాయి ఉషారమణి భర్త నరేందర్ చనిపోయేవరకూ ఆమెను వీడలేదు. ఎన్నో అనారోగ్యాలున్నా మనసుకు మరెన్నో గాయాలున్నా హుషారుకు మారుపేరుగా అందరికీ కనిపించారంటే అదంతా ఆమె సంకల్ప బలమే. జానకీరాణి గురించి ఎక్కువమందికి తెలిసింది ఆమె మంచి కథారచయిత్రి అని. మంచి రేడియో ప్రయోక్త అని. కాని ఆమెకు ఇంగ్లిష్లో అపారమైన పాండిత్యం ఉందనీ ఆమె చక్కని నర్తకి అని చాలామందికి తెలీదు. ఆమెకు నాయకత్వ లక్షణాలు మెండు. ఆ రోజుల్లోనే హైదరాబాద్లో ఏర్పడిన రచయిత్రుల సంఘం ‘సఖ్యసాహితి’కి ఆమె అధ్యక్షురాలిగా పని చేశారు. రచయిత్రులను కూడగట్టి చురుగ్గా కార్యక్రమాలు నిర్వహించారు. చలం మనమరాలిగా పుట్టినందుకు ఆనందించినా, ‘మా తాతయ్య చలం’ పుస్తకాన్ని ఎంతో ప్రేమగా రాసుకున్నా తనను వేదికపై పరిచయం చేసేటప్పుడు ‘చలం మనమరాలు’ అని అభివర్ణిస్తే చిరాకు పడేవారు. తన అస్తిత్వం తనదే. దానికి మరొకరి ‘గోడ చేర్పు’ అవసరం లేదని ఆమె భావన. అయితే పిల్లల కోసం ఎక్కువ పని చేయడం వల్లనో ఏమో అపుడపుడూ ఆవిడలోనూ ఇంకా పసితనం పోలేదని అనిపించేది. పిల్లలంటే ఆమెకు ఎంత ఇష్టమంటే వారి హక్కుల కోసం ‘బాలవాదం’ రావాలని గట్టిగా వాదించేవారు. ‘బంగారు పిలక’, ‘బి.నందంగారి ఆస్పత్రి’, ‘మిఠాయి పొట్లం’ వంటి పుస్తకాలను పిల్లల కోసం వెలువరించడం ఎంత నిజమో నిజ జీవితంలో కూడా అలగడం, మారాం చెయ్యడం, చిన్న చిన్న కోరికలను కనడం, పెంకిగా ప్రవర్తించడం- అంతే నిజం. జానకీరాణిగారి సన్నిహితులు ఆమె కంటే చిన్నవారైనా ఆమె బాల్యాన్ని ‘చూడ’గలిగారు. అయితే కథలు రాసేటప్పుడు ఈ పసితనం మాయమయ్యి ఆమెలోని చైతన్యమూర్తి అందునా చైతన్యంతో నిండిన స్త్రీమూర్తి కనిపించేది. ఆమె కథాశిల్పం చాలా వేగవంతమైనది. చదివించే గుణం కలిగినది. మధ్యతరగతి జీవితాల్లోని స్త్రీల నలుగుబాటును ఆమె చాలా సూక్ష్మపరిశీలనతో చేశారనిపిస్తుంది. కథలు రాసినా సాంఘిక సంక్షేమ శాఖ నుంచి యూనిసెఫ్ వరకూ పని చేసినా జానకీరాణి తాను చేపట్టిన ప్రతి పనినీ చక్కని ప్రతిభతో పట్టుదలతో చేసి చూపించారు. తనకు తెలిసిన కళలలో అంటే రచన ద్వారా, ఆడియో మాధ్యమం ద్వారా పిల్లల కోసం, స్త్రీల కోసం తను చేయగలిగినదంతా చేశారు. లోక్సత్తా పార్టీ సభ్యత్వం ద్వారా తన రాజకీయ సత్తాను కూడా నిరూపించుకున్నారు. వ్యక్తిగత జీవితంలోని విషాదాలకు ఆమెకు కొరతేమీ లేదు. కానీ అవేవీ ఆమె ఆలోచనలకు ఆటంకాలు కాలేదు. ఆమెలోని సెన్సాఫ్ హ్యూమర్ తన కష్టాలనూ తనను చుట్టుముట్టిన సంఘటనలనూ నిర్లిప్తతతో చూసేలా చేసేది. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండటం ఆమెకు సహజలక్షణం. జీవితాన్ని సంపూర్ణంగా ఆనందించాలనీ అనారోగ్యం అసౌకర్యం పేరిట తనకిష్టమైన పనులేవీ మానుకోకూడదనీ చెప్పడమే కాదు చేసి చూపించిన అపురూప వ్యక్తిత్వం ఆమెది. పెళ్లి కావచ్చు, పేరంటం కావచ్చు, పుస్తకావిష్కరణ కావచ్చు, ఊరికనే రచయితలు కలిసే సభ కావచ్చు, తనకు అందులో ఏ పాత్రా ఏ ప్రాముఖ్యమూ లేకపోవచ్చు. అయినా ఆమె హాజరైపోయేవారు. మిత్రులను కలుసుకోవాలన్నా పది మందితో మంచీ చెడ్డా మాట్లాడుకోవాలన్నా ఆమెకెంత ఇష్టమో. జీవితాన్ని ప్రతిక్షణమూ తనకిష్టమైన విధంగా గడపడానికి ప్రయత్నించడం అతికొద్ది మందికి మాత్రమే సాధ్యం. దానికి ఆవిడ ఆరోగ్యం సహకరించకపోయినా ఇంటి పరిస్థితులు అనుకూలించకపోయినా ఆమెలో తడబాటు లేదు. నిర్ణయాన్ని మార్చుకునే ప్రసక్తి లేదు. నాకూ జానకీరాణిగారికీ మధ్య ఉన్నది ఒక విలక్షణమైన అనుబంధం. యువవాణి అనౌన్సర్గా నన్ను, నా కంఠస్వరాన్ని మెచ్చుకుంటూనే ‘ఆ వేగం ఏమిటి? కాస్త నెమ్మదిగా మాట్లాడలేవూ. శ్రోతలు చస్తారు నిన్ను అర్థం చేసుకోవడానికి’ అని తొలిరోజుల్లో మందలించినా ఆ తర్వాత 20 ఏళ్లకు కాబోలు ‘మా ఆయన పేరు మీద పెట్టిన అవార్డుకు నీ కంటే అర్హులు లేరు’ అంటూ తురగా కృష్ణమోహనరావుగారి అవార్డు నాకు ఇచ్చినా, కొన్ని నెలల క్రితం ఒక పెళ్లిలో నేను ఆమెకు ప్లేటులో భోజనం తెచ్చి ఇచ్చి తినేవరకూ పక్కనే కూర్చున్నప్పుడు ‘నువ్వు నాకుతెచ్చి పెట్టడమేమిటి? నేను తెచ్చుకోగలను’ అని నన్ను కసురుకున్నా నెలకోసారి తప్పక నాకు ఫోన్ చేసి, పలకరించి, నా పిల్లల గురించి ముచ్చటించినా మా మధ్య ఒక ఆత్మీయబంధం. నెలరోజుల క్రితం అనుకుంటా జానకీరాణిగారు నాకు ఫోన్ చేసి ‘నా కథలన్నీ కలిపి సంపుటం వేశాను. నీకు పంపానా?’ అని అడిగారు. లేదన్నాను. ఆవిష్కరణ సభ జరిగినట్టు పేపర్లో చూశానన్నాను. ‘ఆ సభకు నిన్ను పిలవాల్సింది. అందరూ బాగానే మాట్లాడారుగాని నా పుస్తకం గురించి కాదు. నాకు కావలసింది నా కథలు ఎలా ఉన్నాయని. నువ్వయితే విశ్లేషణ బాగా చేసేదానివి. నీకు నా పుస్తకం పంపుతాను. చదివి తెలుగులో కాదు ఇంగ్లిష్లో రివ్యూ రాయి. ఇండియన్ లిటరేచర్కు పంపు’ అని ఆదేశించారు. తప్పక చేస్తానని అన్నాను. నేనే పుస్తకం కొనుక్కుంటానని రెండు సార్లయినా అనుంటాను. ‘నువ్వ కొనుక్కోవడమేమిటి? నేను పంపుతాను’ అన్నారు. ఇంతవరకూ ఆమె పంపలేదు. పంపలేకపోయారు. నేను రివ్యూ ఇంకా రాయలేదు. మన్నించు జానీ బామ్మా. ఇప్పటికి నేను రివ్యూ రాయొచ్చు. రాస్తాను కూడా. కానీ మీరు చదవరుగా? - మృణాళిని -
మనిషికి బతకాలనే ఆశ ఉండాలి...
తురగా జానకీరాణి... ఒక కథకురాలు... ఒక నవలా రచయిత్రి... రేడియో ప్రయోక్త... ఒక గాయని... ఒక నర్తకి... ఒక నటి... చదువులో బంగారు పతకాలు... ఉద్యోగంలో జాతీయ అవార్డులు... బాలానందం కార్యక్రమంతో ఆకాశవాణి జీవితం ప్రారంభం... ప్రొడ్యూసర్గా పదవీ విరమణ... జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు... అన్నిటినీ అధిగమించారు... జానకీరాణిగారు అక్టోబరు 15, బుధవారం గతించడానికి కొన్ని వారాల ముందు ‘సాక్షి’తో కొన్ని జ్ఞాపకాలు పంచుకున్నారు. ఇదే ఆవిడ ఇచ్చిన చివరి ఇంటర్వ్యూ... ఆ స్పర్శ చల్లగా ఉంది... నా ఆరో ఏట ఒకసారి మహాత్మాగాంధీ మా ఊరు వచ్చారు. ఆయనను చూడటానికి జనమంతా వెళ్తుంటే నేను కూడా వాళ్లతో వెళ్లాను. ఆయన ఒక్కో అడుగు వేస్తుంటే, ప్రజలంతా ఆయన కాళ్ల దగ్గర ఉన్న ఇసుకను దోసెళ్లతో ఎత్తి నెత్తిన పెట్టుకున్నారు. నేను ఆయన మెడలో వేయడానికి తీసుకువెళ్లిన ఎర్రగులాబీల దండలో పూలన్నీ, ఆయన దగ్గర చేరే లోపే రాలిపోయాయి. ఆయన ఆ దండ తీసుకుని, నా తల మీద మృదువుగా నిమిరారు. ఆయన చేతి స్పర్శ నాకు చల్లగా అలాగే ఉండిపోయింది. ఆయనకు ‘జి’ అని రాసి ఉన్న నా చేతి ఉంగరాన్ని ఇస్తుంటే, తన చిటికెనవేలితో తీసుకుని ‘ఇది ఎందుకు?’ అన్నారు. ‘కస్తూర్బా ఫండ్’ కి అన్నాను. ఆయన నన్ను ఆశీర్వదించారు. బాలానందంతో ప్రారంభం...: చిన్నప్పటి నుంచే ఆకాశవాణి బాలానందం కార్యక్రమంలో పాల్గొన్నాను. అబ్బూరి వరదరాజేశ్వరరావు రచించిన ‘ఒరియా’ అనువాద నాటకం లైవ్ బ్రాడ్కాస్ట్లో పాటలు పాడాను. ‘‘నీ కంఠంలో కరుణరసం బాగా పలుకుతుంది’’ అన్నారు సినారె. విశ్వనాథ సత్యనారాయణ గారి ‘కోకిలమ్మపెళ్లి’ నాటకంలో చిలకతల్లి వేషం వేశాను. విదేశీ ప్రసారాల కోసం బాలమురళిగారు మా చేత జోలపాటలు, ఉయ్యాల పాటలు, అప్పగింతల పాటలు పాడించారు. వివాహ బంధం... నా 12వ ఏట తురగా కృష్ణమోహన్గారు (అప్పటికి ఆయన వయసు 18) నా వెంటపడ్డారు. ‘ఒక మనిషి ఇంకో మనిషిని అంతగా ప్రేమించగలరా’ అనుకునేంతగా ఆయన నన్ను ఇష్టపడ్డారు. అందుకే నేను ఆయన అభిమానంలో చిక్కుకుపోయాననుకుంటాను. మా మధ్య స్నేహం సుమారు పది సంవత్సరాలు నడిచింది. ఏది ఎలా ఉన్నా చదువులో మాత్రం ముందుండేదాన్ని. డిగ్రీ, పీజీలలో గోల్డ్మెడల్స్ సాధించాను. 1959 లో నా 22వ ఏట మా వివాహం జరిగింది. అప్పుడు ఆయన ఆంధ్రపత్రికలో పనిచేస్తుండేవారు. నేను ఇంట్లో తలనొప్పితో బాధపడుతుంటే, ఆఫీసులో అందరికీ నా గురించి చెబుతూ ఆయన కూడా బాధపడేవారని ఆయన స్నేహితులు చెప్పేవారు. అంత ప్రేమగా ఉండేవారు ఆయన. కొంతకాలానికి ఆయన ఆంధ్రపత్రిక నుంచి ఆకాశవాణిలో వార్తావిభాగంలో చేరారు. నేను ‘సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్’లో చేరి పదిహేనేళ్లు పనిచేశాను. నిజాయితీ గల ఆఫీసరుగా పేరు తెచ్చుకున్నాను. మారిన జీవితం...: ఇద్దరు ఆడపిల్లలు పుట్టిన తర్వాత పిల్లల కోసం ఉద్యోగం మానేశాను. మేమిద్దరం... మాకిద్దరు... అన్నచందాన ఎంతో అన్యోన్యంగా ఉంటున్న నా జీవితం ఊహించని మలుపు తిరిగిపోయింది. 1974 లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన మరణించారు. ఆయనకు ఆ రోజు ఉదయం కాఫీ ఇచ్చిన గ్లాసు ఇంకా కిటికిలోనే ఉంది, ఇంతలో మృతదేహం వచ్చింది. ఎన్నో ఏళ్లు కుమిలికుమిలి ఏడ్చాను. కాలం నెమ్మదిగా గాయాల్ని మాన్చింది. పిల్లల్ని చూసుకుని నాకు నేనే ధైర్యం చెప్పుకున్నాను. ఏ పిల్లల కోసం నేను ఉద్యోగం మానేశానో, అదే పిల్లల కోసం మళ్లీ ఉద్యోగంలో చేరాను. ఆకాశవాణి ప్రొడ్యూసర్గా ... 1974లో ఆకాశవాణి ప్రొడ్యూసర్గా చేరి 1995లో రిటైరయ్యేవరకు అక్కడే కొనసాగాను. ఆకాశవాణి అప్పుడొక స్వర్ణయుగం. నేను పనిచేసిన 20 సంవత్సరాల కాలంలో రేడియోలో అనేక కార్యక్రమాలకు రూపకల్పన చేశాను. ‘అందరికీ చదువు’ అనే కార్యక్రమం ప్రసారం చేసినప్పుడు, అన్ని జిల్లాల నుంచి అక్కడి బడి పరిస్థితులను వివరిస్తూ ఉత్తరాలు వచ్చేవి. వాటిని విద్యాశాఖ కార్యదర్శికి పంపేదాన్ని. ఇంకా... పిల్లల కార్యక్రమాలు, మహిళా కార్యక్రమాలు, నవయుగం, నవలా స్రవంతి, సమత, బాలవిహార్, మహిళా సమాజం... వంటి కార్యక్రమాలు చేశాను. అనేక బాలకవిసమ్మేళనాలు నిర్వహించాను. ‘బ్రాడ్కాస్టర్’ అనే పదానికి బదులు ‘ప్రసారకర్త’ అనే పదాన్ని వాడటం ప్రారంభించింది నేనే. దాశరథి కృష్ణమాచారిగారు మా స్టేషన్ డెరైక్టర్తో ‘జానకీరాణి తెలుగుభాషకు చాలా సేవచేస్తోంది’ అంటూ నన్ను అభినందించారు. వందేమాతరం... ‘ఆనంద్మఠ్’ నవల రచించి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రేడియోలో సెలట్రేబ్ చేయమన్నారు. వందేమాతరం గీతంలోని ‘సుజలాం, సుఫలాం’ వాక్యాన్ని తీసుకుని డా. సి. నారాయణరెడ్డిగారితో ‘‘మంచుకొండలను దిగివచ్చింది మా గంగమ్మ... మనసే మురళిగా మలచుకొంది మా యమునమ్మ...’’ అని పాట రాయించాను. ఈ కార్యక్రమం ఆహ్వానపత్రికలో ‘దృశ్య గీతి’ అని వేస్తే, అలా ఎందుకు వేశారని అందరూ నన్ను అడిగారు. అందుకు నేను ‘అది దృశ్యం కాదు, శ్రవ్యం కాదు, చూడవలసిన గీతి కనుక అలా వేశాను’ అని చెప్పాను. ఇలా ఎన్ని కార్యక్రమాలు చేశానో నాకే గుర్తు లేదు. గుర్తున్నంతవరకు కొన్ని మాత్రమే చెప్పగలిగాను. ఇప్పుడు నా వయసు 78. అయినా నా మనసు మాత్రం ఎంతో యాక్టివ్గా ఉంది. ఇప్పటికీ ఏ ప్రోగ్రామ్కి పిలిచినా వెళ్లిపోతాను. రేడియోవాళ్లు నా గురించి నాతో మాట్లాడించి ఆరు భాగాలు టేప్ చేశారు. ‘బతకాలి బతకాలి’ అన్నదే నా ఫిలాసఫీ. జీవితం చాలా విలువైనది. మనం బతికున్నామంటే అది ఒక వరం. మనిషికి బతకాలనే ఆశ ఉండాలి. అప్పుడే జీవితంలో అన్నిటినీ ఎదుర్కోగలుగుతాం... అంటూ ముగించారు. - డా॥వైజయంతి తాతగారి ఆశీస్సులే కారణం... చిన్నప్పుడే నేను కథలు రాయడానికి ఒక రకంగా మా తాతయ్య చలంగారి ఆశీస్సులే కారణం. నాకు 15 సంవత్సరాల వయసున్నప్పుడు తిరువణ్నామలై వెళ్లి ఆయన్ని కలిశాను. ఆయన నా కంటె 50 సంవత్సరాలు పెద్ద. ఆయన్ని నేను ఎన్నోరకాల ప్రశ్నలు వేసి వేధించాను. అన్నిటికీ ఆయన ఓరిమిగా సమాధానాలు చెప్పారు. ‘‘నువ్వు హృదయం ఉన్న పిల్లవు. నీలోంచి ఆలోచనలు పెళ్లగించుకుని వస్తేనే కథలు రాయి’’ అన్నారు. ఆయన మాటలు నా మనసులో ముద్ర వేసుకున్నాయి. ఆయన నాకు 16 ఉత్తరాలు రాశారు. ఆయనతో పరిచయం నాకు గొప్ప అనుభవం. అంత పెద్దమనిషి చేత నేను ప్రశంసలు పొందానని నాకు గర్వంగా ఉండేది. కృష్ణార్జున సంవాదంలో కృష్ణుడు వేషం వేశారు. మొట్టమొదటి కథ 15వ ఏట కృష్ణాపత్రికలో పడింది. వెంపటి చిన సత్యం గారి దగ్గర భరతనాట్యం నేర్చుకుని, అనేక ప్రదర్శనలిచ్చారు. నాట్యంలో డిప్లమా చేశారు. చినసత్యంగారు ఇచ్చిన గజ్జెలు ఇప్పటికీ ఆవిడ దగ్గరున్నాయి. ‘నిశ్శబ్దంలో ప్రయాణాలు’ అని మూగచెముడు వారికోసం, ‘ఆశ్రయం’ అని వయోవృద్ధుల కోసం చేసిన కార్యక్రమాలకు, పిల్లల కోసం రచించిన బాల గేయాలకు రెండుసార్లు... మొత్తం నాలుగు జాతీయ అవార్డులు వచ్చాయి. 1963లో ‘అఖిలభారత రచయిత్రుల సంఘం’ ఏర్పాటుచేశారు. ఆ ప్రారంభోత్సవానికి విజయలక్ష్మీ పండిట్ వచ్చారు.