breaking news
Hyderabad Future City
-
రేవంత్కు ఆశ లావు.. పీక సన్నమైంది!
తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ప్రధానంగా మూడు అంశాలపై చర్చోపచర్చలు జోరందుకుంటున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన రాజకీయ గురువు బాటలోనే తలపెట్టిన ‘ఫ్యూచర్ సిటీ’, హైదరాబాద్ మెట్రో రైలు నిర్వహణ బాధ్యతలు ఎల్ అండ్ టీ నుంచి ప్రభుత్వం చేతుల్లోకి మారిపోవడం.. కేసీఆర్ ప్రభుత్వం రూ.లక్ష కోట్లతో చేపట్టిన కాళేశ్వరం మాదిరిగానే రేవంత్ ప్రభుత్వం రూ.35 వేల కోట్ల ప్రాణహిత చేవెళ్ల పథకం నిష్ప్రయోజనం కానుందా? అన్నవి ఆ మూడు అంశాలు.ఫ్యూచర్ సిటీ విషయంలో రేవంత్ పట్టుదలతోనే ఉన్నారు. అభివృద్ధి సంస్థ నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేశారు. అయితే ఆ ప్రాంతానికి ఒక పేరు పెట్టి తామే నగరాన్ని నిర్మిస్తామని చెప్పడమే విస్మయం కలిగిస్తుంది. కులీకుతుబ్ షా మాదిరి రేవంత్ కూడా నగర సృష్టి చేయనున్నారని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పొగడటం బాగానే ఉన్నా.. ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుని కార్యాచరణకు దిగడం మంచిది అనిపిస్తుంది. అంతర్జాతీయ కంపెనీలూ, ఫార్చ్యూన్ 500 కంపెనీలు అనేకం ఇప్పటికే హైదరాబాద్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. మరిన్ని వచ్చిన తగినంత భూమి ప్రభుత్వం ఉంది. వచ్చిన ప్రతిపాదనలకు తగ్గట్టుగా ఆయా ప్రాంతాల్లో భూ సేకరణ చేయవచ్చు కూడా. ఇదో నిరంతర ప్రక్రియ.అయితే, ఒకవైపు ప్రభుత్వ భూములను వేలం పెడుతూ, మరోవైపు కొత్త నగరం పేరిట రైతుల నుంచి భూములను సమీకరించడం ఎంతవరకు అవసరమన్నది ఆలోచించుకోవాలి. ఫ్యూచర్ సిటీని న్యూయార్క్ నగరంతోనో, లేక టోక్యో, దుబాయి వంటి నగరాలతో పోల్చి, అక్కడి వారు కూడా ఇక్కడకు వచ్చి చూసి వెళ్లాలన్న ఆకాంక్ష తప్పు కాదు కానీ రేవంత్ ఇలాంటి విషయాలు చెబుతుంటే గతంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ను డల్లాస్ నగరంగా మార్చేస్తానని, హుస్సేన్ సాగర్ నీళ్లను కొబ్బరి నీళ్ల మాదిరి చేసేస్తామని చెప్పిన కబుర్లు గుర్తుకు వస్తాయి. హుసేన్ సాగర్ను ఎండగట్టి శుభ్రం చేయాలన్న కేసీఆర్ ప్రతిపాదించినప్పటికీ విపరిణామాలపై పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ఆ తరువాత ఈ ప్రణాళిక ముందుకు పోలేదు. హైదరాబాద్ డల్లాస్గా మారలేదు. కాకపోతే ఆ తరువాతి కాలంలో ప్రాక్టికల్గా ఆలోచించి నగరంలో పలుచోట్ల వంతెనలు, రోడ్ల వెడల్పు చేయడం, రేడియల్ రోడ్ల నిర్మాణం వంటివి చేశారు.ఇక, ఏపీలో చంద్రబాబు అమరావతి పేరుతో అవసరం లేకపోయినా లక్ష ఎకరాలు తీసుకుని లక్షల కోట్లు వెచ్చించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోవడంతో వారంత ఆందోళన చెందుతున్నారు. అందుకే ఒకప్పటి మద్దతుదారులైన అమరావతి రైతులే ఇప్పుడు బాబకు నిరసన చెప్పడం మొదలుపెట్టారు. రాజధాని నిర్మాణం పేరుతో పలు నగరాలు సందర్శించిన చంద్రబాబు ఏ దేశమెళితే అక్కడి మాదిరిగా అమరావతిని కట్టేస్తానని ఊదరగొట్టేవారు. ఇప్పటికే వేల కోట్ల రూపాయలు వ్యయం చేసినా పది శాతం కూడా పూర్తి కాలేదని మంత్రి నారాయణే చెబుతున్నారు. ఫ్యూచర్ సిటీ గురించి వింటున్నప్పుడు కేసీఆర్ కబుర్లు, చంద్రబాబు డాంబికాలను కలగలిపి మరీ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారా అన్న సందేహం వస్తుంది. ఏ అవసరాల కోసం ఈ నగరాన్ని నిర్మించదలిచారు? పారిశ్రామిక అవసరాలకా? లేక పాలన కోసమా? రైతుల నుంచి భూములు ఏ పద్దతిలో తీసుకుంటారు?.అవుట్ ఆఫ్ కోర్టు ద్వారా రైతులు భూముల పరిహారం సెటిల్ చేసుకోవాలని రేవంత్ చెబుతున్న తీరు వారిని బుజ్జగించడమా? లేక బెదిరించడమా?. గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫార్మా సిటీ భవిష్యత్తు ఏమిటి?. ఆ భూములను రైతులకు తిరిగి ఇచ్చేస్తామని అప్పట్లో కాంగ్రెస్ వారు చెబుతుండేవారు. మరి ఇప్పుడు ఫ్యూచర్ సిటీ కోసం కొత్తగా భూములు తీసుకో తలపెట్టారు. ఇదంతా రియల్ ఎస్టేట్ విలువలు పెరిగి భూముల లావాదేవీలు పుంజుకోవాలన్న లక్ష్యంతో చేస్తున్నారా?. కాంగ్రెస్ పార్టీనే తీసుకు వచ్చిన 2013 భూ సేకరణ చట్టం గురించి ఎందుకు మాట్లాడడం లేదు?. ఆయన మాటలు వింటుంటే రైతులకు కొంతవరకు నష్టం తప్పదేమో అనిపిస్తుంది. ఈ విషయాలే భవిష్యత్తులో సమస్యలుగా మారవచ్చు. ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బుల్లెట్ రైలు వస్తుందని చెబుతున్న తీరు అచ్చంగా చంద్రబాబు నాయుడు చెప్పే అతిశయోక్తుల మాదిరే అనిపిస్తాయి. అక్కడి ప్రజలను ఊరించడానికా, లేక వారిలో నమ్మకం పెంచడానికా? ఏది ఏమైనా రేవంత్ ఫ్యూచర్ సిటీపై గట్టి ఆశతో ఉన్నారా? లేక వేరే లక్ష్యంతో హైప్ చేస్తున్నారా అన్నది తేలడానికి మరికొంత కాలం పడుతుంది. హైదరాబాద్ మెట్రో రైలు నిర్వహణ నుంచి ఎల్ అండ్ టీ తప్పుకోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలతో (పీపీపీ) జరిగే ప్రాజెక్టులన్నీ సఫలమవుతాయన్న గ్యారెంటీ లేదనేందుకు ఈ ప్రాజెక్టు ఒక నిదర్శనం. ప్రైవేట్ సంస్థలు తమకు నష్టం వస్తుందనుకుంటే కాడి పడేస్తాయని ఈ అనుభవం చెబుతుంది. చివరికి తెలంగాణ ప్రభుత్వం నెత్తి మీదకు రూ.15వేల కోట్ల భారం పడుతోంది. ఈ ప్రాజెక్టు కింద 300 ఎకరాల విలువైన భూములు ఉన్నాయని, వాటిని ప్రైవేటు వారికి కట్టబెట్టడానికి ప్రభుత్వం ప్లాన్ చేసిందని బీఆర్ఎస్ ఆరోపిప్తోంది. ఆ భూముల అమ్మకం ద్వారా 15వేల కోట్లను సమీకరించాలని ప్రభుత్వం యోచిస్తోందా? లేక ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టిందా అన్నది తెలియదు.మెట్రో రైల్ రెండో దశ ప్రాజెక్టును ఏ రకంగా తీసుకువెళతారో తెలిస్తే ఎల్ అండ్ టీ నిర్వహణ బాధ్యతల నుంచి తప్పుకోవడం ఉపయోగమా? కాదా? అన్నది తేలుతుంది. చంద్రబాబుకు సంబంధించిన తెలుగుదేశం మీడియా రేవంత్కు సహకరిస్తోంది కాబట్టి సరిపోయింది కానీ, లేకుంటే ఈ పాటికి హైదరాబాద్ను విధ్వంసం చేశారని, ఎల్ అండ్ టీని తరిమేశారని విపరీతంగా ప్రచారం చేసేది. ఆర్థికంగా స్థోమతు ఉంటే ఫ్యూచర్ సిటీ నిర్మించవచ్చు. మెట్రో స్వయంగా నడపవచ్చు. కొత్తగా మెట్రో రైలును పొడిగించవచ్చు. ప్రాణహిత-చేవెళ్ల స్కీమ్ను వేల కోట్లతో చేపట్టవచ్చు. కాళేశ్వరం ప్రాజెక్టు గుదిబండ అని చెబుతున్న రేవంత్ ప్రభుత్వం దానిని పక్కనబెట్టి ప్రాణహిత స్కీమ్ను ఎలా తీసుకు వస్తుందన్నది ఆసక్తికరమే. అది అంత తేలిక కాకపోవచ్చు.ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం రుణ భారం మోయలేనంతగా రూ.6.72 లక్షల కోట్లకు చేరింది. ఈ ప్రభుత్వం వచ్చాక సుమారు లక్షన్నర కోట్ల అప్పు చేశారని లెక్కలు చెబుతున్నాయి. హైదరాబాద్ ఆదాయం, భూముల అమ్మకం, ఎక్సైజ్ ఆదాయం వంటి వాటి ద్వారా ప్రభుత్వం నడుస్తున్నప్పటికీ, అప్పులు సైతం తక్కువేమీ లేవు. ఈ ఆర్ధిక సంవత్సరంలో అనుమతించిన అప్పులలో ఇప్పటికే ప్రభుత్వం 85 శాతం తీసేసుకుంది. ప్రభుత్వానికి రూ.54009 కోట్ల అప్పునకు అవకాశం ఉంది. ఇందులో రూ.45900 కోట్ల రుణాలు తీసేసుకున్నారు. మిగిలిన ఆరు నెలలకు అప్పులు చేయాలనుకున్నా వచ్చేది 8109 కోట్లే.మరోవైపు కాంట్రాక్టర్ల బిల్లులు వేల కోట్లలో ఉన్నాయని అంటున్నారు. ఆ మధ్య సచివాలయంలో కూడా నిరసనకు దిగారు. ఆర్టీసీకి ఫ్రీ బస్ స్కీమ్ కింద రూ.మూడు వేల కోట్ల బకాయిపడ్డారట. ఇంకా పలు హామీలను నెరవేర్చవలసి ఉంది. ఈ నేపథ్యంలో ముందుగా ఆర్ధిక పరిస్థితి చక్కబరచుకోకుండా ఆశ లావు, పీక సన్నం అన్న చందంగా కొత్త, కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్లాలనుకుంటే అది ఆకాశానికి నిచ్చెనలు వేసినట్లు అవుతుందేమో! జాగ్రత్త సుమా!.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
న్యూయార్క్లో ఉన్న వాళ్లను ఫ్యూచర్ సిటీకి రప్పిస్తా: సీఎం రేవంత్
సాక్షి, రంగారెడ్డి: ఇంకెన్నాళ్లు టోక్యో, న్యూయార్క్ అంటూ గొప్పలు చెప్పుకుంటామని.. భావితరాలకూ అలాగే ఓ నగరం ఉండాలనే ఆలోచనతో భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. ఆదివారం కందుకూరు మండలం మీర్ఖాన్ పేటలో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ భవనానికి శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన ప్రసంగించారు. ఫ్యూచర్ సిటీని అడ్డుకునేందుకు చాలామంది కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారు. చేయకూడని రాద్ధాంతాలు చేస్తున్నారు. ఇక్కడ రేవంత్కు భూములు ఉన్నాయని, అందుకే నగరాన్ని నిర్మిస్తున్నారని ప్రచారం చేస్తున్నారు. భూములుంటే దాచితే దాగేది కాదు. రికార్డుల్లో ఉంటాయి. అందరికీ తెలిసిపోతుంది. కుతుబ్షాహీలు నగరాన్ని నిర్మిస్తే.. వైఎస్ రాజశేఖర్రెడ్డి లాంటి నాయకులు ఆలోచన చేశారు. అలాంటి వాళ్లు మాకెందుకులే అనుకుని ఉంటే ఇవాళ ఓఆర్ఆర్, శంషాబాద్లు ఏవీ వచ్చేవి కావు. గత అనుభవాలు పునాది కావాలి. భూముల విలువ నాకు తెలుసు. నేను ఎవరికీ అన్యాయం చేయను. చిన్న చిన్న సమస్యలుంటే పరిష్కరించుకుందాం. ఫ్యూచర్ సిటీకి స్థానికులు సహకరించాలి. ఇంకెన్నాళ్లు న్యూయార్క్, టోక్యో నగరాలంటూ మాట్లాడుకుందాం. ఎందుకు మనమే ఫ్యూచర్ సిటీ నిర్మించుకోవద్దు. నాకు పదేళ్లు అవకాశం ఇవ్వండి. న్యూయార్క్లో ఉన్నవాళ్లు కూడా ఫ్యూచర్ సిటీకి వచ్చేలా చేస్తాం. బుల్లెట్ రైలు వచ్చేలా కేంద్రాన్ని ఒప్పించాం. ఫ్యూచర్ సిటీ మన కోసం కాదు.. భవిష్యత్తు తరాల కోసం అని సీఎం రేవంత్ అన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఫ్యూచర్ సిటీ నుంచి బందరుపోర్ట్ వరకు అమరావతి మీదుగా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి సీఎం రోడ్డు మంజూరు చేయించారు. ఫ్యూచర్ సిటీ నుంచి బెంగళూరు వరకు రోడ్డు నిర్మాణం చేయనున్నాం. ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి అభివృద్ధి పనులు ఫ్యూచర్ సిటీ లో జరగనున్నాయి. భవిష్యత్ లో ఫ్యూచర్ సిటీ ప్రపంచానికి తలమానికం కానుంది. రేవంత్ రెడ్డి సంకల్పం త్వరితగతిన పూర్తికావాలని కోరుకుంటున్నా అని అన్నారు. మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ఫ్యూచర్ సిటీ డెవలప్ మెంట్ అథారిటీ ప్రధాన కార్యాలయానికి శంకుస్థాపన చేసుకున్నాం. ప్రణాళిక బద్దమైన నగరంగా చండీఘడ్ నిర్మించారు. అదే తరహాలో ఫ్యూచర్ సిటీ నిర్మాణం చేస్తున్నాం. వాణిజ్యం, వ్యాపారం చేసే వారికి అనుకూలంగా అన్ని మౌలిక వసతులు కల్పిస్తున్నాం. స్పోర్ట్స్ క్యాపిటల్ చేసే విధంగా క్రీడా విశ్వవిద్యాలయం అందేలా చర్యలు చేపడతాం. జీరో పోల్యూటెడ్ ప్రాంతంగా అభివృద్ధి చేస్తాం. భారత్ ఫ్యూచర్ సిటీ గా రూపుదిద్దడానికి స్థానికులు భాగస్వాములు కావాలని కోరుతున్నా అని ప్రసంగించారు. ఇదీ చదవండి: ఫోర్త్ సిటీ కాదు.. ఉన్న సిటీని పట్టించుకోండి -
నాలుగో నగరి భవిష్యత్.. మూడో నగరిలో
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘ఫ్యూచర్ సిటీ’ భవిష్యత్ మూడడుగులు ముందుకు.. ఆరడుగులు వెనక్కి అన్నట్లు మారింది. 330 అడుగుల గ్రీన్ఫీల్డ్ రోడ్డు, మెట్రోరైలు, ఏఐ సిటీ, జపాన్, తైవాన్ కంపెనీలు అంటూ రోజుకో ప్రకటనతో సర్కారు ఊదరగొడుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ఇప్పటివరకు కేవలం స్కిల్ యూనివర్సిటీ మినహా మరే ప్రాజెక్టుకు ప్రతిపాదిత నాలుగో నగరిలో పునాది రాయి కూడా పడకపోవడం.. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేస్తూ రెండు నెలల క్రితం ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ సిబ్బందిని కూడా సమకూర్చుకోకపోవడం చూస్తే.. ఈ ప్రాజెక్టు ఎప్పుడు పట్టాలెక్కుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. కడ్తాల్, కందుకూరు, యాచారం, మంచాల, ఇబ్రహీంపట్నం, ఆమన్గల్, మహేశ్వరం మండలాల్లోని 56 గ్రామాలను ఎఫ్సీడీఏ పరిధిలోకి తెచ్చారు. అయితే.. ఈ గ్రామాల అభివృద్ధిని క్షేత్రస్థాయి నుంచి పర్యవేక్షించాల్సిన ఎఫ్సీడీఏ ఆఫీసు మాత్రం మూడో నగరమైన (సైబరాబాద్) నానక్రాంగూడలో ఏర్పాటు చేయడం గమనార్హం. సీఎం కలల ప్రాజెక్టు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలల ప్రాజెక్టు బాలారిష్టాలను ఎదుర్కొంటోంది. అధికారంలోకి రాగానే హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ తరహాలో ఫోర్త్ సిటీ అవసరమని రేవంత్ ప్రకటించారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ జాతీయ రహదారుల మధ్యలో ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించి ఏడాది గడుస్తున్నా ఆశించిన స్థాయిలో ఆ దిశగా అడుగులు ముందుకు పడటం లేదు. పూర్తి స్థాయి సిబ్బంది లేకపోవడంతో అభివృద్ధి పనుల్లో పురోగతి కనిపించడం లేదు. రావిర్యాల ఓఆర్ఆర్ ఎగ్జిట్ నుంచి ఆకుతోట పల్లి వరకు 330 అడుగుల రతన్టాటా గ్రీన్ఫీల్డ్ రహదారికి భూ సేకరణ పనులు చురుగ్గా సాగగా.. పరిహారం ఇవ్వకుండానే నిర్మాణ పనులకు టెండర్లు పిలవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ నిర్వాసితులు హైకోర్టును ఆశ్రయించడంతో బ్రేక్ పడింది. దీంతో ఇప్పటివరకు ఈ ప్రాంతంలో కేవలం స్కిల్ వర్సిటీ పనులు మాత్రమే కాస్తో కూస్తో సాగుతున్నాయని చెప్పవచ్చు. సిబ్బంది కొరత.. 765.28 చదరపు కి.మీల విస్తీర్ణంలో ఫోర్త్ సిటీని అభివృద్ధి చేయాలన్నది రేవంత్ సర్కార్ లక్ష్యం. ఎఫ్సీడీఏ ప్రధాన కార్యాలయం నానక్రాంగూడలోని ఉంది. వివిధ విభాగాల నుంచి డిప్యుటేషన్పై 90 పోస్టులకు గత మార్చిలో మంత్రివర్గం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. వీటిలో 34 రెగ్యులర్ పోస్టులు కాగా.. మిగిలిన 56 పోస్టులను ఔట్ సోర్సింగ్/కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తారు. కానీ.. ఇప్పటివరకు ఎఫ్సీడీఏ కమిషనర్ శశాంక మినహా పూర్తిస్థాయి సిబ్బంది నియామకం జరగలేదు. సిబ్బంది కొరతతో ఫ్యూచర్ సిటీ అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయి. హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ ఇతర విభాగాల నుంచి డెప్యుటేషన్పై ఎఫ్సీడీఏ ప్లానింగ్ విభాగంలో పనిచేసేందుకు అధికారులు నిరాసక్తి చూపిస్తున్నారు. దీంతో ఎఫ్సీడీఏ మాస్టర్ ప్లాన్ రూపకల్పనలో ఎలాంటి పురోగతి లేదు.మాస్టర్ ప్లాన్ హెచ్ఎండీఏదే.. ఫోర్త్సిటీలో ఐటీ, పారిశ్రామిక, ఆతిథ్య, పర్యాటక, క్రీడారంగాలకు పెద్దపీట వేయాలని నిర్ణయించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు దేశ, విదేశీ సంస్థలు, పెట్టుబడులు తీసుకురావాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి ప్రతిబంధకాలు రాకుండా, అభివృద్ధి పనులు ప్రణాళికబద్ధంగా చకచకా సాగేలా ప్రత్యేక మాస్టర్ ప్లాన్ రూపొందిచాలని నిర్ణయించారు. ఈ బాధ్యతలను హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) అప్పగించినట్లు ఓ అధికారి తెలిపారు.చదవండి: హైదరాబాద్లో మరో ఉప ఎన్నిక! గతంలో సైబరాబాద్ డెవలప్మెంట్ అథారిటీ (సీడీఏ), ఎయిర్పోర్ట్ అథారిటీ ప్లాన్ (ఏఏపీ) మాస్టర్ ప్లాన్లను హెచ్ఎండీఏనే అభివృద్ధి చేసిందని ఆయన గుర్తు చేశారు. అలాగే ఎఫ్సీడీఏ (FCDA) పరిధిలోని గ్రామాలు గతంలో హెచ్ఎండీఏ (HMDA) పరిధిలోనే ఉన్నాయని, అందుకే ఎఫ్సీడీఏ మాస్టర్ ప్లాన్ను హెచ్ఎండీఏ అభివృద్ధి చేస్తోందని ఆయన వివరించారు. -
ఇక ఫ్యూచర్ సిటీలో లేఔట్లు.. ఎఫ్సీడీఏ పర్మిషన్లు
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ఫోర్త్ సిటీ నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ (ఎఫ్సీడీఏ) శరవేగంగా అడుగులు వేస్తోంది. జూన్ నుంచి ఎఫ్సీడీఏ కార్యకలాపాలు ప్రారంభించనుంది. ఫ్యూచర్ సిటీలో ఓపెన్ ప్లాట్ లేఔట్లు, నివాస, వాణిజ్య భవన నిర్మాణాల అనుమతులతో పాటు మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులకు ఎఫ్సీడీఏ (FCDA) అనుమతులు మంజూరు చేయనుంది. వీటితో పాటు పరిశ్రమలు, ఐటీ మరియు ఆరోగ్య సంరక్షణ ప్రాజెక్ట్లకు భూ కేటాయింపుల బాధ్యత కూడా ఎఫ్సీడీఏనే నిర్వహించనుంది.హెచ్ఎండీఏ నుంచి ఎఫ్సీడీఏకు.. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ తరహాలో తెలంగాణలో ఫోర్త్ సిటీ (fourth city) అభివృద్ధి అవసరమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శివార్లలోని ఆమన్గల్, ఇబ్రహీంపట్నం, కడ్తాల్, కందుకూరు, మహేశ్వరం, యాచారం, మంచాల్ 7 మండలాలోని 56 రెవెన్యూ గ్రామాలు ఎఫ్సీడీఏ పరిధిలోకి తీసుకొచ్చారు. కొత్త అనుమతులు, ఆమోదాలను నిలిపివేయడం, మార్గదర్శకాలపై స్పష్టత లేకపోవడంతో రియల్ ఎస్టేట్ డెవలపర్లు, భూ యజమానులలో అనిశ్చితి ఏర్పడింది. దీంతో అథారిటీ ఏర్పాటు వేగంగా జరిగినా.. రెండు నెలల పాటు కార్యకలాపాల నిర్వహణ జరగలేదు. దీంతో ఆయా ప్రాంతాలలో స్థిరాస్తి ప్రాజెక్ట్లు, అభివృద్ధి పనుల్లో జాప్యం ఏర్పడింది.మార్చి వరకూ ఫ్యూచర్ సిటీ ప్రాంతాలలో భవనాలు, లేఔట్ల అనుమతులను హైదరాబాద్ మెట్రోపాలిటన్ అభివృద్ధి అథారిటీ (హెచ్ఎండీఏ), స్థానిక సంస్థలు మంజూరు చేశాయి. తాజాగా ప్రభుత్వం అధికారాన్ని కార్యాచరణలోకి తీసుకురావడంపై దృష్టిసారించింది. ఇందులో భాగంగా ఎఫ్సీడీఏ పరిధిలో లేఔట్లు, నిర్మాణ అనుమతుల అధికారాలను హెచ్ఎండీఏ (HDMA) నుంచి ఎఫ్సీడీఏ కమిషనర్కు బదిలీ చేశారు. దీంతో శ్రీశైలం హైవే వెంబడి ఉన్న ఈ ఫ్యూచర్ సిటీలో పట్టణ మరియు పారిశ్రామిక విస్తరణతో పాటు ప్రణాళికబద్ధమైన అభివృద్ధికి వీలు కలగనుంది.ఫ్యూచర్ సిటీ పేరు మార్పు? యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా పోలీసు స్కూల్, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీల పేర్ల తరహాలోనే ఫ్యూచర్ సిటీకి కూడా జాతీయ స్థాయిలో గౌరవం పొందేలా ఫ్యూచర్ సిటీని ‘భారత్ ఫ్యూచర్ సిటీ’గా పేరు మార్చాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) నిర్ణయించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే పలు కార్యక్రమాలలో సీఎం తన ప్రసంగాలలో దీన్ని భారత్ ఫ్యూచర్ సిటీ (Bharat Future City)గా ప్రకటించారు. దీంతో జాతీయ స్థాయి పెట్టుబడుల గమ్యస్థానంగా మారుతుందని అధికార వర్గాలు తెలిపాయి. ఫ్యూచర్ సిటీ స్వరూపమిదీ విస్తీర్ణం: 765.28 చ.మీ ఎకరాలు: 2,01,318 జనాభా: 1,31,733చదవండి: హైదరాబాద్ మెట్రో రెండో దశ.. స్టేషన్లు ఇవే


