breaking news
Green park colony
-
నక్సల్స్ పేరుతో బెదిరింపులు: ఒకరి అరెస్ట్
హైదరాబాద్: నక్సల్స్ పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సరూర్నగర్ గ్రీన్పార్కు కాలనీకి నివాసి రత్లావత్ శేఖర్(39) తేలిగ్గా డబ్బు సంపాదించేందుకు పథకం పన్నాడు. ఇందులో భాగంగా గత కొంతకాలంగా తాను జనశక్తి గ్రూప్ నేత జగన్నంటూ పీఎన్ఆర్ ఫార్మసీ కళాశాల సెక్రటరీగా పనిచేస్తున్న నరేందర్ రెడ్డిని బెదిరించాడు. వెంటనే రూ.15 లక్షలు ఇవ్వాలని, లేకుంటే చంపేస్తానని నగరంలోని వేర్వేరు చోట్ల నుంచి కాయిన్ బాక్స్ల ద్వారా ఫోన్ చేస్తున్నాడు. దీనిపై బాధితుడు చేసిన ఫిర్యాదు మేరకు ఎల్బీనగర్ ఎస్వోటీ పోలీసులు రంగంలోకి దిగారు. కాయిన్ బాక్స్ల వద్ద కాపు కాసి శేఖర్ను మంగళవారం అదుపులోకి తీసుకుని మీర్పేట్ పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. -
అనుమానంతో కానిస్టేబుల్ను చితకబాది...
సైదాబాద్: ఓ ఆటో డైవర్ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడంతో ఆగ్రహించిన స్థానికులు ఓ కానిస్టేబుల్ను చితకబాదారు. సైదాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలోని గ్రీన్పార్కు కాలనీలో బుధవారం జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... వడ్త్యా సిరినాయక్(40) చంపాపేట సమీపంలో సింగరేణి కాలనీలో నివాసం ఉంటూ ఆటో నడుపుతున్నాడు. కాగా, ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్కు చెందిన వినోద్కుమార్ సిర్పూర్-టి పోలీస్ స్టేసన్లో కానిస్ట్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు. మంగళవారం రాత్రి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో మద్యం మత్తులో ఉన్న వినోద్కుమార్ బోరబండ వెళ్లడానికి సిరినాయక్ ఆటో ఎక్కాడు. ఆ తర్వాత వినోద్ కుమార్ నిద్రలోకి జారుకోవడంతో సిరినాయక్ సింగరేణి కాలనీలోకి తన నివాసానికి తీసుకెళ్లాడు. ఏమైందో గానీ, బుధవారం ఉదయం చూసే సరికి సిరినాయక్ ఆటోలోని డ్రైవింగ్ సీట్లోనే మృతి చెంది ఉన్నాడు. వెనుక సీట్లో వినోద్ నిద్రపోతున్నాడు. ఇది చూసిన స్థానికులు కానిస్టేబుల్ను పట్టుకుని చేతులు, కాళ్లు కట్టేసి తీవ్రంగా కొట్టి పోలీసులకు అప్పగించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అనుమానస్పద మృతి కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.