గద్వాల బంద్ సంపూర్ణం
గద్వాల : జోగుళాంబ జిల్లా చేయాలంటూ జేఏసీ చేపట్టిన 72గంటల నిరవధిక బంద్లో భాగంగా మొదటిరోజు సంపూర్ణంగా ముగిసింది. శుక్రవారం తెల్లవారుజామున నుంచే జేఏసీ నాయకులు బైక్లపై తిరుగుతూ బంద్ను పాటించారు. గద్వాల జిల్లా కాంక్షిస్తూ విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, దుకాణదారులు, పెట్రోలు బంకులు, సినిమా థియేటర్లు స్వచ్ఛందంగా మూసివేశారు. ఆర్టీసీ బస్సుల రాకపోకలు సైతం నిలిచిపోయాయి. ఉదయం పదిగంటల వరకు డిపోకే పరిమితమయ్యాయి. పలుచోట్ల ర్యాలీలు నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు.
పోలీసులతో వాగ్వాదం
ఈ సందర్భంగా జేఏసీ నాయకులు, పోలీసులకు మధ్య కొద్దిసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సులను పోలీసుల పహారాలో డిపో నుంచి బయటకు రప్పించారు. విషయం తెలుసుకున్న జేఏసీ నాయకులు అభ్యంతరం తెలిపారు. స్థానిక కష్ణవేణిచౌరస్తాలో జేఏసీ నాయకులు ఆర్టీసీ బస్సులకు అడ్డుతగిలేందుకు యత్నించారు. ఆందోళనకారులను పోలీసులు బలవంతంగా తమ వాహనాల్లో ఎక్కించి స్టేషన్కు తరలించారు. ఈ క్రమంలోనే తోపులాట జరిగింది. పరిస్థితి విషమించడంతో డీఎస్పీ బాలకోటి రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం
గద్వాల జిల్లా సాధించే వరకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని జేఏసీ నాయకులు నాగర్దొడ్డి వెంకట్రాములు, మధుసూదన్బాబు అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఆంక్షలు, అరెస్టులతో తమ ఉద్యమాన్ని ఆపలేరన్నారు. బంద్ సందర్భంగా పోలీసు బలగాలను మోహరించి విచక్షణారహితంగా ఉద్యమకారులపై లాఠీలు ఝులిపించి అక్రమంగా అరెస్టులు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు వీరభద్రప్ప, వెంకట్రాజారెడ్డి, అంపయ్య, గడ్డం కష్ణారెడ్డి, శంకర్, రాజశేఖర్రెడ్డి, పరమేశ్వర్రెడ్డి, శ్రీధర్రెడ్డి, బీజాపూర్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.