gadag district
-
దొరికినవి.. దేవతల నగలు
దొడ్డబళ్లాపురం(బెంగళూరు): ఈ ఏడాది జనవరి 10వ తేదీన కర్ణాటకలోని గదగ్ జిల్లా లక్కుండిలో లభించిన నిధి గురించి కొత్త విషయాలు వెలుగుచూశాయి. ఆ చారిత్రక గ్రామంలో ఓ మహిళ ఇంటి పునాది తవ్వతుండగా పురాతనమైన రాగి చెంబు, అందులో అపురూపమైన బంగారు నగలు లభించడం తెలిసిందే. వాటిని ప్రభుత్వానికి అప్పగించారు. పురావస్తుశాఖ అధికారులు ఆ బంగారు ఆభరణాలు సుమారు 600 సంవత్సరాల క్రితం నాటివని, కళ్యాణ చాళుక్య రాజులు, విజయనగర అరస రాజుల కాలం నాటివని నిర్ధారించారు. ఇవి మనుషులు ధరించేవి కావని, ఆలయాలలో దేవతలకు లేదా ఉత్సవ మూర్తులకు అలంకరించే ఆభరణాలని తెలిపారు. వీటి విలువ రూ.8 కోట్లని ప్రకటించారు. చదవండి: అరుదైన ఈ రైల్వేస్టేషన్ గురించి తెలుసా? -
ఐదు లక్షల లంచం.. కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే అరెస్ట్
హుబ్లీ: కర్ణాటకలో సంచలన ఘటన చోటుచేసుకుంది. అవినీతి, లంచం కేసుల్లో దాడులు నిర్వహించే లోకాయుక్తకు ప్రతిపక్ష బీజేపీ శాసనసభ్యుడు చిక్కారు. లంచం తీసుకుంటూ గదగ్ జిల్లా సిరహట్టి బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ చంద్రు లామాణి పట్టుబడ్డారు. శనివారం మధ్యాహ్నం గదగ్ జిల్లా లక్ష్మేశ్వర పట్టణంలోని ఎమ్మెల్యేకు చెందిన బాలాజీ ఆస్పత్రిపై లోకయుక్త అధికారులు దాడి చేశారు.ఈ సందర్భంగా కాంట్రాక్టర్ నుంచి రూ.5 లక్షలు డబ్బులు తీసుకుంటున్న ఎమ్మెల్యే చంద్రుని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఎమ్మెల్యేతోపాటు ఆయన ఇద్దరు పీఏలు మంజునాథ వాల్మీకి, గురు నాయక్ను కూడా అదుపులోకి తీసుకున్నారు. చిన్ననీటి పారుదల పనులకు సంబంధించి కాంట్రాక్టర్ విజయ్ పూజార్ని ఎమ్మెల్యే రూ.11 లక్షలు డిమాండ్ చేశారని, అందులో రూ.5 లక్షలు తీసుకుంటుండగా దాడి చేసినట్లు లోకాయుక్త అధికారులు తెలిపారు. ఈ సమయంలో ఓ పీఏ రూ.50 వేల నగదున్న కవరును బయటకు విసిరేయగా దానిని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. కాగా, ధార్వాడ లోకాయుక్త ఎస్పీ సిద్ధలింగప్ప నేతృత్వంలో అధికారులు, సిబ్బంది, దాడిలో పాల్గొన్నారు. నగదు డిమాండ్ చేస్తూ విజయ్కు చేసిన ఫోన్ కాల్ ఆడియో ఆధారంగా ఎమ్మెల్యేపై నిఘా ఉంచినట్లు సమాచారం. అరెస్టు గురించి విధానసభ స్పీకర్ యూటీ ఖాదర్కు సమాచారం అందించారు. ఈ విషయంపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. కాగా, 2023లో కూడా మరో బీజేపీ ఎమ్మెల్యే మాదాల్ విరూపాక్షప్ప కుమారుడు రూ. 40 లక్షల లంచం తీసుకుంటూ దొరికిన విషయం తెలిసిందే. -
గదగ్లో లవ్ జిహాద్
రాయచూరు రూరల్(కర్ణాటక): గదగ్లో విడ్డూరమైన లవ్ జిహాద్ కేసులో కట్టుకున్న భర్తపైనే భార్య పోక్సో కేసు పెట్టించిన ఉదంతం వెలుగు చూసింది. వివరాలు.. గదగ్లోని బెటగేరి ప్రాంతంలో విశాల్ కుమార్ అనే వ్యక్తి మైనార్టీ సముదాయానికి చెందిన యువతి మూడేళ్ల నుంచి ప్రేమించుకున్నారు. వీరిద్దరూ గత ఏడాది నవంబర్లో వివాహం చేసుకున్నారు. అయితే వివాహ నిఖా సమయంలో తనను మతమార్పిడి చేయడమే కాకుండా మసీదులో విరాజ్ సాబ్గా తన పేరును మార్చారని, తనకు న్యాయం చేయాలని కోరుతూ తాజాగా వారం రోజుల క్రితం పోలీసు స్టేషన్ను ఆశ్రయించాడు. దీనిని గమనించిన యువతి మైనార్టీ తీరని 17 ఏళ్ల అమ్మాయిని వివాహం చేసుకొన్నట్లు భర్తపై ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
ప్రేయసికి... నిప్పంటించాడు
సాక్షి, గదగ్(బెంగళూరు): ప్రేమించానన్నాడు, ఆమె చుట్టూ తిరిగాడు, తియ్యని మాటలతో లోబరుచుకున్నాడు. గర్భం దాల్చిన ఆమెను పెళ్లి చేసుకోకుండా కిరోసిన్ పోసి నిప్పంటించాడు ఓ మృగాడు. ఈ హృదయవిదారక ఘటన గదగ్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలు.... గదగ్ జిల్లాలోని శింగటాలూర గ్రామానికి చెందిన ప్రకాష్ ముండవాడ, అదే గ్రామానికి చెందిన బాధిత యువతితో ఐదేళ్లుగా ప్రేమాయణాన్ని సాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే బాధిత యువతి గర్భం దాల్చింది. ఈ విషయాన్ని ప్రకాష్కు చెప్పి తనను పెళ్లి చేసుకోవాలని కోరింది. దీంతో ప్రకాష్ ఆమెను దూరం పెడుతూ వచ్చాడు. తనను వివాహం చేసుకోవాల్సిందేనని బాధిత యువతి తన తల్లితో కలిసి శుక్రవారం సాయంత్రం ప్రకాష్ ఇంటి ముందు బైఠాయించింది. ఈక్రమంలో ప్రకాష్, అతని కుటుంబ సభ్యులు బాధిత యువతి ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించి పరారయ్యారు. స్థానికులు అప్రమత్తమై మంటలను ఆర్పి బాధితురాలిని గదగ్ జిల్లాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న స్థానిక పోలీసులు పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు. -
మృగాడికి సంకెళ్లు
14 మందిపై అత్యాచారం లక్షలాది రూపాయల ఆభరణాలు స్వాధీనం గదగ్ :గదగ్, హావేరి, ధారవాడ జిల్లాల్లో పలు చోట్ల 14 మంది మహిళలపై అత్యాచారాలకు పాల్పడిన వికృత కాముకుడు హావేరి జిల్లా సవణూరు తాలూకా కలివాళ గ్రామానికి చెందిన పకీరప్ప కాడణ్ణను అరెస్ట్ చేసి కటకటాల వెనక్కు నెట్టినట్లు గదగ్ జిల్లా ఎస్పీ సంతోష్బాబు తెలిపారు. గురువారం ఆయన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. నిందితుడు మహిళల వంటిపై ఉన్న బంగారు, వెండి ఆభరణాలతో పాటు మొబైల్ ఫోన్లను చోరీ చేశాడన్నారు. అతనితో పాటు మరో ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి వారి నుంచి లక్షలాది రూపాయల విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలతో పాటు 31 మొబైల్ ఫోన్లను స్వాధీనపరచుకున్నట్లు తెలిపారు. గదగ్ సమీపంలోని బింకదకట్టి వద్ద గత డిసెంబర్ నెలలో ఓ మహిళను బైక్పై తీసుకెళ్లిన పకీరప్ప ఆమెపై అత్యాచారానికి పాల్పడి, ఆమె ఆభరణాలను దోచుకొని పరారయ్యాడు. ఈ ఘటనపై గదగ్ గ్రామీణ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసును సవాల్గా స్వీకరించిన రూరల్ పోలీసులు సమగ్ర దర్యాప్తు జరిపి ఎట్టకేలకు నిందితుడిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఇతనికి సహకరించిన కలివాళ గ్రామానికి చెందిన బసవరాజ గదిగెన్నవర్, గదగ్ జిల్లా ముండరగి తాలూకా రామేనహళ్లికి చెందిన ఆశా కార్యకర్త మహాదేవి బేవినమరద్లను కూడా అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నిందితుల వద్ద నుంచి 2 బైక్లు, రూ.19 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు, రూ.21 వేలు విలువ చేసే వెండి ఆభరణాలు, 31 మొబైల్ ఫోన్లు స్వాధీనపరచుకున్నట్లు తెలిపారు. విలేకరుల సమావేశంలో డీఎస్పీ వీటీ విజయ్కుమార్, రూరల్ సీఐ సోమశేఖర్ జుట్టల్, ఎస్ఐ ఎల్కే జూలకట్టి తదితరులు పాల్గొన్నారు.


