Former judges
-
హైకోర్టు జడ్జిజలందరికీ సమాన పెన్షన్
న్యూఢిల్లీ: మాజీ న్యాయమూర్తుల పెన్షన్ తదితరాల విషయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ‘‘నియామక తేదీ, పద్ధతి, పదవీకాలం తదితరాలతో నిమిత్తం లేకుండా రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తులందరికీ సమాన పెన్షన్ అందజేయాల్సిందే. ఎందుకంటే హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన రోజునుంచే వారు రాజ్యాంగపరమైన శ్రేణిలోకి వస్తారు. కనుక అలాంటి రాజ్యాంగపరమైన పదవుల విషయంలో వన్ ర్యాంక్, వన్ పెన్షన్ విధానమే పాటించాలి’’ అని స్పష్టం చేసింది. సీజేఐ జస్టిస్ బి.ఆర్.గవాయ్, న్యాయమూర్తులు జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసీ, జస్టిస్ కె.వినోద్చంద్రన్ ధర్మాసనం సోమవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. న్యాయవ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తిని, గౌరవాన్ని నిలబెట్టేందుకు న్యాయమూర్తుల వేతనాల్లాగే వారి పదవీ విమరణ ప్రయోజనాలు కూడా ఒకేరకంగా ఉండటం తప్పనిసరి అని సీజేఐ గవాయ్ అభిప్రాయపడ్డారు. ‘‘హైకోర్టు న్యాయమూర్తుల జీతభత్యాలు, పెన్షన్ తదితరాల విషయంలో వారి నియామక తేదీ, బాధ్యతల తరహా (శాశ్వత, అదనపు న్యాయమూర్తులు), నేపథ్యం (బార్, జిల్లా స్థాయి న్యాయవ్యవస్థ) వంటివి ప్రాతిపదిక అసలే కారాదు. అది వివక్షాపూరితమే గాక ఆర్టికల్ 14కు విరుద్ధం కూడా’’ అని పేర్కొంది. ఈ మేరకు 63 పేజీల తీర్పు వెలువరించింది. ‘‘జిల్లా న్యాయా« దికారులుగా, బార్ సభ్యులుగా వారి సేవలను, అనుభవాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు, జిల్లా న్యాయాధికారిగా రిటైరయ్యాక హైకోర్టు న్యాయ మూర్తిగా బాధ్యతలు స్వీకరించడానికి మధ్యలో ఉండే అంతరం వంటివి కూడా తక్కువ పెన్షన్కు ప్రాతిపదిక కావడానికి వీల్లేదు. నూతన పెన్షన్ పథకం (ఎన్పీఎస్) అమల్లోకి వచ్చాక బాధ్యతలు చేపట్టినా సరే, హైకోర్టు న్యాయమూర్తుల (వేతనాలు, సర్వీసు నిబంధనల) చట్టం, 1954 ప్రకారం ప్రావిడెంట్ ఫండ్ తదితరాలకు కూడా వారు పూర్తిగా అర్హులు’’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. రిటైర్డ్ హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తులకు రూ.15 లక్షలు, న్యాయమూర్తులకు రూ.13.5 లక్షల చొప్పున మౌలిక వార్షిక పెన్షన్ అందించాలని పేర్కొంది. రిటైర్డ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తుల మరణానంతరం సంబంధీకులకు కుటుంబ పెన్షన్, గ్రాట్యుటీ తదితరాలను నిరాకరించడం నిబంధనలకు విరుద్ధమని పేర్కొంది. అలాగే జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ న్యాయమూర్తులకు, జిల్లా న్యాయమూర్తులకు కూడా పదవీ విరమణ ప్రయోజనాలు సమానంగా ఉండాలని ఆదేశించింది. -
న్యాయమూర్తుల సంతానానికి హైకోర్టు జడ్జిలుగా నో చాన్స్!
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు, హైకోర్టు ప్రస్తుత, మాజీ న్యాయమూర్తుల సంతానం, అతి సమీప బంధువులను హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించరాదన్న ప్రతిపాదనను సుప్రీంకోర్టు కొలీజియం చురుగ్గా పరిశీలిస్తున్నట్టు తెలిసింది. అలాంటి వారి పేర్లను సిఫార్సు చేయరాదంటూ హైకోర్టు కొలీజియాలకు సూచిస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. తద్వారా అర్హులైన కొందరికి అన్యాయం జరిగినా బంధుప్రీతి వంటి ఆరోపణలకు తావుండదని, ఎంపిక ప్రక్రియ మరింత పారదర్శకంగా మారుతుందని కొలీజియం సభ్యుడైన సీనియర్ న్యాయమూర్తి అభిప్రాయపడ్డట్టు సదరు వర్గాలు వెల్లడించాయి. తొలి తరం న్యాయవాదులతో పాటు విభిన్న సామాజికవర్గాల వారికి హైకోర్టు న్యాయమూర్తులుగా అవకాశం లభిస్తుందన్నది దీని ఉద్దేశమని వివరించాయి. మళ్లీ తెరపైకి ‘సంప్రదింపులు’ హైకోర్టు న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి మరో ఇటీవల కీలక పరిణామం కూడా చోటుచేసుకుంది. హైకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన అభ్యర్థులతో సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా సారథ్యంలోని ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు కొలీజియం డిసెంబర్ 22న వ్యక్తిగతంగా భేటీ అయింది. తద్వారా గత సంప్రదాయాన్ని పునరుద్ధరించింది. అనంతరం రాజస్తాన్, ఉత్తరాఖండ్, బాంబే, అలహాబాద్ హైకోర్టులకు న్యాయ మూర్తులుగా ఆరుగురు పేర్లను కేంద్రానికి సిఫార్సు చేసింది. దేశంలో మెజారిటీ ప్రజల అభిప్రాయమే సాగాలంటూ అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శేఖర్ కుమార్ యాదవ్ ఇటీవల చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఈ ‘సంప్రదింపు’ల నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటిదాకా హైకోర్టు న్యాయమూర్తుల నియామకానికి అభ్యర్థుల బయోడేటా, వారి అర్హత, సామర్థ్యాలపై కొలీజియం అంచనా, నిఘా సమాచారం తదితరాలను ప్రాతిపదికగా తీసుకుంటూ వస్తుండటం తెలిసిందే. -
బాబు తప్పించుకోలేరు
♦ ‘ఓటుకు నోటు’ వ్యవహారంలో ఆయనే సూత్రధారి అనేందుకు ఆధారాలున్నాయి ♦ మాజీ న్యాయమూర్తులు,ప్రముఖ న్యాయవాదుల అభిప్రాయం ♦ ఏసీబీ నమోదు చేసిన అభియోగాలు బాబుకు వర్తిస్తాయి ♦ చంద్రబాబును విచారించేందుకు గవర్నర్ అనుమతి అవసరం లేదు ♦ ఒక వ్యక్తి ఫోన్కు వచ్చిన కాల్ను రికార్డు చేయడం ట్యాపింగ్ కాదు సాక్షి, హైదరాబాద్: నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు లంచం ఇస్తూ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్రెడ్డి పట్టుబడిన కేసులో ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు చట్టం నుంచి తప్పించుకోవడం సాధ్యంకాదని న్యాయనిపుణులు పేర్కొం టున్నారు. చంద్రబాబును నిందితుడిగా చేర్చి, విచారించేందుకు అవసరమైన అన్ని సాక్ష్యాధారాలు ఏసీబీ వద్ద ఉన్నట్టేనని వారు తేల్చిచెబుతున్నారు. ఈ కేసులో ఏసీబీ నమోదు చేసిన అభియోగాలన్నీ బాబుకు వర్తిస్తాయని వారు అంటున్నారు. ఈ కేసుకు సంబంధించి మాజీ న్యాయమూర్తులు, ప్రముఖ న్యాయవాదులతో ‘సాక్షి’ చర్చించింది. ఈ సందర్భంగా వారు వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఇలా ఉన్నాయి. సమష్టి ఉద్దేశం(కామన్ ఇంటెన్షన్) ఓటుకు నోటు వ్యవహారం వెనుక ఎమ్మెల్యేల ఓట్లను కొనుగోలు చేయాలనే ఉద్దేశం (కామన్ ఇంటెన్షన్) చంద్రబాబుతో పాటు రేవంత్కు ఉంది. అందులో భాగంగానే ఎమ్మెల్యేలను రేవంత్ సంప్రదించినట్లు స్పష్టమవుతోంది. బాబు తన ఫోన్ సంభాషణలోనూ ఈ విషయాన్ని అంగీకరించారు. స్టీఫెన్సన్తో మాట్లాడుతూ.. ‘మనవాళ్లు అంతా వివరించారు. మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. నేను అండగా ఉంటా. మా వాళ్లు చెప్పినవన్నీ అమలు చేస్తాం. మనం కలసి పనిచేద్దాం..’ అని బాబు అంగీకరించారు. దీంతో రేవంత్తోపాటు బాబుకూ కామన్ ఇంటెన్షన్ ఉందని స్పష్టమవుతోంది. సెక్షన్ 120(బి): నేరపూరిత కుట్ర నేరం చేయాలని ప్రోత్సహించేందుకు ప్రయత్నించడం అవినీ తి నిరోధక చట్టంలోని సెక్షన్ 12, ఐపీసీ 120(బి) కింద నేరం. ఓటుకు నోటు వ్యవహారంలో టీడీపీ అధినేతగా బాబే నేరపూరిత కుట్రకు రూపకల్పన చేశారు. కుట్రలో ఆయన భాగస్వామిగా ఉన్నారనేందుకు ఆధారాలున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్ల కోసం అడ్డదారి తొక్కారు. అందులో భాగంగా ఓటు కోసం నామినేటెడ్ ఎమ్మెల్యేను రేవంత్ ప్రలోభపెట్టారు. ఈ డీల్ను బాబు సంభాషణ కూడా స్పష్టంగా వెల్లడిస్తోంది. డబ్బును సమకూర్చడంతోపాటు ఓటు తర్వాత మిగతా డబ్బును అందజేస్తామని ఆయన హామీ ఇచ్చారు. కుట్రకు ఆయనే సూత్రధారి అనేందుకు ఈ ఆధారాలు చాలు. ఆ స్టింగ్ ఆపరేషన్ చట్టబద్ధమే రేవంత్ కేసులో ఏసీబీ అధికారులు స్టింగ్ ఆపరేషన్ చేశారు కాబట్టి అవి సాక్ష్యాలుగా కోర్టు ముందు చెల్లవనే వాదనలో ఎంత మాత్రం నిజం లేదు. దర్యాప్తు సంస్థలు ఆధారాలను సేకరించేందుకు స్టింగ్ ఆపరేషన్ నిర్వహించవచ్చని ఢిల్లీ హైకోర్టు స్పష్టమైన తీర్పులు ఇచ్చింది. దర్యాప్తు సంస్థలు ఆధారాలను సేకరించేందుకు స్టింగ్ ఆపరేషన్ నిర్వహించవచ్చని సీనియర్ న్యాయవాది ఆర్కే ఆనంద్కు సంబంధించిన కేసులో (2009(8)ఎస్సీసీ 106) అత్యున్నత న్యాయస్థానం కూడా స్పష్టం చేసింది. ఓటుకు నోటు కేసులో గత నెల 28న ప్రాథమిక సమాచార నివేదిక (ఎఫ్ఐఆర్) నమోదైంది. తర్వాత నిందితుల నేరపూరిత కుట్రను ఛేదించేందుకు ఏసీబీ స్టింగ్ ఆపరేషన్ను నిర్వహించి, కీలక ఆధారాలను సేకరించింది. నిందితుల మీద అభియోగాలను నిరూపించేందుకు ఈ వీడియోలు కీలక సాక్ష్యాలు. భారత సాక్ష్యాధారాల చట్టం, ఐటీ చట్టం ప్రకారం నిందితులపై అభియోగాలను నిరూపించేందుకు తిరుగులేని సాక్ష్యాలివి. అనుమతి అవసరమా? చంద్రబాబును విచారించేందుకు గవర్నర్ అనుమతి అవసరమే లేదు. అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 19 కింద కోర్టు అభియోగాలను విచారణకు స్వీకరించేందుకు గవర్నర్ అనుమతి అవసరం. అయితే ‘ఓటుకు నోటు’ వ్యవహారంలో ఏసీబీ పేర్కొన్న సెక్షన్ 12 కింద నిందితులపై అభియోగాలను మోపేందుకు ఎటువంటి ముందస్తు అనుమతి అవసరం లేదని చట్టం స్పష్టం చేస్తోంది. చంద్రబాబును నిందితుడిగా చేర్చవచ్చు.. విచారించవచ్చు.. చట్టపరంగా అభియోగాలు నమోదు చేసి చర్యలు చేపట్టవచ్చు. ట్యాపింగ్ కానేకాదు.. ‘తన ఫోన్ను ట్యాప్ చేశారని ఏపీ సీఎం సోమవారం కూడా ఆరోపించారు. అంటే స్టీఫెన్సన్తో మాట్లాడింది తానేనని బాబు పరోక్షంగా ఒప్పుకున్నారు. అయితే ఇక్కడ ఒకవిషయాన్ని బాబు, ఆయన పార్టీ సభ్యులు విస్మరిస్తున్నారు. స్టీఫెన్సన్తో బాబు మాట్లాడిన టేపులు ఫోన్ ట్యాపింగ్ కిందకు రానేరావు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేయాలంటూ టీడీపీ నేతలు తన తో బేరసారాలు ఆడుతున్నారని స్టీఫెన్సన్ 29వ తేదీనే ఏసీబీకి ఫిర్యాదు చేశారు. దానిని స్వీకరించిన ఏసీబీ స్టీఫెన్సన్కు తగిన సలహాలు, సూచనలు చేసింది. అందులో భాగంగానే ఆయన తన ఫోన్కు వచ్చిన ప్రతి కాల్ను రికార్డు చేశారు. ఒక వ్యక్తి తన ఫోన్కు వచ్చిన కాల్ను రికార్డు చేయడమంటే అది ట్యాపింగ్ కానేకాదు’ అని న్యాయనిపుణులు పేర్కొంటున్నారు.