breaking news
Employees Union workers
-
ఉక్కు కోసం భగ్గుమన్న జనం
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం/ ఉక్కు నగరం(గాజువాక): విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటనపై రాష్ట్ర ప్రజలు భగ్గుమన్నారు. విశాఖతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగాయి. కేంద్రమంత్రి ప్రకటనను నిరసిస్తూ కార్మికులు, నిర్వాసితులు, ఉద్యోగ సంఘాలు విశాఖలో సోమవారం రాత్రి నుంచి చేపట్టిన ఆందోళన మంగళవారమూ కొనసాగింది. వీరికి మద్దతుగా ప్రజాసంఘాలు, వామపక్షాలు, కార్మిక సంఘాలూ రోడ్డెక్కాయి. ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో కూర్మన్నపాలెం కూడలిలో జాతీయ రహదారిని నిర్బంధించడంతో వాహనాలు నిలిచిపోయాయి. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ ఆందోళనలు కొనసాగాయి. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే పోరాటాన్ని మరింత ఉ«ధృతం చేస్తామని పోరాట కమిటీ హెచ్చరించింది. 11న యాజమాన్యానికి సమ్మె నోటీసివ్వాలని, ఈ నెల 25 తర్వాత ఎప్పుడైనా సమ్మెకు దిగాలని నిర్ణయించింది. ఆందోళనలతో వేడెక్కిన విశాఖ.. కేంద్రం తీరుకు నిరసిస్తూ విశాఖ కూర్మన్నపాలెంలోని స్టీల్ప్లాంట్ మెయిన్గేట్ వద్ద జాతీయ రహదారిపై ఉద్యమకారులు సోమవారం రాత్రి నుంచి ఆందోళనకు దిగారు. రోడ్డును దిగ్బంధించారు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్రం ప్రకటనతో కూడిన ప్రతుల్ని దగ్ధం చేశారు. ప్రధాని మోదీ దిష్టి బొమ్మను కూడా దహనం చేశారు. మరోవైపు ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ పిలుపు మేరకు స్టీల్ప్లాంట్ పరిపాలన భవనం ముట్టడించేందుకు భారీసంఖ్యలో ఆందోళనకారులు తరలివెళ్లారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, ప్రధాని డౌన్డౌన్ అంటూ నినాదాలతో హోరెత్తిస్తూ ముందుకెళ్లేందుకు ప్రయత్నించారు. వారిని ప్రత్యేక బలగాలు, పోలీసులు నిలువరించే ప్రయత్నం చేయడంతో తోపులాటలు చోటుచేసుకుని పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అదే సమయంలో ప్లాంట్లోకి వెళ్లేందుకు వచ్చిన ఫైనాన్స్ డైరెక్టర్ వి.వేణుగోపాలరావును ఆందోళనకారులు దిగ్బంధించారు. ఆయన కారు దిగి వెళ్లేందుకు ప్రయత్నించగా.. దాడికి యత్నించారు. వారిని పోలీసులు, సీఐఎస్ఎఫ్ సిబ్బంది చెదరగొట్టారు. ఆయనకోసం వచ్చిన హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వై.బాలాజీని కూడా కార్మికులు దిగ్బంధించారు. స్టీల్ప్లాంట్ మెయిన్గేట్తోపాటు వివిధ ప్రాంతాల్లో ఆందోళనకారులు రోడ్లను దిగ్బంధించడంతో వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. పలు రోడ్లలో అడ్డంగా చెట్లకొమ్మలు వేశారు. మరికొన్నిచోట్ల టైర్లని తగులబెట్టి నిరసన వ్యక్తం చేశారు. వడ్లపూడి ప్రజలు తమ వీధుల్లోని రహదారుల్ని మూసివేసి కేంద్రాన్ని, బీజేపీ వైఖరిని ఎండగడుతూ నినాదాలు చేశారు. మరోవైపు స్టీల్ప్లాంట్ పరిరక్షణ కమిటీ ప్రజాసంఘాల ఐక్యవేదిక చైర్మన్, సీఐటీయూ నగర ప్రధాన కార్యదర్శి ఎం.జగ్గునాయుడు మాట్లాడుతూ రాష్ట్రానికి కొత్తగా పరిశ్రమలివ్వని బీజేపీ ఉన్నవి అమ్మేయడానికి సిద్ధపడటం దుర్మార్గమన్నారు. బీజేపీని, ఆ పార్టీకి సహకరిస్తున్న జనసేన నేతలను మున్సిపల్ ఎన్నికల్లో తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. నినాదాలతో మార్మోగిన బెజవాడ బెజవాడ లెనిన్ సెంటర్ మంగళవారం విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలతో మార్మోగింది. పలు కార్మిక సంఘాలు మంగళవారం లెనిన్ సెంటర్లో ఆందోళన నిర్వహించి కేంద్రప్రభుత్వ జీవోలను దగ్ధం చేశాయి. తూర్పుగోదావరి జిల్లా ఆలమూరులో ప్రజాసంఘాలు, లాయర్లు, రిక్షా కార్మికులు మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. ఇంకా రాష్ట్రంలోని పలు జిల్లాల్లోనూ ఆందోళనలు కొనసాగాయి. ఢిల్లీ వెళ్లొచ్చిన స్టీల్ప్లాంట్ సీఎండీ.. కేంద్ర ఉక్కు మంత్రిత్వశాఖ పిలుపు మేరకు విశాఖ స్టీల్ప్లాంట్ సీఎండీ పీకే రథ్, డైరెక్టర్(పర్సనల్) కేసీ దాస్లు సోమవారం రాత్రి ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. కేంద్ర మంత్రిత్వ శాఖతో చర్చించిన అనంతరం మంగళవారం రాత్రి విశాఖ చేరుకున్నారు. నేడు అత్యవసర బోర్డు మీటింగ్ నిర్వహించే అవకాశముందని సమాచారం. 11న సమ్మె నోటీసు ప్రైవేటీకరణ ముప్పు నుంచి స్టీల్ప్లాంట్ పరిరక్షణకు అనుసరించాల్సిన ప్రణాళికను ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఖరారు చేసింది. 11వ తేదీన యాజమాన్యానికి సమ్మె నోటీసివ్వాలని, 25వ తేదీ తర్వాత ఎప్పుడైనా సమ్మెకు దిగాలని నిర్ణయించింది. పార్లమెంట్లోని వివిధ పార్టీల నేతలకు వినతిపత్రాలు అందజేయాలని, ఈ నెల 20న జాతీయ కార్మిక సంఘాల ప్రతినిధులతో ఉక్కు కార్మికుల గర్జన పేరిట స్టీల్ప్లాంట్ త్రిష్ణా మైదానంలో బహిరంగసభ నిర్వహించాలని, కిసాన్మోర్చా ఢిల్లీ నాయకులతో నగరంలో 28న భారీ సభ నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. సమావేశంలో కమిటీ నాయకులు సీహెచ్.నర్శింగరావు, మంత్రి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. 11 నుంచి ఆందోళన: విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక గాంధీనగర్(విజయవాడ సెంట్రల్): విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు కలసి ఆందోళన ఉధృతం చేయాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక మంగళవారం విజయవాడలో నిర్వహించిన సమావేశంలో నిర్ణయించింది. కేంద్రం ప్రకటనను నిరసిస్తూ 11వ తేదీ నుంచి ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు వేదిక కన్వీనర్ జి.ఓబులేసు, సీఐటీయూ నాయకులు వి.ఉమామహేశ్వరరావు ప్రకటించారు. 11, 12 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు, దిష్టిబొమ్మల దహనం, 13, 14 తేదీల్లో ఎంపీలకు సామూహిక వినతిపత్రాలు, 15న రాష్ట్రవ్యాప్తంగా రైల్వేస్టేషన్లు, కేంద్రప్రభుత్వ కార్యాలయాల వద్ద విశాఖ స్టీల్, ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ నిరసన దినం జరపాలని నిర్ణయించినట్టు తెలిపారు. 15న వేదిక సమావేశమై భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తుందన్నారు. -
రవాణా బంద్..పాక్షికం
సాక్షి, కడప : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న రవాణా బిల్లును వ్యతిరేకిస్తూ కార్మికులు ఆందోళనబాట పట్టారు. రోడ్డు రవాణా భద్రత బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టవద్దంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బిల్లును వ్యతిరేకిస్తూ అన్ని సంఘాలు ఆందోళనలలో పాల్గొన్నాయి. జిల్లాలో గురువారం నిర్వహించిన బంద్ పాక్షికంగా కొనసాగింది. రాయచోటి డిపో ఎదుట కార్మికుల ధర్నా కేంద్రం ప్రవేశపెట్టనున్న బిల్లును వ్యతిరేకిస్తూ రాయచోటి ఆర్టీసీ డిపో ఎదురుగా ఎంప్లాయిస్ యూనియన్ కార్మికులు ఆందోళన చేపట్టారు. ఎంప్లాయిస్ యూనియన్ రాష్ర్ట ఉపాధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్, సెక్రటరీలు నాగరాజు, రంగనాథ్, రీజినల్ ప్రెసిడెంట్ నాగమణిల ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా చేశారు. వెంటనే బిల్లును ఉపసంహరించుకోవాలని, కార్మికులకు 43 శాతం ఫిట్మెంటు అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. దాదాపు గంటపాటు రోడ్డుపై కూర్చుని నిరసన తెలిపారు. నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన జిల్లాలోని అనేక డిపోల్లోని ఆర్టీసి కార్మికులు గురువారం నిర్వహించిన బంద్ నేపథ్యంలో జేబులకు నల్లబ్యాడ్జీలు తగిలించుకొని నిరసన తెలిపారు. కొన్ని యూనియన్లు బంద్కు మద్దతు ప్రకటించి ఆందోళనల్లో పాల్గ్గొనగా, మరికొన్ని యూనియన్ల వారు బ్యాడ్జీలతొ నిరసన తెలిపారు. సంపూర్ణ మద్దతు ప్రకటించిన వైఎస్సార్ సీపీ కార్మికులు చేపట్టిన బంద్కు వైఎస్సార్ సీపీ నాయకులు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కడపలో జరిగిన ప్రత్యక్ష ఆందోళనల్లో కూడా వైఎస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు. కడపలో పలు సంఘాల నాయకుల అరెస్టు జిలా ్లకేంద్రమైన కడపలో ధర్నా, రాస్తారోకో చేస్తున్న పలువురు నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న ఏఐటీయూసీ, వైఎస్సార్సీపీ ట్రేడ్ యూనియన్, సీఐటీయూ, ఐఎన్టీయూసీ, బీఎంఎస్లకు చెందిన సంఘాల నాయకులను అరెస్టు చేసి ధర్నా, రాస్తారోకోలను భగ్నం చేశారు. అనంతరం నేతలను పోలీస్ స్టేషన్కు తరలించి పూచికత్తుపై విడుదల చేశారు. తప్పని తిప్పలు జిల్లాలో కార్మికులు రవాణా బంద్కు పూనుకోవడంతో ప్రయాణికులకు ఇబ్బంది తప్ప లేదు. రోజూ మాదిరిగా కాకుండా గురువారం ఆర్టీసీ బస్సుల సంఖ్య తగ్గడంతో సమస్యలు ఎదురయ్యాయి. గమ్యస్థానాలకు చేరేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే జిల్లాలో బంద్ మాత్రం పాక్షికంగానే కొనసాగింది.