breaking news
business and finance
-
ఎల్ఐసీకి ఐటీ రీఫండ్ రూ. 11,500 కోట్లు
ముంబై: ఆదాయ పన్ను రీఫండ్స్ కింద రూ. 11,500 కోట్లు అందుకున్నట్లు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) తెలిపింది. ఇందులో సింహ భాగాన్ని పాలసీదారులకు అందజేయనున్నట్లు సంస్థ వర్గాలు పేర్కొన్నాయి. 2007-08 నుంచి 2009-10 అసెస్మెంట్ ఇయర్స్కి సంబంధించిన కేసులో ఇన్కమ్ ట్యాక్స్ అపీలేట్ ట్రిబ్యునల్ (ఐటీఏటీ) తమకు అనుకూలంగా ఉత్తర్వులు ఇచ్చినట్లు వివరించాయి. రీఫండ్స్ను రెండు విడతలుగా అందుకున్నట్లు ఎల్ఐసీ వర్గాలు తెలిపాయి. కంపెనీ ఇంత పెద్ద స్థాయిలో రీఫండ్ అందుకోవడం ఇదే ప్రథమం అని వివరించాయి. అయితే, ఎల్ఐసీ చైర్మన్ ఎస్కే రాయ్ దీనిపై అధికారికంగా ఎటువంటి వివరణ ఇవ్వలేదు. ఎల్ఐసీ చట్టం 1956లోని సెక్షన్ 26 ప్రకారం ఎల్ఐసీకి వచ్చే ఐటీ రీఫండ్స్లో 95 శాతం మొత్తం పాలసీదారులకు, మిగతాది డివిడెండ్ రూపంలో ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. -
చర్చల్లోనే రుణాల రీషెడ్యూల్
రెండు రాష్ట్ర ప్రభుత్వాలను పూర్తి వివరాలతో రమ్మని కోరాం ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఆర్.గాంధీ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రుణాల రీ-షెడ్యూల్ గురించి చర్చలు ఇంకా ప్రాధమిక దశలోనే ఉన్నాయని, దీనికి సంబంధించి పూర్తి వివరాలతో రమ్మనమని రెండు రాష్ట్ర ప్రభుత్వాలను కోరినట్లు ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఆర్.గాంధీ స్పష్టం చేశారు. కరువు, తుపాను వంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఎస్ఎల్బీసీ అనుమతితో రుణాల రీ-షెడ్యూల్ ఎలా చేయాలో ఇప్పటికే స్పష్టమైన నిబంధనలు ఉన్నాయన్నారు. ఈ నిబంధనలు కాకుండా ప్రత్యేకంగా రీ-షెడ్యూల్ కావాలంటే పూర్తి వివరాలతో రమ్మనమని కోరినట్లు తెలిపారు. సోమవారం హైదరాబాద్లో ఫిక్కీ నిర్వహించిన ‘ఫిన్సెక్-2014’ సదస్సులో ప్రత్యేక అతిథిగా పాల్గొన్న గాంధీ తనను కలసిన విలేకరులతో మాట్లాడుతూ రీ-షెడ్యూల్కు సంబంధించి పూర్తి వివరాలు ఇంతవరకు అందలేదని, దీనిపై ఇంకా ఎటువంటి తుది నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. రుణ మాఫీ లేదా రీ-షెడ్యూల్ ఆలస్యంతో ఏర్పడుతున్న ఎన్పీఏలకు సంబంధించి బ్యాంకులకు ప్రత్యేకంగా ఏమైనా మినహాయింపులు ఇస్తారా అన్న ప్రశ్నకు వ్యవసాయ రుణాల ఎన్పీఏలకు సంబంధించి స్పష్టమైన నిబంధనలు ఉన్నాయని, వాటి ప్రకారమే బ్యాంకులు నడుచుకోవాల్సి ఉంటుందన్నారు. అంతకుముందు రెండు రోజుల ఫైనాన్షియల్ సెక్టార్ కాన్క్లేవ్ ‘ఫిన్సెక్-2014’ ప్రారంభించిన తెలంగాణ ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ రైతు రుణ మాఫీపై జూలై 16న తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. గ్రామీణ ఏటీఎంలు గ్రామీణ ప్రాంతాల ప్రజల అవసరాలకు ఉపయోగపడే విధంగా చిన్న నోట్లను అందించే ఏటీఎంలను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు ఆర్బీఐ తెలిపింది. ప్రస్తుతం ఉన్న ఏటీఎంలు రూ.500, రూ.1,000 నోట్లను అందిస్తున్నాయని, కాని గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి పెద్ద నోట్ల కంటే చిన్న నోట్లకు డిమాండ్ ఉండటంతో ప్రత్యేక ఏటీఎంలను రూపొందిస్తున్నట్లు గాంధీ తెలిపారు. చిన్న నోట్లను అందించే ఏటీఎంలను అభివృద్ధి చేస్తున్నామని, త్వరలోనే అవి అందుబాటులోకి వస్తాయన్నారు. చెల్లింపులకు ప్రత్యేక బ్యాంకులు కేవలం చెల్లింపుల కోసం ఏర్పాటు చేయనున్న పేమెంట్ బ్యాంక్కు సంబంధించి మార్గదర్శకాలను త్వరలోనే విడుదల చేయనున్నట్లు ఆర్బీఐ తెలిపింది. బడ్జెట్లో ప్రకటించిన విధంగా డిఫరెన్షియేటెడ్ బ్యాంకుల ఏర్పాటులో భాగంగా ముందుగా పేమెంట్ బ్యాంకును ఏర్పాటు చేస్తున్నట్లు గాంధీ తెలిపారు. పేమెంటు బ్యాంకులు ఇతర వాణిజ్య బ్యాంకుల్లా డిపాజిట్ల సమీకరణ, రుణ వితరణ తదితర కార్యకలాపాలు నిర్వహించవు. ఇవి కేవలం కార్పొరేట్, ప్రభుత్వాలు చేసే వివిధ రకాల చెల్లింపులను మాత్రమే స్వీకరిస్తాయి. దేశంలో సంస్కరణలు ప్రారంభమైన తర్వాత ఆర్థిక సేవల రంగంలో దక్షిణాది రాష్ట్రాలు దేశ సగటు కంటే ముందున్నాయన్నారు. మార్చి 2012 నాటికి దేశంలో ఫైనాన్షియల్ ఇన్క్లూజన్లో భాగంగా 42.8 శాతం మందికి బ్యాంకింగ్ సేవలు అందుబాటులో వస్తే ఈ సగటు దక్షిణాది రాష్ట్రాల్లో 66 శాతంగా ఉందన్నారు. రాష్ట్రంలో ఆగిపోయిన మైక్రోఫైనాన్స్ వ్యాపారం తిరిగి ప్రారంభం కావడానికి మరికొంత కాలం పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఫిక్కి కో-చైర్ జేఏ చౌదరితోపాటు బ్యాంకింగ్, బీమా రంగానికి చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. -
ఇన్వెస్టర్ల సెంటిమెంటు మెరుగుపడుతుంది: మూడీస్
న్యూఢిల్లీ: ఎన్డీయే విజయంతో ఇన్వెస్టర్ల సెంటిమెంటు మెరుగుపడగలదని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ పేర్కొంది. దేశీ స్టాక్ మార్కెట్లు, రూపాయిపై ఇన్వెస్టర్లలో పెరుగుతున్న విశ్వాసం స్థిరంగా కొనసాగేందుకు ఈ విజయం తోడ్పడగలదని తెలిపింది. రాబోయే రోజుల్లో ఎకానమీని పునరుద్ధరించేందుకు విధానపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ.. భారత వృద్ధి, ద్రవ్య లోటు, ద్రవ్యోల్బణ గణాంకాలు తక్షణమే మారిపోయే అవకాశాలు లేవని మూడీస్ వివరించింది. ఫలితంగా ఈ ఏడాది భారత వృద్ధి, అసలు సామర్థ్యం కన్నా తక్కువగా సుమారు 5 శాతం మేర ఉండొచ్చని అంచనా వేసింది. ఎల్ నినో ప్రభావం కారణంగా వ్యవసాయం కూడా అంతంత మాత్రంగా ఉంటే.. వృద్ధి మరింత తగ్గొచ్చని తెలిపింది. రాబోయే రోజుల్లో ఆర్థికంగా విధానపరమైన చర్యలు అమల్లోకి తెచ్చిన దాన్ని బట్టి దేశ ఆర్థిక పరపతి రేటింగ్ మార్పులపై ప్రభావం ఉంటుందని వివరించింది. మధ్యకాలికంగా చూస్తే మాత్రం ..కొత్త ప్రభుత్వం కొన్ని నిర్దిష్టమైన చర్యలను ఎంత వేగంగా అమలు చేసిందన్న దాన్ని బట్టి ఎకానమీ పునరుద్ధరణ ఆధారపడి ఉంటుందని మూడీస్ వ్యాఖ్యానించింది. ఒక మోస్తరు క్రెడిట్ రిస్కును సూచిస్తూ స్థిరమైన అంచనాలతో భారత్కి మూడీస్ ‘బీఏఏ3’ రేటింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే.