breaking news
Brookfield AMC
-
భారత్పై బ్రూక్ఫీల్డ్ భారీ అంచనాలు
ముంబై: న్యూయార్క్ కేంద్రంగా పనిచేసే బ్రూక్ఫీల్డ్ అస్సెట్ మేనేజ్మెంట్ భారత మార్కెట్లో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవాలనుకుంటోంది. తన నిర్వహణలోని ఆస్తులను (ఏయూఎం) వచ్చే మూడేళ్లలో మూడు రెట్లు పెంచుకుని 100 బిలియన్ డాలర్లకు (రూ.8.5 లక్షల కోట్లు సుమారు) చేర్చే లక్ష్యంతో ఉన్నట్టు ప్రకటించింది. అంతర్జాతీయంగా తమ ఏయూఎం వచ్చే ఐదేళ్లలో ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని సంస్థ ప్రెసిడెంట్ కానర్ టెస్కే తెలిపారు. ఇదే సమయంలో భారత్ తదితర వర్ధమాన మార్కెట్లలో వృద్ధి మరింత అధికంగా ఉంటుందని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. భారత్లో ఇన్ఫ్రా, రియల్ ఎస్టేట్, పునరుత్పాదక ఇంధన రంగాల్లో బ్రూక్ఫీల్డ్ ప్రస్తుతం 30 బిలియన్ డాలర్ల ఆస్తులను నిర్వహిస్తుండడం గమనార్హం. వచ్చే ఐదేళ్లలో నిర్వహణ ఆస్తులను మూడు లేదా నాలుగింతలు చేసుకోగలమన్న అంచనాతో ఉన్నట్టు టెస్కే చెప్పారు. భారత జీడీపీ వృద్ధి 5.5 శాతానికి పడిపోయినా తమ ఆస్తులపై ఎలాంటి ప్రభావం ఉండబోదన్నారు. భారత్ మాదిరి ఆర్థిక వ్యవస్థకు అది మెరుగైన రేటే అవుతున్నారు. విలీనాలు.. కొనుగోళ్లు.. ప్రధానంగా విలీనాలు, కొనుగోళ్ల రూపంలో భారత్లోని తమ నిర్వహణ ఆస్తులు పెంచుకోనున్నట్టు కానర్ టెస్కే తెలిపారు. అదే సమయంలో ప్రస్తుత వ్యాపార వృద్ధిపైనా దృష్టి సారిస్తామని చెప్పారు. భారత్ వేగంగా మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించిందని చెబుతూ.. స్థిరమైన సరఫరా వ్యవస్థల కోసం చూసే కంపెనీలకు గమ్యస్థానం అవుతుందన్నారు. మౌలిక సదుపాయాలపై అధిక వ్యయాలు చేస్తుండడంతో ఈ రంగంలో తమ కార్యకలాపాలను మరింత బలోపేతం చేసుకోగలమని ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్లో పెట్టుబడులపై రాబడులు తమ అంచనాలకు అనుగుణంగా లేదా అంతకుమించే ఉన్నట్టు టెస్కే తెలిపారు. బ్రూక్ఫీల్డ్ నిర్వహణ ఆస్తుల్లో 12 బిలియన్ డాలర్లు ఇన్ఫ్రాలో, మరో 12 బిలియన్ డాలర్నలు రియల్ ఎస్టేట్లో ఉండగా.. పునరుత్పాదక ఇంధన రంగంలో 3 బిలియన్ డాలర్లు, ప్రైవేటు ఈక్విటీలో 3.6 బిలియన్ డాలర్ల మేర నిర్వహిస్తోంది. యూఎస్ అనుసరిస్తున్న టారిఫ్ల విధానంతో భారత్కు ఎక్కువ ప్రయోజనకరమని టెస్కే అభిప్రాయపడ్డారు. -
భారతీ ఎంటర్ప్రైజెస్ ఆస్తుల విక్రయం
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం భారతీ ఎంటర్ప్రైజెస్ దేశ రాజధానిలోని వరల్డ్మార్క్సహా నాలుగు వాణిజ్య ఆస్తులను విక్రయించేందుకు ఒప్పందాన్ని కుదుర్చుకుంది. తద్వారా వీటిలో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ బ్రూక్ఫీల్డ్ 51 శాతం వాటాను సొంతం చేసుకోనుంది. రూ. 5,000 కోట్ల ఎంటర్ప్రైజ్ విలువలో డీల్ కుదిరినట్లు భారతీ ఎంటర్ప్రైజెస్ వెల్లడించింది. మొత్తం 3.3 మిలియన్ చదరపు అడుగుల ఈ నాలుగు ఆస్తులపై భాగస్వామ్య(జేవీ) ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలియజేసింది. ఆస్తుల జాబితాలో వరల్డ్మార్క్ ఏరోసిటీ(ఢిల్లీ), వరల్డ్మార్క్ 65, ఎయిర్టెల్ సెంటర్(గుర్గావ్), పెవిలియన్ మాల్(లూథియానా) ఉన్నట్లు పేర్కొంది. ఒప్పందంలో భాగంగా బ్రూక్ఫీల్డ్ రియల్టీ ఫండ్ 51 శాతం వాటాను పొందనుండగా.. మిగిలిన 49 శాతం వాటాతో భారతీ ఎంటర్ప్రైజెస్ కొనసాగనుంది. ఎంటర్ప్రైజ్ విలువ మదింపులో రుణభారాన్ని సైతం పరిగణించినట్లు కంపెనీ తెలియజేసిం ది. అయితే కచ్చితమైన ఒప్పంద విలు వను వెల్లడించలేదు. నియంత్రణ సంస్థల అనుమతుల తదుపరి లావాదేవీ అమలుకానుంది. ఆస్తులను బ్రూక్ఫీల్డ్ అనుబంధ సంస్థ బ్రూక్ఫీల్డ్ ప్రాప ర్టీస్ మేనేజ్ చేయనున్నట్లు భారతీ వెల్లడించింది. ఆస్తుల వివరాలు: 1.43 మిలియన్ చదరపు అడుగుల వరల్డ్మార్క్ ఏరోసిటీ మిశ్రమ వినియోగ ఆస్తికాగా.. 7 లక్షల ఎస్ఎఫ్టీగల ఎయిర్టెల్ సెంటర్ కార్పొరేట్ సౌకర్యాలను కలిగి ఉంది. ఇక వరల్డ్మార్క్ 65 సైతం 7 లక్షల ఎస్ఎఫ్టీలో మిశ్రమ వినియోగానికి అనువుగా నూతనంగా నిర్మాణమైంది. దేశీయంగా బ్రూక్ఫీల్డ్ పలు నగరాలలో 47 మిలియన్ చదరపు అడుగుల వాణిజ్య రియల్టీ ఆస్తులను నిర్వహిస్తోంది. గతేడాది రూ. 3,800 కోట్ల ఐపీవో ద్వారా దేశీయంగా రియల్ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్(ఆర్ఈఐటీ)ను ఆవిష్కరించింది. -
బ్రూక్ఫీల్డ్ చేతికి ఈక్వినాక్స్ బిజినెస్ పార్క్స్
న్యూఢిల్లీ: దేశీ కమర్షియల్ రియల్ ఎస్టేట్ రంగంలో భారీ డీల్స్ నమోదవుతున్నాయి. తాజాగా ముంబైలోని ఖరీదైన కమర్షియల్ ప్రాపర్టీ.. ఈక్వినాక్స్ బిజినెస్ పార్క్స్ని అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్ సంస్థ బ్రూక్ఫీల్డ్ అసెట్ మేనేజ్మెంట్ కొనుగోలు చేసింది. రూ.2,400 కోట్లకు దీన్ని విక్రయించినట్లు ఎస్సార్ గ్రూప్ వెల్లడించింది. 10 ఎకరాల విస్తీర్ణంలోని ఈ బిజినెస్ పార్క్లో నాలుగు టవర్లున్నాయి. లీజుకిచ్చేందుకు అనువైన 12.5 లక్షల చదరపుటడుగుల ఆఫీస్ స్పేస్ అందుబాటులో ఉంది. ఇందులో టాటా కమ్యూనికేషన్స్, ఎక్స్పీరియన్, క్రాంప్టన్ గ్రీవ్స్, లఫార్జ్ తదితర దిగ్గజాల కార్యాలయాలున్నాయి. దేశీ రియల్ ఎస్టేట్ రంగంలో అత్యంత భారీ డీల్స్లో ఇది ఒకటని ఎస్సార్ పేర్కొంది. ఎస్సార్ గ్రూప్ గతంలో దీన్ని బెంగళూరుకు చెందిన రియల్టీ సంస్థ ఆర్ఎంజెడ్ కార్పొరేషన్కి విక్రయించాలని అనుకున్నప్పటికీ.. డీల్ సాకారం కాలేదు. దాదాపు 285 బిలియన్ డాలర్ల అసెట్స్ని నిర్వహిస్తున్న బ్రూక్ఫీల్డ్ అసెట్ మేనేజ్మెంట్ సంస్థకి దేశీ రియల్టీ మార్కెట్లో గణనీయంగా కార్యకలాపాలు ఉన్నాయి. 2014లో యూనిటెక్ గ్రూప్ నుంచి ఆరు ఐటీ–సెజ్ ప్రాజెక్టులను రూ. 2,000 కోట్లకు కొనుగోలు చేసింది. -
ఎన్పీఏలకు ఎస్బీఐ చికిత్స!
♦ స్ట్రెస్డ్ అసెట్స్ కొనుగోళ్లకు ఫండ్ ♦ బ్రూక్ఫీల్డ్ ఏఎంసీతో కలిసి రూ. 7,350 కోట్ల జాయింట్ వెంచర్ ♦ ఎస్బీఐ వాటా 5 శాతం... ♦ ఇప్పటికే ఇలాంటి నిధిని ఏర్పాటు చేసిన కోటక్ మహీంద్రా బ్యాంకు ముంబై: బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి రుణాల్ని ఉద్దేశపూర్వకంగా ఎగవేసినవారు కొందరైతే... నిజంగానే ఆస్తులున్నా వాటిని విక్రయించలేక, అప్పులు తీర్చలేక సతమతమవుతున్నవారు కొందరు!!. ఇలాంటి ఆస్తుల్నే స్ట్రెస్డ్ అసెట్స్ (మొండిబకాయిలు-ఎన్పీఏ)గా పిలుస్తున్నారు. ఇదంతా ఎందుకంటే... దేశీ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇపుడు ఈ స్ట్రెస్డ్ అసెట్స్పైనే దృష్టి పెట్టింది. తన బ్యాంకు పరిధిలోను, ఇతర బ్యాంకులు, ఆర్థిక సంస్థల పరిధిలోను ఉన్న ఇలాంటి ఆస్తుల్ని కొనుగోలు చేయటానికి న్యూయార్క్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రముఖ ఫండ్ హౌస్ ‘బ్రూక్ ఫీల్డ్ అసెట్ మేనేజ్మెంట్’తో జతకట్టింది. ఇలాంటి ఆస్తుల కొనుగోళ్లకు ఈ రెండూ కలిసి ఫండ్ను ఏర్పాటు చేయనున్నాయి. ఫండ్ విలువ రూ.7,350 కోట్లుకాగా, అమెరికా సంస్థ వాటా 7,000 కోట్లు. ఫండ్లో ఐదు శాతం అంటే దాదాపు రూ.350 కోట్లను ఎస్బీఐ పెట్టుబడిగా పెడుతుందని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. భారీగా పేరుకుపోయిన ఎస్బీఐ మొండి బకాయిల సమస్యల పరిష్కారానికి కూడా తాజా చొరవ దోహదపడుతుందని చెప్పారాయన. బ్రూక్ఫీల్డ్ దాదాపు రూ.240 బిలియన్ విలువైన ఆస్తుల్ని నిర్వహిస్తోంది. కొత్త ఫండ్ ఎప్పటి నుంచీ కార్యకలాపాలు నిర్వహిస్తుందని అడిగిన ప్రశ్నకు సీనియర్ అధికారి ఒకరు సమాధానమిస్తూ... ‘‘త్వరలో ఫండ్ ఏర్పాటవుతుంది. దీనిని బ్రూక్ఫీల్డ్, ఎస్బీఐ టాప్ మేనేజ్మెంట్ నిర్వహిస్తాయి’’ అని చెప్పారు. తొలుత ఒత్తిడిలో ఉన్న ఎస్బీఐ ఆస్తులపై ఫండ్ దృష్టి పెడుతుందా? అన్న ప్రశ్నకు ‘అవును’ అని ఆయన సమాధానమివ్వటం గమనార్హం. ‘‘అయితే ఇతర ఆస్తుల కొనుగోళ్లకూ అవకాశముంది. భారీ రుణ అకౌంట్లలో అధికం ఎస్బీఐకి చెందినవే ఉన్నాయి కాబట్టి ఆ అకౌంట్లపైనా ఫండ్ దృష్టి సారిస్తుంది’’ అని ఆయన వివరించారు. ఎస్బీఐ ఎన్పీఏల స్థితి ఇదీ... ఆర్థిక వ్యవస్థలో కీలకంగా ఉన్న పలు రంగాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో- ఎస్బీఐ నికర మొండి బకాయిల సమస్య గత కొన్నేళ్లుగా తీవ్ర రూపం దాలుస్తోంది. 2015 మార్చి నాటికి మొత్తం రుణాల్లో 2.12 శాతంగా (రూ.27,591 కోట్లు) ఉన్న బ్యాంక్ ఎన్పీఏల పరిమాణం 2016 మార్చి నాటికి 3.81 శాతానికి (రూ.55,807 కోట్లు) ఎగసింది. స్థూలంగా చూస్తే ఈ మొత్తం ఇదే ఏడాది కాలంలో 2.5 శాతం నుంచి 6.5 శాతానికి పెరిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గత ఏడాది డిసెంబర్లో నిర్వహించిన అసెట్ క్వాలిటీ రివ్యూ ప్రకారం 36 బ్యాంకుల నికర ఎన్పీఏలు మార్చి 2016లో 7.6 శాతానికి చేరాయి. 2015 సెప్టెంబర్లో ఇది 5.1 శాతం. ఇక పునర్వవస్థీకరించిన అకౌంట్లు సహా మొత్తం ఒత్తిడిలో ఉన్న రుణాల విలువ మార్చి 2016 నాటికి 13 శాతంగా ఉంది. అంటే రూ.8 లక్షల కోట్లకు పైమాటే. ఇప్పటికే కోటక్ ఫండ్...: ఈ తరహా ఫండ్ రెండవది. ఒత్తిడిలో ఉన్న ఆస్తుల్లో పెట్టుబడులకోసం కోటక్ బ్యాంక్ ఇప్పటికే కెనడియన్ పెన్షన్ ప్లాన్ ఇన్వెస్ట్మెంట్ బోర్డ్తో కలిసి మార్చిలో 525 మిలియన్ డాలర్ల ఫండ్ను ఏర్పాటు చేసింది. ఇందులో కెనడా సంస్థ వాటా 450 బిలియన్ డాలర్లు. మిగిలిన 75 మిలియన్ డాలర్ల వాటాను కోటక్ మహీంద్రా బ్యాంక్ పెట్టింది. 2019 నాటికి 90 బిలియన్ డాలర్లు అవసరం: ఫిచ్ అంతర్జాతీయ బ్యాంకింగ్ నిబంధనలైన బాసెల్-3 ప్రమాణాలు అనుగుణంగా- 2019 మార్చి నాటికి ప్రభుత్వ రంగ బ్యాంకులకు 90 బిలియన్ డాలర్ల (దాదాపు 6 లక్షల కోట్లు) మూలధనం అవసరమవుతుందన్నది రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ తన తాజా నివేదికలో పేర్కొంది. ప్రభుత్వం మంగళవారం 13 బ్యాంకులకు దాదాపు రూ.22 వేల కోట్ల తాజా మూలధన కేటాయింపుల నేపథ్యంలో ఫిచ్ తాజా అంచనాలను వెలిబుచ్చింది. బ్యాంకుల మూలధన పరిస్థితులు చరిత్రాత్మక బలహీన స్థాయి ల్లో ఉన్నట్లు పేర్కొన్న ఫిచ్, రుణ నాణ్యత సన్నగిల్లడం, ఎన్పీఏలకు సంబంధించి భారీ ప్రొవిజనింగ్ కేటాయింపులు దీనికి కారణంగా పేర్కొంది. పెద్ద మొత్తంలో నిధులు సమకూర్చుకోవడం ప్రభుత్వ రంగ బ్యాంకులకు కష్టమవుతుందని, ప్రభుత్వమే ఈ దిశలో చర్యలు తీసుకోవాలని సూచించింది. ప్రభుత్వ రంగ బ్యాంక్ల పునర్వ్యవస్థీకరణ కోసం ఇంద్రధనుష్ కార్యక్రమాన్ని గత ఏడాది ప్రభుత్వం ప్రకటించింది. ఈ కార్యక్రమం కింద ప్రభుత్వ రంగ బ్యాంక్లకు నాలుగేళ్లలో రూ.70,000 కోట్ల పెట్టుబడులు అందించనున్నారు. ఈ కార్యక్రమం కింద గత ఆర్థిక సంవత్సరంలో రూ. 25 వేల కోట్లు ఇవ్వగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరో 25,000 కోట్ల బడ్జెట్ కేటాయింపులు జరిగాయి. రానున్న రెండు ఆర్థిక సంవత్సరంలో ఒక్కో ఏడాదికి రూ.10,000 కోట్లు చొప్పున నిధులు అందజేస్తారు. అవసరమైతే మరిన్ని నిధులు కూడా అందిస్తామని ఆర్థిక మంత్రి జైట్లీ హామీ ఇస్తున్నారు. కాగా ప్రభుత్వం సమకూర్చనున్న నిధులతో పోల్చితే, ఫిచ్ సూచిస్తున్న నిధుల మొత్తం భారీగా ఉండడం గమనార్హం. ప్రత్యామ్నాయంలో భాగం... స్ట్రెస్డ్ అసెట్స్ సమస్య పరిష్కారం దిశగా అంతర్జాతీయ దిగ్గజ సంస్థలతో చేతులు కలపటమనేది బ్యాంకుల ముందున్న మార్గాల్లో ఒకటి. ఎస్బీఐకి సంబంధించిన స్ట్రెస్డ్ ఆస్తుల సమస్య పరిష్కరించడానికి, లిక్విడిటీ ఇబ్బందుల నుంచి బయటపడటానికి తాజా చర్య సరైనదే. - అరుంధతీ భట్టాచార్య, ఎస్బీఐ చీఫ్ మంచి అవకాశం... ఎస్బీఐతో ఒప్పందం హర్షణీయం. దీర్ఘకాలంపాటు వృద్ధిబాటలో సాగే భారత్లో పెట్టుబడుల కొనసాగింపును గొప్ప అవకాశంగా భావిస్తున్నాం. మా ప్రైవేట్ ఈక్విటీ ప్లాట్ఫామ్ను ఇండియాలో మరింత విస్తరిస్తాం. పెట్టుబడుల విస్తరణకు సంస్థ తగిన వ్యూహాల్ని అమలు చేస్తుంది. - అనూజ్ రంజన్, బ్రూక్ఫీల్డ్ ఇండియా హెడ్