breaking news
Anti-Rabies vaccines
-
‘కుక్కకాటు’కు మందు లేదు!
సాక్షి, అనంతపురం : జిల్లాలో కుక్కకాటుకు ఆస్పత్రుల్లో వ్యాక్సిన్ అందుబాటులో లేకుండా పోయింది. ప్రధానంగా పీహెచ్సీ, ఏరియా ఆస్పత్రుల్లో వ్యాక్సిన్ లేదనే సమాధానాలు వినవస్తున్నాయి. దీంతో కుక్కకాటు బాధితులు పెద్ద సంఖ్యలో జిల్లా కేంద్రంలోని సర్వజనాస్పత్రికి వస్తున్నారు. ఇక్కడి ఏపీఎంఎస్ఐడీసీ డ్రగ్ స్టోర్లోనూ సూది మందులు అందుబాటులో లేవంటూ అధికారులు చెబుతున్నారు. ప్రైవేట్గా ఈ మందు కొనుగోలు చేయాలంటూ ఒక్కొ వెయిల్ రూ.350 ధర పలుకుతోంది. నెలకు 10 వేల వెయిల్స్ జిల్లాలో సర్వజనాస్పత్రితో పాటు 88 పీహెచ్సీలు, 15 సీహెచ్సీలు, రెండు ఏరియా ఆస్పత్రులు, అనంతపురం సీడీ ఆస్పత్రి, హిందూపురం జిల్లా కేంద్రం ఆస్పత్రులున్నాయి. ఈ ఆస్పత్రులకు నెలకు సగటున 10వేల ఏఆర్వీ వెయిల్స్ అవసరమని వైద్యాధికారులు చెబుతున్నారు. అయితే ఆరు నెలలుగా వ్యాక్సిన్ పూర్తి స్థాయిలో అందుబాటులో లేకుండా పోయింది. ఈ ఏడాది జూన్ 20న కర్నూలు సీడీ ఆస్పత్రి నుంచి ఒక వెయ్యి వెయిల్స్, జూలై 29న భరత్ బయోటెక్ ఇంటర్నేషనల్ నుంచి 4,160 వెయిల్స్ తెప్పించారు. ఈ నెల 19న 3,700, 21న మరో 3,700 వెయిల్స్ కోసం కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చారు. అయితే ఇవి ఆస్పత్రులకు చేరేందుకు మరింత సమయం పడుతుందని ఏపీఎంఎస్ఐడీసీ అధికారులు చెబుతున్నారు. రెండు వెయిల్స్తో ఐదుగురికి కుక్కకాటుకు గురైన వారికి ఐదు డోసుల్లో ఏఆర్వీ వ్యాక్సిన్ వేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో రెండు వెయిల్స్ ద్వారా ఐదుగురికి ఒక్కసారిగా వ్యాక్సిన్ వేయవచ్చు. ప్రస్తుతం సర్వజనాస్పత్రిలో 20 వెయిల్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. బుధవారం (నేడు)తో అవి కూడా అయిపోతాయి. గతంలో రోజుకు 20 నుంచి 30 మందికి మాత్రమే ఈ వ్యాక్సిన్ను వేసేవారు. అయితే ఇటీవల కుక్కకాటు బాధితుల సంఖ్య పెరగడంతో రోజూ 80 మందికి వేయాల్సి వస్తోంది. అనంతపురం రూరల్, ధర్మవరం, తాడిపత్రి, బత్తలపల్లి, పామిడి, మామిళ్లపల్లి, రాయదుర్గం, కళ్యాణదుర్గం, తదితర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో కుక్కకాటు బాధితులు సర్వజనాస్పత్రికి వస్తున్నారు. సంగీత అనె మహిళ కళ్యాణదుర్గం మండలం నర్సాపురం గ్రామం. కొన్ని రోజుల క్రితం కుక్కకాటుకు గురైన తన కుమారుడు వేదవ్యాస్ నాయక్కు రెండు డోస్ల యాంటీ రేబిస్ వ్యాక్సిన్(ఏఆర్వీ)ను బెళుగుప్పలోని పీహెచ్సీలో వేయించారు. మంగళవారం మూడో డోస్ వేయించేందుకు అక్కడకు వెళితే.. వ్యాక్సిన్ లేదని చెప్పారు. దీంతో కుమారుడిని తీసుకుని సర్వజనాస్పత్రికి మధ్యాహ్నం 1.09 గంటలకు చేరుకున్నారు. డ్యూటీలో ఉన్న హెడ్నర్స్ను కలిసి విషయం చెబితే.. వ్యాక్సిన్ అయిపోయిందని చేతులెత్తేశారు. కళ్యాణదుర్గం నుంచి ఇక్కడకు రానుపోనూ రూ.200కు పైగా ఖర్చు అవుతుందని, ఇక్కడకు వచ్చాక లేదని చెబితే పిల్లాడి పరిస్థితి ఏమిటంటూ ఆవేదనతో ఆమె వెనుదిరిగారు. ఇలాంటి పరిస్థితి జిల్లా వ్యాప్తంగా అన్ని పీహెచ్సీల్లోనూ ఉంది. కుక్కకాటుకు గురైన వారు సూది మందు దొరక్క అవస్థలు పడుతున్నారు. ధర్మవరం నుంచి 12 మంది కుక్కకాటుకు గురై సర్వజనాస్పత్రికి రాగా అందులో 8 మందికి మాత్రమే వ్యాక్సిన్ వేశారు. మిగిలిన వారిని వెనక్కు పంపారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 100 వెయిల్స్ కొనుగోలు చేస్తున్నాం ఆస్పత్రిలో ఏఆర్వీ వ్యాక్సిన్ కొరత ఉండేది వాస్తవమే. ఆస్పత్రి బడ్జెట్ నుంచి గుంటూరులోని ఓ ఫార్మసీ ద్వారా వంద వెయిల్స్ కొనుగోలు చేయబోతున్నాం. వ్యాక్సిన్ కొరతను ఇప్పటికే ఉన్నతాధికారులు దృష్టికి తీసుకెళ్లాం. – డాక్టర్ రామస్వామి నాయక్, సర్వజనాస్పత్రి సూపరింటెండెంట్ రెండు నెలలుగా ఇదే పరిస్థితి రెండు నెలలుగా ఏఆర్వీ వ్యాక్సిన్ కొరత ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే సమస్య. దేశంలో కేవలం మూడు కంపెనీలు మాత్రమే ఈ వ్యాక్సిన్ను సరఫరా చేస్తున్నాయి. వ్యాక్సిన్ల కొరతను అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. త్వరలో వ్యాక్సిన్ రావచ్చు. – ఐవీఎస్ రెడ్డి, ఏపీఎంఎస్ఐడీసీ ఈఈ -
పశువులకు కుక్కకాటుపై నిర్లక్ష్యం వద్దు
ఆదిలాబాద్ అగ్రికల్చర్ : వీధి కుక్కలు పశువులను కరిచినప్పుడు నిర్లక్ష్యం వహించకుండా యాంటీ రేబిస్ టీకాలు వేయించాలి. నాటు వైద్యంపై ఆధారపడవద్దు. జిల్లాలోని అన్ని పశు వైద్యశాల కేంద్రాల్లో టీకాలు అందుబాటులో ఉన్నా యి. జిల్లాలోని డివిజన్ కేంద్రాలు నిర్మల్కు 500, మం చిర్యాలకు 350, ఆదిలాబాద్కు 150 వ్యాక్సిన్లు అందజేశాం. కుక్కకాటు బారిన పశువులకు టీకాలు వేయించాలి. జిల్లాలో సుమారు 18వేల వరకు కుక్కలు ఉన్నా యి. ఈ ఏడాది జూలై వరకు సారంగాపూర్ మండలంలో 40, జైపూర్లో 25, లక్ష్మణచాందలో 15 పశువులను కుక్కలు కరిచాయి. పశువులను మూతి భాగంలో కరుస్తాయి కాబట్టి వాటికి త్వరగా వెర్రి లేచే ప్రమాదముంది. కుక్కలు పశువుల దగ్గరకు రాగానే కొమ్ములతో పొడిచే ప్రయత్నం చేస్తాయి. దీంతో మూతి, ముక్కు దగ్గర ఎక్కువగా కరుస్తాయి. రేబిస్ వైరస్ రక్తనాళాల గుండా చిన్నమెదడుకు త్వరగా చేరి చనిపోయే ప్రమాదం ఉంటుంది. మనిషిని కాటు వేస్తే 20 సంవత్సరాల వరకు బతికే అవకాశం ఉంది. కానీ పశువులు రెండేళ్లకంటే ఎక్కువగా జీవించే అవకాశాలు లేవు. లక్షణాలు.. కుక్కకాటుకు గురైన పశువులు గడ్డి తినకుండా 105 డిగ్రీల నుంచి 108 డిగ్రీల జ్వరంతో బాధపడుతుంది. నోటి నుంచి సొల్లు కారుస్తూ ఎప్పుడూ నిల్చోనే ఉంటాయి. వాటికి కళ్లముందు ఏమీ కనిపించవు. ఎవరినైనా పొడిచే ప్రయత్నం చేస్తాయి. వీటికి నీటిని చూస్తే భయంగా ఉంటుంది. వర్సాకాలం నాడీ వ్యవస్థపై రేబిస్ ప్రభావం త్వరగా మెదడుకు చేరుతుంది. చల్లటి వాతావరణంలో ఇది రక్తనాళాలల్లో చిన్నమెదడుకు చురుగ్గా చేరి దశదిశ లేకుండా ప్రయాణిస్తుంటాయి. నోరు మూగ పడిపోయి తరచూ మూత్ర విసర్జన చేస్తాయి. వెనక కాలు జాడిస్తూ తలను గోడకు వేసి రాయడం, ఎదురుగా వచ్చేది ఏదైనా చూడకుండా కొమ్ములతో పొడవడానికి, నోటితో కొరికేందుకు ప్రయత్నిస్తాయి. వ్యాక్సిన్ అందించే పద్ధతి.. కాటుకు గురైన రోజు, మూడో రోజు, ఏడో రోజు, 14వ రోజు, 28వ రోజు, 60వ రోజు ఇలా క్రమం తప్పకుండా ఏడు డోసులు టీకాలు వేయించాలి. రెండు మూడు డోసులు వేయించి ఊరుకున్నా ప్రమాదమే. వర్షాకాలంలో అధికంగా కుక్కకాటుకు గురవుతుంటాయి. పశువుల పోషకులు సకాలంలో గమనించి వైద్యం అందించాలి.