ఏపీలో అధికార పార్టీకి చెందిన గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అక్రమంగా లైమ్స్టోన్ తవ్వకాలు, రవాణా చేస్తూ...
హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం
సాక్షి, హైదరాబాద్: ఏపీలో అధికార పార్టీకి చెందిన గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అక్రమంగా లైమ్స్టోన్ తవ్వకాలు, రవాణా చేస్తూ, ప్రభుత్వానికి రూ.కోట్లలో రాయల్టీ ఎగవేస్తున్నారని, ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. అక్రమంగా లైమ్స్టోన్ తవ్వకాలు చేస్తున్న వారిని అరెస్ట్ చేయడంతోపాటు అక్రమ మైనింగ్ కార్యకలాపాలను నిరోధించేలా ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ పిడుగురాళ్లకు చెందిన కుందుర్తి గురవాచారి ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.
ఇందులో పరిశ్రమలు, రెవెన్యూ శాఖల ముఖ్య కార్యదర్శులు, డీజీపీ, జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఎమ్మెల్యే వై.శ్రీనివాసరావు, సీబీఐ జాయింట్ డెరైక్టర్, గనులశాఖ అసిస్టెంట్ డెరైక్టర్లను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఎమ్మెల్యే శ్రీనివాసరావు స్థానిక టీడీపీ నేతలతో కలసి పిడుగురాళ్ల, నడికుడి, కానస్నపల్లి, దాచేపల్లి, కొండమోడులతోపాటు పలు గ్రామాల్లో గత రెండేళ్లుగా ప్రభుత్వ భూములు, జేపీ సిమెం ట్స్కు లీజుకిచ్చిన భూముల్లో అనుమతులు తీసుకోకుండా లైమ్స్టోన్ తవ్వకాలు చేస్తున్నారని పిటిషనర్ తన పిటిషన్లో పేర్కొన్నారు.