బీజేపీకే ఎక్కువ సీట్లు | BJP to be single largest party in Maha, Haryana | Sakshi
Sakshi News home page

బీజేపీకే ఎక్కువ సీట్లు

Oct 11 2014 1:09 AM | Updated on Mar 29 2019 9:24 PM

మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎక్కువ స్థానాలు గెలుచుకోనుందని ఇండియా టీవీ, సీ-ఓటర్ ఒపీనియన్ పోల్ అంచనా వేసింది

న్యూఢిల్లీ: మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎక్కువ స్థానాలు గెలుచుకోనుందని ఇండియా టీవీ, సీ-ఓటర్ ఒపీనియన్ పోల్ అంచనా వేసింది. అయితే మెజారిటీ సీట్లు మాత్రం బీజేపీకి దక్కకపోవచ్చని అభిప్రాయపడింది. 288 సీట్లున్న మహారాష్ట్రలో బీజేపీకి 132-142 మధ్య సీట్లు రావచ్చని ఒపీనియన్ పోల్‌లో వెల్లడైంది. అలాగే శివసేనకు 50-60 సీట్లు, ఎన్సీపీకి 31-41 సీట్లు, కాంగ్రెస్‌కు 38-48 సీట్లు, ఎంఎన్‌ఎస్ 8-14 సీట్లు, చిన్న పార్టీలు, స్వతంత్రులకు 3-9 సీట్లు రావచ్చని తమ సర్వేను ఉటంకిస్తూ ఇండియా టీవీ ఓ ప్రకటనలో తెలిపింది. ఓట్ల శాతం పరంగా చూస్తే బీజేపీకి 28 శాతం, శివసేనకు 19.7 శాతం, ఎన్సీపీకి 13.7 శాతం, కాంగ్రెస్‌కు 21.2 శాతం, ఎంఎన్‌ఎస్‌కు 7 శాతం రావచ్చని సర్వే పేర్కొంది. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి 144 సీట్లలో గెలవగా బీజేపీ-శివసేన కూటమి 90 సీట్లలో గెలుపొందింది. ఇతరులు 54 చోట్ల గెలిచారు. మరోవైపు 90 సీట్లున్న హర్యానాలో బీజేపీ 34 సీట్లతో అతిపెద్ద పార్టీగా నిలిచే అవకాశం ఉందని సర్వే అంచనా వేసింది. ఓం ప్రకాశ్ చౌతాలాకు చెందిన ఐఎన్‌ఎల్‌డీ 27 సీట్లతో రెండో స్థానంలో నిలవచ్చని, అధికార కాంగ్రెస్ 16 సీట్లకే పరిమితం కావచ్చని అభిప్రాయపడింది. ఇతర పార్టీలు మిగిలిన స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని పేర్కొంది. 2009 హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 40 సీట్లు గెలుచుకోగా ఐఎన్‌ఎల్‌డీ 31 సీట్లు, బీజేపీ 4 సీట్లు, హెచ్‌జేసీ, హెచ్‌జేపీ 6 సీట్లు, ఇతరులు 9 సీట్లలో గెలిచారు.


 మహా ఎన్నికల్లో 798 మంది నేర చరితులు
 
 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 798 మంది నేర చరితులు బరిలో ఉన్నారని అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) అనే స్వచ్ఛంధ సంస్థ వెల్లడించింది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న 4,119 మంది అభ్యర్థుల్లో 2,336 మంది సమర్పించిన అఫిడవిట్లను పరిశీలించగా క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న వారి సంఖ్య 798 అని తేలిందని ఏడీఆర్ అధినేత మేజర్ జనరల్(రిటైర్డ్) అనిల్ వర్మ శుక్రవారం వెల్లడించారు. క్రిమినల్ కేసులున్న వారికి ఎక్కువ టికెట్లు ఇచ్చిన పార్టీల్లో శివసేన ముందువరుసలో ఉంది. 278 మంది శివసేన అభ్యర్థుల్లో 169 మంది (61 శాతం)పై క్రిమినల్ కేసులున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement