ఓ విద్యార్థికి నిప్పంటుకోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అయితే అతను ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడా.. లేదా ఎవరైనా నిప్పంటించారా..?
మంటలతో విద్యార్థికి తీవ్రగాయాలు
మహబూబ్నగర్: ఓ విద్యార్థికి నిప్పంటుకోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అయితే అతను ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడా.. లేదా ఎవరైనా నిప్పంటించారా..? అనే విషయాలు తేలాల్సి ఉంది. వివరాలు.. మహబూబ్నగర్ జిల్లా నారాయణపేటకు చెందిన నర్సింహులుకు భార్య పదేళ్ల క్రితమే చనిపోయింది. దీంతో కుమారులు నరేందర్, శరత్లను జిల్లా కేం ద్రంలోని రెడ్క్రాస్ అనాథాశ్రమంలో చేర్చాడు. అనంతరం స్థానిక సాంఘిక బాలుర హాస్టల్ (ఆనంద ని లయం)లో ఉంటూ నరేందర్ ఏనుగొండ ప్రభుత్వ పాఠశాలలో ఏడు, శరత్ ఎనిమిదో తరగతి చదువుతున్నారు.
నెల రోజులుగా నరేందర్ పాఠశాలకు సరిగా రావడంలేదని ఉపాధ్యాయులు వార్డెన్ బాబారావు సమాచారమిచ్చారు. దీంతో ఆయన మందలించినా మార్పురాలేదు. ఈ క్రమంలోనే మంగళవారం మధ్యాహ్నం పాఠశాలకు సమీపంలో బాలుడికి నిప్పంటుకోగా స్థానికులు గమనించి వెంటనే మంటలను ఆర్పి జిల్లా ప్రధాన ఆస్పత్రికి తరలించారు. సోషల్ వెల్ఫేర్ డీడీ జయశంకర్, డీఎస్డబ్ల్యూవో శ్రీనివాస్, వార్డెన్ బాబురావు బాధితుడిని పరామర్శించి ఘటన గురించి ఆరా తీశారు. అనంత రం వారు వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్య చికిత్సల కోసం హైదరాబాద్లోని ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్లారు.
పొంతన లేని సమాధానాలు
కాగా, ఈ ఘటనపై విద్యార్థి పొంతలేని సమాధానం చెబుతున్నాడు. ఒకసారి మంటలు అంటుకున్నాయని, మరోసారి గుర్తుతెలియని వారు పెట్రోల్ పోసి నిప్పంటించారన్నాడు. మంగళవారం ఉదయం నరేందర్ అగ్గిపెట్టె ఉందా అని తనను అడిగినట్లు తోటి విద్యార్థి శ్రీనివాస్ తెలిపారు. పాఠశాలకు వెళదామంటే టీచర్ కొడతాడని భయపడ్డాడని చెప్పి హాస్టల్ నుంచి బయటకు వెళ్లాడన్నాడు. ఇంత జరిగినా హాస్టల్ అధికారులు మాత్రం పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. ఇంతకూ ఈ విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టాడా లేక గుర్తుతెలియని వ్యక్తులు నిప్పంటించారా? అనేది తెలియరాలేదు.