ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికల నామినేషన్లపర్వం మందకొడిగా సాగుతోంది. రెండోరోజైన గురువారం మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నాలుగు నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి.
సాక్షి, కరీంనగర్ : ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికల నామినేషన్లపర్వం మందకొడిగా సాగుతోంది. రెండోరోజైన గురువారం మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నాలుగు నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి. ఎంపీ స్థానాలకు ఇంకా బోణీ కాలేదు. కరీంనగర్ అసెంబ్లీ స్థానానికి వైఎస్సార్సీపీ తరఫున పార్టీ నగర కన్వీనర్ డాక్టర్ కె.నగేశ్ నామినేషన్ వేశారు. రామగుండం నియోజకవర్గానికి టీఆర్ఎస్ తరఫున కోరుకంటి చందర్, స్వతంత్ర అభ్యర్థిగా తోట వేణు నామినేషన్ సమర్పించారు.
హుజూరాబాద్ నియోజకవర్గానికి టీడీపీ తరఫున జమ్మికుంట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పొల్నేని సత్యనారాయణరావు నామినేషన్ వేశారు. శుక్రవారం మంచి ముహూర్తం ఉండడంతో ఎక్కువ మంది నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతున్నారు. నామినేషన్ల సమర్పణకు ఈ నెల 9వరకు గడువుంది. ఇప్పటివరకు ఆయా పార్టీలు అభ్యర్థులను ప్రకటించకపోవడంతో ఆశావహులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
పొత్తులు, టికెట్ల ఖరారులో ఇప్పటి దాకా ఏ పార్టీలోనూ స్పష్టత రాకపోవడంతో నాయకులు టెన్షన్ పడుతున్నారు. పార్టీ తరఫున నామినేషన్ దాఖలు చేసిన తర్వాత బీ ఫారం వస్తుందో రాదోనని ఆందోళన చెందుతున్నారు. ఒకవేళ బీఫారం రాకపోతే అనుచరులు.. ప్రజల్లో అవమానకరంగా ఉంటుందని నామినేషన్ వేసేందుకు వెనకడుగు వేస్తున్నారు.