సాక్షి, హైదరాబాద్: ఎనిమిదేళ్లుగా గ్రూప్–1, 3, 4 సర్వీసు, ఇతర ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేయడంలేదని, రాష్ట్రంలో 8 లక్షల మంది వివిధ కోర్సులు చేస్తూ ఉద్యోగాలకోసం ఎదురుచూస్తున్నారని ప్రభుత్వానికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య వివరించారు. ఈ మేరకు మంగళవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషిని కలిశారు. గుజ్జకృష్ణ, భూపేశ్సాగర్లతో కలిసి ఖాళీల వివరాలతో కూడిన వినతి పత్రం సమర్పించారు. గ్రూప్–1లో 1200 ఉద్యోగాలు, గ్రూప్–3లో 8వేలు, గ్రూప్–4 సర్వీసులో 35వేలు ఖాళీగా ఉన్నాయని వివరించారు.
ఉద్యోగాలను భర్తీ చేసే టీఎస్పీఎస్సీలో వందల సంఖ్యలో ఖాళీలున్నాయన్నారు. కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారుకానీ అక్కడ సిబ్బందిని నియమించలేదన్నారు. రిటైర్ అయిన వారిని ఓఎస్డీలు, ప్రభుత్వ సలహాదారులుగా నియమించడం వల్ల కొత్తవారికి అవకాశం రావడం లేదన్నారు. త్వరలో 46 శాఖల ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటుచేసి, భర్తీకి చర్యలు తీసుకుంటామని సీఎస్ హామీ ఇచ్చారని కృష్ణయ్య తెలిపారు.
ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వరా?
Feb 28 2018 1:16 AM | Updated on Feb 28 2018 1:16 AM
Advertisement
Advertisement