అధికారుల నిర్లక్ష్యం వ్యవసాయానికి శాపంగా మారుతోంది. పంట సాగును అంచనా వేసిన అధికారులు.. అందుకు అనుగుణం గా విత్తనాలు, ఎరువులను తెప్పించడంలో విఫలమవుతున్నారన్న ఆరోపణలున్నాయి.
జిల్లాలో సాగు అంచనా 3,98,900 హెక్టార్లు
కాగితాలకే పరిమితమైన కార్యాచరణ
మార్కెట్లో సరిపడా లేని విత్తనాలు, ఎరువులు
ఆందోళనలో రైతాంగం
అధికారుల నిర్లక్ష్యం వ్యవసాయానికి శాపంగా మారుతోంది. పంట సాగును అంచనా వేసిన అధికారులు.. అందుకు అనుగుణం గా విత్తనాలు, ఎరువులను తెప్పించడంలో విఫలమవుతున్నారన్న ఆరోపణలున్నాయి. సీజన్ ఆరంభమైనా.. జిల్లాలో అరకొరగానే వి త్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండడంతో ఈసారి ఖరీఫ్ సాగు ప్రశ్నార్థకంగా కనిపిస్తోంది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
జిల్లాలో 2013 ఖరీఫ్ సీజన్లో వ్యవసాయశాఖ అంచనాలకు మించి పంటలు సాగయ్యాయి. రైతులు పది శాతం ఎక్కువ విస్తీర్ణంలో సుమారు 3,04,648 హెక్టార్లలో పంటలు వేశారు. దీంతో విత్తనాల కొరత ఏర్పడింది. దీనిని దృష్టిలో ఉంచుకొని ఈసారి యాక్షన్ ప్లాన్ రూపొందించారు. సాగు అంచనాను 3,98,900 హెక్టార్లకు పెంచారు. 1.50 లక్షల హెక్టార్లలో వరి, 1.50 లక్షల హెక్టార్లలో సోయా, 45 వేల హెక్టార్లలో మొక్కజొన్న, 13,500 హెక్టార్లలో పత్తి, 13,500 హెక్టార్లలో పసుపు వేయనుండగా.. మిగతా హెక్టార్లలో కందులు, పెసర, చెరకు తదితర పంటలు వేస్తారని అంచనా వేశారు. ఏపీ సీడ్స్, హాకా, ఏపీ ఆయిల్ఫెడ్ల ద్వారా 70 వేల క్వింటాళ్ల సోయా విత్తనాలు, 3,650 క్వింటాళ్ల మొక్కజొన్నలతో పాటు మొత్తం 79,800 క్వింటాళ్ల విత్తనాలను సరఫరా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ప్రస్తుతం 14 వేల క్వింటాళ్ల విత్తనాలు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు అధికారుల రికార్డులు పేర్కొంటున్నాయి.
ఎరువుల విషయానికొస్తే ఈ ఖరీఫ్ సీజన్లో 2,49,685 మెట్రిక్ టన్నుల యూరియా, డీఏపీ, కాంప్లెక్స్ తదితర ఎరువులు అవసరం ఉంటాయని యాక్షన్ ప్లాన్లో అధికారులు పేర్కొన్నారు. కాగా మార్క్ఫెడ్, సహకార సంఘాలు, ప్రైవేట్ డీలర్ల వద్ద 92,143 మెట్రిక్ టన్నుల నిల్వలు మాత్రమే ఉన్నట్లు చెబుతున్నారు. రైతులు, రైతు సంఘాల్లో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఖరీఫ్ కార్యాచరణను వ్యవసాయశాఖ ముందుగానే రూపొందించినా.. ఆచరణలో ఆ ప్రణాళిక కాగితాలకే పరిమితం అయ్యిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా వ్యవసాయ శాఖ సరైన అంచనాలతో సరిపడా విత్తనాలు, ఎరువులను తెప్పించాలని రైతులు కోరుతున్నారు. బ్లాక్ మార్కెట్ దందాపైనా నిఘా పెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు