బయటకు వచ్చి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు

Isolation Wards In District Center Susy Etala Rajinder - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు సంఖ్య రోజురోజుకీ పెరుగుతున్న తరుణంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా లక్షణాలు ఉన్నవారికి జిల్లా స్థాయి కేంద్రాల్లోనే వైద్య చికిత్స అందించాలని ఆ శాఖ మంత్రి ఈటల రాజేందర్ అధికారులను ఆదేశించారు. అలాగే అన్ని జిల్లా కేంద్రా‍ల్లో ఐసోలేషన్‌ వార్డులను ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆదివారం ఉన్నత అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రి ఆదేశాలు జారీ చేశారు. జీవనోపాధి కోల్పోకూడదని మాత్రమే లాక్‌డౌన్‌ని ఎత్తి వేయడం జరిగిందని, ప్రజలు అవసరం లేకున్నా బయటికి వచ్చి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని మంత్రి ఈటల రాజేందర్ విజ్ఞప్తి చేశారు. (టెన్త్‌ పరీక్షలు : కేసీఆర్‌ కీలక భేటీ)

కరోనా వైరస్ వ్యాప్తి, నియంత్రణ పట్ల ప్రభుత్వాలు ఎంత ప్రచారం చేసినా కొంత మంది ప్రజల్లో భయాందోళనలు మాత్రం తగ్గడం లేదని మంత్రి అన్నారు. హోమ్ క్వారంటైన్లో ఉండేందుకు కేంద్రం అనుమతి ఇచ్చినా ప్రజల్లో ఉన్న భయం వారిని హాస్పిటల్ నుంచి బయటకి రానివ్వడం లేదని పేర్కొన్నారు. మరోపక్క పాజిటివ్ పేషంట్ ఇంటి పక్కన ఉంటే తమకు వైరస్ సోకుతుందేమో అన్న  భయం ప్రజల్లో ఉండటంతో హోమ్ క్వారంటైన్‌లో ఉండే వారిని ఇబ్బంది పెడుతున్నారని చెప్పారు. జియగూడలో ఇలాంటి సంఘటనే చోటుచేసుకుందని గుర్తుచేశారు. ఈ మేరకు ఆదివారం రాత్రి సమీక్షా సమావేశం అనంతరం ఈటల ప్రెస్‌నోట్‌ను విడుదల చేశారు. 

‘కోవిడ్‌ బాధితుల సంఖ్య పెరిగితే ప్రభుత్వం, వైద్యుల మీది ఒత్తిడి మరింత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిబందనల మేరకు తక్కువ లక్షణాలు ఉన్న, లక్షణాలు లేకుండా ఉన్న పాజిటివ్ పేషంట్లను ఇంట్లో ఉంచి చికిత్స అందించడానికి ప్రజలు, సమాజం సహకరించాలి. లాక్‌డౌన్ సడలించడం వల్ల ప్రజలు ఎక్కువ మంది బయటకి రావడంతో వైరస్‌ వ్యాప్తి పెరిగింది. వయసు మీద పడినవారికి, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి కరోనా సోకితే మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు కరోనా సోకకుండా ఉండే జాగ్రత్తలు పాటించాలని కోరుతున్నా. మరణాలు తగ్గించడానికి కృషి చేస్తున్నాం.’ అని తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top