ప్రగతి వైపు పయనం

Governor ESL Narasimhan Speech At Assembly - Sakshi

ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగం  

ఇచ్చిన హామీలే కాకుండా కొత్త పథకాలు అమలు

ఈ ఏడాది నుంచే 10 వేలతో రైతుబంధు పథకం

సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేసే లక్ష్యంగా ముందడుగు

పెంచిన పింఛన్లు, రుణమాఫీ, నిరుద్యోగ భృతి అమలు

మార్చికల్లా ఇంటింటికీ మిషన్‌ భగీరథతో తాగునీరు

రిజర్వేషన్లపై రాజీలేని పోరాటం చేస్తున్నామని స్పష్టీకరణ

ఎమ్మెల్యేలకు హృదయపూర్వక శుభాకాంక్షలు

సాక్షి, హైదరాబాద్‌: కేసీఆర్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి పనులు, పథకాలతో రాష్ట్రం ప్రగతి పథంలో పయనిస్తోందని గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ పేర్కొన్నారు. నాలుగున్నరేళ్లలో ఇచ్చిన హామీలే కాకుండా కొత్త పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిందని ప్రశంసించారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా శనివారం అసెంబ్లీ ఉభయసభలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన శాసనసభ్యులందరికీ తెలుగులో హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ గవర్నర్‌ ప్రసంగాన్ని ప్రారంభించారు. సభ్యులందరి పదవీకాలం దిగ్విజయంగా సాగాలని, అంకితభావంతో పనిచేయాలని గవర్నర్‌ ఆకాంక్షించారు. తెలంగాణ కొత్త రాష్ట్రంలో ఏర్పడిన రెండో ప్రభుత్వంలో.. తొలిసారి కొలువుదీరిన ఉభయసభలనుద్దేశించి ప్రసంగించడం సంతోషంగా ఉందన్నారు. ఇప్పటివరకు ప్రభుత్వం అమలు చేసిన పథకాలు, చేయాల్సిన కార్యక్రమాలపై ఆంగ్లంలో ప్రసంగాన్ని కొనసాగించిన గవర్నర్‌ నరసింహన్‌ చివరకు తెలుగులో ముగించారు.

కీలక సమస్యల పరిష్కారం
ఆరు దశాబ్దాల సుదీర్ఘ పోరాటం తర్వాత తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రం సాధించుకోగలిగారని, రాష్ట్ర సాధన ఉద్యమాన్ని ముందుండి నడిపిన కేసీఆర్‌ నేతృత్వంలో తొలి ప్రభుత్వం ఏర్పడిందని గవర్నర్‌ ప్రశంసించారు. ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తూ, అవినీతి రహిత పాలన అందించడంలో ప్రభుత్వం విజయం సాధించిందన్నారు. 29 రాష్ట్రాల్లో ఎవరికీ సాధ్యంకాని రీతిలో ఆర్థిక వృద్ధిని తెలంగాణ సొంతం చేసుకుందని ప్రశంసించారు. 2014–2018 వరకు 17.17% సగటు వార్షికాదాయ వృద్ధిరేటు నమోదైందని, ఈ ఆర్థిక సంవత్సరంలో నవంబర్‌ నాటికే రాష్ట్రం 29.93% ఆదాయ వృద్ధిరేటు సాధించిందని సభకు తెలియజేశారు. జీఎస్‌టీ వసూళ్లలోనూ దేశంలోనే తెలంగాణ ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. వృద్ధులు, వితంతువులు తదితర వర్గాల వారికి పింఛన్ల మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం గణనీయంగా పెంచిందని నరసింహన్‌ వెల్లడించారు. పేద ఆడ పిల్లల వివాహానికి ప్రభుత్వం ద్వారా రూ.1,00,116 సాయం అందించే కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని గవర్నర్‌ కొనియాడారు. ప్రభుత్వమే ఇంటింటికీ నల్లా సౌకర్యం కల్పించి, శుద్ధమైన తాగునీటిని అందించేలా ‘మిషన్‌ భగీరథ’ను ప్రభుత్వం చేపట్టిందని, రాష్ట్రంలోని మొత్తం 66 మున్సిపాలిటీలకు, 23,968 ఆవాసాలకు సురక్షిత తాగునీరు అందించడమే లక్ష్యంగా నిర్దేశించుకుందన్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే 56 మున్సిపాలిటీలకు, అన్ని ఆవాసాలకు మిషన్‌ భగీరథ ద్వారా ప్రస్తుతం మంచినీళ్లు అందుతున్నాయన్నారు.

కోటిఎకరాలకు సాగునీరు
రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగునీరందించడమే లక్ష్యంగా ప్రభుత్వం భారీ నీటిప్రాజెక్టులను నిర్మిస్తోందని గవర్నర్‌ తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసే సీతారామ ప్రాజెక్టుకు అటవీ, పర్యావరణ అనుమతులను ఇటీవలే సాధించుకున్నామన్నారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కూడా అన్ని అనుమతులు సాధించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. మిషన్‌ కాకతీయ ద్వారా నాలుగు దశల్లో 20,171 చెరువుల పునరుద్ధరణ పూర్తయిందని, ఈ చెరువుల్లో నీటి నిల్వ సామర్థ్యంతోపాటు భూగర్భ నీటిమట్టం గణనీయంగా పెరిగిందని ఆయన తెలిపారు. ఇందుకోసం గడిచిన నాలుగున్నరేళ్లలో రూ.77,777 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేసిందని, రాబోయే కాలంలో రూ.1,17,000 కోట్ల అంచనా వ్యయంతో పనులు చేపట్టిందన్నారు. తెలంగాణ ఏర్పడిన తొమ్మిదో నెల నుంచే నిరంతరాయ నాణ్యమైన విద్యుత్తును 24గంటల పాటు సరఫరా చేస్తున్నట్లు గవర్నర్‌ సభకు తెలియజేశారు.

తెలంగాణను మిగులు విద్యుత్‌ రాష్ట్రంగా మార్చేందుకు 28వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి లక్ష్యంగా తలపెట్టిన కొత్త విద్యుత్‌ ప్లాంట్ల నిర్మాణం శరవేగంగా జరుగుతోందన్నారు. 800 మెగావాట్ల కేటీపీఎస్‌ 7వ దశను 42 నెలల రికార్డు సమయంలో పూర్తి చేసి, విద్యుదుత్పత్తి ప్రారంభించడం గొప్ప పరిణామమన్నారు. రైతుకు అండగా ఉండేందుకు పంట పెట్టుబడి కోసం ఎకరాకు రూ.4వేల చొప్పున.. రెండు పంటలకు రూ.8వేలు అందడంపై రైతాంగం హర్షం వ్యక్తం చేస్తోందన్నారు. ఈ పథకాన్ని ఐక్యరాజ్యసమితి ప్రశంసించడం తెలంగాణ ప్రజలకు గర్వకారణమన్నారు. భూ వివాదాలను శాశ్వతంగా పరిష్కరించడం కోసం, భూ రికార్డుల నిర్వహణ పారదర్శకతే లక్ష్యంగా రికార్డుల సమగ్ర ప్రక్షాళన కార్యక్రమం చేపట్టిందన్నారు. ప్రభుత్వం చేసిన కృషితో దాదాపు 94% భూముల యాజమాన్యాల హక్కుల విషయంలో స్పష్టత వచ్చిందన్నారు.

కొత్త జిల్లాలతో పాలన సంస్కరణలు
పరిపాలనా సౌలభ్యం, ప్రభుత్వ కార్యక్రమాల అమలులో వేగం, పారదర్శకతను పెంచేందుకు 10 జిల్లాలను 31 జిల్లాలు చేసుకున్నట్టు గవర్నర్‌ తెలిపారు. కొత్తగా నారాయణపేట, ములుగు జిల్లాలను కూడా ఏర్పాటుచేస్తున్నట్టు తెలిపారు. 43 రెవెన్యూ డివిజన్ల సంఖ్యను 69కి, 459 మండలాలను 584 మండలాలకు పెంచినట్టు తెలిపారు. గతంలో ఉన్న 8,690 గ్రామ పంచాయతీలను 12,751కు పెంచుకున్నట్లు సభకు వివరించారు. వచ్చేవారం జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 3వేల మంది ఎస్టీలు సర్పంచులయ్యే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిందన్నారు. పోలీస్‌ శాఖలో రెండు పోలీస్‌ కమీషనరేట్లు మాత్రమే ఉండేవని, కొత్తగా మరో ఏడు కమిషనరేట్లు ఏర్పాటుచేసినట్లు గవర్నర్‌ వెల్లడించారు. కొత్త జిల్లాల ప్రాతిపదికన స్థానికుల హక్కులు పరిరక్షించటం కోసం, ప్రభుత్వం కొత్త జోనల్‌ వ్యవస్థను ఏర్పాటు చేసిందని, లోకల్‌ కేడర్‌ ఉద్యోగాలలో 95% అవకాశాలు స్థానికులకే లభించేలా చట్టం చేసిందన్నారు. జిల్లా కేడర్‌తో పాటు 7 జోన్లు, 2 మల్టీ జోన్లు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం చట్టం తీసుకొచ్చిందని.. కొత్త జోనల్‌ వ్యవస్థ ప్రకారమే తెలంగాణలో నియామకాలు జరుగుతాయన్నారు. రాష్టంలో పరిశ్రమల స్థాపనకోసం టీఎస్‌ఐపాస్‌ ద్వారా కేవలం 15 రోజుల్లోనే అనుమతులు లభిస్తున్నాయన్నారు. ఇప్పటివరకు 8వేల పరిశ్రమలకు అనుమతులు లభించగా అందులో 5,570 పరిశ్రమల్లో ఉత్పత్తి మొదలైందన్నారు. రూ.1.32 లక్షల కోట్ల పెట్టుబడులు రాగా.. 8.37 లక్షల మందికి ఉద్యోగాలు లభించాయన్నారు. నిరుపేదలకు గృహనిర్మాణం పథకంలో భాగంగా డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ళను నిర్మిస్తున్నామని.. ఇప్పటివరకు 2,72,763 ఇళ్ళను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. బలహీనవర్గాల గృహనిర్మాణ పథకం కింద లబ్ధిదారులు గతంలో బకాయి పడ్డ రూ. 4వేల కోట్లను ప్రభుత్వం రద్దుచేసిందన్నారు.

సజావుగా శాంతిభద్రతలు
శాంతి భద్రతల పరిరక్షణలో రాష్ట్ర పోలీస్‌ శాఖ భేషుగ్గా పనిచేస్తోందని గవర్నర్‌ నరసింహన్‌ కితాబిచ్చారు. అభివృద్ధిలో శాంతి భద్రతలకున్న ప్రాధాన్యతను గుర్తించి, ప్రభుత్వం పోలీసు శాఖకు ఎక్కువ బడ్జెట్‌ కేటాయించిందన్నారు. త్వరలోనే హైదరాబాద్‌లో అంతర్జాతీయ స్థాయిలో పోలీస్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ప్రారంభం కానుందని గవర్నర్‌ తెలిపారు. పేకాట, గుడుంబా తయారీ వంటి సమస్యలను పోలీస్‌ శాఖ సమర్థవంతంగా అరికట్టిందన్నారు.

గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు పునరుత్తేజం
కుల వృత్తుల మీద ఆధారపడి జీవించే బీసీలు, వారి వృత్తులకు ఆర్థిక చేయూత, ప్రోత్సాహం ఇవ్వడం వల్ల రాష్ట్రంలోని బీసీల స్థితిగతులను మార్చేందుకు ప్రభుత్వం కృషిచేసిందన్నారు. గొల్ల, కురుమలు, మత్స్యకారులు, నేత కార్మికులు, విశ్వకర్మలు, చాకలి, మంగలి తదితర కులాల వారికి ప్రత్యేక పథకాలు అమలు చేశామన్నారు. ఎంబీసీ కార్పొరేషన్‌ ద్వారా సంచార, ఆశ్రిత కులాలు తదితర వర్గాల కోసం రూ.1,000 కోట్ల నిధులు కేటాయించినట్టు తెలిపారు. కేజీ టు పీజీ ఉచిత విద్యావిధానంలో నూతన స్కూళ్లు, రెసిడెన్షియల్‌ కాలేజీలను ప్రభుత్వం ఏర్పాటుచేసినట్టు నరసింహన్‌ తెలిపారు. రాష్ట్రం ఏర్పడకముందు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల కోసం 296 గురుకులాలు మాత్రమే ఉండేవని, తెలంగాణ ప్రభుత్వం కొత్తగా 542 గురుకులాలు ఏర్పాటుచేసిందన్నారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి బీసీల కోసం మరో 119 రెసిడెన్షియల్‌ స్కూళ్లను ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వాసుపత్రుల్లో అవసరమైన మందులను పేదలకు ఉచితంగా అందిస్తున్నామన్నారు. 40 ప్రభుత్వ ఆసుపత్రుల్లో డయాలసిస్‌ కేంద్రాలు, ఎంఆర్‌ఐ, సీటీæ స్కాన్, డిజిటల్‌ రేడియాలజీ, 2డీ ఎకో తదితర అత్యాధునిక పరికరాలను అందుబాటులోకి తెచ్చినట్లు నరసింహన్‌ వెల్లడించారు.

కుల వృత్తుల మీద ఆధారపడి జీవించే బీసీలు, వారి వృత్తులకు ఆర్థిక చేయూత, ప్రోత్సాహం ఇవ్వడం వల్ల రాష్ట్రంలోని బీసీల స్థితిగతులను మార్చేందుకు ప్రభుత్వం కృషిచేసిందన్నారు. గొల్ల, కురుమలు, మత్స్యకారులు, నేత కార్మికులు, విశ్వకర్మలు, చాకలి, మంగలి తదితర కులాల వారికి ప్రత్యేక పథకాలు అమలు చేశామన్నారు. ఎంబీసీ కార్పొరేషన్‌ ద్వారా సంచార, ఆశ్రిత కులాలు తదితర వర్గాల కోసం రూ.1,000 కోట్ల నిధులు కేటాయించినట్టు తెలిపారు. కేజీ టు పీజీ ఉచిత విద్యావిధానంలో నూతన స్కూళ్లు, రెసిడెన్షియల్‌ కాలేజీలను ప్రభుత్వం ఏర్పాటుచేసినట్టు నరసింహన్‌ తెలిపారు. రాష్ట్రం ఏర్పడకముందు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల కోసం 296 గురుకులాలు మాత్రమే ఉండేవని, తెలంగాణ ప్రభుత్వం కొత్తగా 542 గురుకులాలు ఏర్పాటుచేసిందన్నారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి బీసీల కోసం మరో 119 రెసిడెన్షియల్‌ స్కూళ్లను ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వాసుపత్రుల్లో అవసరమైన మందులను పేదలకు ఉచితంగా అందిస్తున్నామన్నారు. 40 ప్రభుత్వ ఆసుపత్రుల్లో డయాలసిస్‌ కేంద్రాలు, ఎంఆర్‌ఐ, సీటీæ స్కాన్, డిజిటల్‌ రేడియాలజీ, 2డీ ఎకో తదితర అత్యాధునిక పరికరాలను అందుబాటులోకి తెచ్చినట్లు నరసింహన్‌ వెల్లడించారు.

ప్రసంగంలోని మరిన్ని అంశాలు

  •    అర్హులకు అందించే ఆసరా పింఛన్లు రూ.1,000 నుంచి రూ.2,016 రూపాయలకు పెంపు
  •    దివ్యాంగులకు పింఛను రూ.1,500ల నుంచి రూ.3,016లు పెంచేందుకు నిర్ణయం
  •    వృద్దాప్య పింఛన్‌ పథకం 57 ఏళ్లకు సడలింపు. ఈ వయస్సు నిండిన వారందరినీ లబ్ధిదారులుగా గుర్తించడం
  •    నిరుద్యోగులకు నెలకు రూ.3,016లు భృతి.
  •    ప్రస్తుత పద్ధతిలో డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల నిర్మాణం కొనసాగిస్తూనే, సొంతస్థలం ఉన్న అర్హులైన పేదలకు డబుల్‌ బెడ్‌రూం ఇంటి నిర్మాణం కోసం రూ.5–6 లక్షల సాయం
  •    రైతులకు రూ.1 లక్ష వరకు పంట రుణాల మాఫీ
  •    ఈ సంవత్సరం నుంచి రైతుబంధు ఎకరానికి ఏడాదికి రూ.8 వేల నుంచి రూ.10వేలకు పెంపు
  •    రైతు సమన్వయ సమితి సభ్యులకు గౌరవ భృతి, ఎస్సీ, ఎస్టీ వర్గాల సమగాభివృద్ధికి ప్రత్యేక పథకాల రూపకల్పనకు కమిటీ నివేదిక ఆధారంగా అమలు
  •    చట్టసభల్లో బీసీలకు 33%, మహిళలకు 33% రిజర్వేషన్‌ అమలు కోసం ప్రభుత్వం పోరాటం.  
  •    ఎస్టీలకు 12%, మైనారిటీలకు 12% రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ కోసం కేంద్రంతో రాజీలేని పోరాటానికి నిర్ణయం.
  •    రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు.. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటు  
  •    సందర్భోచితంగా ఐకేపీ ఉద్యోగుల సేవల క్రమబద్ధీకరణకు నిర్ణయం.
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top