ఏప్రిల్ నెల వేతనంలో కూడా వాయిదా
ఉత్తర్వులు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులకు మార్చి నెల మాదిరిగానే ఏప్రిల్ నెల వేతనాల్లో కూడా కొంతభాగాన్ని వాయిదా వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికోసం ప్రభుత్వం గత నెలలో విడుదల చేసిన ఉత్తర్వులను పరిగణనలోకి తీసుకోవాలని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కె. రామకృష్ణారావు సోమవారం ఇచ్చిన ఉత్తర్వుల్లో వెల్లడించారు.
రాష్ట్ర ప్రభుత్వానికి రావల్సిన పన్నులు, పన్నేతర ఆదాయం రాకపోవడంతో పాటు కోవిడ్–19 నివారణకు చర్యలు తీసుకోవలసి ఉన్నందున జీవో నం: 27 ప్రకారం ఏప్రిల్ నెల జీతంలో కూడా వాయిదా కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. అయితే పింఛన్దారులకు మాత్రం (లాస్ట్ గ్రేడ్ సర్వీస్ పింఛన్ దారులను మినహాయించి) వారి నెల పింఛన్లో 25 శాతం మాత్రమే వాయిదా వేయాలని అందులో పేర్కొన్నారు. కాగా, తదుపరి ఉత్తర్వులో పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.