టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని సీపీఐ జిల్లా కార్యదర్శి బాగం హేమంతరావు ఆరోపించారు.
మాటలతో మభ్యపెడుతున్న సీఎం కేసీఆర్
Mar 21 2017 6:11 PM | Updated on Aug 14 2018 11:02 AM
► సీపీఐ జిల్లా కార్యదర్శి బాగం హేమంతరావు విమర్శలు
ఖమ్మం : టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి 33 మాసాలు గడుస్తున్నా ఇంత వరకు ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని సీపీఐ జిల్లా కార్యదర్శి బాగం హేమంతరావు ఆరోపించారు. మంగళవారం ఖమ్మంలోని గిరిప్రసాద్ భవన్లో జరిగిన సీపీఐ జిల్లా సమితి సమావేశంలో బాగం మాట్లాడుతూ సీఎం కేసీఆర్ మాయ మాటలతో ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికై ఈ నెల 27వ తేదీ ఖమ్మం కలెక్టరేట్ను ముట్టడించనున్నట్లు తెలిపారు ఈ ముట్టడిలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలన్నారు.
అర్హులందరికి డబుల్బెడ్ రూం ఇండ్లు ఇవ్వాలని, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీతారామ ప్రాజెక్టుకు నిధులు కేటాయించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని, ఇలా అయితే ప్రాజెక్టు పూర్తి అయ్యేసరికి 10 సంవత్సరాలు పడుతుందన్నారు. రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగునీరు అందిస్తామని బహిరంగ సభల్లో చెబుతున్న మాటలు ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. ప్రాజెక్టుల నిర్మాణం కేవలం తమ కుటుంబాల లబ్ధి పొందేందుకే చేపడుతున్నారన్నారు. మిషన్ భగీరథ పేరుతో కోట్ల రూపాయలను దుర్వినియోగం చేస్తున్నారన్నారు. కేసీఆర్ పాలనను నిరసిస్తూ నిర్వహించే కలెక్టరేట్ ముట్టడిని జయప్రదం చేయాలన్నారు. ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పోటు ప్రసాద్, జమ్ముల జితేందర్రెడ్డి, శింగు నరసింహారావు, తాటి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement