రైలు ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండండి
అధికారులకు దక్షిణ మధ్య రైల్వే జీఎం ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైళ్లకు ప్రమాదాలు చోటుచేసుకోకుండా అప్రమత్తంగా ఉండాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా అధికారులను ఆదేశించారు. వంతెనలు, సొరంగాలు, చెరువులను ఆనుకుని ట్రాక్ ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. మంగళవారం ఆయన రైల్ నిలయంలో రైళ్ల భద్రత, సమయపాలనపై సమీక్ష నిర్వహించారు. వర్షాలు కురుస్తున్నప్పుడు ఏర్పడే సిగ్నలింగ్, ఇంజనీరింగ్ వైఫల్యాలపై దృష్టి సారించాలన్నారు.
సరుకు రవాణాలో కూడా శ్రద్ధ కనబరచాలన్నారు. 150వ గాంధీ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని, మహాత్ముడి జీవిత విశేషాలతో ఉన్న చిత్రాలను రైల్వేస్టేషన్లలో ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు జీఎం జాన్ థామస్, చీఫ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ విజయ్ అగర్వాల్, ప్రిన్సిపల్ ఫైనాన్స్ అడ్వైజర్ బ్రజేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు.