మహబూబ్‌నగర్‌ శుభారంభం

తెలంగాణ టి20 లీగ్‌

సాక్షి, హైదరాబాద్‌: జి.వెంకటస్వామి స్మారక తెలంగాణ టి20 (టీటీఎల్‌) లీగ్‌ తొలి మ్యాచ్‌లో రంగారెడ్డి రైజర్స్‌ 7 వికెట్లతో ఘనవిజయం సాధించింది. మెదక్‌ మావేరిక్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన మెదక్‌ 19.5 ఓవర్లలో 98 పరుగులకు ఆలౌటైంది. రంగారెడ్డి పేసర్‌ మెహదీ హసన్‌ (3/12) ధాటికి మెదక్‌ తక్కువ స్కోరుకే పరిమితమైంది. అనంతరం బరిలోకి దిగిన రైజర్స్‌ 13.2 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 102 పరుగులు చేసింది. అక్షత్‌ రెడ్డి (48 నాటౌట్‌), ప్రతీక్‌ పవార్‌ (39) చెలరేగడంతో మరో 40 బంతులు మిగులుండగానే రైజర్స్‌ విజయం సాధించింది. అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకున్న మెహదీ హసన్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది.
 
కాకతీయ కింగ్స్‌తో జరిగిన మరో మ్యాచ్‌లో ఎమ్‌ఎల్‌ఆర్‌ రాయల్స్‌ మహబూబ్‌నగర్‌ గెలుపొందింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన మరో మ్యాచ్‌లో కాకతీయ కింగ్స్‌ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లకు 159 పరుగులు చేసింది. ప్రజ్ఞయ్‌ రెడ్డి (45 బంతుల్లో 67; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు), చరణ్‌తేజ (30) ఆకట్టుకున్నారు. రాయ ల్స్‌ బౌలర్లలో అజయ్‌ దేవ్‌గౌడ్‌ (3/25) రాణించాడు. అనంతరం రాయల్స్‌ 16.5 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 163 పరుగులు చేసింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ఠాకూర్‌ తిలక్‌ వర్మ (32 బంతుల్లో 60; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), చంద్రశేఖర్‌ (46 నాటౌట్‌) సత్తాచాటడంతో రాయల్స్‌ మరో 19 బంతులు మిగిలుండగానే గెలుపొందింది.

కరీంనగర్‌ వారియర్స్, ఆదిలాబాద్‌ టైగర్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌ ‘టై’ కావడంతో సూపర్‌ ఓవర్‌ ద్వారా విజేతను నిర్ణయించారు. మొదట బ్యాటింగ్‌ చేసిన కరీంనగర్‌ 5 వికెట్లకు 169 పరుగులు చేయగా... ఆ తర్వాత ఆదిలాబాద్‌ కూడా 9 వికెట్ల నష్టానికి సరిగ్గా అన్నే పరుగులు చేయడంతో మ్యాచ్‌ ‘టై’ అయింది. వారియర్స్‌ తరఫున రాహుల్‌ (55 బంతుల్లో 83; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు), టైగర్స్‌ తరఫున బెంజమిన్‌ (47 బంతుల్లో 60; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) భారీ స్కోర్లు చేశారు. అనంతరం జరిగిన సూపర్‌ ఓవర్‌లో కూడా రాహుల్‌ రాణించడంతో కరీంనగర్‌ విజయం సాధించింది.  

,

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top