ఆసీస్‌కు భారీ లక్ష్యం

India Set Target of 359 Runs Against Australia in 4th Odi - Sakshi

మొహాలి: ఆస్ట్రేలియాతో్ జరుగుతున్న నాల్గో వన్డేలో టీమిండియా 359 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్ ఆది నుంచి దూకుడుగా ఆడింది. భారత ఓపెనర్లలో శిఖర్‌ ధావన్‌(143; 115బంతుల్లో 18 ఫోర్లు, 3 సిక్సర్లు) భారీ శతకం నమోదు చేయగా, రోహిత్‌ శర్మ(95; 92 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 193 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించారు. తద్వారా వన్డేల్లో ఆసీస్‌పై అత్యధిక పరుగుల భాగస్వామ్యాన్ని సాధించి సరికొత్త రికార్డు నెలకొల్పారు.
(ఇక్కడ చదవండి: మరో ‘సెంచరీ’ కొట్టేశారు..!)

కాగా, రోహిత్‌ శర్మ తొలి వికెట్‌గా పెవిలియన్‌ చేరిన తర్వాత ధావన్‌ మరింత ధాటిగా ఆడాడు.  ఈ క్రమంలో వన్డేల్లో 16వ సెంచరీ సాధించిన ధావన్‌.. అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేశాడు. అయితే భారత్‌ స్కోరు 254 పరుగుల వద్ద ధావన్‌ రెండో వికెట్‌ ఔటయ్యాడు. ప్యాట్ కమిన్స్‌ బౌలింగ్‌లో ధావన్‌ బౌల్డ్‌ అయ్యాడు. ఆపై మరో 12 పరుగుల వ్యవధిలో విరాట్‌ కోహ్లి(7) ఔట్‌ కావడంతో భారత్ మూడో వికెట్‌ను నష్టపోయింది. ఆ తరుణంలో కేఎల్‌ రాహుల్‌తో జత కలిసిన రిషబ్‌ పంత్‌ బ్యాట్‌ ఝుళిపించాడు.  జట్టు స్కోరు 296 పరుగుల వద్ద రాహుల్‌(26) నాల్గో వికెట్‌గా పెవిలియన్‌ బాటపట్టాడు.
(ఇక‍్కడ చదవండి: ఆసీస్‌పై సరికొత్త రికార్డు)

కాసేపటికి రిషభ్‌ పంత్‌(36; 24 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్‌) ఐదో వికెట్‌గా ఔటయ్యాడు. అటు తర్వాత జాదవ్‌(10), భువనేశ్వర్‌లు స్వల్ప వ్యవధిలో ఔట్‌ కావడంతో భారత్‌ స్కోరులో వేగం తగ్గింది. చివర్లో విజయ్‌ శంకర్‌( 26; 15 బంతుల్లో 1 ఫోర్‌, 2 సిక్సర్లు) ధాటిగా ఆడటంతో భారత్‌ నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 358 పరుగులు చేసింది. కమిన్స్‌ వేసిన ఆఖరి ఓవర్‌ చివరి బంతికి బుమ్రా సిక్స్‌ కొట్టడం విశేషం. ఇది ఆస్ట్రేలియాపై భారత్‌కు రెండో తొలి ఇన్నింగ్స్‌ అత్యధిక స్కోరు. 2013 బెంగళూరులో ఆసీస్‌తో జరిగిన వన్డేలో భారత్‌ ఆరు వికెట్ల నష్టానికి 383 పరుగులు చేసింది. ఇది తొలి స్థానంలో ఉండగా, తాజా మ్యాచ్‌లో స్కోరు రెండో స్థానాన్ని ఆక్రమించింది. ఇక మొహాలిలో భారత్‌కు ఇది రెండో అత్యధిక స్కోరు. 2017లో శ్రీలంకపై ఇదే స్టేడియంలో భారత్‌ నాలుగు వికెట్ల నష్టానికి 392 పరుగులు చేసింది. ఆసీస్‌ బౌలర్లలో కమిన్స్‌ ఐదు వికెట్లు సాధించగా, రిచర్డ్‌సన్‌ మూడు వికెట్లు తీశాడు. ఆడమ్‌ జంపాకు వికెట్‌ దక్కింది.
(ఇక్కడ చదవండి: రోహిత్‌-ధావన్‌ల జోడి మరో ఘనత)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top