
సాక్షి, అమలాపురం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 201వ రోజు షెడ్యూలు ఖరారైంది. రాజన్నబిడ్డ పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లా అమలాపురం నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగతుంది. వైఎస్ జగన్ శనివారం ఉదయం భీమనపల్లి శివారు నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి సింగాయపాలెం, అనంతవరం, మహిపాల చెరువు చేరుకుని జననేత భోజన విరామం తీసుకుంటారు. అనంతవరం శివారు వద్ద వైఎస్ జగన్ పాదయాత్ర ముమ్మిడివరం నియోజకవర్గంలోకి అడుగు పెట్టనుంది.
అనంతరం పాదయాత్ర తిరిగి 2.45కు ప్రారంభమౌతుంది. బొండయకొడు, కొండలమ్మచింత మీదుగా ముమ్మిడివరం వరకూ పాదయాత్ర కొనసాగుతుంది. ముమ్మిడివరం హైస్కూల్ సెంటర్ వద్ద జరిగే బహిరంగ సభలో వైఎస్ జగన్ పాల్గొని ప్రజలను నుద్దేశించి ప్రసంగిస్తారు. రాత్రి రాజన్న బిడ్డ అక్కడే బస చేస్తారు. ఈ మేరకు పార్టీ జనరల్ సెక్రటరీ తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రజాసమస్యలు తెలుసుకుంటూ.. వారికి నేనున్నా అని భరోసానిస్తూ జననేత పాదయాత్రలో అడుగులు ముందుకు వేస్తున్నారు.