సామాజిక మాధ్యమాలే వేదికగా ఎన్నికల వార్‌

Social Media Is A Big Stage For Election Campaign - Sakshi

ఒకప్పుడు పక్క గ్రామంలో ఏదైన సంఘటన జరిగితే తెల్లవారితే గాని పత్రికల్లో వస్తే తప్ప తెలిసేదికాదు.. నేడు క్షణాల్లో పక్క గ్రామమే కాదు ప్రపంచంలో ఏ మూలన ఏ సంఘటన జరిగినా క్షణాల్లో ప్రపంచానికి తెలిసిపోతోంది.. ఒకప్పుడు ఇంటర్నెట్‌ వినియోగం అంతంతమాత్రంగానే ఉండేది. ఇప్పుడు ప్రతిపల్లె గుడిసెల్లోకి వచ్చి చేరింది. స్మార్ట్‌ ఫోన్‌ వినియోగం పెరగడంతో ప్రస్తుత లోక్‌సభ ఎన్నికలల్లో ప్రచార అస్త్రంగా నాయకులు సోషల్‌ మీడియాను ఎంచుకుంటున్నారు. 

సాక్షి, మెదక్‌: మొబైల్‌లో ముఖ్యంగా వాట్సప్, ఫేస్‌బుక్, ట్విట్టర్‌ వేదికలుగా అకౌంట్‌లు ఏర్పాటు చేసుకొని గ్రూపుల్లో సమాచారాన్ని చేరవేస్తున్నారు. సమాచారాన్ని సేకరించి వార్తల్లో నిలుపుతున్నారు. ప్రపంచంలో ఏదో ఒక మూలన జరిగిన సంఘటనలు ఫొటోలు, వీడియోలు క్షణాల్లో గ్రూపుల్లో వచ్చి చేరుతున్నాయి. పెద్దగా చదువురాని వారు సైతం సులభంగానే వాట్సఫ్, ఫేస్‌బుక్‌లను వినియోగిస్తూ అన్ని విషయాలను తెలుసుకుంటున్నారు.

జోరుగా హైటెక్‌ ప్రచారం..
లోక్‌సభ ఎన్నికల ప్రచారం ఎక్కువగా ఫేస్‌బుక్, వాట్సప్‌లలో జోరుగా కనిపిస్తోంది. రాజకీయ పార్టీలు, ఎన్నికల్లో పోటీ చేస్తున్న పార్టీలు సోషల్‌మిడియాను విరివిగా వినియోగించుకుంటున్నాయి. తమ కార్యక్రమాలను సోషల్‌మిడియాలో షేర్‌చేస్తూ విస్తృతంగా ప్రచారం చేసుకుంటున్నారు. ప్రతి కార్యక్రమానికి ఏర్పాటు చేసుకున్న గ్రూపుల ద్వార క్షణాల్లో ఫొటోలు, వీడియోలతో సహ ప్రజల ముంగిటకు చేరవేస్తున్నారు. తమకు ఓట్లు వేసేల ప్రత్యేక గ్రూపులతో నేతలు ప్రచారం చేసుకుంటున్నారు. 

దుమ్ములేపుతున్న సోషల్‌మీడియా..
ఏ సెల్‌ఫోన్‌ చూసినా ఆసక్తికరమైన వార్తలు, విశేషాలతో సోషల్‌మీడియా దుమ్ములేపుతోంది. ఏ సంఘటన జరిగినా క్షణాల్లో ఫొటోలు, వీడియోలు ఆయా గ్రూపుల్లో వచ్చి చేరుతున్నాయి.  సోషల్‌ మీడియా వినియోగం విరివిగా పెరిగిపోయింది. అన్ని విషయాలు తెలుస్తుండటంతో సోషల్‌మిడియాపై చాలా మంది ఆసక్తి కనబరుస్తున్నారు.

నేతల గ్రూపులు..
లోక్‌సభ ఎన్నికల్లో మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి పేరిట కేపీఆర్‌ సైన్యం, బీజేపీ అభ్యర్థి మాదవనేని రఘునందన్‌రావు పేరిట రఘన్న యువసైన్యం, బీజేపీ మీడీయా గ్రూపు పేరిట గ్రూపులు క్రియేట్‌ చేసి జోరుగా సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డికి మద్దతుగా దుబ్బాక నియోజకవర్గంలో ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి పేరిట ఆర్‌ఎల్‌ఆర్‌ సేన, రామలింగన్న సేవా దళం, లింగన్న ప్రగతి సైన్యం, సిద్దిపేట నియోజకవర్గంలో హరీశన్న సైన్యంతో పాటు రకరకాల గ్రూపులు వాట్సప్, ఫేస్‌బుక్‌లలో ఏర్పాటు చేసుకుని ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. 

రాజకీయనేతల పేరిట..
రాజకీయ నాయకులు ప్రత్యేకంగా సోషల్‌ మీడియాను ఎక్కువగా వినియోగించుకుంటున్నారు. తమ పేరిట ప్రత్యేక సేనలు, గ్రూపులు ఏర్పాటు చేసుకొని తమ అనుచరులకు సమాచారాన్ని చేరవేయడం ఎక్కువగా జరుగుతుంది. ఎన్నో రకరకాల ఆసక్తికరమైన గ్రూపులు రకరకాల సమాచారంతో హల్‌చల్‌ చేయడం కనిపిస్తోంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top