చంద్రబాబు మెదడులో చిప్‌ డిస్‌ లొకేట్‌ అయింది: గడికోట

Gadikota Srikanth Reddy Slams Chandrababu Over His Comments On CM Jagan - Sakshi

సాక్షి, తాడేపల్లి : సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉందని చెప్పుకొనే చంద్రబాబు సంస్కార హీనంగా మాట్లాడుతున్నారని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. ఐదు కోట్ల మంది ప్రజలకు ప్రతినిధి అయిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే.. చంద్రబాబు మెదడులో ఉండే చిప్‌ డిస్‌లొకేట్‌ అయినట్లు కనిపిస్తుందని ఎద్దేవా చేశారు. మంగళవారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ప్రధాని నరేంద్ర మోదీ సంసార జీవితం గురించి నీచంగా మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు అని విరుచుకుపడ్డారు. బాలకృష్ణతో మోదీ తల్లిని తిట్టించి... ఇప్పుడు మళ్లీ సిగ్గులేకుండా ఆయనతో కాళ్ళ బేరానికి వెళ్తున్నాడని చంద్రబాబు తీరును విమర్శించారు. కేసులకు భయపడి టీడీపీ పార్లమెంటరీ పార్టీని బీజేపీలో విలీనం చేసిన చంద్రబాబు.. పులివెందుల పంచాయితీలు, రాయలసీమ గుండాలు అంటూ రాయలసీమ ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబుకు రాయలసీమ మహిళలు వాతలు పెట్టె రోజులు దగ్గరలోనే ఉన్నాయని చురకలు అంటించారు.

రూ. వెయ్యికోట్లు కనిపించడం లేదా..
‘చంద్రబాబు కుమారుడు లోకేష్ ఒక మాలోకం. సిగ్నేచర్ లేని, ఔట్‌డేటెడ్‌ చెక్ లాంటి వాడు. లోకేష్‌కు... సీఎం జగన్‌కు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. తన కుమారుడిని తలుచుకుంటూ బాధతో చంద్రబాబు సీఎం జగన్‌పై పడి ఏడుస్తున్నారు. ఇక వందల కోట్లు ప్రజధనాన్ని తినేసి కొవ్వు పట్టిన దేవినేని ఉమా కూడా సీఎం గురించి మాట్లాడుతున్నారు. రివర్స్ టెండరింగ్‌లో ఆదా అయిన రూ. వెయ్యి కోట్ల ప్రజాధనం ఉమాకు కనిపించడం లేదా’ అని శ్రీకాంత్‌ రెడ్డి ప్రశ్నించారు. ‘చంద్రబాబుకు పని లేదు. కాబట్టి నోటికొచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. అలా మాట్లాడిన వారు చరిత్ర హీనులుగా మిగిలిపోయారు. చంద్రబాబుకు చేతనైతే సలహాలు సూచనలు ఇవ్వాలి. డీజీపీని పట్టుకొని ఖబర్దార్‌ అని హెచ్చరించడం సరికాదు. పోలీసులను కించపరిచే విధంగా చంద్రబాబు మాట్లాడుతున్నారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు భాష మార్చుకోకపోతే ప్రజలు మరింత అసహ్యించుకుంటారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అదే విధంగా ఎల్లో మీడియా తీరును శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. ‘సీఎం జగన్‌ ఢిల్లీ వెళ్లి రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడుతుంటే ఎల్లో మీడియా దానిని కూడా వక్రీకరిస్తుంది. చంద్రబాబు లాగా భయపడే వ్యక్తి కాదు జగన్‌మోహన్‌రెడ్డి. చంద్రబాబు లాగా చీకట్లో చిదంబరం కాళ్ళు పట్టుకోవడం జగన్‌కు తెలియదు. లోపల ఒకటి జరిగితే బయట ఇంకొకటి చెప్పుకోవడం జగన్‌కు అలవాటు లేదు’ అని చురకలు అంటించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top