కేజ్రీవాల్‌కు భద్రత పెంచిన పోలీసులు

Delhi Police Increase Security For CM Arvind Kejriwal - Sakshi

చెంపదెబ్బ కొట్టిన సురేష్‌పై కేసు నమోదు

సాక్షి, న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ రోడ్‌షోలకి ఢిల్లీ పోలీసులు భద్రత పెంచారు. బవనా గ్రామంలో ఆయన ప్రచారం నిర్వహిస్తుండగా.. ఆయన వాహనం చుట్టూ పోలీసులే కనిపిస్తున్నారు. నిన్న మోదీనగర్‌ ప్రాంతంలో కేజ్రీవాల్‌పై దాడి జరిగిన నేపథ్యంలో.. పోలీసులు ఈ మేరకు చర్యలు చేపట్టారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా మోతీ నగర్‌లో రోడ్‌షో నిర్వహిస్తున్న కేజ్రీవాల్‌ని ఓ వ్యక్తి చెంపదెబ్బ కొట్టాడు. జీప్‌పైకి ఎక్కి మరీ దాడిచేశాడు. ఇది ప్రత్యర్థుల కుట్రని ఆప్‌ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రికి భద్రతను పట్టించుకోవడంలేదని ఢిల్లీ పోలీసులపై ధ్వజమెత్తారు. కేజ్రీవాల్‌ని చంపేయాలనుకుంటున్నారా అని ఘాటుగా స్పందించారు డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్‌ ప్రచారాలకు పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.

చెంపదెబ్బ కొట్టిన సురేష్‌పై కేసు నమోదు
ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌పై దాడిచేసిన సురేష్‌ అనే వ్యక్తిపై ఢిల్లీ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేశారు. ఉద్దేశపూర్వకంగా గాయపరిచినందుకు ఐపీసీ సెక్షన్‌ 323 కింద అభియోగాలు నమోదుచేశారు. కేజ్రీవాల్‌పై దాడిచేసిన వ్యక్తి ఓ చిన్న వ్యాపారి అని పోలీసులు తెలిపారు. అతనికి గతంలో ఎలాంటి నేర చరిత్ర లేదని స్పష్టంచేశారు. దాడి నేపథ్యంలో కేజ్రీవాల్‌ రోడ్‌షోలకి ఢిల్లీ పోలీసులు భద్రత పెంచారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top