‘షా పర్యటనతో టీఆర్ఎస్, కాంగ్రెస్లో వణుకు’
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో బీజేపీ జాతియాధ్యక్షుడు అమిత్షా పర్యటనతో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు దడపుడుతుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కే లక్ష్మణ్ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేపు(బుధవారం) అమిత్ షా తెలంగాణకు రానున్నారని తెలిపారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో పోలీంగ్ బూత్ కార్యకర్తలతో సమావేశం అవుతారన్నారు. అనంతం ప్రత్యేక హెలికాప్టర్లో కరీంనగర్లో జరిగే ఎన్నికల సమరభేరి సభలో పాల్గొంటారని అమిత్ షా పర్యటన వివరాలను వివరించారు.
రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు, మోదీ ప్రభుత్వం అమలు చేసిన పథకాల గురించి ఈ సభ ద్వారా ప్రజలకు తెలియజేస్తామన్నారు. ముందుస్తు ఎన్నికలకు సీఎం కేసీఆర్ ఎందుకు వెళ్తున్నారో సమాధానం చెప్పాలని నిలదీస్తామని తెలిపారు. కాంగ్రెస్ నేతలు పగటి వేశగాళ్లలాగా మళ్లీ ప్రజల వద్దకు వెళ్తున్నారని విమర్శించారు. తెలంగాణ ద్రోహులతో జత కట్టి మహాకూటమిగా వస్తుందని మండిపడ్డారు. విధిలేక చేతగాక కాంగ్రెస్ కూటములు కడుతుందని ఎద్దేవా చేశారు. తెలంగాణ ద్రోహులతో కోదండరాం జతకడుతున్నారని దుయ్యబట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనతో రాష్ట్రంలో రాజకీయం మారిపోనుందని జోస్యం చెప్పారు. .