అమిత్ షా వివాదాస్పద వ్యాఖ్యలు

Amit Shah Sensational Comments On Opposition - Sakshi

ముంబై: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా విపక్షాలపై ఆరోపణలు, విమర్శలు తీవ్రతరం చేశారు. విపక్షాలను కుక్కలు, పిల్లులు, పాములతో పోల్చుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముంబైలో జరిగిన బీజేపీ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొన్న సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. 2019 ఎన్నికల తర్వాత ఎవరిసత్తా ఏంటో తెలుస్తుందని, ఇకనైనా మేల్కోవాలంటూ ప్రతిపక్షాలకు హెచ్చరించారు. పార్లమెంట్ సమావేశాలను ప్రధాని నరేంద్ర మోదీ చాలా సవ్యంగా జరిగేలా జాగ్రత్తలు తీసుకున్నా, విపక్షాలు మాత్రం సభ సమయాన్ని వృథా చేశాయని ఆరోపించారు. 

2019 ఎన్నికల కోసం విపక్షాలన్నీ ఏకం కావాలని నిర్ణయం తీసుకున్నా తమను ఏం చేయలేవన్నారు. విపక్షాలన్నీ కుక్కలు, పిల్లులు, ముంగిసలు, పాముల్లాంటివని.. ఓ పెద్ద ఉప్పెన వస్తే అవన్నీ చెట్టేక్కేస్తాయంటూ ఎద్దేవా చేశారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో తమ కూటమి ఉప్పెనలా విజృంభిస్తే.. విపక్షాలు వరద నీటిని చూసి భయపడి చెట్టేక్కే రకాలని అభిప్రాయపడ్డారు. ప్రజల్లో తమ పార్టీపై విశ్వాసం సన్నగిల్లలేదని, ప్రధాని మోదీ ఇదివరకు సాధించిన విజయాలే అందుకు నిదర్శనమని అమిత్ షా వివరించారు.
   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top