ఇరవయ్యో శతాబ్దపు సందేశం

ఇరవయ్యో శతాబ్దపు సందేశం


అద్భుతమైన రచనలు చేసినటువంటివారు గురజాడ, రావిశాస్త్రి. నేను పుట్టిన ఏడో, తర్వాత సంవత్సరమో గురజాడ వారు చనిపోయారు. గురజాడ కన్యాశుల్కం రాసింది 1897లో. ఇప్పుడు 1993 డిసెంబర్ నెల నడుస్తోంది.  ఈ వంద సంవత్సరాల నుంచి మన సమాజం ఇంకా గురజాడ రచనలోని అద్భుతాలను కొత్త కొత్త కోణాల్లో కనిపెడుతూనే ఉంది. జ్వాలాముఖి వంటి అనే క మంది ప్రముఖులు కన్యాశుల్కంలోని విశేషాలు, రహ స్యాల మీద వ్యాఖ్యానాలూ, విశ్లేషణలూ చేస్తున్నారు. గురజాడ వారి అనుయాయి అయినటువంటి రాచ కొండ విశ్వనాథశాస్త్రిగారు రాసినటువంటి కథలు, ముఖ్యంగా ‘పిపీలికం’ కథ గురించి ఇవాళ కూడా చాలా అద్భుతంగా చెబుతారు.



 ‘పిపీలికం’ కథనే తీసుకుందాం! 1993 డిసెంబర్ 4 - ఈ రోజు మనం ఎక్కడ ఉన్నామని! పిపీలికం కథ లోపలి పేర్కొన్నటువంటి రకరకాల జీవుల్లో మనం ఏ కోవకు చెందినవాళ్లం? సరే ఆ చీమల్లోనైనా ‘నేనెవర్ని?’ అని తెలుసుకోవడానికి ప్రయత్నించిన చీమలో అయినా మనమున్నామా? లేక ఆడా మగా, ఎర్ర, నల్ల రకరకాల చీమల తగాదాల మధ్యనే ఉన్నామా? ఇంకా మనకు జరిగే అన్యాయాలు... మనకు కావలసిన భూమి, మన తిండిని గుంజుకునే వాళ్ల విషయం లోపట ‘మహాప్రభో! ఇది మా ఇల్లు, మా తిండి’ అని చెప్పుకునే దశలో ఉన్నా మా? సరే, ‘ఇది మా ఇల్లు’ అని చెప్పుకునే స్థితికైనా వచ్చినామా? ఇది మనం ఆలోచించాలి. ‘ఉల్లంబున పల్లేరులు పొర్లగా, కల్లబొల్లి నవ్వులు వెదజల్లుతూ/ తల్లడిల్లు బానిస ప్రాణాలకు గొల్లున ఏడ్చే స్వాతంత్య్ర మెప్పుడో!?’

 

 అది ఇరవయ్యో శతాబ్దం అయితేనేమి? ఇరవై ఒక టో శతాబ్దం అయితేనేమి? ఎన్ని యుగాలు గడిస్తేనేమి? ప్రహ్లాదుని కథలో హిరణ్యకశిపుడు- వాడు ఒక్క భూ మండలానికే కాదు, మూడు లోకాల మీద వాడి ఆధిప త్యం. వాని మాట ఔనన్నవానికి ఏ లోటూ లేదు. వాడు ప్రకృతినే శాసించేవాడట. ఎక్కడ ఎండ కాయమంటా వు? ఎంతకాయమంటావు? అని సూర్యుడు అడిగేవాడ ట వాణ్ణి. వాన ఎక్కడ పడాలి? భూమ్మీద నీరు ఎక్కడ పుట్టించాలి? ఎక్కడ ఏ పంటలు పండించాలి? అని అడిగి వాడు ఎట్లా శాసిస్తే అట్లా నడుచుకునేవట.

 

 శాస్త్రీయంగా ఫాసిజం అంటే ఏమిటో చదువుకున్న వాణ్ణికాను గానీ, ఫాసిజానికి నా నిర్వచనం ఏంటంటే, ‘ఏకీభవించనోని పీకనొక్కు సిద్ధాంతం’. ఇట్లాంటి  మహారాజా హిరణ్యకశిపుని రాజ్యం లోపట ‘నా అభి ప్రాయం వేరు, నీ అభిప్రాయంతో నేను ఏకీభవించను’ అనెటోడు ఒక్కడు బయలుదేరిండు- ప్రహ్లాదుడు. ‘నాన్నగారు, నా అభిప్రాయం వేరు. మీది చాలా తప్పు’ అని డిసెంట్ ప్రకటించిండు. ‘మూడు లోకాల్లో అంద రూ నా మాట వింటున్నారు. నువ్వేందిరా నన్నే ఎదిరి స్తున్నవ్!’ అన్నడు హిరణ్యకశిపుడు.

 ‘అవును నా అభిప్రాయం ఇదే’

 ‘అట్టైతే నీకు అన్నం పెట్ట’

 ‘పెట్టకు’ ‘జైల్లో ఏస్త’‘ఏసుకో’

 ‘పాముల్తో కరిపిస్త’ ‘కరిపిచ్చుకో’

 ఏనుగులతో తొక్కిస్త’ ‘తొక్కించుకో’

 

 ఇట్లా ప్రహ్లాదుడు చేసింది సత్యాగ్రహం. హిరణ్యక శిపుడు చేసింది అతి పెద్ద హింస. స్టేట్ వయోలెన్స్‌కు ప్రతీక హిరణ్యకశిపుడు. దీనికి వ్యతిరేకంగా అహింసా మార్గంలో సత్యాగ్రహం చేసిన మొట్టమొదటి సత్యా గ్రహి ప్రహ్లాదుడు. ఇది కృతయుగంలో జరిగింది. సత్యా గ్రహం చేసినట్లైతే దౌర్జన్యం చేసినవానిలో హృదయ పరి వర్తన జరుగుతుందనేది సత్యాగ్రహ ధర్మ మూలసూ త్రం. కానీ హిరణ్యకశిపుని లోపట హృదయ పరివర్తన జరగలేదు. దౌర్జన్యం చేస్తూనే పోయిండు.

 

 కథలో అప్పుడేమయింది! నరసింహమూర్తిగా రొచ్చినారు. వారొచ్చి, హిరణ్యకశిపుణ్ణి పట్టుకుని, తొడ మీద పెట్టుకుని, పొట్టచీల్చి, పేగులు మెడలేసుకుని, రక్తం తాగిండు. నరసింహస్వామి చేసింది- అది ఏమైనా కావచ్చు, అహింస మాత్రం కాదు.

 పిపీలికం కథలో, అయ్యా! ఇది మా ఇల్లు. ఇది మా కష్టం. దీన్ని మేమే కట్టినం అని తొలుత అహింసా మార్గంలోనే చీమలు పామును ప్రార్థించినయి. కష్టపడ డమే మీ పని. సుఖపడడం మా పని. మీకు సూది మొన మోపేంత జాగ కూడా ఇవ్వను పో అన్న తర్వాతనే చీమ లన్నీ కలసి పామును కరిచి చంపినయట.

 

 అహింస అహింస అని గోలపెట్టే మహానుభావులు న్నారు చాలామంది. చీమలు కలసి పామును కరిచి చం పితే అందులో వారికి హింస కనబడతది. వారి దృష్టిలో చీమలంటే తీవ్రవాదులు. ఓ ముసలిపాము చీమలు పెట్టిన పుట్టలో ప్రవేశించింది. పదేండ్లు, ఇరవై ఏండ్లా యె. ఖాళీ చేయలేదు. కష్టపడి ఆ పుట్ట కట్టింది చీమలే కావచ్చు. అంతమాత్రాన చీమలన్నీ కలసి ముసలిపా మును కరిచి చంపుతే అది హింస కాకపోతే మరేమిటని వీరికి పాము పట్లనే సానుభూతి ఉంటుంది. మరి మన సానుభూతి చీమల వైపు ఉన్నదా? లేక చీమలను కాల రాచేవారి వైపు ఉన్నదా? చీమల కష్టాన్ని దోచుకునే వారి వైపు ఉన్నదా? అనేది ప్రశ్న.

 ఆహా, ఏం కథ రాసిండు విశ్వనాథశాస్త్రి! ఎటు వంటి పాఠం నేర్పిండు! ఇది ఇరవయ్యవ శతాబ్దపు యుగ సందేశం.

 

 (సెప్టెంబర్ 9 కాళోజీ జయంతి- తెలంగాణ భాషా దినోత్సవం సందర్భంగా)

 (రెండు దశాబ్దాల క్రితం నాగార్జునసాగర్‌లో జరి గిన గురజాడ, రావిశాస్త్రి సంస్మరణలో పాల్గొన్న కాళోజీ నారాయణరావుగారు చేసిన ఉపన్యాసంలో కొన్ని భాగా లు ఇవి. కాళోజీ చిత్రంతో పాటు ఉపన్యాసాన్ని సేకరించి పంపినవారు ‘అల’ కళల వేదిక నిర్వాహకుడు, చిత్రకా రుడు ‘దాసి’సుదర్శన్ మొబైల్: 94406 08208)

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top